Pages

Thursday, October 6, 2011

స్టీవ్ జాబ్స్.. భారతదేశం.. యాపిల్

సాంకేతిక చరిత్రలో ఒక గొప్ప శకం ముగిసింది. భవిష్యత్ తరాలపై కూడా ప్రభావితం చూవుతుందని ప్రశంసలు పొందుతున్న ఓ గొప్ప సాంకేతిక దార్శనికుడు, యాపిల్ ఆవిష్కర్త కన్నుమూయడంతో మనకాలానికి చెందిన ఒక గొప్ప మేధో సృజన శాశ్వత విరామం పొందింది.

స్టీవ్స్ జాబ్స్ -56- చరిత్రలో ఓ గొప్ప సాంకేతిక బ్రాండ్ ఆవిష్కర్త కన్నుమూశాడు. టెక్నాలజీ జార్ అని ప్రపంచం తనను ఇప్పుడు ముద్దుగా పిలుస్తోంది. సంగీతం, మొబైల్ ఫోన్లు, కంప్యూటింగ్ చరిత్రను విప్లవీకరించిన అమోఘ సాంకేతిక విన్నాణానికి మారుపేరు స్టీవ్. కంప్యూటింగ్ ప్రపంచాన్ని ఒంటిచేత్తో మార్చివేసి, పాకెట్ డివైసెస్ భావనను పూర్తిగా పునర్విచించిన దార్శనికుడు స్టీవ్ జాబ్స్. తను ఆవిష్కరించిన ఆధునిక సాంకేతిక ఉపకరణాలకంటే ప్రపంచ జ్ఞానానుభవానికి అతడు చేసిన దోహదం, ప్రపంచ డిజిటల్ భవిష్యత్తు పట్ల అతడు ప్రదర్శించిన ఆశావహ దృక్పధం చరిత్రలో సాటిలేనివి.

30 సంవత్సరాలుగా నిరంతరం ఆలోచిస్తున్న ఒక మహా మేధకు జీవితం తొలి దశలో భారతదేశంలోనే జ్ఞానోదయం వంటిది కలిగిందంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. కాని తాను చిన్న వయసులో అలవర్చుకున్న హిప్పీ సంస్కృతి జ్ఞానాన్వేషణలో భారత్‌ను సందర్శిచేలా చేసింది.

భారత పర్యటన
ప్రపంచ వ్యాప్తంగా పలువురు మహా వ్యక్తుల విషయంలో జరిగినట్లే యాపిల్ సహ-నిర్మాత స్టీవ్ జాబ్స్ తాత్విక చింతనకు భారత దేశమే మూలాధారం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 18 ఏళ్ల చిన్న వయస్సులో ఇండియాలో పలు ప్రాంతాలు సందర్శించిన తర్వాత, స్టీవ్ బౌద్ధమతం స్వీకరించాడు.

1970ల మధ్యలో స్టీవ్ భారతదేశంలో పర్యటించాడు. డిగ్రీ చదువునుంచి తొలి సెమిస్టర్‌లోనే వైదొలగిన తర్వాత అమెరికాలో ఒక వీడియో గేమ్స్ తయారీ సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తూ పోగుచేసుకున్న డబ్బుతో అతడు ఇండియా పర్యటనకు వచ్చాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్వేషణలో భాగంగా స్టీవ్ భారత్ పర్యటనకు వచ్చాడు. అతడి భారత పర్యటనపై అప్పట్లో ఎలాంటి వార్తలూ ప్రచురించబడలేదు కాని, భారత పర్యటనలో భాగంగా తను చేసిన కొన్ని వ్యాఖ్యలు జ్ఞానబోధ, ఆధ్యాత్మికత పట్ల గురించి తానేమనుకుంటున్నది తెలియపరుస్తున్నాయి.

ఆరెగాన్ లోని పోర్ట్‌ల్యాండ్‌లో రీడ్ అనే ఒక ప్రయివేట్ మానవ శాస్త్రాల అధ్యయన విభాగంలో డిగ్రీ చదువుతూ మధ్యలోనే వదిలేసిన స్టీవ్ మత వ్యవహారాలలో మంచి ఆసక్తి కలిగిన నిరంతర తాత్విక విద్యార్థి. అతడు ఒకే ఒక సెమిస్టర్ -మూడు నెలలు?- చదివిన తర్వాత ఎందుకు కాలేజీ చదువును వదిలి పెట్టేశాడో కూడా ప్రపంచానికి వింత వార్తలాగే ఉంటుంది. పుట్టుకతో మధ్యతరగతికి చెందిన స్టీవ్, తను చేరిన సంపన్నుల కాలేజీలో ఇమడలేకపోయాడని, అందుకే అతడు చదువును మధ్యలోనే వదిలేశాడని వార్తలు.

చదువు నిలిపివేసిన తొలిరోజుల్లో బతకడం కోసం కోక్ బ్యాటిల్స్‌ని సేకరించి కంపెనీకి తిరిగి ఇచ్చే పనిలో ఉండేవాడు. (భారత పర్యటనకోసమే ఈ పని చేశాడని చాలామంది అంటున్నారు). స్థానిక్ హరే కృష్ణ ఆలయంలో వారానికి ఒకసారి ఉచిత భోజనం కూడా చేసేవాడట. తనకంటూ అప్పట్లో ప్రత్యేకంగా గది ఉండేది కాదని, మిత్రుల గదుల్లోని నేలమీద పడుకుని నిద్రించేవాడినని స్టీవ్ తర్వాత చెప్పుకున్నాడు. కోక్ ఖాళీ బ్యాటిళ్లను సేకరించి వాటిని అయిదు సెంట్లకు -డాలర్‌కు వంద సెంట్లు- ఒకటి చొప్పున కంపెనీకి తిరిగి ఇచ్చేసి వచ్చిన దాంతో ఆహారం కొనుక్కునేవాడినని, స్థానికంగా హరేకృష్ణ ఆలయంలో ప్రతి ఆదివారం రాత్రి ఉచితంగా అందించే మంచి భోజనం కోసం పట్టణంలో ఏడు మైళ్లు నడిచి వెళ్లేవాడినని స్టీవ్ చెప్పుకున్నాడు. నిజంగా తాను అలాంటి జీవితాన్ని చక్కగా ఆస్వాదించాడట కూడా.

భారత దేశంలో అనాధపిల్లలు జీవితం గడుపుతున్న రీతిలో, సెంటు సెంటుగా కూడబెట్టిన డబ్బుతో స్టీవ్ 18 ఏళ్ల వయస్సులో భారత దేశం వచ్చాడు. 1970లలో నీమ్ కరోరి బాబా అనే హనుమాన్ భక్తుడికి అమెరికాలో కొద్దిమంది సహచరులు ఉండేవారట. అతడిని కలవాలనే స్టీవ్ తన మిత్రుడు, రీడ్స్ కాలేజీలో సహాధ్యాయి కొట్కే తో కలిసి తన ఆశ్రమానికి వచ్చాడు కాని అప్పటికే బాబా చనిపోయారని తెలుస్తోంది.

భారతదేశం నుంచి అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నప్పుడు అతడు జ్ఞానోదయం పట్ల తనదైన రీతిలో వ్యాఖ్యానించాడని తెలుస్తోంది.

"ఒక నెల రోజుల్లో జ్ఞానోదయం పొందగల చోటును వెతకడానికి మేము వెళ్లి ఉండలేదు. మొట్టమొదటిసారిగా నేను ఇక్కడే వాస్తవాన్ని గ్రహించనారంభించాను అదేమంటే కారల్ మార్క్స్, నీమ్ కైరోలి బాబా కంటే ఎక్కువగా ధామస్ ఎడిసన్ ప్రపంచాన్ని మరింతగా మెరుగుపర్చి ఉండవచ్చు."

అలా భారత పర్యటన ముగిసిన కొద్ది కాలంలోనే స్టీవ్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. తన తలను గుండు గీయించుకున్నాడు కూడా. భారతీయులకు మల్లే వదులుగా ఉండే దుస్తులు ధరించసాగాడు. మానసిక సంబంధమైన అంశాలపై ప్రయోగాలు కూడా తరచుగా చేశాడు.

తర్వాత కొద్ది కాలంలోనే యాపిల్ సంస్థకు తన కుటుంబ గ్యారేజీలో రూపు దిద్దాడు. ఒరేగాన్‌లో ఒక కమ్యూన్‌లో యాపిల్ పళ్లతోటను చూసిన తర్వాత తను పెట్టబోయే సంస్థకు యాపిల్ పేరును సూచించాడని తెలుస్తోంది.

వ్యవస్థా వ్యతిరేక దృక్పథం
1955లో శాన్‌ప్రాన్సిస్కోలో పుట్టిన స్టీవ్ అమెరికాలో హిప్పీ సంస్కృతి వ్యాపిస్తున్న కాలంలో పెరిగాడు. హిప్పీల సంస్కృతికి ప్రతినిధులైన బాబ్ డిలాన్, బీటిల్స్ అతడి అభిమాన సంగీత కారులు. వీరి రాజకీయ అభిప్రాయాలు, వ్యవస్థా వ్యతిరేక దృక్పధాలతో ఇతడు భాగం పంచుకున్నాడు. బీటిల్స్ లాగే స్టీవ్స్ కూడా ఆధ్యాత్మిక మార్గాన్వేషణలో భాగంగా భారతదేశం సందర్శించాడు. వారిలాగే ఇతడు కూడా తన పుట్టి పెరిగిన ప్రాంతాల్లో, చివరకు ఆఫీసులో కూడా కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాడని సిఎన్ఎన్ నివేదించింది.

