Saturday, July 21, 2012

ఓడి గెలిచిన యోధానుయోధుడు స్పార్టకస్

సమకాలీన ప్రపంచంలో పరిచయం అవసరం లేని వాళ్లలో ఒకరి పేరు సూచించండి. నాకయితే వెంటనే గుర్తుకొచ్చే పేరు చేగువేరా. అలాగే ప్రాచీన ప్రపంచంలో పరిచయం అవసరం లేని వాళ్లలో ఒకరి పేరు సూచించమంటే నా మనస్సులో మెదిలే తొలి పేరు స్పార్టకస్.

వీరిలో రోమ్ సామ్రాజ్యపు బానిసత్వ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడి బానిసల గుండెలను రగిలించి తిరుగుబాటు చేసి రోమ్ పాలకులను గడగడలాడించిన ప్రాచీన తిరుగుబాటుదారుడు స్పార్టకస్. కాగా,  లాటిన్ అమెరికాను అమెరికా సామ్రాజ్యవాద డేగ పట్టునుంచి తప్పించే లక్ష్యంతో తనమీద తానే ప్రయోగం చేసుకని ప్రాణార్పణ చేసిన సాహసోపేత విప్లవకారుడు చేగువేరా.

గెలిచి ఓడడానికి, ఓడి గెలవడానికి మానవ చరిత్రలోనే ప్రతీకలుగా నిలిచిపోయన అసమాన ధీరులు స్పార్టకస్, చేగువేరా. జీవితానికి, మరణానికి కూడా సార్థకత ఉండాలని తపించిన అచ్చమైన మనుషులు వీళ్లు.

స్వేచ్ఛ కోసం పోరాటం…. జీవించడం కోసం పోరాటం… ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పోరాటం… చివరకు మరణించడానికి కూడా పోరాటం… ఇదే స్పార్టకస్ మనుషులకు అందించిన నిజమైన సందేశం. రెండు సహస్రాబ్దాల తర్వాత కూడా ఈ సందేశానికి కాలం చెల్లిపోలేదు. ప్రపంచం నూతన బానిసత్వపు కోరలకింద మగ్గుతున్న నేటికాలంలో కూడా స్పార్టకస్ తనదైన సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు.

రెండువేల సంవత్సరాలుగా మరుగున పడిన ఓ విషాదాంత ధీరోదాత్తుడి విఫలగాథను హాలీవుడ్ యాభైఏళ్ల క్రితం ప్రపంచానికి అందించింది. అర్థ శతాబ్దం తర్వాత కూడా స్పార్టకస్ చిత్రం మానవజాతికి అందిస్తున్న సందేశం పలుచబారలేదు.

ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అత్యుత్తమ సినిమాలను పరిచయం చేద్దామని భావించినప్పుడు నా మనస్సులో మెదిలిన మొదటి సినిమా “స్పార్టకస్.”  అందుకే తొలుత ఈ సినిమా పరిచయం తోటే ప్రారంభిస్తున్నాను.

స్పార్టకస్ చిత్ర ప్రాశస్త్యం
ప్రపంచ సినిమా చరిత్రలో తొలి మేధో మహాకావ్యంగా గుర్తించబడిన “స్పార్టకస్” చిత్రం తొలిసారిగా 1960లో విడుదలయింది. రోమన్ సామ్రాజ్య చరిత్రలో మరుగునపడిపోయిన ఓ మహత్తర ఆదర్శ భావాన్ని, భయంకరమైన దృశ్యాలను రెండు వేల సంవత్సరాల తర్వాత మానవజాతి జ్ఞాపకాల్లోకి తెచ్చిన మహా కళాఖండం “స్పార్టకస్.” మూడు దశాబ్దాల తర్వాత పునరుద్దరించిన కొత్త చిత్రం (1991) కూడా అలనాటి అద్భుత కావ్యానికి ఏ మాత్రం భంగంకాని విధంగా రూపొందింది. పునరుద్ధరణ తర్వాత కూడా దాని మేధోశక్తి అంతరించలేదు.

ఈనాటి ప్రమాణాల రీత్యా చూస్తే స్పార్టకస్ సినిమాలో అత్యంత సాహసోపేతమైన అంశం ఏదయినా ఉందంటే అది చిత్రం ముగింపే. సమకాలీన చిత్రాలకు బిన్నంగా ఇది విషాదాంత కథ. అయినా సరే 187 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్ర కావ్యం ఏ రకంగాను ఓ మతిహీన ముగింపును ఇవ్వదు. అదే దీని గొప్పతనం. ఒక విషాదాంతం సాహసోపేతమైన అంశంగా మారడానికి దారితీసిన ఆ ఘటన ఏది మరి!

వాస్తవ చరిత్రకు భిన్నంగా సినిమా చివర్లో శిలువ వేయబడిన కథానాయకుడు స్పార్టకస్… అన్ని సినిమాలలో సాంప్రదాయకంగా చూపించే కథానాయకుడి అంతిమ విజయానికి దూరం కావడంతో పాటు.. బానిసత్వానికి వ్యతిరేకంగా తాను వెదజల్లిన భావాలు చరిత్రలో నిలిచిఉంటాయని తన్ను తాను ఓదార్చుకుంటాడు. ఇదే సినిమా ముగింపు.

ఈ సినిమాకు రోమన్ సామ్రాజ్యాన్ని వణికించిన రోమన్ బానిస స్పార్టకస్ -కిర్క్ డగ్లస్- కథ మూలం. బానిసత్వానికి వ్యతిరేకంగా కలగంటూ స్పార్టకస్ తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తాడు. సినిమాలో నేపధ్య వ్యాఖ్యాత ప్రేక్షకులకు హామీ ఇస్తూ ఇలా అంటాడు. “బానిసత్వానికి చావు – మరో రెండు వేల సంవత్సరాల తర్వాత గాని మళ్లీ ఇది ఆవిర్బవించదు.”

సినిమాలో రోమన్ సైనికుడిని కరిచినందుకుగాను స్పార్టకస్‌కు మరణ శిక్ష విధిస్తారు. అయితే బానిస మల్లయుద్ధ యోధుల దళారీ అయిన బటియాటుస్ -పీటర్ ఉస్తినోవ్- అతడిని రక్షించాడు. ఇతడి మల్లయుద్ధ అకాడెమీలో నే స్పార్టకస్ యుద్ధ కళల్లో శిక్షణ పొందుతాడు. ఓ రోజు ఇద్దరు శక్తిమంతులు తమ భార్యలతో కలిసి రోమ్ నుండి అక్కడికి వస్తారు. ఎదురెదురు పోరులో బానిసలు పోరాడుతూ చనిపోవడాన్ని చూస్తూ వినోదించాలని ఆ భ్రష్ట మహిళలు కోరతారు. అలా, స్పార్టకస్ మరో నల్ల గ్లాడియేటర్ -ఊడీ స్ట్రోడ్-తో ఇక్కడ తలపడతాడు. చివరకు స్పార్టకస్‌ను ప్రాణాలతో విడిచిపెట్టిన నల్ల యోధుడు చివరకు తానే చనిపోతాడు.

ఇద్దరు భ్రష్ట మహిళల వినోదం కోసం తాము చచ్చేదాకా పోరాడాల్సిరావడం స్పార్టకస్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రెచ్చగొట్టింది. దీంతో మొదలైన బానిసల తిరుగుబాటు దాదాపు అప్పటి ఇటలీలో సగం విస్తీర్ణంలో చెలరేగింది. బలహీనపడి, శిక్షణ సరిగా లేని రోమన్ సైన్యాలతో స్పార్టకస్ అనుచరులు యుద్ధాల్లో తలపడ్డారు. స్పార్టకస్ విజయానికి అతి సమీపంలోకి వచ్చాడు కానీ, అతడి దళాలు రెండు సైన్యాల మధ్య చిక్కుకుపోయి విషాదకరంగా ఓటమి పాలయ్యాయి.

రోమన్ పతనం నేపధ్యంలోనే ఈ  పరిణామాలన్నీ జరిగాయి. నాటి సెనేట్ రాజకీయ క్రీడలను కూడా ఈ చిత్రం ప్రతిభావంతంగా చూపింది. వయోవృద్ధుడు, బలవంతుడు అయిన సెనేటర్ గ్రాచూస్ (చార్లెస్ లాఫ్టన్)ను పక్కకు తప్పించి తానే రోమన్ సామ్రాజ్య నియంత కావాలని క్రాసస్ (లారెన్స్ అలివర్) ప్రయత్నిస్తుంటాడు. దీంట్లో లైంగిక అంశాలు కూడా చోటుచేసుకున్నాయి. గ్రాచూస్ స్త్రీలోలుడు, క్రాసస్ ఉభయలింగ సంపర్కధారి. అయితే స్పార్టకస్ సహచరి, బానిస మహిళ వరీనియా (జీన్ సైమన్స్)తో ప్రేమను జయించుకోవాలనే బలీయమైన కాంక్ష అతడిలో రగులుతుంది.

స్పార్టకస్ (1960) చిత్రం స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వంలో వచ్చింది. స్పార్టకస్ చారిత్రక జీవితంపై, బానిసల చివరి యుద్దంపై హోవార్ట్ ఫాస్ట్ అదే పేరుతో రచించిన మేటి నవల దీనికి ఆధారం. ఈ చిత్రానికి డాల్టన్ ట్రుంబో స్క్రీన్‌ప్లే రాశాడు. చిత్ర నిర్మాత కిర్క్ డగ్లస్. ఆనాటికి 31 ఏళ్ల ప్రాయంలో ఉన్న స్టాన్లీ క్యుబ్రిక్ దీనికి దర్శకత్వం వహించాడు.

గత 50 సంవత్సరాలుగా ఈ సినిమా తనదైన ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది. ప్రత్యేకించి యుద్ధరంగ దృశ్యాల అమేయ శక్తి, అలివర్, డగ్లస్, లాఫ్టన్‌ల అద్భుత నటనా ప్రదర్శన సంవత్సరాలు గడిచినా తమ ప్రాచుర్యాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాయి.

బానిస తిరుగుబాటు నేత స్పార్టకస్‌గా కిర్క్ డగ్లస్, అతడి విరోధి, రోమన్ సైన్యాధిపతి, రాజకీయనేత అయిన మార్కస్ లిసినియస్ క్రాసస్‌గా లారెన్స్ అలివర్ ఈ చిత్రంలో నటించారు. బానిసల వ్యాపారి లెంట్యులస్ బటియాటస్‌గా నటించిన పీటర్ ఉస్తినోవ్ ఈ చిత్రంలో ఉత్తమ సహాయ నటుడుగా ఆస్కార్ అవార్డ్ అందుకున్నాడు కూడా. జాన్ కెవిన్ జూలియస్ సీజర్‌గా నటించగా జీన్ సైమన్స్, చార్లీస్ లాఫ్టన్, జాన్ ఐర్లండ్, హెర్బర్ట్ లోమ్, వూడీ స్ట్రోడ్, టోనీ కర్టిస్, జాన్ డాల్, చార్లీ మెక్‌గ్రా ఈ చిత్రంలోని ఇతర పాత్రలను పోషించారు.

సినిమా పరిచయం
రోమన్ పాలిత ప్రాంతమైన లిబియాలో బానిసలు పనిచేస్తున్న దృశ్యంతో సినిమా మొదలవుతుంది. పనిచేస్తూ కిందపడిపోయిన ముదుసలికి సాయపడేందుకోసం వచ్చిన ధ్రేషియన్ జాతీయుడైన స్పార్టకస్‌ను రోమన్ సైనికుడు కొరడాతో బాది వెనక్కు వెళ్లి పని చేయమని చెబుతాడు. కుపితుడైన స్పార్టకస్ ఆ సైనికుడిపై దాడి చేసి కాలిమడమపై కొరకడంతో అతడిని బంధించి అన్నాహారాలు అందివ్వకుండా చంపేయ్యాలని శిక్ష విధిస్తారు.

లెంట్యులస్ బటియాటస్, లానిస్టాలు మల్లయుద్ధ యోధులకోసం వెతుకుతూ అక్కడికి వస్తారు. అక్కడ పలువురు బానిసలను తనిఖీ చేసిన అనంతరం వారు చివరగా స్పార్టకస్ వద్దకు వస్తారు. చెక్కుచెదరని అతడి స్థైర్యాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని గుర్తిస్తారు. ఇక్కడే బటియాటస్ పలువురు బానిసలతో పాటు బానిసలను కొంటారు.

మల్లయోధుల శిక్షణా శిబిరం ఉన్న కేపువా వద్దకు వీరిని తీసుకెళతారు. థ్రేషియన్‌ను ఎందుకు చంవవచ్చో ఉదాహరణ మాత్రంగా ప్రస్తావించిన అక్కడి శిక్షకుడు మార్సెలస్ వచ్చీరాగానే స్పార్టకస్‌ను రెచ్చగొడతాడు. ఇక్కడే మరొక మల్లయోధుడు క్రిక్సస్‌ (జాన్ ఐర్లండ్), స్పార్టకస్ మధ్య స్నేహం చిగురిస్తుంది,

మల్లయుద్ధ శిక్షణా శిబిరంలో మల్లయోధుల శిక్షణను, జీవితాన్ని సినిమాలో వివరంగా చిత్రించారు. ఇలా ఉండగా ఓ రోజు రోమన్ సైన్యాధిపతి క్రాసస్, రెండు జతల మల్లయోధులు పోరాడుతూ చావడం చూడాలని కోరుకుంటున్న తన స్నేహితులు, స్నేహితురాళ్లతో కలిసి ఈ శిబిరానికి వస్తాడు. స్పార్టకస్, క్రిక్సస్, ఓ ఇధియోపియా బానిస డ్రాబా, గాలినో అనే మరో మల్లయోధుడిని ఈ పోటీలకు ఎంపిక చేస్తారు.

తొలి పోటీ క్రిక్సస్, గాలినో మధ్య జరుగుతుంది. పోటీలో గెలిచిన క్రిక్సస్ ప్రత్యర్థిని చంపేస్తాడు. తర్వాత డ్రాబాతో తలపడిన స్పార్టకస్ అనూహ్యంగా ఓడిపోతాడు. అయితే అతడిని చంపడానికి తిరస్కరించిన డ్రాబా వీక్షకుల గ్యాలరీలో కూర్చున్న వారిపైకి తన ఈటెను విసిరివేస్తాడు. రోమన్లపై దాడికి గాను ఎగిరిదూకిన డ్రాబాను సైనికులు వధిస్తారు. క్రాసస్ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు బానిస యువతి వరీనియాను అతడు కొనుగోలు చేస్తాడు. బటియాటుస్ ఈమెను స్టార్టకస్ వద్దకు పంపుతాడు. వారిద్దరూ పరస్పరం ఇష్టపడతారు.

వ్యక్తిగతంగా తనకు తగిలిన దెబ్బకు తోడుగా, రోమన్ సైన్యాధిపతి, అతడి మిత్రుల వ్యవహారంతో రెచ్చిపోయిన స్పార్టకస్ తిరుగుబాటు లేవదీస్తాడు. శిక్షణా శిబిరం నుంచి విముక్తులైన మల్లయోధులు త్వరలో కేపువా దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాలను పట్టుకుంటారు. అనేకమంది స్థానిక బానిసలు తిరుగుబాటుదారులతో కలిసిపోతారు. సిసిలియన్ దారిదోపిడి దొంగల నౌకల ద్వారా బ్రండిసియం రేవు గుండా సముద్రమార్గాన తప్పించుకోవాలని స్పార్టకస్ పథకం రచిస్తాడు.

బానిస తిరుగుబాటును అణచడానికి ప్లెబియన్ సెనేటర్ గ్రాచూస్ జిత్తులమారితనంతో రోమ్ సెనేట్‌లో క్రాసస్ స్నేహితుడైన మార్కస్ గ్లాబ్రస్‌కు రోమ్ సైనిక శిబిరంలోని ఆరు బలగాలను ఇచ్చి పంపుతాడు. గ్లాబ్రస్ పరోక్షంలో రోమ్ సైనిక శిబిరంపై నియంత్రణను తన మిత్రుడైన జూలియస్ సీజర్‌ చేపట్టేలా దారి ఏర్పరుస్తాడు గ్రాచూస్.

ఈలోగా సిసిలీ గవర్నర్ నుంచి క్రాసస్ కొత్త బానిసలను బహుమతిగా పొందుతాడు. వారిలో సిసిలీలోని మునుపు పిల్లల సంరక్షకుడిగా పనిచేసిన ఆంటోనియస్ కూడా ఉంటాడు. క్రాసస్ తీవ్రంగా బెదిరించడంతో ఆంటోనియస్ అక్కడినుంచి పారిపోయి స్పార్టకస్ చెంత చేరతాడు.

బానిసయోధులలో కొత్తగా చేరిన వారిని స్పార్టకస్, క్రిక్సస్ సమీక్షించి వారి నైపుణ్యాలకు తగినట్లుగా ఆయా పదవులలో నియమిస్తారు. వారిలో ఒకడైన ఆంటోనియస్‌ తన్ను తాను కవి, ఊహాతత్వవేత్తగా పరిచయం చేసుకుంటాడు. తర్వాత అతడు బానిస సైన్యానికి వినోదం పంచిపెడతాడు. అయితే రాజకీయాలకు, కళకు మధ్య ఉన్న సంబంధంపై పరోక్షంగా వ్యాఖ్యానించడం ద్వారా, సైనికుడిగా కావాలన్న ఆకాంక్షను అతడు వ్యక్తపరుస్తాడు.