యాపిల్ చరిత్ర,, గుడ్డపీలికల దశనుండి సంపన్న జీవితం వరకు సాగిన స్టీవ్ జీవితం ఈ మహావిజయ గాథకు ఒక గట్టి నిదర్శనంలా నిలుస్తోంది. స్టీవ్ సాధించిన ఈ అసాధారణ విజయం తనను ఇక వెనక్కి తిరిగి చూసుకోనివ్వలేదు. తర్వాత అతడు మరెన్నడూ భారతదేశానికి రాలేదు కూడా. ఐబీఎమ్ నుంచి హెచ్.పీ దాకా ఐటీ పరిశ్రమ మొత్తంగా భారతీయ సిలికాన్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నప్పుడు కూడా స్టీవ్ భారతదేశంలో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపించలేదు.

బౌద్ధమతంపై తీవ్ర ఆసక్తి కలిగిన స్టీవ్, ఇండియా పట్ల సానుకూల వైఖరిని అవలంబించలేదు. భారత పర్యటన కాలంలో ఇక్కడ తాండవిస్తున్న దారిద్ర్యాన్ని, ఇక్కడి కల్లోల పరిస్థితులను చూసి అతడు తీవ్రంగా అసంతృప్తి చెంది ఉండవచ్చు. తాను తదనంతర జీవితం పొడవునా ఆసక్తి ప్రదర్శించిన తన కలల ఉత్పత్తిలోనే అతడు బహుశా నిజమైన జ్ఞానోదయాన్ని కనుగొని ఉండవచ్చు.

వ్యక్తి - వృత్తి- నిమ్నోన్నతాలు
విజయానికి నిజమైన అవకాశం ఉద్యోగంలో కాకుండా వ్యక్తిలోనే దాగి ఉంటుదనేది నేటి నానుడి. స్టీవ్ జాబ్స్‌ని గురించి ఎవరయినా నిర్వచించాలంటే పై పంక్తులు చక్కగా సరిపోతాయి. యాపిల్ సంస్థ భారాన్ని పద్నాలుగేళ్ల పాటు మోస్తూ వచ్చిన స్టీవ్ ఈ అక్టోబర్ 5నే కన్నుమూశాడు. స్టీవ్ కెరీర్, జీవితం బాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోవు. కంప్యూటింగ్ ప్రపంచ రారాజుగా పేరొందిన ఈ కాలేజ్ డ్రాపవుట్ తన మిత్రుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి సిలికాన్ వ్యాలీలోని తన కుటుంబ గ్యారేజీలో అపెల్ కంప్యూటర్‌ సంస్థను 1970ల చివరలో ప్రారంభించాడు.

తను ప్రవేశపెట్టిన యాపిల్ 1 కంప్యూటర్ పెద్దగా విజయం పొందనప్పటికీ యాపిల్ 2 మాత్రం విజయం సాధించింది 1980లో ఐపీఓ ద్వారా స్టీవ్ మిలియనీర్‌గా మారాడు. తదనంతరం ఐబీఎమ్ పలు పర్సనల్ కంప్యూటర్లను ప్రారంభించడంతో ఈ విజయ గాధకు అడ్డంకులు ఎదురయ్యాయి. తన మిత్రుడు, భాగస్వామి వోజ్నియాక్ విమానప్రమాదంలో గాయపడటంతో పరిస్థితులు మరింత విషమించాయి. జీవితంలో నిజమైన మలుపు తిరగసాగింది.

అప్పట్లో పెప్సీ అధిపతిగా ఉన్న హోంచో జాన్ స్కల్లీని యాపిల్‌లో చేరవలసిందిగా స్టీవ్ ఆహ్వానించాడు. కాని, ఈ స్కల్లీనే యాపిల్ నుంచి స్టీవ్‌ని సాగనంపాడు. స్టీవ్‌ని సాగనంపిన తర్వాత .యాపిల్ భాగ్యరేఖ తారుమారయింది. దాని ఉత్పత్తులు వరుసగా విఫలం చెందడంతో స్కల్లీ కూడా సంస్థనుంచి బహిష్కరించబడ్డాడు. స్టీవ్ తిరిగి యాపిల్‌కి వచ్చిన తర్వాతే సంస్థ దశ తిరిగింది. రెండోసారి వచ్చిన వెంటనే ఐపాడ్ పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్‌ని, ఐఫోన్, ఐప్యాడ్‌లను స్టీవ్ ప్రవేశపెట్టాడు. ఇవి మొత్తం కంప్యూటింగ్ ప్రపంచాన్ని, సెల్యులార్ ఫోన్ వ్యాపారాన్నే విప్లవీకరించేశాయి.

స్టీవ్ గొప్పతనం ఏదంటే తన నిజమైన దార్శనికతే. సాంకేతిక జ్ఞాన సరిహద్దులను ముందుకు నెట్టడంలో అతడి సృజనాత్మక తృష్ణ సాటిలేనిది. తాను ఈ ప్రపంచాన్ని ఒక కోణంలో మార్చగలనని విశ్వసించాడు, నలుగురికీ భిన్నంగా ఆలోచించాడు. తన నమ్మకాన్ని రుజువు చేశాడు. టెక్నాలజీపై తన నమ్మకం ప్రపంచాన్ని మార్చగలుగుతుందని ఒకనాడు అతడు భావించాడు. ఈరోజు ప్రపంచం దాన్ని నిరూపిస్తోంది.

వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తులు, నిర్మాణరంగం వంటి సాంప్రదాయిక రంగాలకు స్టీవ్ మేధస్సు ఎలాంటి దోహదం చేయలేదన్నది వాస్తవమే కావచ్చు. కాని సాంకేతిక జ్ఞానం ప్రపంచాన్ని, వినోద పరిశ్రమ, ఐటీ, కంప్యూటింగ్ రంగంలో మారుస్తుందని నిరూపించడంలో స్టీవ్ తన సమకాలీన ప్రపంచంకంటే ఎంతో ముందు ఉంటూ వచ్చాడు. తానే చెప్పుకున్నట్లు మనిషి జీవితం చాలా పరిమితమైనది. ఒక వ్యక్తి తన పరిమిత జీవితంలో ఇంతకంటే సాధించవలసింది ఏముంటుంది?

కారల్ మార్క్స్ కంటే, నీమ్ బాబా కంటే ప్రపంచాన్ని ధామస్ ఎడిసనే మరింత ఎక్కువగా మార్చి ఉండవచ్చునంటూ స్టీవ్ చేసాడని చెప్పబడుతున్న వ్యాఖ్యలను వివాదాస్పదంగా చూడనవసరం లేదు. ఈ వ్యాఖ్యలు తన భవిష్యత్ దర్శనాన్ని చూపించాయి. తను భావించిన రంగంలో అతడు సాధించినది అద్వితీయ విజయం. అంతే.

మరణం ఇప్పటికీ చివరి గమ్యమే...
స్టీవ్ మరణంపై అధికారిక ప్రకటన వెలువడలేదు కాని చాలాకాలంగా తను కేన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చాడు. 2005లో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చేసిన ప్రసంగం స్టీవ్ జీవితంలోనే అత్యంత గొప్పదైన, చిరస్మరణీయమైన ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయింది.
మొదటిసారిగా ఇక్కడే తను ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన పాంక్రియాటిక్ కేన్సర్ గురించి స్టీవ్ బయట పెట్టాడు.

భూమ్మీద మనిషి జీవితం చాలా పరిమితమైంది కాబట్టి ఏదో అల్లాటప్పా జీవితం గడుపుతూ వృధాపర్చరాదని ఈ ప్రసంగంలో స్టీవ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అతడు చెప్పిన వాక్యం "to stay hungry, stay foolish since a person`s limited time on earth should not be wasted in living someone else`s life." అక్కడి శ్రోతలను ఉర్రూతలూగించింది.

"ఎవరూ చావాలనుకోరు. స్వర్గానికి పోవాలనుకున్న వారు కూడా అక్కడికి వెళ్లడానికి ఇక్కడ చనిపోవాలని కోరుకోరు. మరణం అనేది మనందరం పంచుకునే గమ్యస్థానంలా ఇప్పటికీ ఉంటోంది. ఎవరూ దాన్నుంచి తప్పించుకోలేరు." అంటూ స్టీవ్ 2005 జూన్ 12న యాపిల్ కంప్యూటర్ సీఈఓగా చేసిన ప్రారంభోపన్యాసంలో చెప్పాడు.