బటియాటుస్ చెరనుంచి తప్పించుకుని మరో బానిస యజమాని ఆస్తిగా మారిన వరీనియా మళ్లీ స్పార్టకస్‌ను కలుసుకుంటుంది. రోమ్ సైన్యానికి చెందిన ఆరు పటాలాలపై దాడిచేసి నిర్మూలించిన స్పార్టకస్, అతడి సైన్యం సముద్రం వేపుగా పురోగమిస్తుంది. ఓడిపోయిన గ్లాబ్రస్ అవమాన భారంతో రోమ్‌కు తిరిగి వస్తాడు. ఆరుపటాలాల సైన్యంలో కేవలం 14 మంది మాత్రమే బతికి బట్టకట్టి తిరిగి వస్తారు. సెనేట్ విచారణ అనంతరం బానిసలతో యుద్ధంలో నిర్లక్ష్యవైఖరికి గాను గ్లాబ్రస్‌ను క్రాసస్ రోమ్ నుంచి బహిష్కరించక తప్పింది కాదు.

తిరుగుబాటును అణచడానికి రోమ్ మళ్లీ సైన్యాన్ని పంపుతూవచ్చింది. కానీ ప్రతిసారీ స్పార్టకస్ వాటిని ఓడిస్తూ వచ్చాడు. మెటాపోంటమ్‌లో జరిగిన ఓ దాడిలో 19 వేల మంది రోమన్‌లు మరణిస్తారు. దీంతో సెనేట్ నుంచి క్రాసస్ తప్పుకుంటాడు. ప్రవాసంలో ఉన్న తన మిత్రుడు గ్లాబ్రస్ గతే ఇతడికీ పట్టేది. కానీ పరిస్థితులు పూర్తిగా విషమించి సెనేటర్లు తనను రోమ్ నియంతగా చేసే తరుణంకోసం అతడు వేచి చూస్తున్నాడని గ్రహించిన గ్రాచూస్ అలాంటి అవకాశం క్రాసస్‌కు రాకుండా బానిసలు తప్పించుకోవడంలో సహాయం చేస్తుంటాడు.

ఈలోగా క్రాసస్ బానిసల పథకాన్ని ఓడించడానికి సర్వం సిద్ధం చేసుకుంటాడు. మాజీ బానిసలు సముద్ర తీరం చేరేసరికి, సిసిలియన్లను క్రాసస్ కొనేశాడని వారికి అర్థమవుతుంది. సిసిలియన్ రాయబారి స్పార్టకస్‌కు, గర్భవతి అయన వరీనియాకు, బానిస ప్రముఖులకు నచ్చచెప్పి ఆసియాకు వెళితే రాజాల్లాగా బతకవచ్చని చెబుతాడు. నిజాయితీ పరుడైన స్పార్టకస్ తన సైన్యాన్ని వదిలి వెళ్లిపోవడానికి అంగీరించడు. పైగా తాను మూడు రోమన్ సైన్యాల మధ్య చిక్కుకున్నట్లు గ్రహిస్తాడు. అవి కాలబ్రియాలోని పాంపే, బ్రుండిసియం లోని లుకల్లస్, రోమ్‌లోని సైనికపటాలం.

రోమన్ సైనిక మోహరింపు కారణంగా స్పార్టకస్ రెండు రోమన్ సైన్యాల నడుమ చిక్కుకుపోయే స్థితి ఏర్పడుతుంది. అతడికి మిగిలిన ఏకైక మార్గం ఏదంటే పోరాడుతూ రోమ్ మార్గం గుండా తప్పుకోవడమే. కానీ గెలిచే అవకాశం చాలా తక్కువ.

ఈలోగా సెనేట్ క్రాసస్‌కు అసాధారణ అధికారాలను కట్టబెడుతుంది. స్పార్టకస్ పట్టుబడితే అతడిని గుర్తుపట్టడానికి గాను క్రాసస్ మల్లయోధుల శిబిరం యజమాని బటియాటూస్‌ను చేరదీస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఓడిపోయిన తర్వాత మిగిలి ఉండే స్పార్టకస్ సైన్యాన్ని తనకు అప్పగిస్తానని క్రాసస్ హామీ ఇస్తాడు.

అంతిమయుద్ధంలో స్పార్టకస్ స్త్రీపురుషులతో కూడిన తన సైన్యాలను రోమ్ సైనిక శిబిరానికి వ్యతిరేకంగా కూడగడతాడు. తొలిదశలో బానిసలు కొన్ని విజయాలు సాధిస్తారు కాని, తర్వాత క్రిక్సస్ యుద్ధంలో మరణిస్తాడు. పైగా, పాంపీ, లుకల్లస్ నుంచి వచ్చిన అదనపు సైన్యాల ముందు బానిస సైన్యం వీగిపోతుంది. ఈ యుద్ధంలో బానిస సైన్యానికి సంపూర్ణ పరాజయం కలుగుతుంది. ఇరుపక్షాల సైనికులూ తీవ్రంగా దెబ్బతింటారు.

బతికి బయటపడ్డ వారిలో స్పార్టకస్, ఆంటోనియస్ కూడా ఉంటారు. స్పార్టకస్‌ను కాని అతడి శవాన్ని కాని చూపించినట్లయితే బందీలను శిక్షించకుండా వదిలిపెడతానని క్రాసస్ హామీ ఇస్తాడు. స్పార్టకస్, ఆంటోనియస్‌లు లేచి నిలబడతారు. అయితే స్పార్టకస్ మాట్లాడేముందుగా ఆంటోనియస్ తానే స్పార్టకస్‌నని కేకవేస్తాడు. అంతే.. బతికి ఉన్న ప్రతి బానిస సైనికుడూ తానే స్పార్టకస్‌నని లేచి నిలబడతారు.

కుపితుడైన క్రాసస్ యుద్ధరంగం నుంచి రోమ్ వైపు దారి తీసే ఏపియన్ మార్గంలో బానిసలను అందరినీ శిలువ వేయవలసిందిగా ఆదేశిస్తాడు. అయితే ఆంటోనియాను గుర్తుపట్టడమే కాక, తాను కేపువాను సందర్శించిన సందర్భంగా చూసిన స్పార్టకస్ ముఖాన్ని క్రాసస్ గుర్తుపట్టి ఇద్దరినీ చివరిదాకా ప్రాణాలతో ఉంచుతాడు. ఓపియన్ వే వైపు బయలుదేరిన ఇతర బానిస యోధులను ఒకరి తరవాత ఒకరిని రోమ్ సైనికులు శిలువ వేస్తారు.

యుద్ధంలో చావగా మిగిలిన బానిసలను తనకు అప్పగిస్తానని చేసి మాటతప్పిన క్రాసస్‌పై పగ తీర్చుకోవడానికి బటియాటస్ కాచుకుని ఉంటాడు. యుద్ధరంగంలో పట్టుబడిన వరీనియా, ఆమె తొలి బిడ్డను క్రాసస్ ఇంటికి తీసుకువస్తారు. వరీనియాను తన బానిస ప్రేమికురాలిగా చేసుకోవాలని క్రాసస్ ప్రయత్నిస్తాడు. ఆమెను లొంగదీసుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తాడు.

రోమ్ రాజకీయాల్లో ప్రాబల్యం తగ్గి క్రాసస్ ప్రాభవాన్ని గ్రహించిన సెనేట్ అధ్యక్షుడు గ్రాచూస్ తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా క్రాసస్ నుంచి వరీనియాను తప్పించేందుకు బటియాటస్‌ను నియమిస్తాడు. తర్వాత ఆమెకు, ఆమె బిడ్డకు స్వేచ్ఛ ప్రసాదిస్తూ స్వహస్తాలతో సంతకం పెట్టిన అనుమతి పత్రాలను వారికి అందజేస్తాడు.

వారు వెళ్లిపోయాక, గ్రాచూస్ రెండుకత్తులను తీసుకుని ఒకదానికేసి చూసి ‘హు… వాడిగా ఉంద”ని గొణుక్కుంటాడు. తర్వాత ఒక కత్తిని చేతబట్టి మరొక కత్తిని కింద పెట్టిన గ్రాచూస్ పక్కనున్న గదికి వెళ్లి తాను జీవితం నుంచి నిష్క్రమిస్తున్నదానికి సూచనగా తెర మూసివేస్తాడు.

ఈలోగా, శిలువ వేయబడడానికి ముందుగా బానిసలు హీనాతి హీనమైన పరిస్థితులనుంచి లేచి నిలబడి రోమ్ సామ్రాజ్యాన్నే ఎలా సవాలు చేశారనే విషయాన్ని స్పార్టకస్ మననం చేసుకుంటాడు. కాస్సేపయ్యాక క్రాసస్ అక్కడికి వస్తాడు. స్పార్టకస్, ఆంటోనియస్‌లను చచ్చేంతవరకూ కొట్లాడవలసిందిగా ఆదేశిస్తాడు. మరుసటిదినం సంబరాలు జరుపుకునేంత వరకూ కూడా ఓపిక పట్టలేని క్రాసస్, తాను కోరినా స్పార్టకస్ తన ఉనికిని చెప్పలేదనే కసితో ఇద్దరి మధ్యా జరిగే పోరులో గెలిచిన వాడిని శిలువ వేయిస్తానని ప్రకటిస్తాడు.

దీంతో శిలువపై ఎక్కి నరక యాతనలు పడి చావడం నుంచి పోటీదారును తప్పించాలనే ఉద్దేశంతో స్పార్టకస్, ఆంటోనియస్‌లు ఒకరి నొకరు చంపుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ పోరులో ఆంటోనియస్‌ చంపబడిన తర్వాత వరీనియా, ఆమె బిడ్డ క్రాసస్‌ బానిసలుగా మారారనే విషయం స్పార్టకస్ చెవిన వేస్తారు. తర్వాత రోమ్ స్థూపాలపై అతడిని శిలువ వేస్తారు. స్పార్టకస్ అమరుడవుతున్న ఈ తరుణాన తాను మొట్టమొదటి సారిగా స్పార్టకస్‌ను చూసి భయపడుతున్నానని క్రాసస్ సీజర్‌వద్ద అంగీకరిస్తాడు.

ఈలోగా ఏపియన్ మార్గం గుండా గాల్ వైపు బయలు దేరిన బటియాటస్, వరీనియాలు ఆ మార్గంలో చిట్టచివరగా శిలువ వేయబడిన స్పార్టకస్‌ను చూస్తారు. అప్పటికి అతడింకా చనిపోయి ఉండడు. తమకు పుట్టిన బిడ్డను వరీనియా స్పార్టకస్‌కు చూపిస్తుంది.

తమ బిడ్డను స్వేచ్ఛామానవుడిగా పెంచుతానని, పెరిగి పెద్దయ్యాక తన తండ్రి ఎవరో, అతడు కన్న కలలు ఏమిటో బిడ్డకు తెలియజేస్తానని వాగ్దానం చేసి స్పార్టకస్‌కు ఆమె తుది వీడ్కోలు పలుకుతుంది. అంతిమ శ్వాస తీయడంతో స్పార్టకస్ తల వెనక్కు వాలిపోతుంది. వరీనియా రథంలోకి ఎక్కి బయలు దేరుతుంది.

స్పార్టకస్ చిత్రం షూటింగ్ విశేషాలు...
స్పార్టకస్ నవలా రచయిత హోవార్డ్ ఫాస్ట్‌నే సినిమా స్క్రీన్‌ప్లే రాయడానికి ఎన్నుకున్నారు కానీ తన నవలకు వెండితెర రూపం ఇవ్వటం కష్టసాధ్యమనిపించిన తర్వాత అతడి స్థానంలో డాల్టన్ ట్రంబోను నియమించారు. ఇతడు కూడా సామ్ జాక్సన్ అనే మారు పేరుతో ఈ స్క్రీన్‌ప్లేను రూపొందించాడు.

ఈ సినిమాకు దర్శకత్వం వహించమని వచ్చిన ప్రతిపాదనను డేవిడ్ లీన్ తోసిపుచ్చిన తర్వాత సుప్రసిద్ధ దర్శకుడు ఆంథోనీ మాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించవలసి ఉంది. అయితే తొలివారం షూటింగ్‌లో క్వారీలో తొలి దృశ్యాలను తీసిన తర్వాత మాన్‌పై డగ్లస్ విరుచుకుపడ్డాడు.

సినిమా పరిధిని చూసి అతడు భయపడినట్లు తనకు అనిపించిందని డగ్లస్ తర్వాత తన జీవిత చరిత్ర పుస్తకంలో రాసుకున్నాడు. అయితే మాన్ ఇంత కంటే పెద్ద కళాఖండాలను కూడా తదనంతరం తీసాడు. ఏదేమైనా దర్శకుడిగా మాన్ తొలగింపుకు కారణాలు ఈనాటికీ నిగూఢంగా ఉండిపోయాయి. తర్వాత ముప్పై ఏళ్ల వయసు కుర్రాడు స్టాన్లీ కుబ్రిక్‌ను దర్శకుడిగా తీసుకున్నారు.

ఆనాటివరకు హాలీవుడ్ చిత్ర పరిశ్రమ చేయనంత పెద్ద ప్రాజెక్టుగా స్పార్టకస్ చిత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా నిర్మాణ వ్యయం అప్పట్లోనే 12 మిలియన్ డాలర్లు. సినిమాలో 10,500 మంది పాత్రలు పోషించారు.

“డబ్బు, సామగ్రి, మనుషులూ ఉన్నాక హాలీవుడ్ లో ఓ “స్పార్టకస్”, సోవియట్ రష్య్యా లో ఓ “వార్ అండ్ పీస్” తీయడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి. కానీ మనకు ఇలాంటి భారీ చారిత్రక ప్రాధాన్యత కలిగిన చిత్రాలు డబ్బులున్నా తీయడం సాధ్యమా” ఆని సత్యజిత్ రాయ్ వంటి సుప్రసిద్ధ దర్శకుడే ఓ సందర్భంలో వాపోయారంటే స్పార్టకస్ చిత్ర నిర్మాణ విశిష్టత మనకు స్పష్టంగా బోధపడుతుంది.

స్పార్టకస్ చిత్రాన్ని మొదట 35 ఎంఎం టెక్‌నిరామా ఫార్మాట్‌లో తీశారు. తర్వాత 70 ఎంఎం చిత్రంగా మార్చారు. భారీ సమూహాన్ని తలపింపజేయడానికి మిచిగాన్ రాష్ట్రంలోని నోటర్ డేమ్ కాలేజ్ ఫుట్‌బాల్ గేమ్ షౌటింగ్ హాల్‌లో 76 వేలమంది వీక్షకులను రికార్డు చేయగలిగే త్రీ ఛానల్ సౌండ్ ఎక్విప్‌మెంట్‌ను కుబ్రిక్ సిబ్బంది ఉపయోగించారు.

సినిమాలోని సాధారణ దృశ్యాలను హాలీవుడ్‌లోనే తీశారు. కానీ యుద్ధరంగ దృశ్యాలను స్పెయిన్ లోని మాడ్రిడ్‌ నగరం వెలుపలి విశాల మైదానంలోనే తీయాలని దర్శకుడు కుబ్రిక్ పట్టుపట్టాడు. రోమన్ సైన్యంగా నటించడానికి స్పానిష్ పదాతి దళానికి చెందిన 8 వేల మంది సైనికులను ఉపయోగించారు.

వీరిని డైరెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన గోపురాలమీదికి ఎక్కి దర్శకుడు ఆదేశాలిచ్చేవాడు. అయితే ప్రీవ్యూ సమయంలో ప్రేక్షకుల వ్యతిరేక స్పందన ఫలితంగా ఒక్కటి మినహా అన్ని యుద్ధ రంగ దృశ్యాలను దర్శకుడు తొలగించవలసి వచ్చింది.

అంతకు మించి, అంతిమ శిలువ సన్నివేశంలో తాత్కాలిక సైకిల్ సీట్లమీద నిలబడి ఉన్న ఓ ఎక్స్‌ట్రా నటుడు పొరపాటున జారిపడి మరణించాడట.

స్పార్టకస్ సినిమాను 1967లో మళ్లీ విడుదల చేశారు. అసలు చిత్రం నుంచి 23 నిమిషాల భాగాన్ని కుదించారు. 1991లో ఈ 23 నిమిషాల కుదింపును చేర్చి మరోసారి చిత్రాన్ని విడుదల చేసారు. అయితే 1960లో తీసిన తొలి చిత్రం నుంచి తీసివేసిన హింసాత్మక యుద్ధ సన్నివేశాలతో కూడిన మరో 14 నిమిషాల నిడివి భాగాలను కూడా చేర్చి మరీ విడుదల చేసారు.

అమెరికా చిత్రపరిశ్రమ తరపున నిర్వహించిన ఓసర్వేలో స్పార్టకస్ చిత్రం పది అత్యుత్తమ అమెరికా ప్రామాణిక సినిమాలలో అయిదో స్థానం దక్కించుకుంది.

“నేనే స్పార్టకస్‌ని” అంటూ ఈ చిత్రం చివర్లో తీసిన దృశ్యం ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమాలకు, పాత్రలకు ప్రేరణగా నిలిచింది. స్పార్టకస్ ఉనికి రోమ్ సైన్యం ముందు బయటపడకుండా ఉండేలా చేసి అతడి ప్రాణాలను కాపాడడానికి బానిస యోధులు ఒకరి వెనుక ఒకరు లేచి నిలబడి నేనే స్పార్టకస్ అని అరుస్తారు. 1964లో సోవియట్-క్యూబా దేశాలు నిర్మించిన సంయుక్త చిత్రం “ఐ యామ్ క్యూబా” లో పట్టుబడిన క్యూబన్ గెరిల్లాలు నేనే ఫిడెల్‌ని అంటూ ప్రకటించుకుంటారు. వియత్నాంకు చెందిన ఓ సినిమాలో కూడా ఇదే రకమైన దృశ్యం కనబడుతుంది.