చరిత్రలో అది గొప్ప ప్రారంభోపన్యాసాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ప్రసంగంలో స్టీవ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి జీవితం చాలా పరిమితమైంది కాబట్టి ఇతరులు బతుకుతున్నట్లుగా బ్రతుకుతూ జీవితాన్ని వృధా చేసుకోవద్దని సూచించాడు. పిడివాదంలోకి కొట్టుకుపోవద్దని, ఇతరులు ఆలోచనల ఫలితాలపై ఆధారపడి పిడివాదం మనుగడ సాధిస్తూ ఉంటుందని సూచించాడు. ఇతరుల అభిప్రాయాల ప్రతిధ్వనులను మీ స్వంత అంతర్వాణిగా చేసుకోవద్దని విద్యార్థులను ఉద్దేశించి స్టీవ్ చెప్పాడు.

మీ హృదయాన్ని, మీ సహజాతాన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండటం అన్నిటికంటే ముఖ్యమైన విషయమని వారికి భోధించాడు. మీరు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో మీ హృదయానికి, మీ అంతర్వాణికి మాత్రమే తెలుసునని వాటితో పోల్చుకుంటే మిగతావన్నీ అప్రాధాన్యవిషయాలే -సెకండరీ- అని స్టీవ్ చెప్పాడు. ఈ సందర్భంగానే అతడు విద్యార్థులకు, మిగతా ప్రపంచానికి కూడా ఒ గొప్ప ప్రకటన వెలువరించాడు "ఆకలిగొని ఉండండి, మూర్ఖంగా కూడా ఉండండి" - Stay Hungry. Stay Foolish?- నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను.

ఈ సుప్రసిద్ధ ప్రసంగంలోనే అతడు చావు గురించి కూడా మాట్లాడాడు. 2004లో తను కేన్సర్ వ్యాధి పరీక్ష జరిగిందని తెలిపాడు. స్కానింగ్‌లో తన శరీరంలోని క్లోమంలో -pancreas- కేన్సర్ కణితి ఏర్పడినట్లు తెలిసిందని, ఆనాటికి తనకు క్లోమం అంటే ఏమిటో కూడా తెలియదని చెప్పాడు. ఇది దాదాపుగా నివారణ కాని కేన్సర్ రకమని, మూడు లేదా ఆరు నెలలకంటే ఎక్కువగా తాను బతికి ఉండటం కష్టమని కూడా డాక్టర్లు చెప్పారని తెలిపాడు.

తన స్వంత వైద్యుడు ఇక ఇంటికి పోయి తన వ్యవహారాలను చక్కదిద్దుకోమని చెప్పారట. వైద్యుల పరిభాషలో, చావుకు సిద్ధంగా ఉండమని దీనర్థం. శస్త్రచికిత్స ద్వారా మాత్రమే నివారించదగిన అరుదైన క్లోమ కేన్సర్ తనకు ఉందని తెలిశాక వైద్యులు విలపించడం ప్రారంభించారట.

తర్వాత తనకు శస్త్ర చికిత్స జరిగిందని, చావును ఎదుర్కొవడానికి ఇదే తనకు అతి దగ్గర మార్గమని, మరికొన్ని దశాబ్దాలు కూడా తను ఈ మార్గంలోనే ఉండవచ్చని భావిస్తున్నట్లు స్టీవ్ చెప్పాడు.

తాను త్వరలోనే చనిపోతానని గుర్తుంచుకోవడం అనేది జీవితంలో పెద్ద అవకాశాలను రూపొందించడంలో తనకు ఉపయోగపడే అత్యంత ప్రముఖ ఉపకరణంగా భావిస్తున్నట్లు స్టీవ్ చెప్పాడు. ఇలాంటి గొప్ప ఉపకరణాన్ని -టూల్- తానింతవరకు ఎదుర్కోలేదని స్టీవ్ ముగించాడు.

జీవితం అంచుల్లో ఉన్నట్లు స్టీవ్‌కి తెలుసా?
అనేక సంవత్సరాలుగా క్లోమ కేన్సర్‌ను ఎదుర్కొంటూ వచ్చిన స్టీవ్ జాబ్స్‌కి తాను త్వరలోనే మరణించబోతున్నట్లు కొన్ని వారాల క్రితమే తెలుసునట. నవంబర్ 21న మార్కెట్లోకి వస్తున్న 'స్టీవ్ జాబ్స్' అనే పుస్తకం ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ పుస్తక రచయిత ఇసాక్సాన్ నాలుగు వారాల క్రితం చివరిసారిగా స్టీవ్‌ని ఇంటర్‌వ్యూ చేశాడట. ఈ ఆగస్ట్ నెలలో యాపిల్ సీఈఓగా దిగిపోతున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూను అతడు నిర్వహించాడు. తాను త్వరలోనే చనిపోతున్నట్లు జాబ్స్ ఈ ఇంటర్‌వ్యూ చివరలో సూచించాడట.

గత రెండేళ్ల కాలంలో ఇసాక్సాన్, స్టీవ్‌ను 40 కంటే ఎక్కువసార్లు ఇంటర్‌వ్యూ చేశాడట. ఈ క్రమంలో అతడు స్టీవ్ మిత్రులు, కుటుంబాలతో కూడా మాట్లాడాడు. ఇసాక్సాన్ ఆస్పెన్ ఇనిస్టిట్యూట్ ప్రధాన కార్యనిర్వాహకాధికారి, టైమ్ మేగజైన్ మాజీ ఎండీ కూడా. అల్బర్ట్ ఐన్‌స్టయిన్, బెన్ ఫ్రాంక్లిన్ అనే రెండు అత్యధికంగా అమ్ముడుపోయిన జీవిత చరిత్ర రచనలు కూడా ఇతడు గతంలో చేశాడట. `iSteve The Book of Jobs` అని మొదట పేరు పెట్టిన ఈ పుస్తకం 2012లో విడుదల కావలిసి ఉండగా, స్టీవ్ మరణంతో ఈ నవంబర్ 24నే మార్కెట్లో `Steve Jobs` అనే పేరుతో విడుదల చేయనున్నారు.

ఈ పుస్తకంలోని విషయాలపై స్టీవ్ ఎలాంటి నియంత్రణలు విధించలేదని, తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి నిక్కచ్చిగా, కొన్ని సార్లు కర్కశంగా -brutally- కూడా మాట్లాడాడని పుస్తక ప్రచురణ కర్త తెలిపారు.

స్మరణ
గుడ్డపీలికల జీవితం నుంచి యాపిల్ బ్రాండ్ వరకు ఎదిగి ముగిసిన స్టీవ్ గురించి సమకాలికులు ఏమనుకుంటున్నారు? తరతరాల వరకు నిలిచి ఉండగల గొప్ప ప్రభావాన్ని స్టీవ్ జాబ్స్ ఈ ప్రపంచంపై ముద్రించారని మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్ ఉద్వేగంగా చెప్పారు. అతడితో పరిచయం కలిగి ఉండటం, తెలుసుకుని ఉండటమే ఒక గొప్ప గౌరవమని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల క్రితమే మేమిద్దరం కలుసుకున్నామని, మా జీవితాల్లో సగం కంటే ఎక్కువ కాలం మేం సహచరులుగా, పోటీదారులుగా, స్నేహితులుగా కూడా గడిపామని, స్టీవ్ మరణంతో తాను నిజంగా విషాదంలో మునిగిపోయానని గేట్స్ చెప్పారు.

ప్రపంచంపై స్టీవ్ కలిగించినంత గొప్ప ప్రభావాన్ని ప్రపంచం చాలా అరుదుగా మాత్రమే ఇతరులలో చూడగలుగుతుందని, అతడి ప్రభావం అనేక తరాలపాటు నిలిచి ఉంటుందని వాల్‌స్ట్రీట్ జర్నల్‌ వెబ్‌సైట్‌కి పంపిన ప్రకటనలో గేట్స్ తెలిపారు. స్టీవ్‌తో కలిసి పనిచేశామంటేనే మేం చాలా అదృష్టవంతులమని, మా జీవితాలకు అదొక అత్యంత గొప్ప గౌరవమని, స్టీవ్ మరణంతో చాలా కోల్పోతున్నానని బిల్‌గేట్స్ నివాళి పలికారు.

మనిషి శాశ్వతం కాకపోవచ్చు కాని పేర్లు శాశ్వతమే. సాంప్రదాయాలు, ఆశల వెదుకులాటలను నిర్వచించే జీవితం కోసం తపన పడుతున్న వేలాదిమంది ఆశాజీవులకు స్టీవ్ ఎప్పటికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాడు.

(స్టీవ్ జాబ్స్ గురించి ఆంగ్లంలో విస్తృతంగా లభ్యమవుతున్న సమాచారాన్ని తెలుగులో అందించడానికి చేసిన ప్రయత్నం.)

స్టీవ్ జాబ్స్ పై కొన్ని కథనాలను కింద చూడండి.

స్టీవ్ జాబ్స్ -- జీవిత సత్యాలు
యాపిల్సారధి స్టీవ్ జాబ్స్అస్తమయం
http://teluguvartalu.wordpress.com/2011/10/06/%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%a7%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80%e0%b0%b5%e0%b1%8d-%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d/
డిజిటల్ ప్రపంచం సంచలనం, యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కన్నుమూతhttp://teluguvaahini.com/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%b8%e0%b0%82%e0%b0%9a%e0%b0%b2%e0%b0%a8%e0%b0%82-%e0%b0%af.html
Steve Jobs and his India connection
Jobs talked cancer, death at Stanford in 2005
Buddhism -- India`s gift to Steve Jobs
In memoriam Steve Jobs
Jobs said little about pancreatic cancer struggls
Steve Jobs The monk who left India to make i-Products
Apple's Steve Jobs 'may never be equaled'

Tuesday, January 25, 2011

దాసరి సుబ్రహ్మణ్యంగారి అరుదైన జీవిత రికార్డు



చందమామ సీరియల్స్ ద్వారా అయిదారు దశాబ్దాలుగా లక్షలాది పాఠకులను ఉర్రూతలూగిస్తూ వచ్చిన మాన్యులు దాసరి సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితం కూడా పరమ సాధారణ స్థితిలో దాదాపు అజ్ఞాతంగా ఎటువంటి పటాటోపాలు లేకుండా కొనసాగింది. 1952 నుండి 2006 వరకు 54 ఏళ్లపాటు అనితర సాధ్యమైన విధంగా చందమామలో పనిచేసిన దాసరి గారు చివరకు వ్యక్తిగత జీవితాన్ని కూడా సుదీర్ఘకాలం పాటు ఒకే అద్దె ఇంటిలో గడపడం చారిత్రక విశేషం. ఇలా వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకే స్థలంలో అయిదు దశాబ్దాలపైబడి కొనసాగించడం బహుశా ప్రపంచంలో ఎవరికీ సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. వృత్తి జీవితంలో చందమామ చిత్రమాంత్రికుడు శంకర్ గారు మాత్రమే ఇందుకు సంబంధించి మినహాయింపుగా ఉంటారు. ఈయన కూడా 1952 చివరినుంచి ఈ నాటి వరకు అంటే దాదాపు 58 ఏళ్లపాటు చందమామలోనే పనిచేస్తున్నారు. కాని నివాసం విషయంలో చాలా స్థలాలు మారారు.

చందమామలో 1952 నుంచి 1980 దాకా నిరవధికంగా జగత్ప్రసిద్ధమైన 12 సీరియల్స్ -తోకచుక్క, రాతిరథం, జ్వాలాద్వీపం, పాతాళదుర్గం, మకరదేవత, శిథిలాలయం, రాకాసిలోయ, భల్లూకమాంత్రికుడు వంటివి- రాసి చందమామ సర్క్యులేషన్‌‍ని అమాంతంగా పెంచిన ఘనత దాసరి గారి సొంతం. అయితే ఆయన రాసిన జానపద ధారావాహికల మంత్రజగత్తులో ఉర్రూతలూగిన లక్షలాది మంది పాఠకులలో నూటికి 99 మందికి, చివరకు చందమామ రచయితలకు కూడా చందమామ సీరియల్స్ రచయిత ఎవరో ఇటీవలివరకు తెలియదంటే నమ్మశక్యం కాదు. చందమామ పత్రిక తన ఉద్యోగుల వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై విధించిన అలిఖిత అజ్ఞాతవాసం అంత పటిష్టంగా కొనసాగింది మరి.

ఆయన ఆనారోగ్యంతో 2006లో విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లినప్పటికీ, 2009 వరకు పాఠకులు ఆయన పేరుతోటే ఉత్తరాలు, రచనలు పంపుతూ వచ్చిన ఉదంతమే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. చివరకు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన అయిదు దశాబ్దాలకు పైగా ఒకే ఇంటిలో నివసించిన విషయం ఇటీవల వరకు ఎవరికీ తెలీదు. గత 54 ఏళ్లుగా ఎలాంటి మరమ్మతులు లేని స్థితిలో, చెన్నయ్ మహానగరంలో, 'భూతాల' నిలయం వంటి పురాతన భవనంలోని ఒక ఇరుకైన గదిలో ఆయన జీవించారు. భూతాల నిలయం అనే పదం ఇక్కడ ప్రతీకగా వాడవచ్చు కాని, ఆ భవంతిలో ఈనాటికీ దాసరి గారితో దశాబ్దాల అనుబంధాన్ని పెంచుకుంటూ వచ్చిన సాధారణ మనుషులు జీవిస్తున్నారు.

చెన్నయ్‌లోని వడపళనిలో పాత చందమామ భవంతికి కూతవేటు దూరంలోని సుప్రసిద్ధమైన మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో కిందా పైనా 12 గదులు ఉన్న ఒక పాడుబడిన అపార్ట్‌మెంట్‌లో 7వ నంబర్ గదిలో దాసరి గారు దశాబ్దాలుగా అద్దెకు ఉంటూ వచ్చారు.

విజయ వాహినీ స్టూడియోలోని పాత చందమామ భవంతి ఇప్పుడు లేదు. చందమామ వైభవోజ్వల శకానికి సాక్షీభూతంగా నిలిచి అయిదెకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన చందమామ భవంతి ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. అక్కడినుంచి చందమామ కార్యాలయం చెన్నయ్ లోని ఈక్కాండి తాంగల్ -గిండీ-, జెఎల్ ప్లాజా -తేనాంపేట-, చిన్న నీలాంగరై -తిరువాన్మయూర్ అవతల- ప్రాంతాలకు వలసపోయింది.

భూమి గుండ్రంగా ఉన్న చందాన 2010 మేలో చందమామ పాతభవంతికి సమీప ప్రాంతానికే చందమామ ఎడిటోరియల్ ఆఫీసు మళ్లీ వచ్చి చేరింది. చిత్రమో, యాదృచ్ఛికమో గాని దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఆ పాత ఇంటికి సరిగ్గా వెనుకవైపు భవంతి -స్వాతి ఎన్‌క్లేవ్ 5-6 నంబర్లు-లోనే ప్రస్తుతం చందమామ కార్యాలయం ఉంది. దాసరి గారు వడపళని ప్రాంతంలోనే ఉండేవారని చూచాయగా తెలుసు కాని నిర్దిష్టంగా ఎక్కడ ఉండేదీ అంతవరకు నాకు తెలీదు.

మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో స్వాతి ఎన్‌క్లేవ్ భవంతిలోకి -2A- వచ్చి చేరిన మూడు నెలలకు చందమామలో ప్యాకింగ్ విభాగంలో పనిచేస్తున్న రవి ఒక రోజు ఆఫీసు బయట పిచ్చాపాటిగా మాట్లాడుతూ 'తాతా సర్ మొదటినుంచి ఉంటూవచ్చిన ఇల్లు ఇదే సార్' అని చూపించారు. దాసరి గారిని చందమామ సిబ్బంది మొదటి నుంచి ‘తాతా సర్’ అని పిలుస్తూ వచ్చారు. సరిగ్గా దాసరి గారి ఇంటి వెనుకవైపు చందమామ ఆఫీసు ఉంది. నాకయితే రవి ఈ విషయం చెప్పాక షాక్ అయింది. 'ఏమిటి ఇంత పాడుబడిన భవంతి' అని చాలా సార్లు అనుకున్నాను గాని, ఆయన దశాబ్దాలుగా గడిపిన ఇంటిపక్కకు మేం వచ్చామని సూచన ప్రాయంగా కూడా తట్టలేదు.

అరుదైన చరిత్రకు నిలయంగా మారిన ఆ ఇంటిని పోటోలు తీయాలని, ఇంటిముందుకు వెళ్లి ఆయన వివరాలు తెలుసుకోవాలని అనుకున్నా అది ఆచరణలో సాధ్యపడేందుకు మరో మూడునెలలు పట్టింది. ఈ శుక్రవారం -17-12-2010- సాయంత్రం చందమామ కొల్లీగ్ వద్ద 3 మెగా పిక్సెల్ మొబైల్ తీసుకుని రవి సాయంతో ఆ ఇంటికి వెళ్లాము.

దాసరి గారు - చెన్నయ్ అద్దె ఇల్లు
రచన జూన్ సంచికలో 'చెట్టెక్కిన బేతాళుడు' పేరుతో నాయని కృష్ణమూర్తిగారు, దాసరి గారితో, ఆయన అద్దె ఇంటితో తన పరిచయాన్ని సమగ్రంగా వివరించారు. ఆయన 1974లో బొమ్మరిల్లు పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న కాలంలో ఓ రోజు సంపాదకులు విజయబాపినీడు గారు చెన్నయ్‌లో ఒక పెద్దాయనను కలిసి ఆయన ఇచ్చే కొన్ని కాగితాలు తీసుకురావాలని చెప్పారు. (చందమామలో పనిచేస్తున్నప్పుడు, కొత్తగా ప్రారంభించబడిన బొమ్మరిల్లుకు ప్రోత్సాహం అందించాలన్న ఆలోచనతో దాసరి గారు 'మృత్యులోయ' జానపద సీరియల్‌ని ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో రాసి బాపినీడుగారికి పంపేవారు.) ఆ ప్రకారం ఆ చిరునామాకు వెళ్లిన నాయని గారు దాసరి గారిని కలిసిన ఆ ప్రథమ సమావేశపు సన్నివేశాన్ని ఇలా వర్ణించారు. విషయ విస్తరణ రీత్యా రచన జూన్ సంచికలో వచ్చిన ఈ భాగాన్ని కుదించి ఇక్కడ పొందుపర్చడమైంది.