చారిత్రక అసందర్భాలు
సినిమాలో స్పార్టకస్ బానిసగా పుట్టినట్లు చూపించారు. అయితే నిజమైన స్పార్టకస్ సైనికుడిగా పనిచేస్తూ రోమన్ సైన్యం నుంచి పారిపోయినాడని, చివరకు పట్టుబడగా శిక్ష కింద అతడిని బానిసగా అమ్మివేశారని చరిత్రకారులు భావిస్తున్నారు. ప్రాచీన లిబియా గనుల్లో ఇతడు పనిచేసినట్లు ఎలాంటి ఆధారమూ లేదు.

క్రీస్తుశకం ఒకటవ శతాబ్దానికి ముందు గ్లాడియేటర్ తరహా మల్లయోధులు ఉనికిలో లేరు.

గ్రాచూస్ పాత్ర కూడా చరిత్రకు అనుగుణంగా లేదు. క్రీస్తుపూర్వం 163 నుంచి 121 మధ్య కాలంలో టైబీరియస్ గ్రాచూస్, గేయస్ గ్రాచూస్ అనే ఇద్దరు విప్లవ రాజకీయ వాదులు ఉనికిలో ఉండేవారు. సినిమాలో ఉన్న గ్రాచూస్ ఈ ఇద్దరు చారిత్రక వ్యక్తుల, వారి జనాకర్షక రాజకీయ వైఖరుల సమ్మేళనంగా రూపొందాడు.

రోమ్ సైనికశిబిరంపై జూలియస్ సీజర్ నియంత్రణ లేదు. ఎందుకంటే అది క్రీస్తుపూర్వం 71లో కాని ఉనికిలోకి రాలేదు. నగర రక్షకులు మాత్రమే నగరాన్ని కాపాడుతూ వీధులను నియంత్రించేవారు. సినిమాలో చూపిన ప్రయేటోరియన్ గార్డ్‌ను ఆగస్టస్ మరో 70 సంవత్సరాల తర్వాత మాత్రమే ఏర్పర్చాడు.

స్పార్టకస్ యుద్ధంలో చనిపోయాడు కానీ అతడి భౌతికకాయం మాత్రం దొరకలేదు. కానీ చిత్రంలో అతడిని శిలువ వేసినట్లు చూపారు.

క్రాసస్ ఎన్నడూ రోమ్ నియంతగా కాలేదు. స్పార్టకస్ సైన్యాన్ని ఓడించినందుకు గాను అతడికి రోమన్ సెనేట్ ఓ నామమాత్రపు పతకాన్ని మాత్రమే బహుకరించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్పార్టకస్ మరణానంతరం ఉత్తరానికి పారిపోయిన బానిసల సైన్యపు అవశేషాలను వెంటాడి ఓడించిన పాంపేకే సంపూర్ణ రోమన్ విజయ గౌరవం దక్కింది. .

ఇదే స్పార్టకస్ చిత్ర నిర్మాణ చరిత్ర.. ఫిల్మ్ క్లబ్బులు దాదాపు అంతరించిపోయిన ఈ కాలంలో ప్రయత్నిస్తే ఈ చిత్రం డీవీడీలలో కూడా ఉత్తమ నాణ్యతతో దొరికే అవకాశముంది. బానిసత్వాన్ని అసహ్యించుకుని తన జాతి జనుల్లో మంటలు రగిలించిన స్పార్టకస్ మానవ చరిత్రలోని మహాయోధుల్లో ఒకడు.

ఈ సినిమా డీవీడీ లభ్యమైతే ముందు మీ కుటుంబంతో కలిసి చూడండి. పిల్లలకు ప్రతి దృశ్యాన్ని విడమర్చి చెప్పండి. స్వేచ్ఛకోసం పోరాడటం కంటే మించిన గొప్ప గుణం లేదని వారికి అర్థం చేయించండి. వీలైతే ఈ సినిమాను మీ మిత్రులకు, బందువులకు, ఇరుగుపొరుగువారికి కూడా చూపించండి. దయచేసి షోకేసుల్లో మాత్రం దీన్ని భద్రంగా పదిలపర్చకండి.
కె.రాజశేఖర రాజు
Blaagu.com/chandamamalu
krajasekhara@gmail.com

గమనిక:
స్పార్టకస్ సినిమా పరిచయం 2010లో ప్రాణహిత.ఆర్గ్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది.
http://www.pranahita.org/2010/01/odi_gelichina/

ప్రపంచ సినిమా చరిత్రను విశేషంగా ప్రభావితం చేసిన ప్రామాణిక చిత్రాలను పరిచయం చేయాలంటూ ప్రాణహిత.ఆర్గ్ నిర్వాహకులు చేసిన ప్రతిపాదన మేరకు 2010లో మొదటగా స్పార్టకస్ సినిమాను పరిచయం చేశాను. ఈ వరుసలో మరొక రెండు సినిమాలు పరిచయం చేసిన తర్వాత నిర్వహణా సమస్యలతో ఆ వెబ్‌సైట్ నిలిచిపోయింది. వాటిని వరుసగా ఇక్కడ నా బ్లాగులో ప్రచురించి తర్వాత వీలువెంబడి ఇతర క్లాసికల్ చిత్రాలను కూడా పరిచయం చేద్దామనుకుంటున్నాను.

ఈ స్పార్టకస్ సినిమా పరిచయాన్ని మొదట ప్రచురించిన ప్రాణహిత.ఆర్గ్ వారికి కృతజ్ఞతలు.
 
రాజశేఖర రాజు

కింది అభిప్రాయాలు ప్రాణహిత.ఆర్గ్ వెబ్‌సైట్‌లో అప్పట్లోనే ప్రచురించబడ్డాయి.

9 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు
9 Responses to “ఓడి గెలిచిన యోధానుయోధుడు స్పార్టకస్”

    1
    హెచ్చార్కె Says
    January 14th, 2010 at 1119 am

    చాల మంచి వ్యాసం. ఏ వర్షనో చెప్పలేను గాని, స్పార్టకస్ సినిమా రెండు మూడు సార్లు చూశాను. సిడి, డివిడి సంపాదించడం… కష్టం కాదనుకుంటాను, ఒక మంచి సినిమాను చర్చించినందుకు అభినందనలు. రాజ శేఖర్ గారు చేసిన వ్యాఖ్యల్లో… “స్వేచ్ఛ కోసం పోరాటం…. జీవించడం కోసం పోరాటం… ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పోరాటం… చివరకు మరణించడానికి కూడా పోరాటం… ” అనే వాక్యంలో చివరి భాగం మంచి వైఖరి కాదని నా అభిప్రాయం. ‘జీవించడం కోసం, స్వేచ్చ కోసం… చచ్చిపోతామని భయపడకుండా పోరాడవలసిందే. ప్రజలు ఆలా పోరాడుతారు కూడా. పోరాడకపోతే ‘బతకలేని’ స్థితిలోనే ప్రజలు పోరాడుతారు. “మరణించడానికి కూడా పోరాటం…” అనేది అర్థ రహితం. మరణాన్ని ఒక ఫెటిష్ గా మార్చడం ఇప్పటికే చాల జరిగింది. ఎంత ‘అందం’గా కనిపించినా ఇదొక అవాంఛనీయ ధోరణి.
    2
    venkati Says
    January 15th, 2010 at 304 am

    సమకాలీన కార్మిక ఉద్యమానికి, సామ్యవాదం అనబడే గమ్యం అన్నా ఉంది. స్పార్టకస్ కాలంలో ఈ శాస్త్రీయ అవగాహన లేదు. స్వార్థం మానవ నైజం అని అన్ని ముఖ్య ప్రవాహాలు ఘోషిస్తున్న ఈ సమయంలో, మానవుడి స్వభావ సిద్ధమైన నిస్వార్హతని స్పార్టకస్ తిరుగుబాటు సూచిస్తుంది. మంచి వ్యాసం.
    3
    venkati Says
    January 15th, 2010 at 314 am
    రంగనాయకమ్మ గారి స్పార్టకస్ పరిచయం ఒక మంచి పుస్తకం.
    4
    కెక్యూబ్ వర్మ Says
    January 15th, 2010 at 1006 pm

    మరణానికి కూడా సార్థకత ఉండాలని తపించిన అచ్చమైన మనుషులు వీళ్లు.

    మనిషిలోని స్వతస్సిద్ధమైన తిరుగుబాటు తత్వానికి ప్రతీకలైన స్పార్టకస్, చేగువేరాల పరిచయంతో మొదలైన మీ పరిచయ వాక్యాలు చాలా బాగున్నాయి. ఒక ధీరోదాత్తుని వీరగాధను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    5
    ప్రాణహిత » ప్రాణహిత జనవరి 2010 సంచిక Says
    February 5th, 2010 at 441 pm

    [...] ఓడి గెలిచిన యోధానుయోధుడు స్పార్టకస్… [...]
    6
    రాజశేఖరరాజు Says
    February 6th, 2010 at 1045 am

    హెచ్చార్కె గారు పంపిన వ్యాఖ్యకు కొంత వివరణ. మరణాన్ని ఒక ఫెటిష్ గా మార్చడం కోసం స్పార్టకస్ చిత్ర పరిచయం చేయలేదు. శిలువపై ఎక్కి నరక యాతనలు పడి చావడం నుంచి పోటీదారును తప్పించాలనే ఉద్దేశంతో స్పార్టకస్, ఆంటోనియస్‌లు ఒకరి నొకరు చంపుకోడానికి తీవ్రంగా ప్రయత్నించిన సందర్బాన్ని వివరించడానికే మరణించడానికి పోరాటం అని రాయవలసివచ్చింది. ఇక్కడ లక్ష్యం కోసం చనిపోవడం కాదు. శిలువ ఎక్కి భయానకంగా చావడం కంటే ఎదురెదురు యుద్ధంలో పోట్లాడుకుని పోరాడడం గొప్ప అనుకున్నారు వారు. దాంట్లో కూడా తన ప్రత్యర్థిని ఆ భయానక చావునుంచి తప్పించడానికి కొట్లాడటం. ఇక్కడ మరణాన్ని ఫెటిష్‌గా మార్చడం ఎక్కడ ఉంది. కాని త్యాగపూరిత మరణం అనేది ఎంత అందంగా కనిపించినా ఇదొక అవాంఛనీయ ధోరణి అనే మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. లక్ష్యంకోసం మరణిస్తున్నవారు చనిపోవడానికి సిద్దమై ఉద్యమాల్లోకి పోవడం లేదు. ఉద్యమాల్లో చనిపోతే పేరు వస్తుందనే గుర్తింపు కోసమూ వారు పోరాటబాట పట్టలేదు. కానీ ప్రాణాన్ని బలిపెట్టకుండా లేదా ప్రాణాలకు తెగించకుండా శాంతియుతంగా చరిత్రలో ఏ మార్పూ జరగలేదు. అహింస ద్వారా మార్పు జరిగిందని చెప్పుకుంటున్న ఘటనల్లో ఎంతమంది సామాన్యుల ప్రాణాలు ఉన్నఫళాన పోయాయో లెక్కలు వేస్తే తెలుస్తుంది. అహింసా పోరాటాల్లో నాయకులు ఎవరూ మరణించలేదు కాబట్టి ఆ పోరాటాన్ని అహింసా పోరాటం అని ముద్రిస్తే చెల్లుబాటయిపోతుందా మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
    7
    హెచ్చార్కె Says
    February 7th, 2010 at 519 am

    రాజ శేఖర్ గారూ,
    1) నేను ఉటంకించి వ్యాఖ్యానించిన మీ వాక్యానికి ఈ అదనపు వివరణ అవసరమైనదే. ఆంటోనియస్ ను శిలువ వేదన నుంచి తప్పించడానికి స్పార్టకస్, అతడిని ద్యంద్వ యుద్ధంలో నిర్జించి, తానే ఆ భయానక మరణాన్ని స్వీకరించడం తప్పకుండా ఉదాత్తమే. మీ వాక్యం అలాంటి ప్రత్యేక పరిస్థితిని ప్రతిబింబించలేదు. అది జనరల్‍ కామెంటుగానే వుంది. అందువల్ల మీ ఈ అదనపు వివరణ అవసరమైనదే. అభినందనలు.
    2) స్పార్టకస్ జీవిత కథ లోని ఆ ప్రత్యేక సందర్భంలో ‘మరణాన్ని ఫెటిష్ గా మార్చడం’ అని నేను అనడం లేదు. కాని జనరల్‍ గా ‘మరణాన్ని ఫెటిష్ గా మార్చే పని’ చాలానే జరిగింది. ఇప్పటికీ జరుగుతోంది. మీ వాక్యం… అది మీ వ్యాసం ఉద్దేశం కాకపోయినా… అలాంటి జనరల్‍ స్పృహనే కలిగిస్తుంది. ఇదొక అవాంఛనీయ ధోరణి అనడంలో నాకెలాంటి సందేహం లేదు. నిజానికి ఈ ధోరణి నిహిలిజానికి మరో రూపం అని కూడా అనుకుంటున్నాను. దానికి దోహదం చేసే సాహిత్యకళారాజకీయ రూపం ఏదయినా అవాంఛనీయమే. అందుకే ‘అందం’ అనే మాట ఉపయోగించాను.
    3) ఇక, ప్రజా పోరాటాలలో ‘హింస’ గురించి మీరు నాకెందుకు క్లాసు తీసుకున్నారో తెలియలేదు. నేను ‘అహింసా వాది’ని కాను. తమ మీద హింసను హింసాత్మకంగా ఎదిరించడానికి ప్రజలకు ఉన్న హక్కును గౌరవిస్తాను. అసలు ప్రజలది, ప్రజా పోరాటాలది హింస కాదు, ప్రతి హింస. హింసకు అవకాశం ఉంటుందనే భయంతో ప్రజలు అన్యాయానికి తలవంచాలని కోరుకోను. నిక్కమైన ఏ ప్రజాతంత్రవాదీ అలా కోరుకోడు. నా వ్యాఖ్యలో ఈ అవగాహన స్పష్టంగానే వుంది. అందువల్ల, మీ వివరణలో రెండో భాగం… నా వ్యాఖ్య సందర్భంగా… ఏమాత్రం సందర్భోచితం కాదు.
    ధన్యవాదాలు
    8
    రాజశేఖరరాజు Says
    March 18th, 2010 at 614 am

    మీ వివరణతో ఏకీభవిస్తున్నాను హెచ్చార్కె గారూ, కానీ మరణాన్ని ఫెటిష్‌గా మార్చడం అనే భావనను ఇంకా లోతుగా పరిశీలించకుండా, చదవకుండా నేను చర్చలోకి దిగడం భావ్యం కాదనుకుంటున్నాను. మీరు చాలా కాలంనుండి ఈ భావనపై విమర్శనాత్మకంగా ఆలోచిస్తున్న విషయం నాకు తెలుసు. కాని మళ్లీ మీ వ్యాఖ్యల వెనుక పునాదిని అధ్యయనం చేయడానికి నావద్ద ప్రస్తుతం సంబంధిత పుస్తకాలు ఏవీ లేవు. లేవనే కన్నా సేకరించినవి అన్నీ పోగొట్టుకున్నానంటే బావుంటుందేమో. మరణాన్ని మార్మికతగా, మాయాజాలంగా ప్రేరేపించే భావజాలాన్ని నిహిలిజం అని మీరు గుర్తు చేశారు కనుక దీనిపై మరింత లోతైన అధ్యయనం అవసరమే.. ఇది కేవలం పరస్పర చర్చలు, వాదోపవాదాల ద్వారా మాత్రమే కుదిరే పని కాదు. ఒక సీరియస్ విషయంపై మళ్లీ దృష్టి సారించినందుకు ధన్యవాదాలు.
    మీరు భలేవారండీ.. మీకు క్లాస్ తీసుకోవడమా
    9
    హెచ్చార్కె Says
    March 19th, 2010 at 145 pm

    రాజశేఖర రాజు గారూ,
    నిజమే. మీరు బాగా గుర్తు చేశారు. వాదోపవాదాల వల్ల కాకుండా, మనకు మనం చదువుకోడం, ఆలోచించడం, ఆలోచనలు పంచుకోడం ద్వారానే మంచి అవగాహనకు రాగలుగుతాం. ‘వాదం’ వల్ల, అంతకు ముందు మన మనస్సులలో ఉన్న అహేతుకాలు మరింత బలపడే ప్రమాదం కూడా ఉంది.
    ‘క్లాసు తీసుకోడం’ అనే మాట సర్దాగా అన్నానంతే.
    ఇదే కోవలో ఏంజెలో పౌలస్ సినిమా ‘ఎటర్నిటీ అండ్ ఎ డే’ని పరిచయం చేస్తే బాగుంటుంది. సిడి దొరుతుందేమో చూడాలని వుంది.

Sunday, June 24, 2012

ఇదేం కమ్యూనిజం...!


ఈ ఆదివారం ఉదయం దినపత్రికల లోపలి పేజీలలో ఓ దుర్వార్త.

"రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీకి సిపిఎం ఇచ్చిన మద్దతును నిరసిస్తూ ప్రసేన్‌జిత్ బోస్ ఇచ్చిన రాజీనామాను తిరస్కరించిన సిపిఎం ఆయనను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. ప్రణబ్‌ను బలపరుస్తూ పొలిట్ బ్యూరో నిర్ణయించడాన్ని నిరసిస్తున్నాను. ఇది చాలా పెద్ద తప్పని, దీనివల్ల పార్టీకి నష్టంతో పాటు వామపక్ష ఐక్యతకూ భంగకరం అని ప్రసేన్ పార్టీకి బహిరంగ లేఖ రాశారు. నాయకత్వం మరో ఖరీదైన తప్పు  చేస్తోందని, తమ సూచనలన్నీ బుట్టదాఖలవుతున్నాయని పార్టీ సభ్యులు ఆవేదన చెందుతున్నారని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బోస్ తన లేఖలో పేర్కొన్నారు."