వడపళనిలో మురుగన్ కోయిల్ ఉంది. అది తెలీని మద్రాసీయులు ఎవరూ ఉండరు. గుడికి డెబ్బై, ఎనభై మీటర్ల ముందు ఒక అడ్డరోడ్డు ఉండేది. అది చందమామ బిల్డింగు -విజయావారి పాత బిల్డింగ్- కు వెళ్లే వైపు కుడిపక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ముందు బారుగా లోపలికి చిన్న చిన్న ఇళ్లు పదో, పన్నెండో ఉంటాయి. వీటిల్లో నేను వెళ్లవలసిన ఇంటికి సాయంకాలం ఏడున్నరకు వెళ్లాను -7వ నెంబర్ ఇల్లు- తాళం వేసుంది మళ్లీ రోడ్డు మీదికి వెళ్లి నిలబడ్డాను.

ఎనిమిదన్నర తర్వాత గుడి ఎదురు రోడ్డు క్రాస్ మీదనుండి వస్తున్న ఒకతను కనిపించాడు. ఏదో ఆలోచిస్తూ, అప్పుడప్పుడూ, తల పక్కకు తిప్పి చూస్తూ, ఆగి ఆగి సిగిరెట్టు కాలుస్తూ వస్తున్న వ్యక్తి. ఆయన నాకేసి చూసినప్పుడు 'సుబ్రహ్మణ్యం గారికోసమండీ ఆ యింట్లో ఉంటారు' అంటూ మధ్యలో కొన్ని ఇళ్లవైపు చేయి చూపిస్తూ అన్నాను. 'ఎక్కణ్ణుంచి వస్తున్నారు' అనడిగితే విజయబాపినీడు గారు పంపారని చెప్పాను. 'రండి' అని ఆయన ముందుకు దారితీసి తన గది ముందు ఆగి జేబులోంచి తాళంచెవి తీసి తలుపులు తెరిచారు. 'ఉండండి,' అంటూ చీకట్లో తనొక్కడే లోపలికి వెళ్లి ఏదో స్విచ్ నొక్కాడు. ముందు గదిలో వెలుగులు పరుచుకున్నాయి.

దాన్ని గది అనొచ్చునా, అనకూడదా అన్న మీమాంస క్షణంలో ఏర్పడింది. బాగా పొడవైన అగ్గిపెట్టె అడ్డంగా పెట్టినట్లు ఉంది ఆ గది. వెడల్పు అయిదడుగులకు మించి ఉండదు. పొడవు 12-15 అడుగుల మధ్య ఉండొచ్చు. కుడి వైపు మూడడుగుల వెడల్పుతో లోపలికి ఒక దోవ ఉంది. ఆ మధ్యలోనే ఎడం వైపు ఒక గది ఉన్నట్లు తలుపులు వేసి ఉన్నాయి. బాగా వెనుకవైపు పెరడు అని చూస్తూనే తెలిసి పోతోంది. ముందు అయిదడుగుల వెడల్పు గదిలోనే బుక్ షెల్వ్స్ ఉన్నాయి. ఆయన కూర్చోవడానికి ఒక కుర్చీ ఉంది. ముందు తలుపుకు దగ్గరగా, లోపలకు వెళ్లే సందు ముందు వచ్చిన వాళ్లు కూర్చోవడానికి ఒక కుర్చీ, ఒక స్టూలు ఉన్నాయి.”

దాదాపు 35 ఏళ్ల క్రితం తాను చూసిన దాసరిగారి అద్దె ఇంటిని పొల్లుపోనంత నిర్దిష్టంగా వర్ణించిన నాయని గారి జ్ఞాపకశక్తికి ఈ సందర్భంగా అందరం జేజేలు పలకాలి. ఆ ఇల్లూ, పరిసరాలూ ఈనాటికీ దాదాపు అలాగే ఉన్నాయి. వడపళని క్రాస్‌కి సమీపంగా నూరడుగుల రోడ్డులో -బీమాస్ హోటల్ వద్ద కలిసే- ఆ అడ్డరోడ్డు మాత్రమే కాస్త మెరుగయి ఉండవచ్చు.

నాయని గారు ఆ కథనంలో వర్ణించిన తీరుకంటే మరింత ఘోరంగా ఆ ఇల్లు ఉందనిపించింది. అరవై, డెబ్బై ఏళ్లక్రితం కట్టిన ఆ భవంతిలో వర్షం వచ్చిందంటే చాలు, ముంగిట్లో నీరు వరద కడుతుంది. చెన్నయ్ లోని చాలా పాత ఇళ్లలో ఇదే పరిస్థితి. ఇంటి మట్టం కంటే రోడ్డు మట్టమే ఎత్తులో ఉన్న స్థితిలో కాస్త వర్షం పడిందంటే ఇంట్లోకి వెళ్లే దారిలో మడమలపైకి నీరు చేరుతుంది. ఈ నీళ్లు ఎటూ పోలేక నిలవ ఉండిపోయి భయంకరమైన వాసన వేస్తుంటుంది. ఆ నీళ్లలోనే కాళ్లు తడుపుతూ ఇరుకు దారి గుండా లోపలికి వెళితే అక్కడ పరిచయమైన ఇద్దరమ్మల సహాయంతో దాసరిగారు ఈ భవంతి చివరలో ఉన్న 7వ నెంబర్ గదిని చూడటం జరిగింది.

మార్వాడీల యాజమాన్యంలో ఉండే ఆ పాత భవంతిలో దాసరి గారు 1952 నుంచి 2006 వరకు 54 ఏళ్ల వరకు ఇక్కడి గ్రౌండ్ ప్లోర్ లోని లోని 7వ నంబర్ గదిలోనే నివసిస్తూ వచ్చారు. అనారోగ్య కారణాలతో ఇక్కడి నుంచే ఆయన 2006లో విజయవాడలోకి బంధువుల ఇంటికి వెళ్లారు. దీంట్లో మొత్తం 12 ఇళ్లు ఉంటున్నాయి., వీటిలో తెలుగు ఫ్యామిలీలే ఎక్కువ. చందమామలో గతంలో కన్నడ విభాగంలో పనిచేసిన పద్మనాభన్ బాబు, ఆయన భార్య గౌరి గార్లు 1వ నెంబర్ ఇంటిలో ఉంటున్నారు. ఈమెకు కన్నడతో పాటు తెలుగు కూడా బాగా వచ్చు. ఇక మనవాళన్ అనే తమిళ సినీ నటుడి -ఇప్పుడు లేరు- భార్య కాంతా మనవాళన్ -60- గారు 2వ నెంబర్ గదిలో ఉంటున్నారు. ఇక్కడున్న వాళ్లంతా గత 35, 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అందరికంటే సీనియర్ మన దాసరి గారే. -అద్దెకొంపలో నివాసం చరిత్రలో ఒకే చోట 54 ఏళ్లు- మనవాళన్ దంపతులు దాసరి గారికి చివరివరకు సపరిచర్యలు చేశారట. చెన్నయ్‌లో ఆయనది బ్రహ్మచర్య జీవితమే కాబట్టి వేడి నీళ్లు కాచి ఇవ్వడం వంటి పనులు, సేవలను మనవాళన్ కుటుంబమే ఆయనకు అందించింది.

ఈ భవంతిలోని 6వ నంబర్ గదిలో గోపాల రావు గారనే టైలర్, దాసరి గారితో చాలా స్నేహంగా ఉండేవారట. ఈయన మురుగన్ కోయిల్ సమీపంలో టైలర్ షాపు పెట్టుకుని బతికేవారు. దాసరిగారికి ఈయనతో చివరివరకు సన్నిహిత సంబంధం కొనసాగింది. ఈయన పనిచేస్తున్న టైలర్ షాపు వద్దే దాసరి గారు ఎక్కువకాలం గడిపేవారు. తన అధ్యయనం మొత్తాన్ని ఈ షాపులోనే చేసేవారని తెలుస్తోంది. వాసిరెడ్డి నారాయణ రావుగారు ఈ విషయం చెప్పినట్లు శాయిగారు చెప్పారు. సామాన్యులే దాసరి గారి కథల్లో పాత్రలు. ఆయన స్నేహం కూడా మామూలు మనుషులతోటే కొనసాగింది. ఆయన కూడా ఇప్పుడు లేరు.

54 ఏళ్లు ఒకే ఇంటిలో ఉండటం, ఒకే ఆఫీసు -చందమామ-లో పనిచేయడం. దాసరి గారికే చెల్లింది. శంకర్ గారు కూడా చందమామలో గత 58 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయన చాలా ఇళ్లు మారారు. కాబట్టి ఇల్లు, ఆఫీసుకు సంబంధించిన దీర్ఘకాలిక రికార్డు ప్రపంచంలో బహుశా దాసరిగారికే దక్కవచ్చు. ఇది ఖచ్చితంగా గిన్నెస్ రికార్డుకు ఎక్కవలసిందే -అవసరమనుకుంటే-

ఈ ఇళ్లలోని వారిని కదిపితే చాలు దాసరి వారి జ్ఞాపకాల స్మరణలో మునిగి పోతున్నారు. చందమామ ఉద్యోగి, పెద్దాయన అనే గౌరవం కంటే ఆయన మా మనిషి అనే ఆత్మీయస్పర్శ వీళ్ల జ్ఞాపకాల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

దాసరి గారి సోదరులు ఈశ్వర ప్రభు ఇక్కడికి చాలా తరచుగా వస్తూ పోతూండేవారట. ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉంటున్న ఈశ్వర ప్రభు గారి కుమార్తె మణి తన బాబాయిని కలుసుకోవడం కోసం ఇక్కడికి వస్తూండేవారట.

దాసరి గారు చందమామ ఆఫీసులో పనిచేసినంతకాలం వడపళనిలోని మురుగన్ కోయిల్ స్ట్రీట్ పరిసరాల్లోనే 54 ఏళ్లుగా ఉంటూవచ్చారు. ఈ ఇల్లు మొదట్నించి మార్వాడీల చేతిలో ఉండేది. మూడేళ్లకు, ఆరేళ్లకు అద్దె ఇళ్లు ఖాళీ చేయాలనే ఇంటి ఓనర్లు రాజ్యమేలుతున్న కాలం మనది. మనిషికున్న భయాల్లో లీగల్ భయాలు సన్నవి కావు. కాగా 54 ఏళ్లుగా దాసరి గారిని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయవలసిందిగా ఈ మార్వాడీ ఓనర్లు కోరకపోవడమే చిత్రాల్లో కెల్లా విచిత్రం.

దాసరి గారు వయోభారంతో మద్రాసు నుంచి విజయవాడకు 2006లో వెళ్లిన తర్వాత కూడా వడపళని లోని ఈ 7వ నంబర్ ఇంటితో ఆయన అనుబంధం కొనసాగింది. మొదటినుంచీ ఇద్దరు నివసిస్తున్న ఈ ఇంటిలో 2010 జనవరి వరకూ దాసరి గారి అద్దెభాగాన్ని -1000 రూపాయలు. - చందమామ పూర్వ అసోసియేట్ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రయోజనం కోసం దాసరి గారి తరపున చెల్లిస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఇక్కడి స్వాతి ఎన్‌క్లేవ్‌లో ఉన్న చందమామ కొత్త ఆఫీసు బిల్డింగ్ పక్కనే ఉన్న పాతబడిన భవంతిలో ఏడవ నంబర్ ఇంటిలో దాసరి గారు అయిదు దశాబ్దాలకు పైబడి నివసించారు. ఇది చందమామ ప్రస్తుత ఆఫీసుకు సరిగ్గా వెనుకవైపున ఉండటం కాకతాళీయం.

దాసరి గారు నివసించిన ఇంటికి పక్క ఇల్లు కూడా చాలా పాతది. ప్రమాణాల ప్రకారం చూస్తే పక్కపక్కనే ఉన్న ఈ రెండు భవంతులూ చెన్నయ్ లోని అతి పురాతన భవనాలలో ఒకటిగా లెక్కించవచ్చు.

ఒక్కటి మాత్రం నిజం. దాసరి గారు చెన్నయ్ నగరంలో చివరి వరకూ మధ్యతరగతి జీవితమే గడిపారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో సామాన్య కుటుంబాలే ఉండేవి. చందమామలో సుప్రసిద్ధమైన 12 ధారావాహికలు రచించి లక్షలాది పాఠకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన దాసరి గారు ఇక్కడి ఇరుకు గదిలోనే నివసిస్తూ చందమామ సీరియల్స్‌కి పాత్రల రూపకల్పన చేసి ఉంటారు. ఆయన గడిపిన మధ్యతరగతి జీవితం సాక్షిగా ఆయన సీరియల్స్ పాత్రలు ఆ మట్టి వాసనే వేసేవంటే ఆశ్చర్యపడవలసింది లేదు.

ముఖ్యంగా మీకు తెలుపవలసింది ఏమిటంటే 7వ నెంబర్ ఇంటి మూసిన తలుపు ఫోటో, వెనుక వైపు తెరిచిన తలుపు ఫోటో తప్పితే మిగతా ఫోటోలు అన్నీ కాంతా మనవాళన్ గారి ఇంటి పోటోలే. దాసరి గారు ఉంటూ వచ్చిన గదిలో ఉంటున్న ఆయన మేం వెళ్లే సమయానికి తాళం వేసి పోవడంతో ఆయన ఇంటిలోపలి భాగాలను ఫోటోలు తీయలేకపోయాము. ఈ ప్లాట్ లోని 12 ఇళ్లూ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి గనుక పాఠకులు సౌకర్యార్థం 2వ నెంబర్ గది లోపలి, వెనుక భాగాలను ఫోటో తీసి పంపిస్తున్నాను. రచన జూన్ సంచికలో నాయని కృష్ణమూర్తి గారు వర్ణించిన దాసరి గారి ఇంటికి ఈ ఇతరుల ఇళ్లు కూడా సరిగ్గా సరిపోతున్నాయి.

దాసరి - మురుగన్ మెడికల్ షాపు
వడపళని మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఇంటికి దగ్గరగా, మురుగన్ కోయిల్‌కి అతి సమీపంలో మురుగన్ మెడికల్ షాపు ఉంది. ఈ మెడికల్ షాపులో మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి గత ఆరునెలల్లో చాలా సార్లు షాపుకు వెళ్లాము. దాన్ని తెలుగువారే నడుపుతున్నారు కాని దాసరి గారు దశాబ్దాలపాటు మందులు తీసుకున్న మెడికల్ షాపు ఇదేనని ఈ రోజు 24-12-2010- వరకు మాకు తెలీలేదు. బోర్డు కూడా రోడ్డుకు పైన కాకుండా లోపల కనీ కనిపించకుండా ఉండటంతో పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. చందమామ ప్యాకింగ్ విభాగంలో ఉన్న రవి చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు దీన్ని పట్టేశాము.

ఈ మెడికల్ షాపుతో దాసరి గారికి 50 ఏళ్లపైబడిన బంధం ఉంది. 1952లో చెన్నయ్‌కి వచ్చింది మొదలుకుని దాసరి గారు తమ వైద్య అవసరాలకు ఈ షాపుకే వచ్చేవారు. మేము వెళ్లేటప్పటికి షాపులో ఉన్న శ్రీనివాస్ గారిని దాసరి గారి గురించి ప్రస్తావిస్తే 22 ఏళ్లుగా ఆయన తనకు తెలుసని చెప్పారు. ఎందుకంటే ఇతను గత 22 ఏళ్లుగా ఈ షాపులోనే పనిచేస్తున్నారు. దాసరి గారి జ్ఞాపకాలను పంచుకోమని అడిగితే ముందుగా ఆయనకు చందమామ 2000 సంవత్సరం (?) లో జీవితకాల సాధనకు -లైఫ్ అచీవ్‌మెంట్‌- గాను అందించిన చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు ధ్రువపత్రాన్ని దాసరిగారు తమకు ఇచ్చారని చెప్పి షాపులోనే ఉన్న ఆ ఫోటోను మాకు అందించారు. షాపులోపలే దాన్ని 3 మెగా పిక్సెల్ మొబైల్‌తో ఫోటో తీస్తే అంత సరిగా రాలేదు.

చందమామ చరిత్రలో ఎక్స్‌లెన్స్ అవార్డు ఇద్దరికి మాత్రమే లబించింది వారు దాసరి, శంకర్ గార్లు. 1999లో చందమామ బయటి వ్యక్తుల సహాయం తీసుకుని తిరిగి ఉనికిలోకి వచ్చాక, దశాబ్దాలుగా పత్రిక అభివృద్ధికి దోహదం చేసిన మాన్యులను గౌరవించాలని పత్రిక మనుగడకు ఆర్థిక సహాయం అందించిన సుధీర్ రావు తదితరులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఇద్దరు మహనీయులకు చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు అందించారు. వడపళనిలో ఉన్న ప్రముఖ హోటల్ ఆదిత్యలో జరిగిన ఓ ఫంక్షన్‌లో ఈ అవార్డును బహూకరించారు.

చందమామ ఆవిర్భవించిన 50 ఏళ్ల తర్వాత ఆ సంస్థకు చెందిన సిబ్బందికి అవార్డులు ప్రకటించిన చరిత్ర అదే మొదటిదీ, చివరిదీ కూడా కావడం గమనార్హం. వ్యక్తుల కంటే సంస్థ ముఖ్యమే కాని తెలుగింటి కథల మామగా పేరొందిన ఈ సుప్రసిద్ధ కథల పత్రికలో పనిచేసిన సిబ్బంది జీవితాలు ఇంత సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోవడమే బాధాకరం. చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు వీరిద్దరికీ వచ్చినా, రాకున్నా వారి ఘనతర చరిత్రకు జరిగే లాభం, నష్టం ఏమీ ఉండవనుకోండి. కాని ఎక్కడో బాధ.

చందమామ బహూకరించిన ఈ జీవితకాల సాధన ధ్రువపత్రాన్ని దాసరి గారు 2006 వరకు పదిలపర్చుకున్నట్లు ఉంది. తర్వాత ఆయన అనారోగ్యంతో విజయవాడలో బందువుల ఇంటికి వెళ్లేటప్పుడు ఈ అపరూప జ్ఞాపకాన్ని ఈ మెడికల్ షాపులో తన స్నేహితుడికి ఇచ్చి వెళ్లినట్లుంది. ఈ రోజుకీ వారు దాన్ని షాపులోనే లోపల భద్రంగా ఉంచారు.