తమ రాజకీయ వైఖరికి దురుద్దేశాలు అంటగట్టేందుకు ప్రయత్నించినందుకు ఆయన్ను పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.  బోస్ శుక్రవారమే రాజీనామా చేసినప్పటికీ దాన్ని తిరస్కరించి వేటువేశామని తెలిపింది.

కాగా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి చేసిన బోస్. సీపీఎం పరిశోధన విభాగం కన్వీనర్‌గా వ్యవహరించారు. పలు చానెళ్లలో పార్టీ తరపున చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ప్రణబ్ అభ్యర్థిత్వానికి సిపిఎం మద్దతు తెలుపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 2007 నుంచి పార్టీ నాయకత్వం వరుస తప్పులు చేస్తోందన్నారు.

"కాంగ్రెస్, బి.జె.పి పార్టీలపై రాజకీయ పోరాటం సాగించాలని ఏప్రిల్ మహాసభల్లో నిర్ణయించిన సి.పి.ఎం పార్టీ" తన నిర్ణయాన్ని తనే తుంగలో తొక్కుతూ ఆ  పార్టీ పాలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రసేన్ జిత్ రాజీనామా ప్రకటించటమే ఒక షాక్ కాగా, ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి రాజీనామాను తిరస్కరించిన పార్టీ, అతడిని పార్టీ నుంచే బహిష్కరించడం మరో షాక్. పార్టీ మౌలిక నిర్ణయంతో విభేదిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడటమే సంప్రదాయంగా ఉన్న పార్టీ నిర్మాణంలో అందుకు భిన్నంగా ఆయన రాజీనామా చేయడం, దానికి ఫలితంగా బహిష్కరణకు గురవడం... ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో ఎక్కడైనా ఇలాంటి ఘటన జరిగిందేమో నాకయితే తెలీదు.

పైగా "బోస్ శుక్రవారమే రాజీనామా చేసినప్పటికీ దాన్ని తిరస్కరించి వేటువేశామని తెలిపింది." అంటూ పత్రికలలో వచ్చిన వార్త సాక్షరంగా నిజమే అయితే ఇంత కసాయి పార్టీ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోనే ఉండదు.

సరిగ్గా నెలరోజుల క్రితం అనుకుంటాను. తెలుగుదేశంలో సీనియర్ నేతగా ఉన్న మైసూరారెడ్డి ఏ కారణం వల్లైనా కావచ్చు పార్టీకి రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ రాజీనామాను కూడా పక్కనబెట్టి బహిష్కరించినట్లు గుర్తు. ఇది నిజమే అయితే ఒక పాలకవర్గ పార్టీకి, ఒక కమ్యూనిస్టు పార్టీగా చెప్పుకుంటున్న పార్టీకి తన సభ్యుడి అసమ్మతిని, ధిక్కారస్వరాన్ని అంచనా వేయడంలో, తీర్పు చెప్పడంలో ఏమాత్రం తేడా లేనట్లే కనిపిస్తోంది.

పైగా "పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని ఆయన లేఖాంశాలు అపఖ్యాతిపాలు చేసే విధంగా ఉన్నాయని" ప్రసేన్ జిత్ బహిష్కరణకు సాకులు వెతకడం కూడా సిపిఎంకే చెల్లనుకుంటాను. ఒక కమ్యూనిస్ట్ పార్టీ -?- మూడునెలల క్రితం ఆమోదించిన రాజకీయ తీర్మానానికి -కాంగ్రెస్, బిజెపి రెండింటిపై రాజకీయ పోరాటం సాగించాలనే తీర్మానానికి- భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కనీసం తన పార్టీ సభ్యుల అవగాహన కోసమైనా ముందస్తు వివరణ ప్రత్రికా ముఖంగా ఇవ్వవలిసిన బాధ్యత ఆ పార్టీకి లేదా అనేది ఒక ప్రశ్న. పరుపు, ప్రతిష్ట అనే పదాలకు అర్థం ఉందనుకుంటే, వాటికి గత కొన్నేళ్లుగా తూట్లు పొడుస్తూ కూడా -బలవంతంగా రైతుల భూములు గుంజుకోవడం, నందిగ్రామ్ పోలీసు కాల్పులు వగైరా- పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని ప్రసేన్ లేఖాంశాలు అపఖ్యాతిపాలు చేసే విధంగా ఉన్నాయని సిపియమ్మే ఆరోపించడం అంటే దొంగే దొంగ అని ఆరోపించినట్లుంది.

దీనికి రాజకీయ కమ్యూనిజం ఆచరణ చరిత్రలోనే మూలం ఉందేమో మరి. వేళ్లతో లెక్కించగలిగినంత తక్కువ మంది సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరో, పార్టీ రాజకీయ ఆచరణ సర్వస్వాన్ని నిర్ణయించగలిగే అపరిమితాధికారాలను గుప్పిట్లో పెట్టుకోవడం మొదలయ్యాకే ఇలాంటి భ్రష్టాచారాలు కమ్యూనిస్టు పార్టీలకు తగులుకున్నాయనుకుంటాను. పార్టీని వేలెత్తి చూపితే వ్యతిరేక పంధాగా, పంథాను తప్పు పట్టినంతమాత్రానే విమర్శించినంతమాత్రానే ఎంతటి ఘనాపాటీల చరిత్ర అయినా సరే ప్రజా ద్రోహ చరిత్ర'గా మారిపోవడం 1930ల తర్వాతనే మొదలయిందనుకుంటాను. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ల కాలం నాటి కమ్యూనిస్టు ఆచరణలలో భిన్నాభిప్రాయాన్ని ఏమాత్రం సహించలేని ధోరణులను నేనయితే చదవలేదు. వినలేదు కూడా.

జర్మనీ కార్మిక వర్గ నాయకురాలు రోజా లగ్జెంబర్గ్, విప్లవానంతరం శైశవదశలోని సోవియట్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో పొడసూపుతున్న అప్రజాస్వామిక లక్షణాలను ఎత్తి చూపుతూ సోవియట్ తరహా కమ్యూనిజం అతి త్వరలోనే శ్రామిక వర్గ నియంతృత్వం పేరిట ప్రజారాసుల సమిష్టి కార్యాచరణల అమలుకు భిన్నంగా పోలిట్ బ్యూరో నియంతృత్వాన్ని నెలకొల్పే ప్రమాదకరమైన నియంతృత్వ ధోరణుల్లోకి ప్రయాణించనుందని తీవ్రంగా విమర్శించారు. లెనిన్ బతికి ఉన్నప్పుడే ఆమె చేసిన ఈ విమర్శను తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం పెడచెవిన పెట్టింది లేదా సాయుధ బలంతో రాజ్యాధికారంలోకి వచ్చాక, ఇక కమ్యూనిజానికి, పార్టీకి తిరుగులేదని భ్రమిసిపోయి, రాజకీయాధికారపు గర్వాంధకారంలో కన్నుమిన్నూ గానకుండా వ్యవహరించింది.

దాని ఫలితాలను గత 80 ఏళ్లుగా అందరం చూస్తూనే ఉన్నాం...

పొలిట్‌బ్యూరో నిర్ణయాలకు అందరూ గంపగుత్తగా చేతులెత్తేస్తూ ఏకగ్రీవతీర్మానాలు అమలయిపోయే భ్రష్ట ధోరణులు ఉనికిలోకి వచ్చేశాక ఇలాంటి ఏకశిలాసదృశ -మోనోలితిక్- నిర్మాణాలకు ఎదురునిల్చి పోరాడటం ప్రసేన్ జిత్ లాంటి వ్యక్తులకు సాధ్యమయ్యే పనేనా?

అందుకే ఆయన రాజీనామా ఇచ్చినట్లుంది. దానికి కూడా సహించలేక ప్రసేన్‌జిత్‌ను బహిష్కరణ వేటుతో చంపేశారు. ఈ బహిష్కరణతో, సిపిఎం పార్టీలో నిన్న గాక మొన్న చేరిన బుడ్డాపకీరు కూడా ఇక ఆయన ముఖం చూడడు.

ఆహా -రాజకీయ- కమ్యూనిజమా!

ఇలాంటి కమ్యూనిజాన్ని ఎవరూ కోరుకోకూడదు. మన ఖర్మ ఏమంటే భారతదేశంలో అన్ని రకాల కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాలూ ఇలాగే ఏడుస్తున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను ఇలాగే ఉద్ధరిస్తున్నాయి. ఉద్యమ నిర్మాణాలలో ఇన్ని లోపాలు పెట్టుకుని, కమ్యూనిస్టు సిద్ధాంత వ్యతిరేకులు కమ్యూనిస్టు పార్టీల దౌర్భాగ్య ఆచరణను సాకుగా చూపి కమ్యూనిజాన్నివిమర్శిస్తున్నారంటే మనం ఉలికిపాటుకు గురికావలసిన పని లేదేమో మరి.

దీనర్థం ఇక మనందరం కమ్యూనిజం అనే ఆదర్శాన్ని తోసిపారేయాలని కాదు.

(ఈ కథనంలో అధికభాగాన్ని విశేఖర్ గారి తెలుగువార్తలు బ్లాగులో "రాష్ట్రపతి ఎన్నిక: సి.పి.ఎం సిద్ధాంతకర్త ప్రసేన్‌జిత్ బహిష్కరణ" కథనానికి వ్యాఖ్యగా పోస్ట్ చేశాను. తర్వాత మరి కాస్త పొడిగించి నా బ్లాగులో టపాగా ప్రచురిస్తున్నాను.)

Saturday, February 4, 2012

సోవియట్ రష్యాలో జీవితంపై అరుదైన కథనాలు

మిత్రులు శ్రీ భండారు శ్రీనివాసరావుగారు సోవియట్ యూనియన్‌ ఉనికిలో ఉన్న చివరిరోజుల్లో మాస్కోలో పనిచేసినప్పుడు తాను ప్రత్యక్షంగా చూసిన, పొందిన సోవియట్ రష్యా జీవితానుభవాలపై రెండేళ్ల క్రితం రాసిన కథనాలు అప్పట్లో చదవటం ఒక మహానుభూతిని కల్గించింది. ఒక రకంగా అవి బ్లాగ్ లోకంలో సంచలనం కలిగించిన ప్రత్యేక విశిష్ట రచనలు.

"ఆ రోజుల్లో 'అలా వుండేది, యిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన 'స్వర్ణ యుగాలు' చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా.

నేను కమ్యూనిష్టుని కాను. వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు. ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం' నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం. నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయిన, గౌరవ ప్రదమయిన, తృప్తికరమయిన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే. వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా గోరంతను 'కొండంత' చేసి చెబుతున్నానేమో అని అనిపించక తప్పదు. అందుకే 'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సి వచ్చింది."

అంటూ శ్రీనివాస రావు గారు తన సోవియట్ రష్యా అనుభవాలను ఇంత ఆలస్యంగా రాయడానికి కారణాలను చెబుతూ రాసిన పై వ్యాఖ్య నన్ను అప్పట్లో విశేషంగా ఆకర్షించింది. కమ్యూనిస్టు పార్టీ వాసన లేని వ్యక్తి, జీవికలో భాగంగా సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపిన వ్యక్తి అక్కడ తాను గడిపిన జీవనం తన జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకున్నారు. "నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయిన, గౌరవ ప్రదమయిన, తృప్తికరమయిన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే." అని కూడా పరమ నిజాయితీగా తన అంతరంగాన్ని ఆకర్షించారు.

1987 నుంచి 1991 వరకు అంటే సోవియట్ యూనియన్ రద్దయ్యే వరకు విదేశీ ఉద్యోగి స్థాయిలో 'పిల్లజమీందారు' జీవితం గడిపిన శ్రీనివాసరావు గారు ఆ దేశం గురించి చేసిన అపురూప కృషిని నెత్తిన పెట్టుకుంటూ అప్పట్లోనే ఆయన రాసిన ఒక టపాకు ఇలా వ్యాఖ్య పంపాను.

"విదేశీ పర్యటనలు,విహారాలపై గతంలో ప్రముఖుల వ్యాసాలు, యాత్రా విశేషాలు ఎన్నో చదివాను. కాని వాటిలో చాలావరకు ఫలానా ప్రాంతం చూశామని, పలాని విశేషాన్ని తిలకించామని, పలానా కట్టడాన్ని చూశామని చెప్పేవారే తప్ప ఓ నగరజీవితాన్ని, ఓ వ్యవస్థ పనితీరును ఇంత హృద్యంగా, ఇంత ఆసక్తికరంగా రాయడాన్ని ఇంతవరకు నేను చూడలేదు.

మీ అయిదేళ్ల మాస్కో జీవితాన్ని ఔపోసన పట్టినట్లు రాస్తున్నారు. ఒక వ్యవస్థ మంచిని చూడడానికి, గుర్తించి ప్రకటించడానికి మనం సిద్ధాంతాలు వల్లెవేయవలసిన అవసరం లేదు. ముద్రలు తగిలించుకోవలసిన అవసరమూ లేదు. మీలా ఉన్నది ఉన్నట్లుగా, చూసింది చూసినట్లుగా, పలవరించి రాస్తే చాలు.

సోవియట్ వ్యవస్థ లోపాలు ఎన్నయినా ఉండవచ్చు కానీ ప్రజలందరికీ మంచి జీవన ప్రమాణాలను అందించడంలో అది సక్సెస్ అయినంతగా భూమ్మీద మరే దేశం కూడా కాలేదని మీ కథనాలబట్టి తెలుస్తోంది. కమ్యూనిస్టు వ్యవస్థ గొప్పతనాన్ని సిద్ధాంతాల ద్వారా మాత్రమే చదువుకున్న నాలాంటివారందరికీ మీరు ప్రత్యక్షంగా ఓ భూతల స్వర్గాన్ని కళ్లకు కట్టిస్తున్నారు.

జీవితంలో సమానత్వాన్ని ఇంత గొప్పగా ఆచరణలో చేసిచూపించిన ఆ గొప్ప దేశంలో మీరు కొన్నేళ్లు బతికారు. ఎంత అదృష్టవంతులు మీరు. అదృష్టానికి మారుపదం దొరకడం లేదు నాకు. శ్రీనివాసరావు గారూ.. మీరు ఇలాగే రాస్తూ పోండి. వీలయితే మీరు మాస్కో జీవితంలో ఫోటోలు తీసుకుని ఉంటే వాటినే ఓ కథనంగా కూడా ప్రచురించండి. చిన్న క్యాప్షన్లతో అయిదారు ఫోటోలను ఒకే ఆర్టికల్‌గా పోస్ట్ చేయవచ్చు.

భవిష్యత్తరాలకు మానవ సమాజంలో ఒకనాడు వెలిగిన భూతలస్వర్గాన్ని మీరు బ్లాగీకరించి భద్రపరుస్తున్నారు. దయచేసి వెంటనే విశాలాంధ్రవారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ మాస్కో అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురండి. కళ్లకు అద్దుకుని తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

అలాగే మాస్కో జీవితంలో మీరు చూసిన లోపాలను కూడా తప్పక రాయండి. లోపాలను కూడా మీరు రాయకపోతే అది ఎప్పటికీ లోటుగానే ఉంటుది.

ప్రేమతో, అభిమానంతో..
రాజు
21 జనవరి 2010 11:58 సా "

సోవియట్ యూనియన్‌ పతనానికి ముందు సమాజ జీవితాన్ని కళ్లారా చూసిన ఈ సామాన్యుడు, ఆ దేశాన్ని సందర్శించిన ఏ ప్రముఖుడూ రాయలేనంత పరమ నిష్పాక్షికంగా ఈ మార్పు చూసిన కళ్లు కథన పరంపరలో అక్షర బద్దం చేశారు. దశాబ్దాల తర్వాత కూడా తన ప్రాసంగికతను కోల్పోనటువంటి ఈ గొప్ప రచనను సమాజ చలనం, పరిణామాల పట్ల ఆసక్తి కలిగిన వారు తప్పక చూడాలనే అభిప్రాయంతో ఆయన రాసిన 17 కథనాల లింకులను ఈ టపాలో ఒకే చోట పోస్ట్ చేస్తున్నాను. కింది లింకులను తెరిచి వరుసగా చదవండి. ఒక అద్భుత ప్రపంచం మీ కళ్లముందు ఆవిష్కరించబడుతుందనడంలో సందేహించవలసిన పనిలేదు.

శ్రీనివాసరావు గారూ,
మరోసారి ధన్యవాదాలండీ.

-----------------

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు) - భండారు శ్రీనివాస రావు

జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు.గ్రంధ ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం. అయినప్పటికీ, అనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకు జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే - ఇంచుమించు రెండు దశాబ్దాల క్రితం - మాస్కోలో గడిపివచ్చిన సుమారు ఐదేళ్ళ అనుభవాలను అక్షర బద్ధం చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఏకధ్రువ ప్రపంచ వ్యవస్తను ప్రశ్నిస్తూ- నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ - ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్ కమ్యూనిష్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా చేసుకుని - 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన కాంక్షను ఎన్నో ఏళ్ళుగా అదిమిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి కారణాలు అనేకం. ఆనాడు నేను చూసింది మరో ప్రపంచం. అప్పటికీ ఇప్పటికీ యెంతో తేడా.

ఆ రోజుల్లో 'అలా వుండేది, యిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన 'స్వర్ణ యుగాలు' చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా. నేను కమ్యూనిష్టుని కాను. వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు. ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం' నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం. నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయిన, గౌరవ ప్రదమయిన, తృప్తికరమయిన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే. వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా గోరంతను 'కొండంత' చేసి చెబుతున్నానేమో అని అనిపించకత ప్పదు. అందుకే 'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సి వచ్చింది.