దాసరిగారికి చందమామ బహూకరించిన ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ఫ్రేమును మాకు చూపించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి పోటో కూడా ఈ సందర్భంగా తీశాము. సాయంత్రం 4 గంటల తర్వాత వస్తే దాసరిగారితో తమ పరిచయం విశేషాలు చెబుతానని చెప్పారు. పక్కనే ఉన్నాము కాబట్టి మళ్లీ కలుద్దామని చెప్పి మా వద్ద ఉన్న చందమామలను గౌరవంగా అందించి ఆఫీసుకు వచ్చేశాము.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. భూమ్మీద వ్యక్తిగత ఆస్తి ఉండరాదని ప్రభోదించే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని జీవితం చివరవరకూ నమ్మిన వారు దాసరి. అద్భుత రీతిలో చందమామ దశాబ్దాల సేవలకోసం తనకు అందించిన ఈ అపురూప ద్రువపత్రాన్ని కూడా దాసరిగారు తృణప్రాయంగానే వదిలి పెట్టి పోవడం, కీర్తికాంక్షల పట్ల ఎలాంటి మమకారం లేని ఆయన నిగర్వానికి, సగటు మనిషితనానికి తిరుగులేని నిదర్శనం. 83 ఏళ్ల వయసులో ఆయన మద్రాసు విడిచి విజయవాడ వెళుతున్నప్పుడు చందమామ పూర్వ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు తోడుగా వెళ్లి దింపి వచ్చారని తెలుస్తోంది. ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ప్రేమును తన వెంట తీసుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

కాని కొన్ని పుస్తకాలు తప్పితే ఆయన చెన్నయ్ నుంచి మరేమీ తీసుకుపోలేదు. చందమామ కోసం, చందమామ సీరియల్స్ కోసం, కథలకోసం జీవితాన్ని అర్పించినందుకు గాను వచ్చిన అరుదైన అవార్డును కూడా ఆయన తనది కాదనుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు. ఈ నిర్మమకారానికి, మూర్తిమత్వానికి మనం ఎలా వెలకట్టగలం చందమామలో దాసరి గారి జీవితానికి సంబంధించిన ఈ చిరస్మరణీయ సాక్ష్యాన్ని భద్రపర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ షాపు వారు ఈ అరుదైన ఫోటోను శాశ్వతంగా భద్రపర్చడానికి, భద్రపర్చగలవారికి ఇస్తే ఎంత బాగుంటుందో! ఇప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి ఆ షాపువారిని కొన్నాళ్ల తర్వాత అయినా ఈ విషయమై ప్రస్తావించాలి. దాసరి రమణ గారు కోరుకుంటున్నట్లు ఆ ఫోటోయే గనుక ఇవ్వడానికి సిద్ధమయితే బాలసాహితి తరపున దీన్ని భద్రపర్చవచ్చు.

దాసరి గారికి ఇష్టమైన హోటళ్లు
దాసరి గారు వడపళనిలోని మురగన్ కోయిల్ స్ట్రీట్‌లో ఉన్న తన ఇంటి చుట్టుపక్కల ఉన్న రెండు మూడు హోటళ్లలో టిఫన్, భోజనం చేస్తూ వచ్చారు. 1970ల చివర్లో చందమామ కథకులు ఎంవీవీ సత్యనారాయణగారు తనను చెన్నయ్‌లో కలిసిన సందర్భంలో దాసరిగారు తన హోటల్ భోజనం గురించి ఇలా అన్నారట. 'కుటుంబరావు గారిని కలవాలని వచ్చి ఎలాగూ కలవలేకపోయారు. పోతే పోయిందిలే. బాబ్బాబు, నా పేరు కాస్త గిన్నెస్ రికార్డు బుక్‌లో ఎక్కించవా! పాతికేళ్లకు పైగా చెన్నయ్‌లో నా బతుకు ఈ హోటల్ పాలయింది. పాతికేళ్లు ఒకే హోటల్లో తిండి. ఎవరికుంటుంది ఈ రికార్డు' అని తనపైన తానే హాస్యమాడారు.

ఆ పాతికేళ్లకు తర్వాత మరో పాతికేళ్లు తోడయ్యాయి. ఆయన చెప్పిన హోటల్ బహుశా ఆర్కాట్ రోడ్డుపై ఉన్న గణేష్ భవన్ కావచ్చు. ఇరుకిరుకుగా లేకుండా ఖాళీ స్థలంలో విశాలంగా కనిపించే ఈ ఉడిపి హోటల్ దాసరి గారి అవసరాలకు చక్కగా సరిపోయి ఉండవచ్చు. నాయని కృష్టమూర్తిగారు రచన జూన్ 2010 సంచికలో రాసిన 'చెట్టెక్కిన బేతాళుడు' రచనలో చెప్పిన ప్రకారం ఆయన 80లకు ముందు మురుగన్ కోయిల్ ఎదురుగా ఆర్కాట్ రోడ్‌పై ఉన్న గణేష్ భవన్ హోటల్లో చాలాకాలం టీ, ఫలహారం తీసుకున్నారు. హిందూ పేపర్ తీసుకుని ఉదయం ఇక్కడికి వచ్చే ఆయన, దాదాపు గంటకుపైగా అక్కడే ఉండి టీ, సిగిరెట్లు తాగుతూ పేపర్ చదివేవారు. ఉడిపి హోటల్లో సిగిరెట్ వెలిగించే అవకాశం ఈయనకు మాత్రమే దక్కిందని నాయని కృష్ణమూర్తిగారి రచన వ్యాసం బట్టి తెలుస్తోంది. సరిగ్గా మధ్యతరగతి వారికి సరిపోయే సాంప్రదాయకమైన గణేష్ భవన్ ఈ నాటికీ సరసమైన ధరలకే మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి సాంబార్ రైస్, పాయసం అద్భుతం

తర్వాతకాలంలో తన ఇంటికి దగ్గరగా, సుప్రసిద్ధ మురుగన్ దేవాలయం వీధి మొదట్లో ఉన్న హోటల్ శివప్రసాద్‌కి తరచుగా వెళ్లేవారట. ఇది ఆయన ఇంటికీ మరీ దగ్గరగా ఉంటుంది. దీనికి ఒక వైపున మురుగన్ కోయిల్, దానికి ఎదురుగా ఆర్కాట్ రోడ్డువైపు దారిలో మురుగన్ మెడికల్స్ షాపు ఉంటాయి. చెన్నయ్‌లో విశేషంగా పేరొందిన ఈ ఆలయం ముందు కొసలో ఉండే శివప్రసాద్ హోటల్ ఆలయానికి వచ్చి, వెళ్లే భక్తులతో సందడిగా ఉంటుంది.

ఆ తర్వాత 2000 దశకంలో ఆర్కాట్ రోడ్డు మీది శరవణ భవన్‌లో తరచుగా ఫలహారాలు తీసుకునే వారిని తెలుస్తోంది. 54 ఏళ్లుగా ఆయన ఈ రెండు మూడు హోటళ్లనే ఉపయోగిస్తూ వచ్చారు. తన ఇంటినుంచి రోడ్డుపై ట్రాపిక్‌ను దాటుకుని వెళ్లడం వయసురీత్యా కష్టమనిపించినప్పుడు ఆయన రోడ్డుకి ఈవైపునే ఉండే శివప్రసాద్, శరవణ హోటళ్లకు మారారనిపిస్తుంది. 90 దశకం చివర్లో చెన్నయ్‌లో ప్రారంభమైన శరవణ గ్రూప్ హోటల్స్ నగరంలో మంచి భోజనానికి మారుపేరుగా నిలిచాయి. 2000సంవత్సరం తర్వాత దాసరి గారు చందమామ పూర్వ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యంగారితో తరచుగా శరవణ హోటల్ సందర్శించేవారని తెలుస్తోంది.

చందమామ కథల సెలెక్షన్‌ - దాసరి
అలాగే చందమామ రైటర్స్ ప్యామిలీగా పేరొందిన జొన్నలగడ్డ కుటుంబానికి చెందిన జొన్నలగడ్డ రత్న -నారాయణ స్వామిగారు, వసుంధర గారి సోదరులు- ఇటీవల చెన్నయ్‌లో కలిసినప్పుడు చెప్పిన వివరాలు ప్రకారం 1980 నుంచి 95 వరకు పదిహనేళ్ల పాటు దాసరి గారు ప్రతి వారాంతంలోనూ ఒక పూట లేదా ఒక రోజు బీసెంట్ నగర్‌లో ఉంటున్న ఆయన ఇంటికి క్రమం తప్పకుండా పోయేవారట. ఐడీబీఐ బ్యాంక్ ఛీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరైన జొన్నలగడ్డ రత్నగారు దాసరి గారితో తన పరిచయం గురించి, ఆయనతో కథా చర్చల గురించి చాలా సమాచారం చెప్పారు. ఈయన ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

మంచి కథ కూడా చందమామలో ఒక్కోసారి సెలెక్టు కాకపోవడంపై దాసరి గారి ఆగ్రహం, పై వారికి -చందమామ అధికారిక సంపాదకులు- సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటూ విసుక్కోవడం, కథ రిజెక్టయినప్పుడు బాధపడవద్దని, చందమామలో కథ ప్రచురణకు తీసుకోనందుకు కథ లోపం కారణం కాదని, దాని వెనుక చాలా కారణాలు ఉంటున్నాయని -సహేతుక కారణాలు కూడా- దాసరి గారు జొన్నలగడ్డ రత్నగారితో చెప్పేవారట. కథ తిరస్కరణకు గురయినప్పుడు దాసరిగారు రచయితలకు రిప్లై పంపేటప్పుడు స్వాంతన కలిగిస్తూ మీ కథ ప్రచురణకు తీసుకోనంత మాత్రాన కథ బాగా లేదనుకోవద్దని సర్దిచెప్పేవారట. కధల సెలెక్షన్‌కి సంబంధించి చందమామ అధికారిక సంపాదకుల తీరుపై కొడవటిగంటి కుటుంబరావుగారికి కూడా వ్యతిరేకత ఉండేదని విశ్వసనీయ సమాచారం. పత్రికలో కథల స్వీకరణ నిర్ణయాలకు సంబంధించి ఇది ప్రపంచంలో అప్పడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉండే సమస్యే కదా.

(చందమామ కథల సెలెక్షన్‌పై, దాసరి గారి స్పందనపై వివరణాత్మక సమాచారాన్ని ‘రచన’ పత్రిక 2010 జనవరి సంచికలో ఈయన సామాన్యుడు కాదు పేరిట దాసరి వెంకట రమణ గారు రాసిన ప్రత్యేక రచనలో చూడండి. నా దృష్టిలో ఇది చందమామ చరిత్రకు, దాసరి సుబ్రహ్మణ్యంగారి జీవిత చరిత్రకు సంబంధించి థీసెస్‌తో సమానమైన రచన.)

తీరిన రుణం
దాసరిగారిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. 1970ల మొదటినుంచీ చందమామలో ఆయన సీరియల్స్‌తో పరిచయం అయినప్పటినుంచి, 2009 జనవరిలో నేను అదే చందమామలో తెలుగు విభాగంలో పనికి కుదిరిన తర్వాత కూడా ఆయన్ను చూడలేకపోయాను. చివరలో బాలుగారితో పాటు విజయవాడలో తనను కలవడానికి చాలా ప్రయత్నించి కూడా సాధ్యపడలేదు. 'చెట్టంత మనిషి కళ్లముందు ఉన్నారులే' అనే కాసింత ఏమరపాటు కూడా కారణం కావచ్చు. తీరా, 'వయసుకు మించి బతికేస్తున్నానం'టూ తనను ఇంటర్వ్యూ చేసిన సిహెచ్. వేణుగారితో సరదాగా అన్న దాసరిగారు తర్వాత ఆరునెలలకే కాలం చేసినప్పుడు అందరికీ పిడుగుపాటే.

చందమామ చిత్రకారులు శంకర్ గారిపై వీడియో ఎలాగోలా విజయవర్ధన్ గారి తోడ్పాటుతో సేకరించగలిగాము. ఒక చిన్న వీడియో కెమెరా ఉండి విజయవాడకు పోగలిగి ఆయనను సజీవంగా చిత్రిక పట్టవలసిన అవసరం గురించి వేణు గారితో చర్చించినప్పటికీ కుదరలేదు. హ్యారీ పోటర్లు, అవతార్‌లు గురించి ప్రపంచానికి తెలియని రోజుల్లోనే లక్షలాది మంది పిల్లలను జానపద సీరియళ్ల మంత్రజగత్తులో ఓలలాడించిన ఈ అపరూప తెలుగు బాల కథా రచయితగురించి ఒక్కటంటే ఒక్క వీడియో చిత్రం కూడా తీయలేని బాధ ఇక అందరినీ వెంటాడుతూనే ఉంటుంది.

ఏమో.. నా జీవితంలో ఎన్నడూ చూడలేకపోయిన దాసరి సుబ్రహణ్యం గారి రుణాన్ని ఈవిధంగా తీర్చుకుంటున్నానేమో.!

నోట్
(చివరగా, దాసరి గారు చెన్నయ్‌లో నివసించిన ఇంటిని పట్టేశానంటూ నాలుగు నెలల క్రితమే చందమామ అభిమాని శ్రీ కప్పగంతు శివరాం ప్రసాద్ గారికి చెప్పినప్పుడు ఆయన వెనువెంటనే ప్రాధేయపడ్డారు. అది పాత భవంతి అంటున్నారు కనుక రాత్రికి రాత్రే దాన్ని కూల్చేసి కొత్త భవంతి నిర్మాణాలకు ప్లాన్ జరిగిపోవచ్చని, చలం గారు నివసించిన స్వంత ఇంటి ఫోటో విషయంలో కూడా ఇలా నిర్లక్ష్యం చేసినందువల్లే ఒక రోజు ఉన్నట్లుండి దాన్ని కూల్చేసి చరిత్రకే లేకుండా చేశారని శివరాం గారు బాధపడ్డారు.

అందుకే అప్పటినుంచి ఆయన పదే పదే మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా దాసరి గారి అద్దె ఇంటిని వీలైనంత త్వరగా ఫోటో తీయమని గుర్తు చేస్తూ వచ్చారు. మన జీవితాల్లో రియల్ ఎస్టేట్ ఒక పెద్ద భూతమని అది ఎప్పుడు ఏ కొంపను లేకుండా కూల్చి వేస్తుందోనని ఆయన భయం. శివరాంగారు హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ నా వద్ద ఉన్న డిజిటల్ కెమెరా లెన్స్ పాడవటంతో రిపేర్ చేయించడం కుదర్లేదు. కెమెరా రెడీ అయితే తర్వాత చూద్దామని తాత్సారం చేస్తూ వచ్చాను.

ఈలోగా దాసరి గారి మూడు పుస్తకాలను ప్రచురించే బాధ్యత తీసుకున్న రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారి చెవిన ఈ విషయం పడి, ఈ అంశంపై వ్యాసంతో పాటు ఫోటోలను కూడా పంపితే చాలా మంచిదని, మళ్లీ మళ్లీ వేయలేమని అరుదైన రికార్డుగా ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఇక తప్పనిసరై చందమామలో సిస్టమ్ అడ్మిన్ శశి వద్ద మొబైల్ తీసుకుని ఈ వారంలో పని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది.

దాసరి గారు నివసించిన ఇంటి వివరాలు ఈ రూపంలో అయినా వెలుగులోకి వచ్చినందుకు కారణమైన శివరాం, శాయి గార్లకు మనఃపూర్వక కృతజ్ఞతలు. ఆ ఇంటి వివరాలు కావాలని చెప్పగానే దగ్గరుండి మరీ చూపించి, చుట్టుపక్కల కుటుంబాలను పరిచయం చేసిన చందమామ ప్యాకింగ్ విభాగం రవికి, మొబైల్ సాయం అందించిన శశికుమార్‌కి ఈ అన్ని ఫోటోలు తీయడంలో సహకరించిన చందమామ లే అవుట్ డిజైనర్ నరేంద్రకు, చివర్లో దాసరి గారి ఎక్సెలెన్స్ అవార్డు గురించి అరుదైన విశేషాలు తెలిపి దాని అరుదైన పోటో అందించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.)

కె. రాజశేఖర రాజు.
చందమామ
...........

గమనిక
శాయిగారూ,
చెన్నయ్‌లో దాసరి గారి వ్యక్తిగత జీవితం, ఆయన నివసించిన ఇల్లు, సందర్శించిన హోటల్స్, వైద్యం కోసం ఉపయోగించిన మెడికల్ షాపు, చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు గురించి లభ్యమైన సమాచారం చాలా పెద్దదయినట్లుంది. రచన పేజీల కొలతకు సరిపోయేలా మీరు దీన్ని వీలైనంత మేరకు ఎడిట్ చేయగలరు.

మీ
రాజు....

తాజా సమాచారం.

మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి వద్ద ఉన్న, దాసరి సుబ్రహ్మణ్యం గారికి వచ్చిన ఎక్స్‌లెన్స్ అవార్డు చందమామ స్వయంగా ఫ్రేమ్ కట్టించి ఇచ్చిందే. దాసరి గారి కోరికమేరకు దీన్ని శ్రీకాకుళంలో కథానిలయానికి అందించవలసి ఉందని తెలుస్తోంది.. ఆయన అభిప్రాయానికి ఎనలేని విలువ కల్పిస్తూ డిసెంబర్ చివర్లో శ్రీనివాస్ వద్ద ఉన్న ఒరిజనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటోను ఆయన అనుమతితో చందమామ ఆఫీసుకు తీసుకెళ్లి స్కాన్ తీయించి భద్రపర్చాము. దాని కాపీనే రచన సంపాదకులు శాయిగారికి, దాసరి వెంకటరమణ గారికి పంపాము. కనీసం కాస్తంత క్వాలిటీతో స్కాన్ అయిన ఈ కాపీ అయినా మనవద్ద ఉందని సంతృప్తి పడాలి.

24-01-2011
చెన్నయ్