అంతేకాదు. కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం. తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది. విషయానికి న్యాయం చేయలేక పోతున్నామేమో అన్న సంశయం మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.
(దస్వి దానియా అంటే రష్యన్ లో మళ్ళీ కలుద్దాం)

'మార్పు చూసిన కళ్ళు ' చదువుతున్నవారికి రచయిత విజ్ఞప్తి:
చరిత్రలో 'గుప్తుల స్వర్ణ యుగం' చదువుకున్నాము. నిజమా కాదా అన్న మీమాంసకు ఎవ్వరం తావివ్వలేదు. ఇదీ అలాగే.
ఆ రోజుల్లో మాకు ప్రతి రోజు 'ఇది నిజంగా నిజమేనా?' అనే సందేహం వెంటాడుతూనే వుండేది. ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ గుర్తు చేసుకుని రాస్తున్నప్పుడు కూడా ఆ సందేహం అంటిపెట్టుకునే ఉంటోంది. మెదడులో నిక్షిప్తం చేసుకున్న విషయాల సింహావలోకనమే ఈ రచన. డయిరీల్లో రాసుకున్నది కాదు. అందువల్ల సమగ్రతకు కొంత భంగం వాటిల్లడమో లేదా విషయాలను ఒకచోట గుదిగుచ్చడంలో ఒకమేరకు అస్పష్టతకు అవకాశం ఏర్పడడమో, పునరుక్తి దోషాలకు తావివ్వడమో జరిగివుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించాలని కోరుతున్నాను. అలాకాక చరిత్ర వక్రీకరణ కనిపిస్తే నిర్మొహమాటంగా తెలియచేసి దిద్దుబాటుకు అవకాశం ఇవ్వాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.
-భండారు శ్రీనివాసరావు
302, మధుబన్, ఎల్లారెడ్డిగూడా,
శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ - 500 073.
ఫోన్: 040-23731056 (email: bhandarusr@yahoo.co.in)
------------------

1.
మార్పు చూసిన కళ్ళు - ఆనాటి మాస్కోలో మా అనుభవాలు - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_01.html

2
గురువారం 7 జనవరి 2010
మార్పుచూసిన కళ్ళు - ఆనాటి సోవియట్ మాస్కో అనుభవాలు - రెండో భాగం - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_07.html

3.
శుక్రవారం 8 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు) - మూడో భాగం - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_08.html


4.
సోమవారం 11 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు -ఆనాటి మాస్కో అనుభవాలు- నాలుగో భాగం-భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_11.html


5.
సోమవారం 11 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు) - ఐదో భాగం - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_9811.html


6.
శుక్రవారం 15 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు - ఆరో భాగం- భండారు శ్రీనివాసరావు)
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_15.html


7.
శుక్రవారం 15 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (మాస్కో అనుభవాలు -ఏడో భాగం ) - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_8240.html


8.
శనివారం 16 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-ఎనిమిదో భాగం)
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_16.html


9.
ఆదివారం 17 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు- తొమ్మిదో భాగం) -భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_17.html


10.
మంగళవారం 19 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదో భాగం)- భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_19.html


11.
మంగళవారం 19 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు- పదకొండో భాగం) -భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_3369.html


12.
బుధవారం 20 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పన్నెండో భాగం)- భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_20.html


13.
బుధవారం 20 జనవరి 2010
మార్పుచూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు పదమూడో భాగం) - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_7837.html


14.
మంగళవారం 26 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మా మాస్కో అనుభవాలు- పదునాలుగో భాగం)) - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_26.html


15.
బుధవారం 27 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు- పదిహేనో భాగం ) - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_27.html


16.
మంగళవారం 2 ఫిబ్రవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదహారో భాగం) - భండారు శ్రీనివాస రావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/02/blog-post.html


17.
మంగళవారం 2 ఫిబ్రవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు-పదిహేడో భాగం)- భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/02/blog-post_02.html

Thursday, October 6, 2011

స్టీవ్ జాబ్స్.. భారతదేశం.. యాపిల్

సాంకేతిక చరిత్రలో ఒక గొప్ప శకం ముగిసింది. భవిష్యత్ తరాలపై కూడా ప్రభావితం చూవుతుందని ప్రశంసలు పొందుతున్న ఓ గొప్ప సాంకేతిక దార్శనికుడు, యాపిల్ ఆవిష్కర్త కన్నుమూయడంతో మనకాలానికి చెందిన ఒక గొప్ప మేధో సృజన శాశ్వత విరామం పొందింది.

స్టీవ్స్ జాబ్స్ -56- చరిత్రలో ఓ గొప్ప సాంకేతిక బ్రాండ్ ఆవిష్కర్త కన్నుమూశాడు. టెక్నాలజీ జార్ అని ప్రపంచం తనను ఇప్పుడు ముద్దుగా పిలుస్తోంది. సంగీతం, మొబైల్ ఫోన్లు, కంప్యూటింగ్ చరిత్రను విప్లవీకరించిన అమోఘ సాంకేతిక విన్నాణానికి మారుపేరు స్టీవ్. కంప్యూటింగ్ ప్రపంచాన్ని ఒంటిచేత్తో మార్చివేసి, పాకెట్ డివైసెస్ భావనను పూర్తిగా పునర్విచించిన దార్శనికుడు స్టీవ్ జాబ్స్. తను ఆవిష్కరించిన ఆధునిక సాంకేతిక ఉపకరణాలకంటే ప్రపంచ జ్ఞానానుభవానికి అతడు చేసిన దోహదం, ప్రపంచ డిజిటల్ భవిష్యత్తు పట్ల అతడు ప్రదర్శించిన ఆశావహ దృక్పధం చరిత్రలో సాటిలేనివి.

30 సంవత్సరాలుగా నిరంతరం ఆలోచిస్తున్న ఒక మహా మేధకు జీవితం తొలి దశలో భారతదేశంలోనే జ్ఞానోదయం వంటిది కలిగిందంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. కాని తాను చిన్న వయసులో అలవర్చుకున్న హిప్పీ సంస్కృతి జ్ఞానాన్వేషణలో భారత్‌ను సందర్శిచేలా చేసింది.

భారత పర్యటన
ప్రపంచ వ్యాప్తంగా పలువురు మహా వ్యక్తుల విషయంలో జరిగినట్లే యాపిల్ సహ-నిర్మాత స్టీవ్ జాబ్స్ తాత్విక చింతనకు భారత దేశమే మూలాధారం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 18 ఏళ్ల చిన్న వయస్సులో ఇండియాలో పలు ప్రాంతాలు సందర్శించిన తర్వాత, స్టీవ్ బౌద్ధమతం స్వీకరించాడు.

1970ల మధ్యలో స్టీవ్ భారతదేశంలో పర్యటించాడు. డిగ్రీ చదువునుంచి తొలి సెమిస్టర్‌లోనే వైదొలగిన తర్వాత అమెరికాలో ఒక వీడియో గేమ్స్ తయారీ సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తూ పోగుచేసుకున్న డబ్బుతో అతడు ఇండియా పర్యటనకు వచ్చాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్వేషణలో భాగంగా స్టీవ్ భారత్ పర్యటనకు వచ్చాడు. అతడి భారత పర్యటనపై అప్పట్లో ఎలాంటి వార్తలూ ప్రచురించబడలేదు కాని, భారత పర్యటనలో భాగంగా తను చేసిన కొన్ని వ్యాఖ్యలు జ్ఞానబోధ, ఆధ్యాత్మికత పట్ల గురించి తానేమనుకుంటున్నది తెలియపరుస్తున్నాయి.

ఆరెగాన్ లోని పోర్ట్‌ల్యాండ్‌లో రీడ్ అనే ఒక ప్రయివేట్ మానవ శాస్త్రాల అధ్యయన విభాగంలో డిగ్రీ చదువుతూ మధ్యలోనే వదిలేసిన స్టీవ్ మత వ్యవహారాలలో మంచి ఆసక్తి కలిగిన నిరంతర తాత్విక విద్యార్థి. అతడు ఒకే ఒక సెమిస్టర్ -మూడు నెలలు?- చదివిన తర్వాత ఎందుకు కాలేజీ చదువును వదిలి పెట్టేశాడో కూడా ప్రపంచానికి వింత వార్తలాగే ఉంటుంది. పుట్టుకతో మధ్యతరగతికి చెందిన స్టీవ్, తను చేరిన సంపన్నుల కాలేజీలో ఇమడలేకపోయాడని, అందుకే అతడు చదువును మధ్యలోనే వదిలేశాడని వార్తలు.

చదువు నిలిపివేసిన తొలిరోజుల్లో బతకడం కోసం కోక్ బ్యాటిల్స్‌ని సేకరించి కంపెనీకి తిరిగి ఇచ్చే పనిలో ఉండేవాడు. (భారత పర్యటనకోసమే ఈ పని చేశాడని చాలామంది అంటున్నారు). స్థానిక్ హరే కృష్ణ ఆలయంలో వారానికి ఒకసారి ఉచిత భోజనం కూడా చేసేవాడట. తనకంటూ అప్పట్లో ప్రత్యేకంగా గది ఉండేది కాదని, మిత్రుల గదుల్లోని నేలమీద పడుకుని నిద్రించేవాడినని స్టీవ్ తర్వాత చెప్పుకున్నాడు. కోక్ ఖాళీ బ్యాటిళ్లను సేకరించి వాటిని అయిదు సెంట్లకు -డాలర్‌కు వంద సెంట్లు- ఒకటి చొప్పున కంపెనీకి తిరిగి ఇచ్చేసి వచ్చిన దాంతో ఆహారం కొనుక్కునేవాడినని, స్థానికంగా హరేకృష్ణ ఆలయంలో ప్రతి ఆదివారం రాత్రి ఉచితంగా అందించే మంచి భోజనం కోసం పట్టణంలో ఏడు మైళ్లు నడిచి వెళ్లేవాడినని స్టీవ్ చెప్పుకున్నాడు. నిజంగా తాను అలాంటి జీవితాన్ని చక్కగా ఆస్వాదించాడట కూడా.

భారత దేశంలో అనాధపిల్లలు జీవితం గడుపుతున్న రీతిలో, సెంటు సెంటుగా కూడబెట్టిన డబ్బుతో స్టీవ్ 18 ఏళ్ల వయస్సులో భారత దేశం వచ్చాడు. 1970లలో నీమ్ కరోరి బాబా అనే హనుమాన్ భక్తుడికి అమెరికాలో కొద్దిమంది సహచరులు ఉండేవారట. అతడిని కలవాలనే స్టీవ్ తన మిత్రుడు, రీడ్స్ కాలేజీలో సహాధ్యాయి కొట్కే తో కలిసి తన ఆశ్రమానికి వచ్చాడు కాని అప్పటికే బాబా చనిపోయారని తెలుస్తోంది.

భారతదేశం నుంచి అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నప్పుడు అతడు జ్ఞానోదయం పట్ల తనదైన రీతిలో వ్యాఖ్యానించాడని తెలుస్తోంది.

"ఒక నెల రోజుల్లో జ్ఞానోదయం పొందగల చోటును వెతకడానికి మేము వెళ్లి ఉండలేదు. మొట్టమొదటిసారిగా నేను ఇక్కడే వాస్తవాన్ని గ్రహించనారంభించాను అదేమంటే కారల్ మార్క్స్, నీమ్ కైరోలి బాబా కంటే ఎక్కువగా ధామస్ ఎడిసన్ ప్రపంచాన్ని మరింతగా మెరుగుపర్చి ఉండవచ్చు."

అలా భారత పర్యటన ముగిసిన కొద్ది కాలంలోనే స్టీవ్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. తన తలను గుండు గీయించుకున్నాడు కూడా. భారతీయులకు మల్లే వదులుగా ఉండే దుస్తులు ధరించసాగాడు. మానసిక సంబంధమైన అంశాలపై ప్రయోగాలు కూడా తరచుగా చేశాడు.

తర్వాత కొద్ది కాలంలోనే యాపిల్ సంస్థకు తన కుటుంబ గ్యారేజీలో రూపు దిద్దాడు. ఒరేగాన్‌లో ఒక కమ్యూన్‌లో యాపిల్ పళ్లతోటను చూసిన తర్వాత తను పెట్టబోయే సంస్థకు యాపిల్ పేరును సూచించాడని తెలుస్తోంది.

వ్యవస్థా వ్యతిరేక దృక్పథం
1955లో శాన్‌ప్రాన్సిస్కోలో పుట్టిన స్టీవ్ అమెరికాలో హిప్పీ సంస్కృతి వ్యాపిస్తున్న కాలంలో పెరిగాడు. హిప్పీల సంస్కృతికి ప్రతినిధులైన బాబ్ డిలాన్, బీటిల్స్ అతడి అభిమాన సంగీత కారులు. వీరి రాజకీయ అభిప్రాయాలు, వ్యవస్థా వ్యతిరేక దృక్పధాలతో ఇతడు భాగం పంచుకున్నాడు. బీటిల్స్ లాగే స్టీవ్స్ కూడా ఆధ్యాత్మిక మార్గాన్వేషణలో భాగంగా భారతదేశం సందర్శించాడు. వారిలాగే ఇతడు కూడా తన పుట్టి పెరిగిన ప్రాంతాల్లో, చివరకు ఆఫీసులో కూడా కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాడని సిఎన్ఎన్ నివేదించింది.

యాపిల్ చరిత్ర,, గుడ్డపీలికల దశనుండి సంపన్న జీవితం వరకు సాగిన స్టీవ్ జీవితం ఈ మహావిజయ గాథకు ఒక గట్టి నిదర్శనంలా నిలుస్తోంది. స్టీవ్ సాధించిన ఈ అసాధారణ విజయం తనను ఇక వెనక్కి తిరిగి చూసుకోనివ్వలేదు. తర్వాత అతడు మరెన్నడూ భారతదేశానికి రాలేదు కూడా. ఐబీఎమ్ నుంచి హెచ్.పీ దాకా ఐటీ పరిశ్రమ మొత్తంగా భారతీయ సిలికాన్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నప్పుడు కూడా స్టీవ్ భారతదేశంలో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపించలేదు.

బౌద్ధమతంపై తీవ్ర ఆసక్తి కలిగిన స్టీవ్, ఇండియా పట్ల సానుకూల వైఖరిని అవలంబించలేదు. భారత పర్యటన కాలంలో ఇక్కడ తాండవిస్తున్న దారిద్ర్యాన్ని, ఇక్కడి కల్లోల పరిస్థితులను చూసి అతడు తీవ్రంగా అసంతృప్తి చెంది ఉండవచ్చు. తాను తదనంతర జీవితం పొడవునా ఆసక్తి ప్రదర్శించిన తన కలల ఉత్పత్తిలోనే అతడు బహుశా నిజమైన జ్ఞానోదయాన్ని కనుగొని ఉండవచ్చు.

వ్యక్తి - వృత్తి- నిమ్నోన్నతాలు
విజయానికి నిజమైన అవకాశం ఉద్యోగంలో కాకుండా వ్యక్తిలోనే దాగి ఉంటుదనేది నేటి నానుడి. స్టీవ్ జాబ్స్‌ని గురించి ఎవరయినా నిర్వచించాలంటే పై పంక్తులు చక్కగా సరిపోతాయి. యాపిల్ సంస్థ భారాన్ని పద్నాలుగేళ్ల పాటు మోస్తూ వచ్చిన స్టీవ్ ఈ అక్టోబర్ 5నే కన్నుమూశాడు. స్టీవ్ కెరీర్, జీవితం బాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోవు. కంప్యూటింగ్ ప్రపంచ రారాజుగా పేరొందిన ఈ కాలేజ్ డ్రాపవుట్ తన మిత్రుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి సిలికాన్ వ్యాలీలోని తన కుటుంబ గ్యారేజీలో అపెల్ కంప్యూటర్‌ సంస్థను 1970ల చివరలో ప్రారంభించాడు.

తను ప్రవేశపెట్టిన యాపిల్ 1 కంప్యూటర్ పెద్దగా విజయం పొందనప్పటికీ యాపిల్ 2 మాత్రం విజయం సాధించింది 1980లో ఐపీఓ ద్వారా స్టీవ్ మిలియనీర్‌గా మారాడు. తదనంతరం ఐబీఎమ్ పలు పర్సనల్ కంప్యూటర్లను ప్రారంభించడంతో ఈ విజయ గాధకు అడ్డంకులు ఎదురయ్యాయి. తన మిత్రుడు, భాగస్వామి వోజ్నియాక్ విమానప్రమాదంలో గాయపడటంతో పరిస్థితులు మరింత విషమించాయి. జీవితంలో నిజమైన మలుపు తిరగసాగింది.

అప్పట్లో పెప్సీ అధిపతిగా ఉన్న హోంచో జాన్ స్కల్లీని యాపిల్‌లో చేరవలసిందిగా స్టీవ్ ఆహ్వానించాడు. కాని, ఈ స్కల్లీనే యాపిల్ నుంచి స్టీవ్‌ని సాగనంపాడు. స్టీవ్‌ని సాగనంపిన తర్వాత .యాపిల్ భాగ్యరేఖ తారుమారయింది. దాని ఉత్పత్తులు వరుసగా విఫలం చెందడంతో స్కల్లీ కూడా సంస్థనుంచి బహిష్కరించబడ్డాడు. స్టీవ్ తిరిగి యాపిల్‌కి వచ్చిన తర్వాతే సంస్థ దశ తిరిగింది. రెండోసారి వచ్చిన వెంటనే ఐపాడ్ పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్‌ని, ఐఫోన్, ఐప్యాడ్‌లను స్టీవ్ ప్రవేశపెట్టాడు. ఇవి మొత్తం కంప్యూటింగ్ ప్రపంచాన్ని, సెల్యులార్ ఫోన్ వ్యాపారాన్నే విప్లవీకరించేశాయి.

స్టీవ్ గొప్పతనం ఏదంటే తన నిజమైన దార్శనికతే. సాంకేతిక జ్ఞాన సరిహద్దులను ముందుకు నెట్టడంలో అతడి సృజనాత్మక తృష్ణ సాటిలేనిది. తాను ఈ ప్రపంచాన్ని ఒక కోణంలో మార్చగలనని విశ్వసించాడు, నలుగురికీ భిన్నంగా ఆలోచించాడు. తన నమ్మకాన్ని రుజువు చేశాడు. టెక్నాలజీపై తన నమ్మకం ప్రపంచాన్ని మార్చగలుగుతుందని ఒకనాడు అతడు భావించాడు. ఈరోజు ప్రపంచం దాన్ని నిరూపిస్తోంది.

వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తులు, నిర్మాణరంగం వంటి సాంప్రదాయిక రంగాలకు స్టీవ్ మేధస్సు ఎలాంటి దోహదం చేయలేదన్నది వాస్తవమే కావచ్చు. కాని సాంకేతిక జ్ఞానం ప్రపంచాన్ని, వినోద పరిశ్రమ, ఐటీ, కంప్యూటింగ్ రంగంలో మారుస్తుందని నిరూపించడంలో స్టీవ్ తన సమకాలీన ప్రపంచంకంటే ఎంతో ముందు ఉంటూ వచ్చాడు. తానే చెప్పుకున్నట్లు మనిషి జీవితం చాలా పరిమితమైనది. ఒక వ్యక్తి తన పరిమిత జీవితంలో ఇంతకంటే సాధించవలసింది ఏముంటుంది?

కారల్ మార్క్స్ కంటే, నీమ్ బాబా కంటే ప్రపంచాన్ని ధామస్ ఎడిసనే మరింత ఎక్కువగా మార్చి ఉండవచ్చునంటూ స్టీవ్ చేసాడని చెప్పబడుతున్న వ్యాఖ్యలను వివాదాస్పదంగా చూడనవసరం లేదు. ఈ వ్యాఖ్యలు తన భవిష్యత్ దర్శనాన్ని చూపించాయి. తను భావించిన రంగంలో అతడు సాధించినది అద్వితీయ విజయం. అంతే.

మరణం ఇప్పటికీ చివరి గమ్యమే...
స్టీవ్ మరణంపై అధికారిక ప్రకటన వెలువడలేదు కాని చాలాకాలంగా తను కేన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చాడు. 2005లో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చేసిన ప్రసంగం స్టీవ్ జీవితంలోనే అత్యంత గొప్పదైన, చిరస్మరణీయమైన ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయింది.
మొదటిసారిగా ఇక్కడే తను ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన పాంక్రియాటిక్ కేన్సర్ గురించి స్టీవ్ బయట పెట్టాడు.

భూమ్మీద మనిషి జీవితం చాలా పరిమితమైంది కాబట్టి ఏదో అల్లాటప్పా జీవితం గడుపుతూ వృధాపర్చరాదని ఈ ప్రసంగంలో స్టీవ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అతడు చెప్పిన వాక్యం "to stay hungry, stay foolish since a person`s limited time on earth should not be wasted in living someone else`s life." అక్కడి శ్రోతలను ఉర్రూతలూగించింది.

"ఎవరూ చావాలనుకోరు. స్వర్గానికి పోవాలనుకున్న వారు కూడా అక్కడికి వెళ్లడానికి ఇక్కడ చనిపోవాలని కోరుకోరు. మరణం అనేది మనందరం పంచుకునే గమ్యస్థానంలా ఇప్పటికీ ఉంటోంది. ఎవరూ దాన్నుంచి తప్పించుకోలేరు." అంటూ స్టీవ్ 2005 జూన్ 12న యాపిల్ కంప్యూటర్ సీఈఓగా చేసిన ప్రారంభోపన్యాసంలో చెప్పాడు.

చరిత్రలో అది గొప్ప ప్రారంభోపన్యాసాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ప్రసంగంలో స్టీవ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి జీవితం చాలా పరిమితమైంది కాబట్టి ఇతరులు బతుకుతున్నట్లుగా బ్రతుకుతూ జీవితాన్ని వృధా చేసుకోవద్దని సూచించాడు. పిడివాదంలోకి కొట్టుకుపోవద్దని, ఇతరులు ఆలోచనల ఫలితాలపై ఆధారపడి పిడివాదం మనుగడ సాధిస్తూ ఉంటుందని సూచించాడు. ఇతరుల అభిప్రాయాల ప్రతిధ్వనులను మీ స్వంత అంతర్వాణిగా చేసుకోవద్దని విద్యార్థులను ఉద్దేశించి స్టీవ్ చెప్పాడు.

మీ హృదయాన్ని, మీ సహజాతాన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండటం అన్నిటికంటే ముఖ్యమైన విషయమని వారికి భోధించాడు. మీరు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో మీ హృదయానికి, మీ అంతర్వాణికి మాత్రమే తెలుసునని వాటితో పోల్చుకుంటే మిగతావన్నీ అప్రాధాన్యవిషయాలే -సెకండరీ- అని స్టీవ్ చెప్పాడు. ఈ సందర్భంగానే అతడు విద్యార్థులకు, మిగతా ప్రపంచానికి కూడా ఒ గొప్ప ప్రకటన వెలువరించాడు "ఆకలిగొని ఉండండి, మూర్ఖంగా కూడా ఉండండి" - Stay Hungry. Stay Foolish?- నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను.

ఈ సుప్రసిద్ధ ప్రసంగంలోనే అతడు చావు గురించి కూడా మాట్లాడాడు. 2004లో తను కేన్సర్ వ్యాధి పరీక్ష జరిగిందని తెలిపాడు. స్కానింగ్‌లో తన శరీరంలోని క్లోమంలో -pancreas- కేన్సర్ కణితి ఏర్పడినట్లు తెలిసిందని, ఆనాటికి తనకు క్లోమం అంటే ఏమిటో కూడా తెలియదని చెప్పాడు. ఇది దాదాపుగా నివారణ కాని కేన్సర్ రకమని, మూడు లేదా ఆరు నెలలకంటే ఎక్కువగా తాను బతికి ఉండటం కష్టమని కూడా డాక్టర్లు చెప్పారని తెలిపాడు.

తన స్వంత వైద్యుడు ఇక ఇంటికి పోయి తన వ్యవహారాలను చక్కదిద్దుకోమని చెప్పారట. వైద్యుల పరిభాషలో, చావుకు సిద్ధంగా ఉండమని దీనర్థం. శస్త్రచికిత్స ద్వారా మాత్రమే నివారించదగిన అరుదైన క్లోమ కేన్సర్ తనకు ఉందని తెలిశాక వైద్యులు విలపించడం ప్రారంభించారట.

తర్వాత తనకు శస్త్ర చికిత్స జరిగిందని, చావును ఎదుర్కొవడానికి ఇదే తనకు అతి దగ్గర మార్గమని, మరికొన్ని దశాబ్దాలు కూడా తను ఈ మార్గంలోనే ఉండవచ్చని భావిస్తున్నట్లు స్టీవ్ చెప్పాడు.

తాను త్వరలోనే చనిపోతానని గుర్తుంచుకోవడం అనేది జీవితంలో పెద్ద అవకాశాలను రూపొందించడంలో తనకు ఉపయోగపడే అత్యంత ప్రముఖ ఉపకరణంగా భావిస్తున్నట్లు స్టీవ్ చెప్పాడు. ఇలాంటి గొప్ప ఉపకరణాన్ని -టూల్- తానింతవరకు ఎదుర్కోలేదని స్టీవ్ ముగించాడు.

జీవితం అంచుల్లో ఉన్నట్లు స్టీవ్‌కి తెలుసా?
అనేక సంవత్సరాలుగా క్లోమ కేన్సర్‌ను ఎదుర్కొంటూ వచ్చిన స్టీవ్ జాబ్స్‌కి తాను త్వరలోనే మరణించబోతున్నట్లు కొన్ని వారాల క్రితమే తెలుసునట. నవంబర్ 21న మార్కెట్లోకి వస్తున్న 'స్టీవ్ జాబ్స్' అనే పుస్తకం ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ పుస్తక రచయిత ఇసాక్సాన్ నాలుగు వారాల క్రితం చివరిసారిగా స్టీవ్‌ని ఇంటర్‌వ్యూ చేశాడట. ఈ ఆగస్ట్ నెలలో యాపిల్ సీఈఓగా దిగిపోతున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూను అతడు నిర్వహించాడు. తాను త్వరలోనే చనిపోతున్నట్లు జాబ్స్ ఈ ఇంటర్‌వ్యూ చివరలో సూచించాడట.

గత రెండేళ్ల కాలంలో ఇసాక్సాన్, స్టీవ్‌ను 40 కంటే ఎక్కువసార్లు ఇంటర్‌వ్యూ చేశాడట. ఈ క్రమంలో అతడు స్టీవ్ మిత్రులు, కుటుంబాలతో కూడా మాట్లాడాడు. ఇసాక్సాన్ ఆస్పెన్ ఇనిస్టిట్యూట్ ప్రధాన కార్యనిర్వాహకాధికారి, టైమ్ మేగజైన్ మాజీ ఎండీ కూడా. అల్బర్ట్ ఐన్‌స్టయిన్, బెన్ ఫ్రాంక్లిన్ అనే రెండు అత్యధికంగా అమ్ముడుపోయిన జీవిత చరిత్ర రచనలు కూడా ఇతడు గతంలో చేశాడట. `iSteve The Book of Jobs` అని మొదట పేరు పెట్టిన ఈ పుస్తకం 2012లో విడుదల కావలిసి ఉండగా, స్టీవ్ మరణంతో ఈ నవంబర్ 24నే మార్కెట్లో `Steve Jobs` అనే పేరుతో విడుదల చేయనున్నారు.

ఈ పుస్తకంలోని విషయాలపై స్టీవ్ ఎలాంటి నియంత్రణలు విధించలేదని, తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి నిక్కచ్చిగా, కొన్ని సార్లు కర్కశంగా -brutally- కూడా మాట్లాడాడని పుస్తక ప్రచురణ కర్త తెలిపారు.

స్మరణ
గుడ్డపీలికల జీవితం నుంచి యాపిల్ బ్రాండ్ వరకు ఎదిగి ముగిసిన స్టీవ్ గురించి సమకాలికులు ఏమనుకుంటున్నారు? తరతరాల వరకు నిలిచి ఉండగల గొప్ప ప్రభావాన్ని స్టీవ్ జాబ్స్ ఈ ప్రపంచంపై ముద్రించారని మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్ ఉద్వేగంగా చెప్పారు. అతడితో పరిచయం కలిగి ఉండటం, తెలుసుకుని ఉండటమే ఒక గొప్ప గౌరవమని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల క్రితమే మేమిద్దరం కలుసుకున్నామని, మా జీవితాల్లో సగం కంటే ఎక్కువ కాలం మేం సహచరులుగా, పోటీదారులుగా, స్నేహితులుగా కూడా గడిపామని, స్టీవ్ మరణంతో తాను నిజంగా విషాదంలో మునిగిపోయానని గేట్స్ చెప్పారు.

ప్రపంచంపై స్టీవ్ కలిగించినంత గొప్ప ప్రభావాన్ని ప్రపంచం చాలా అరుదుగా మాత్రమే ఇతరులలో చూడగలుగుతుందని, అతడి ప్రభావం అనేక తరాలపాటు నిలిచి ఉంటుందని వాల్‌స్ట్రీట్ జర్నల్‌ వెబ్‌సైట్‌కి పంపిన ప్రకటనలో గేట్స్ తెలిపారు. స్టీవ్‌తో కలిసి పనిచేశామంటేనే మేం చాలా అదృష్టవంతులమని, మా జీవితాలకు అదొక అత్యంత గొప్ప గౌరవమని, స్టీవ్ మరణంతో చాలా కోల్పోతున్నానని బిల్‌గేట్స్ నివాళి పలికారు.

మనిషి శాశ్వతం కాకపోవచ్చు కాని పేర్లు శాశ్వతమే. సాంప్రదాయాలు, ఆశల వెదుకులాటలను నిర్వచించే జీవితం కోసం తపన పడుతున్న వేలాదిమంది ఆశాజీవులకు స్టీవ్ ఎప్పటికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాడు.

(స్టీవ్ జాబ్స్ గురించి ఆంగ్లంలో విస్తృతంగా లభ్యమవుతున్న సమాచారాన్ని తెలుగులో అందించడానికి చేసిన ప్రయత్నం.)

స్టీవ్ జాబ్స్ పై కొన్ని కథనాలను కింద చూడండి.

స్టీవ్ జాబ్స్ -- జీవిత సత్యాలు
యాపిల్సారధి స్టీవ్ జాబ్స్అస్తమయం
http://teluguvartalu.wordpress.com/2011/10/06/%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%a7%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80%e0%b0%b5%e0%b1%8d-%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d/
డిజిటల్ ప్రపంచం సంచలనం, యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కన్నుమూతhttp://teluguvaahini.com/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%b8%e0%b0%82%e0%b0%9a%e0%b0%b2%e0%b0%a8%e0%b0%82-%e0%b0%af.html
Steve Jobs and his India connection
Jobs talked cancer, death at Stanford in 2005
Buddhism -- India`s gift to Steve Jobs
In memoriam Steve Jobs
Jobs said little about pancreatic cancer struggls
Steve Jobs The monk who left India to make i-Products
Apple's Steve Jobs 'may never be equaled'

Monday, January 24, 2011

దాసరి సుబ్రహ్మణ్యంగారి అరుదైన జీవిత రికార్డు



చందమామ సీరియల్స్ ద్వారా అయిదారు దశాబ్దాలుగా లక్షలాది పాఠకులను ఉర్రూతలూగిస్తూ వచ్చిన మాన్యులు దాసరి సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితం కూడా పరమ సాధారణ స్థితిలో దాదాపు అజ్ఞాతంగా ఎటువంటి పటాటోపాలు లేకుండా కొనసాగింది. 1952 నుండి 2006 వరకు 54 ఏళ్లపాటు అనితర సాధ్యమైన విధంగా చందమామలో పనిచేసిన దాసరి గారు చివరకు వ్యక్తిగత జీవితాన్ని కూడా సుదీర్ఘకాలం పాటు ఒకే అద్దె ఇంటిలో గడపడం చారిత్రక విశేషం. ఇలా వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకే స్థలంలో అయిదు దశాబ్దాలపైబడి కొనసాగించడం బహుశా ప్రపంచంలో ఎవరికీ సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. వృత్తి జీవితంలో చందమామ చిత్రమాంత్రికుడు శంకర్ గారు మాత్రమే ఇందుకు సంబంధించి మినహాయింపుగా ఉంటారు. ఈయన కూడా 1952 చివరినుంచి ఈ నాటి వరకు అంటే దాదాపు 58 ఏళ్లపాటు చందమామలోనే పనిచేస్తున్నారు. కాని నివాసం విషయంలో చాలా స్థలాలు మారారు.

చందమామలో 1952 నుంచి 1980 దాకా నిరవధికంగా జగత్ప్రసిద్ధమైన 12 సీరియల్స్ -తోకచుక్క, రాతిరథం, జ్వాలాద్వీపం, పాతాళదుర్గం, మకరదేవత, శిథిలాలయం, రాకాసిలోయ, భల్లూకమాంత్రికుడు వంటివి- రాసి చందమామ సర్క్యులేషన్‌‍ని అమాంతంగా పెంచిన ఘనత దాసరి గారి సొంతం. అయితే ఆయన రాసిన జానపద ధారావాహికల మంత్రజగత్తులో ఉర్రూతలూగిన లక్షలాది మంది పాఠకులలో నూటికి 99 మందికి, చివరకు చందమామ రచయితలకు కూడా చందమామ సీరియల్స్ రచయిత ఎవరో ఇటీవలివరకు తెలియదంటే నమ్మశక్యం కాదు. చందమామ పత్రిక తన ఉద్యోగుల వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై విధించిన అలిఖిత అజ్ఞాతవాసం అంత పటిష్టంగా కొనసాగింది మరి.

ఆయన ఆనారోగ్యంతో 2006లో విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లినప్పటికీ, 2009 వరకు పాఠకులు ఆయన పేరుతోటే ఉత్తరాలు, రచనలు పంపుతూ వచ్చిన ఉదంతమే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. చివరకు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన అయిదు దశాబ్దాలకు పైగా ఒకే ఇంటిలో నివసించిన విషయం ఇటీవల వరకు ఎవరికీ తెలీదు. గత 54 ఏళ్లుగా ఎలాంటి మరమ్మతులు లేని స్థితిలో, చెన్నయ్ మహానగరంలో, 'భూతాల' నిలయం వంటి పురాతన భవనంలోని ఒక ఇరుకైన గదిలో ఆయన జీవించారు. భూతాల నిలయం అనే పదం ఇక్కడ ప్రతీకగా వాడవచ్చు కాని, ఆ భవంతిలో ఈనాటికీ దాసరి గారితో దశాబ్దాల అనుబంధాన్ని పెంచుకుంటూ వచ్చిన సాధారణ మనుషులు జీవిస్తున్నారు.

చెన్నయ్‌లోని వడపళనిలో పాత చందమామ భవంతికి కూతవేటు దూరంలోని సుప్రసిద్ధమైన మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో కిందా పైనా 12 గదులు ఉన్న ఒక పాడుబడిన అపార్ట్‌మెంట్‌లో 7వ నంబర్ గదిలో దాసరి గారు దశాబ్దాలుగా అద్దెకు ఉంటూ వచ్చారు.

విజయ వాహినీ స్టూడియోలోని పాత చందమామ భవంతి ఇప్పుడు లేదు. చందమామ వైభవోజ్వల శకానికి సాక్షీభూతంగా నిలిచి అయిదెకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన చందమామ భవంతి ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. అక్కడినుంచి చందమామ కార్యాలయం చెన్నయ్ లోని ఈక్కాండి తాంగల్ -గిండీ-, జెఎల్ ప్లాజా -తేనాంపేట-, చిన్న నీలాంగరై -తిరువాన్మయూర్ అవతల- ప్రాంతాలకు వలసపోయింది.

భూమి గుండ్రంగా ఉన్న చందాన 2010 మేలో చందమామ పాతభవంతికి సమీప ప్రాంతానికే చందమామ ఎడిటోరియల్ ఆఫీసు మళ్లీ వచ్చి చేరింది. చిత్రమో, యాదృచ్ఛికమో గాని దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఆ పాత ఇంటికి సరిగ్గా వెనుకవైపు భవంతి -స్వాతి ఎన్‌క్లేవ్ 5-6 నంబర్లు-లోనే ప్రస్తుతం చందమామ కార్యాలయం ఉంది. దాసరి గారు వడపళని ప్రాంతంలోనే ఉండేవారని చూచాయగా తెలుసు కాని నిర్దిష్టంగా ఎక్కడ ఉండేదీ అంతవరకు నాకు తెలీదు.

మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో స్వాతి ఎన్‌క్లేవ్ భవంతిలోకి -2A- వచ్చి చేరిన మూడు నెలలకు చందమామలో ప్యాకింగ్ విభాగంలో పనిచేస్తున్న రవి ఒక రోజు ఆఫీసు బయట పిచ్చాపాటిగా మాట్లాడుతూ 'తాతా సర్ మొదటినుంచి ఉంటూవచ్చిన ఇల్లు ఇదే సార్' అని చూపించారు. దాసరి గారిని చందమామ సిబ్బంది మొదటి నుంచి ‘తాతా సర్’ అని పిలుస్తూ వచ్చారు. సరిగ్గా దాసరి గారి ఇంటి వెనుకవైపు చందమామ ఆఫీసు ఉంది. నాకయితే రవి ఈ విషయం చెప్పాక షాక్ అయింది. 'ఏమిటి ఇంత పాడుబడిన భవంతి' అని చాలా సార్లు అనుకున్నాను గాని, ఆయన దశాబ్దాలుగా గడిపిన ఇంటిపక్కకు మేం వచ్చామని సూచన ప్రాయంగా కూడా తట్టలేదు.

అరుదైన చరిత్రకు నిలయంగా మారిన ఆ ఇంటిని పోటోలు తీయాలని, ఇంటిముందుకు వెళ్లి ఆయన వివరాలు తెలుసుకోవాలని అనుకున్నా అది ఆచరణలో సాధ్యపడేందుకు మరో మూడునెలలు పట్టింది. ఈ శుక్రవారం -17-12-2010- సాయంత్రం చందమామ కొల్లీగ్ వద్ద 3 మెగా పిక్సెల్ మొబైల్ తీసుకుని రవి సాయంతో ఆ ఇంటికి వెళ్లాము.

దాసరి గారు - చెన్నయ్ అద్దె ఇల్లు
రచన జూన్ సంచికలో 'చెట్టెక్కిన బేతాళుడు' పేరుతో నాయని కృష్ణమూర్తిగారు, దాసరి గారితో, ఆయన అద్దె ఇంటితో తన పరిచయాన్ని సమగ్రంగా వివరించారు. ఆయన 1974లో బొమ్మరిల్లు పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న కాలంలో ఓ రోజు సంపాదకులు విజయబాపినీడు గారు చెన్నయ్‌లో ఒక పెద్దాయనను కలిసి ఆయన ఇచ్చే కొన్ని కాగితాలు తీసుకురావాలని చెప్పారు. (చందమామలో పనిచేస్తున్నప్పుడు, కొత్తగా ప్రారంభించబడిన బొమ్మరిల్లుకు ప్రోత్సాహం అందించాలన్న ఆలోచనతో దాసరి గారు 'మృత్యులోయ' జానపద సీరియల్‌ని ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో రాసి బాపినీడుగారికి పంపేవారు.) ఆ ప్రకారం ఆ చిరునామాకు వెళ్లిన నాయని గారు దాసరి గారిని కలిసిన ఆ ప్రథమ సమావేశపు సన్నివేశాన్ని ఇలా వర్ణించారు. విషయ విస్తరణ రీత్యా రచన జూన్ సంచికలో వచ్చిన ఈ భాగాన్ని కుదించి ఇక్కడ పొందుపర్చడమైంది.

వడపళనిలో మురుగన్ కోయిల్ ఉంది. అది తెలీని మద్రాసీయులు ఎవరూ ఉండరు. గుడికి డెబ్బై, ఎనభై మీటర్ల ముందు ఒక అడ్డరోడ్డు ఉండేది. అది చందమామ బిల్డింగు -విజయావారి పాత బిల్డింగ్- కు వెళ్లే వైపు కుడిపక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ముందు బారుగా లోపలికి చిన్న చిన్న ఇళ్లు పదో, పన్నెండో ఉంటాయి. వీటిల్లో నేను వెళ్లవలసిన ఇంటికి సాయంకాలం ఏడున్నరకు వెళ్లాను -7వ నెంబర్ ఇల్లు- తాళం వేసుంది మళ్లీ రోడ్డు మీదికి వెళ్లి నిలబడ్డాను.

ఎనిమిదన్నర తర్వాత గుడి ఎదురు రోడ్డు క్రాస్ మీదనుండి వస్తున్న ఒకతను కనిపించాడు. ఏదో ఆలోచిస్తూ, అప్పుడప్పుడూ, తల పక్కకు తిప్పి చూస్తూ, ఆగి ఆగి సిగిరెట్టు కాలుస్తూ వస్తున్న వ్యక్తి. ఆయన నాకేసి చూసినప్పుడు 'సుబ్రహ్మణ్యం గారికోసమండీ ఆ యింట్లో ఉంటారు' అంటూ మధ్యలో కొన్ని ఇళ్లవైపు చేయి చూపిస్తూ అన్నాను. 'ఎక్కణ్ణుంచి వస్తున్నారు' అనడిగితే విజయబాపినీడు గారు పంపారని చెప్పాను. 'రండి' అని ఆయన ముందుకు దారితీసి తన గది ముందు ఆగి జేబులోంచి తాళంచెవి తీసి తలుపులు తెరిచారు. 'ఉండండి,' అంటూ చీకట్లో తనొక్కడే లోపలికి వెళ్లి ఏదో స్విచ్ నొక్కాడు. ముందు గదిలో వెలుగులు పరుచుకున్నాయి.

దాన్ని గది అనొచ్చునా, అనకూడదా అన్న మీమాంస క్షణంలో ఏర్పడింది. బాగా పొడవైన అగ్గిపెట్టె అడ్డంగా పెట్టినట్లు ఉంది ఆ గది. వెడల్పు అయిదడుగులకు మించి ఉండదు. పొడవు 12-15 అడుగుల మధ్య ఉండొచ్చు. కుడి వైపు మూడడుగుల వెడల్పుతో లోపలికి ఒక దోవ ఉంది. ఆ మధ్యలోనే ఎడం వైపు ఒక గది ఉన్నట్లు తలుపులు వేసి ఉన్నాయి. బాగా వెనుకవైపు పెరడు అని చూస్తూనే తెలిసి పోతోంది. ముందు అయిదడుగుల వెడల్పు గదిలోనే బుక్ షెల్వ్స్ ఉన్నాయి. ఆయన కూర్చోవడానికి ఒక కుర్చీ ఉంది. ముందు తలుపుకు దగ్గరగా, లోపలకు వెళ్లే సందు ముందు వచ్చిన వాళ్లు కూర్చోవడానికి ఒక కుర్చీ, ఒక స్టూలు ఉన్నాయి.”

దాదాపు 35 ఏళ్ల క్రితం తాను చూసిన దాసరిగారి అద్దె ఇంటిని పొల్లుపోనంత నిర్దిష్టంగా వర్ణించిన నాయని గారి జ్ఞాపకశక్తికి ఈ సందర్భంగా అందరం జేజేలు పలకాలి. ఆ ఇల్లూ, పరిసరాలూ ఈనాటికీ దాదాపు అలాగే ఉన్నాయి. వడపళని క్రాస్‌కి సమీపంగా నూరడుగుల రోడ్డులో -బీమాస్ హోటల్ వద్ద కలిసే- ఆ అడ్డరోడ్డు మాత్రమే కాస్త మెరుగయి ఉండవచ్చు.

నాయని గారు ఆ కథనంలో వర్ణించిన తీరుకంటే మరింత ఘోరంగా ఆ ఇల్లు ఉందనిపించింది. అరవై, డెబ్బై ఏళ్లక్రితం కట్టిన ఆ భవంతిలో వర్షం వచ్చిందంటే చాలు, ముంగిట్లో నీరు వరద కడుతుంది. చెన్నయ్ లోని చాలా పాత ఇళ్లలో ఇదే పరిస్థితి. ఇంటి మట్టం కంటే రోడ్డు మట్టమే ఎత్తులో ఉన్న స్థితిలో కాస్త వర్షం పడిందంటే ఇంట్లోకి వెళ్లే దారిలో మడమలపైకి నీరు చేరుతుంది. ఈ నీళ్లు ఎటూ పోలేక నిలవ ఉండిపోయి భయంకరమైన వాసన వేస్తుంటుంది. ఆ నీళ్లలోనే కాళ్లు తడుపుతూ ఇరుకు దారి గుండా లోపలికి వెళితే అక్కడ పరిచయమైన ఇద్దరమ్మల సహాయంతో దాసరిగారు ఈ భవంతి చివరలో ఉన్న 7వ నెంబర్ గదిని చూడటం జరిగింది.

మార్వాడీల యాజమాన్యంలో ఉండే ఆ పాత భవంతిలో దాసరి గారు 1952 నుంచి 2006 వరకు 54 ఏళ్ల వరకు ఇక్కడి గ్రౌండ్ ప్లోర్ లోని లోని 7వ నంబర్ గదిలోనే నివసిస్తూ వచ్చారు. అనారోగ్య కారణాలతో ఇక్కడి నుంచే ఆయన 2006లో విజయవాడలోకి బంధువుల ఇంటికి వెళ్లారు. దీంట్లో మొత్తం 12 ఇళ్లు ఉంటున్నాయి., వీటిలో తెలుగు ఫ్యామిలీలే ఎక్కువ. చందమామలో గతంలో కన్నడ విభాగంలో పనిచేసిన పద్మనాభన్ బాబు, ఆయన భార్య గౌరి గార్లు 1వ నెంబర్ ఇంటిలో ఉంటున్నారు. ఈమెకు కన్నడతో పాటు తెలుగు కూడా బాగా వచ్చు. ఇక మనవాళన్ అనే తమిళ సినీ నటుడి -ఇప్పుడు లేరు- భార్య కాంతా మనవాళన్ -60- గారు 2వ నెంబర్ గదిలో ఉంటున్నారు. ఇక్కడున్న వాళ్లంతా గత 35, 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అందరికంటే సీనియర్ మన దాసరి గారే. -అద్దెకొంపలో నివాసం చరిత్రలో ఒకే చోట 54 ఏళ్లు- మనవాళన్ దంపతులు దాసరి గారికి చివరివరకు సపరిచర్యలు చేశారట. చెన్నయ్‌లో ఆయనది బ్రహ్మచర్య జీవితమే కాబట్టి వేడి నీళ్లు కాచి ఇవ్వడం వంటి పనులు, సేవలను మనవాళన్ కుటుంబమే ఆయనకు అందించింది.

ఈ భవంతిలోని 6వ నంబర్ గదిలో గోపాల రావు గారనే టైలర్, దాసరి గారితో చాలా స్నేహంగా ఉండేవారట. ఈయన మురుగన్ కోయిల్ సమీపంలో టైలర్ షాపు పెట్టుకుని బతికేవారు. దాసరిగారికి ఈయనతో చివరివరకు సన్నిహిత సంబంధం కొనసాగింది. ఈయన పనిచేస్తున్న టైలర్ షాపు వద్దే దాసరి గారు ఎక్కువకాలం గడిపేవారు. తన అధ్యయనం మొత్తాన్ని ఈ షాపులోనే చేసేవారని తెలుస్తోంది. వాసిరెడ్డి నారాయణ రావుగారు ఈ విషయం చెప్పినట్లు శాయిగారు చెప్పారు. సామాన్యులే దాసరి గారి కథల్లో పాత్రలు. ఆయన స్నేహం కూడా మామూలు మనుషులతోటే కొనసాగింది. ఆయన కూడా ఇప్పుడు లేరు.

54 ఏళ్లు ఒకే ఇంటిలో ఉండటం, ఒకే ఆఫీసు -చందమామ-లో పనిచేయడం. దాసరి గారికే చెల్లింది. శంకర్ గారు కూడా చందమామలో గత 58 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయన చాలా ఇళ్లు మారారు. కాబట్టి ఇల్లు, ఆఫీసుకు సంబంధించిన దీర్ఘకాలిక రికార్డు ప్రపంచంలో బహుశా దాసరిగారికే దక్కవచ్చు. ఇది ఖచ్చితంగా గిన్నెస్ రికార్డుకు ఎక్కవలసిందే -అవసరమనుకుంటే-

ఈ ఇళ్లలోని వారిని కదిపితే చాలు దాసరి వారి జ్ఞాపకాల స్మరణలో మునిగి పోతున్నారు. చందమామ ఉద్యోగి, పెద్దాయన అనే గౌరవం కంటే ఆయన మా మనిషి అనే ఆత్మీయస్పర్శ వీళ్ల జ్ఞాపకాల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

దాసరి గారి సోదరులు ఈశ్వర ప్రభు ఇక్కడికి చాలా తరచుగా వస్తూ పోతూండేవారట. ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉంటున్న ఈశ్వర ప్రభు గారి కుమార్తె మణి తన బాబాయిని కలుసుకోవడం కోసం ఇక్కడికి వస్తూండేవారట.

దాసరి గారు చందమామ ఆఫీసులో పనిచేసినంతకాలం వడపళనిలోని మురుగన్ కోయిల్ స్ట్రీట్ పరిసరాల్లోనే 54 ఏళ్లుగా ఉంటూవచ్చారు. ఈ ఇల్లు మొదట్నించి మార్వాడీల చేతిలో ఉండేది. మూడేళ్లకు, ఆరేళ్లకు అద్దె ఇళ్లు ఖాళీ చేయాలనే ఇంటి ఓనర్లు రాజ్యమేలుతున్న కాలం మనది. మనిషికున్న భయాల్లో లీగల్ భయాలు సన్నవి కావు. కాగా 54 ఏళ్లుగా దాసరి గారిని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయవలసిందిగా ఈ మార్వాడీ ఓనర్లు కోరకపోవడమే చిత్రాల్లో కెల్లా విచిత్రం.

దాసరి గారు వయోభారంతో మద్రాసు నుంచి విజయవాడకు 2006లో వెళ్లిన తర్వాత కూడా వడపళని లోని ఈ 7వ నంబర్ ఇంటితో ఆయన అనుబంధం కొనసాగింది. మొదటినుంచీ ఇద్దరు నివసిస్తున్న ఈ ఇంటిలో 2010 జనవరి వరకూ దాసరి గారి అద్దెభాగాన్ని -1000 రూపాయలు. - చందమామ పూర్వ అసోసియేట్ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రయోజనం కోసం దాసరి గారి తరపున చెల్లిస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఇక్కడి స్వాతి ఎన్‌క్లేవ్‌లో ఉన్న చందమామ కొత్త ఆఫీసు బిల్డింగ్ పక్కనే ఉన్న పాతబడిన భవంతిలో ఏడవ నంబర్ ఇంటిలో దాసరి గారు అయిదు దశాబ్దాలకు పైబడి నివసించారు. ఇది చందమామ ప్రస్తుత ఆఫీసుకు సరిగ్గా వెనుకవైపున ఉండటం కాకతాళీయం.

దాసరి గారు నివసించిన ఇంటికి పక్క ఇల్లు కూడా చాలా పాతది. ప్రమాణాల ప్రకారం చూస్తే పక్కపక్కనే ఉన్న ఈ రెండు భవంతులూ చెన్నయ్ లోని అతి పురాతన భవనాలలో ఒకటిగా లెక్కించవచ్చు.

ఒక్కటి మాత్రం నిజం. దాసరి గారు చెన్నయ్ నగరంలో చివరి వరకూ మధ్యతరగతి జీవితమే గడిపారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో సామాన్య కుటుంబాలే ఉండేవి. చందమామలో సుప్రసిద్ధమైన 12 ధారావాహికలు రచించి లక్షలాది పాఠకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన దాసరి గారు ఇక్కడి ఇరుకు గదిలోనే నివసిస్తూ చందమామ సీరియల్స్‌కి పాత్రల రూపకల్పన చేసి ఉంటారు. ఆయన గడిపిన మధ్యతరగతి జీవితం సాక్షిగా ఆయన సీరియల్స్ పాత్రలు ఆ మట్టి వాసనే వేసేవంటే ఆశ్చర్యపడవలసింది లేదు.

ముఖ్యంగా మీకు తెలుపవలసింది ఏమిటంటే 7వ నెంబర్ ఇంటి మూసిన తలుపు ఫోటో, వెనుక వైపు తెరిచిన తలుపు ఫోటో తప్పితే మిగతా ఫోటోలు అన్నీ కాంతా మనవాళన్ గారి ఇంటి పోటోలే. దాసరి గారు ఉంటూ వచ్చిన గదిలో ఉంటున్న ఆయన మేం వెళ్లే సమయానికి తాళం వేసి పోవడంతో ఆయన ఇంటిలోపలి భాగాలను ఫోటోలు తీయలేకపోయాము. ఈ ప్లాట్ లోని 12 ఇళ్లూ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి గనుక పాఠకులు సౌకర్యార్థం 2వ నెంబర్ గది లోపలి, వెనుక భాగాలను ఫోటో తీసి పంపిస్తున్నాను. రచన జూన్ సంచికలో నాయని కృష్ణమూర్తి గారు వర్ణించిన దాసరి గారి ఇంటికి ఈ ఇతరుల ఇళ్లు కూడా సరిగ్గా సరిపోతున్నాయి.

దాసరి - మురుగన్ మెడికల్ షాపు
వడపళని మురుగన్ కోయిల్ స్ట్రీట్‌లో దాసరి గారు 54 ఏళ్లపాటు నివసించిన ఇంటికి దగ్గరగా, మురుగన్ కోయిల్‌కి అతి సమీపంలో మురుగన్ మెడికల్ షాపు ఉంది. ఈ మెడికల్ షాపులో మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి గత ఆరునెలల్లో చాలా సార్లు షాపుకు వెళ్లాము. దాన్ని తెలుగువారే నడుపుతున్నారు కాని దాసరి గారు దశాబ్దాలపాటు మందులు తీసుకున్న మెడికల్ షాపు ఇదేనని ఈ రోజు 24-12-2010- వరకు మాకు తెలీలేదు. బోర్డు కూడా రోడ్డుకు పైన కాకుండా లోపల కనీ కనిపించకుండా ఉండటంతో పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. చందమామ ప్యాకింగ్ విభాగంలో ఉన్న రవి చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు దీన్ని పట్టేశాము.

ఈ మెడికల్ షాపుతో దాసరి గారికి 50 ఏళ్లపైబడిన బంధం ఉంది. 1952లో చెన్నయ్‌కి వచ్చింది మొదలుకుని దాసరి గారు తమ వైద్య అవసరాలకు ఈ షాపుకే వచ్చేవారు. మేము వెళ్లేటప్పటికి షాపులో ఉన్న శ్రీనివాస్ గారిని దాసరి గారి గురించి ప్రస్తావిస్తే 22 ఏళ్లుగా ఆయన తనకు తెలుసని చెప్పారు. ఎందుకంటే ఇతను గత 22 ఏళ్లుగా ఈ షాపులోనే పనిచేస్తున్నారు. దాసరి గారి జ్ఞాపకాలను పంచుకోమని అడిగితే ముందుగా ఆయనకు చందమామ 2000 సంవత్సరం (?) లో జీవితకాల సాధనకు -లైఫ్ అచీవ్‌మెంట్‌- గాను అందించిన చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు ధ్రువపత్రాన్ని దాసరిగారు తమకు ఇచ్చారని చెప్పి షాపులోనే ఉన్న ఆ ఫోటోను మాకు అందించారు. షాపులోపలే దాన్ని 3 మెగా పిక్సెల్ మొబైల్‌తో ఫోటో తీస్తే అంత సరిగా రాలేదు.

చందమామ చరిత్రలో ఎక్స్‌లెన్స్ అవార్డు ఇద్దరికి మాత్రమే లబించింది వారు దాసరి, శంకర్ గార్లు. 1999లో చందమామ బయటి వ్యక్తుల సహాయం తీసుకుని తిరిగి ఉనికిలోకి వచ్చాక, దశాబ్దాలుగా పత్రిక అభివృద్ధికి దోహదం చేసిన మాన్యులను గౌరవించాలని పత్రిక మనుగడకు ఆర్థిక సహాయం అందించిన సుధీర్ రావు తదితరులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఇద్దరు మహనీయులకు చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు అందించారు. వడపళనిలో ఉన్న ప్రముఖ హోటల్ ఆదిత్యలో జరిగిన ఓ ఫంక్షన్‌లో ఈ అవార్డును బహూకరించారు.

చందమామ ఆవిర్భవించిన 50 ఏళ్ల తర్వాత ఆ సంస్థకు చెందిన సిబ్బందికి అవార్డులు ప్రకటించిన చరిత్ర అదే మొదటిదీ, చివరిదీ కూడా కావడం గమనార్హం. వ్యక్తుల కంటే సంస్థ ముఖ్యమే కాని తెలుగింటి కథల మామగా పేరొందిన ఈ సుప్రసిద్ధ కథల పత్రికలో పనిచేసిన సిబ్బంది జీవితాలు ఇంత సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోవడమే బాధాకరం. చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు వీరిద్దరికీ వచ్చినా, రాకున్నా వారి ఘనతర చరిత్రకు జరిగే లాభం, నష్టం ఏమీ ఉండవనుకోండి. కాని ఎక్కడో బాధ.

చందమామ బహూకరించిన ఈ జీవితకాల సాధన ధ్రువపత్రాన్ని దాసరి గారు 2006 వరకు పదిలపర్చుకున్నట్లు ఉంది. తర్వాత ఆయన అనారోగ్యంతో విజయవాడలో బందువుల ఇంటికి వెళ్లేటప్పుడు ఈ అపరూప జ్ఞాపకాన్ని ఈ మెడికల్ షాపులో తన స్నేహితుడికి ఇచ్చి వెళ్లినట్లుంది. ఈ రోజుకీ వారు దాన్ని షాపులోనే లోపల భద్రంగా ఉంచారు.

దాసరిగారికి చందమామ బహూకరించిన ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ఫ్రేమును మాకు చూపించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి పోటో కూడా ఈ సందర్భంగా తీశాము. సాయంత్రం 4 గంటల తర్వాత వస్తే దాసరిగారితో తమ పరిచయం విశేషాలు చెబుతానని చెప్పారు. పక్కనే ఉన్నాము కాబట్టి మళ్లీ కలుద్దామని చెప్పి మా వద్ద ఉన్న చందమామలను గౌరవంగా అందించి ఆఫీసుకు వచ్చేశాము.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. భూమ్మీద వ్యక్తిగత ఆస్తి ఉండరాదని ప్రభోదించే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని జీవితం చివరవరకూ నమ్మిన వారు దాసరి. అద్భుత రీతిలో చందమామ దశాబ్దాల సేవలకోసం తనకు అందించిన ఈ అపురూప ద్రువపత్రాన్ని కూడా దాసరిగారు తృణప్రాయంగానే వదిలి పెట్టి పోవడం, కీర్తికాంక్షల పట్ల ఎలాంటి మమకారం లేని ఆయన నిగర్వానికి, సగటు మనిషితనానికి తిరుగులేని నిదర్శనం. 83 ఏళ్ల వయసులో ఆయన మద్రాసు విడిచి విజయవాడ వెళుతున్నప్పుడు చందమామ పూర్వ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు తోడుగా వెళ్లి దింపి వచ్చారని తెలుస్తోంది. ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటో ప్రేమును తన వెంట తీసుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

కాని కొన్ని పుస్తకాలు తప్పితే ఆయన చెన్నయ్ నుంచి మరేమీ తీసుకుపోలేదు. చందమామ కోసం, చందమామ సీరియల్స్ కోసం, కథలకోసం జీవితాన్ని అర్పించినందుకు గాను వచ్చిన అరుదైన అవార్డును కూడా ఆయన తనది కాదనుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు. ఈ నిర్మమకారానికి, మూర్తిమత్వానికి మనం ఎలా వెలకట్టగలం చందమామలో దాసరి గారి జీవితానికి సంబంధించిన ఈ చిరస్మరణీయ సాక్ష్యాన్ని భద్రపర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ షాపు వారు ఈ అరుదైన ఫోటోను శాశ్వతంగా భద్రపర్చడానికి, భద్రపర్చగలవారికి ఇస్తే ఎంత బాగుంటుందో! ఇప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి ఆ షాపువారిని కొన్నాళ్ల తర్వాత అయినా ఈ విషయమై ప్రస్తావించాలి. దాసరి రమణ గారు కోరుకుంటున్నట్లు ఆ ఫోటోయే గనుక ఇవ్వడానికి సిద్ధమయితే బాలసాహితి తరపున దీన్ని భద్రపర్చవచ్చు.

దాసరి గారికి ఇష్టమైన హోటళ్లు
దాసరి గారు వడపళనిలోని మురగన్ కోయిల్ స్ట్రీట్‌లో ఉన్న తన ఇంటి చుట్టుపక్కల ఉన్న రెండు మూడు హోటళ్లలో టిఫన్, భోజనం చేస్తూ వచ్చారు. 1970ల చివర్లో చందమామ కథకులు ఎంవీవీ సత్యనారాయణగారు తనను చెన్నయ్‌లో కలిసిన సందర్భంలో దాసరిగారు తన హోటల్ భోజనం గురించి ఇలా అన్నారట. 'కుటుంబరావు గారిని కలవాలని వచ్చి ఎలాగూ కలవలేకపోయారు. పోతే పోయిందిలే. బాబ్బాబు, నా పేరు కాస్త గిన్నెస్ రికార్డు బుక్‌లో ఎక్కించవా! పాతికేళ్లకు పైగా చెన్నయ్‌లో నా బతుకు ఈ హోటల్ పాలయింది. పాతికేళ్లు ఒకే హోటల్లో తిండి. ఎవరికుంటుంది ఈ రికార్డు' అని తనపైన తానే హాస్యమాడారు.

ఆ పాతికేళ్లకు తర్వాత మరో పాతికేళ్లు తోడయ్యాయి. ఆయన చెప్పిన హోటల్ బహుశా ఆర్కాట్ రోడ్డుపై ఉన్న గణేష్ భవన్ కావచ్చు. ఇరుకిరుకుగా లేకుండా ఖాళీ స్థలంలో విశాలంగా కనిపించే ఈ ఉడిపి హోటల్ దాసరి గారి అవసరాలకు చక్కగా సరిపోయి ఉండవచ్చు. నాయని కృష్టమూర్తిగారు రచన జూన్ 2010 సంచికలో రాసిన 'చెట్టెక్కిన బేతాళుడు' రచనలో చెప్పిన ప్రకారం ఆయన 80లకు ముందు మురుగన్ కోయిల్ ఎదురుగా ఆర్కాట్ రోడ్‌పై ఉన్న గణేష్ భవన్ హోటల్లో చాలాకాలం టీ, ఫలహారం తీసుకున్నారు. హిందూ పేపర్ తీసుకుని ఉదయం ఇక్కడికి వచ్చే ఆయన, దాదాపు గంటకుపైగా అక్కడే ఉండి టీ, సిగిరెట్లు తాగుతూ పేపర్ చదివేవారు. ఉడిపి హోటల్లో సిగిరెట్ వెలిగించే అవకాశం ఈయనకు మాత్రమే దక్కిందని నాయని కృష్ణమూర్తిగారి రచన వ్యాసం బట్టి తెలుస్తోంది. సరిగ్గా మధ్యతరగతి వారికి సరిపోయే సాంప్రదాయకమైన గణేష్ భవన్ ఈ నాటికీ సరసమైన ధరలకే మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి సాంబార్ రైస్, పాయసం అద్భుతం

తర్వాతకాలంలో తన ఇంటికి దగ్గరగా, సుప్రసిద్ధ మురుగన్ దేవాలయం వీధి మొదట్లో ఉన్న హోటల్ శివప్రసాద్‌కి తరచుగా వెళ్లేవారట. ఇది ఆయన ఇంటికీ మరీ దగ్గరగా ఉంటుంది. దీనికి ఒక వైపున మురుగన్ కోయిల్, దానికి ఎదురుగా ఆర్కాట్ రోడ్డువైపు దారిలో మురుగన్ మెడికల్స్ షాపు ఉంటాయి. చెన్నయ్‌లో విశేషంగా పేరొందిన ఈ ఆలయం ముందు కొసలో ఉండే శివప్రసాద్ హోటల్ ఆలయానికి వచ్చి, వెళ్లే భక్తులతో సందడిగా ఉంటుంది.

ఆ తర్వాత 2000 దశకంలో ఆర్కాట్ రోడ్డు మీది శరవణ భవన్‌లో తరచుగా ఫలహారాలు తీసుకునే వారిని తెలుస్తోంది. 54 ఏళ్లుగా ఆయన ఈ రెండు మూడు హోటళ్లనే ఉపయోగిస్తూ వచ్చారు. తన ఇంటినుంచి రోడ్డుపై ట్రాపిక్‌ను దాటుకుని వెళ్లడం వయసురీత్యా కష్టమనిపించినప్పుడు ఆయన రోడ్డుకి ఈవైపునే ఉండే శివప్రసాద్, శరవణ హోటళ్లకు మారారనిపిస్తుంది. 90 దశకం చివర్లో చెన్నయ్‌లో ప్రారంభమైన శరవణ గ్రూప్ హోటల్స్ నగరంలో మంచి భోజనానికి మారుపేరుగా నిలిచాయి. 2000సంవత్సరం తర్వాత దాసరి గారు చందమామ పూర్వ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యంగారితో తరచుగా శరవణ హోటల్ సందర్శించేవారని తెలుస్తోంది.

చందమామ కథల సెలెక్షన్‌ - దాసరి
అలాగే చందమామ రైటర్స్ ప్యామిలీగా పేరొందిన జొన్నలగడ్డ కుటుంబానికి చెందిన జొన్నలగడ్డ రత్న -నారాయణ స్వామిగారు, వసుంధర గారి సోదరులు- ఇటీవల చెన్నయ్‌లో కలిసినప్పుడు చెప్పిన వివరాలు ప్రకారం 1980 నుంచి 95 వరకు పదిహనేళ్ల పాటు దాసరి గారు ప్రతి వారాంతంలోనూ ఒక పూట లేదా ఒక రోజు బీసెంట్ నగర్‌లో ఉంటున్న ఆయన ఇంటికి క్రమం తప్పకుండా పోయేవారట. ఐడీబీఐ బ్యాంక్ ఛీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరైన జొన్నలగడ్డ రత్నగారు దాసరి గారితో తన పరిచయం గురించి, ఆయనతో కథా చర్చల గురించి చాలా సమాచారం చెప్పారు. ఈయన ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

మంచి కథ కూడా చందమామలో ఒక్కోసారి సెలెక్టు కాకపోవడంపై దాసరి గారి ఆగ్రహం, పై వారికి -చందమామ అధికారిక సంపాదకులు- సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటూ విసుక్కోవడం, కథ రిజెక్టయినప్పుడు బాధపడవద్దని, చందమామలో కథ ప్రచురణకు తీసుకోనందుకు కథ లోపం కారణం కాదని, దాని వెనుక చాలా కారణాలు ఉంటున్నాయని -సహేతుక కారణాలు కూడా- దాసరి గారు జొన్నలగడ్డ రత్నగారితో చెప్పేవారట. కథ తిరస్కరణకు గురయినప్పుడు దాసరిగారు రచయితలకు రిప్లై పంపేటప్పుడు స్వాంతన కలిగిస్తూ మీ కథ ప్రచురణకు తీసుకోనంత మాత్రాన కథ బాగా లేదనుకోవద్దని సర్దిచెప్పేవారట. కధల సెలెక్షన్‌కి సంబంధించి చందమామ అధికారిక సంపాదకుల తీరుపై కొడవటిగంటి కుటుంబరావుగారికి కూడా వ్యతిరేకత ఉండేదని విశ్వసనీయ సమాచారం. పత్రికలో కథల స్వీకరణ నిర్ణయాలకు సంబంధించి ఇది ప్రపంచంలో అప్పడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉండే సమస్యే కదా.

(చందమామ కథల సెలెక్షన్‌పై, దాసరి గారి స్పందనపై వివరణాత్మక సమాచారాన్ని ‘రచన’ పత్రిక 2010 జనవరి సంచికలో ఈయన సామాన్యుడు కాదు పేరిట దాసరి వెంకట రమణ గారు రాసిన ప్రత్యేక రచనలో చూడండి. నా దృష్టిలో ఇది చందమామ చరిత్రకు, దాసరి సుబ్రహ్మణ్యంగారి జీవిత చరిత్రకు సంబంధించి థీసెస్‌తో సమానమైన రచన.)

తీరిన రుణం
దాసరిగారిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. 1970ల మొదటినుంచీ చందమామలో ఆయన సీరియల్స్‌తో పరిచయం అయినప్పటినుంచి, 2009 జనవరిలో నేను అదే చందమామలో తెలుగు విభాగంలో పనికి కుదిరిన తర్వాత కూడా ఆయన్ను చూడలేకపోయాను. చివరలో బాలుగారితో పాటు విజయవాడలో తనను కలవడానికి చాలా ప్రయత్నించి కూడా సాధ్యపడలేదు. 'చెట్టంత మనిషి కళ్లముందు ఉన్నారులే' అనే కాసింత ఏమరపాటు కూడా కారణం కావచ్చు. తీరా, 'వయసుకు మించి బతికేస్తున్నానం'టూ తనను ఇంటర్వ్యూ చేసిన సిహెచ్. వేణుగారితో సరదాగా అన్న దాసరిగారు తర్వాత ఆరునెలలకే కాలం చేసినప్పుడు అందరికీ పిడుగుపాటే.

చందమామ చిత్రకారులు శంకర్ గారిపై వీడియో ఎలాగోలా విజయవర్ధన్ గారి తోడ్పాటుతో సేకరించగలిగాము. ఒక చిన్న వీడియో కెమెరా ఉండి విజయవాడకు పోగలిగి ఆయనను సజీవంగా చిత్రిక పట్టవలసిన అవసరం గురించి వేణు గారితో చర్చించినప్పటికీ కుదరలేదు. హ్యారీ పోటర్లు, అవతార్‌లు గురించి ప్రపంచానికి తెలియని రోజుల్లోనే లక్షలాది మంది పిల్లలను జానపద సీరియళ్ల మంత్రజగత్తులో ఓలలాడించిన ఈ అపరూప తెలుగు బాల కథా రచయితగురించి ఒక్కటంటే ఒక్క వీడియో చిత్రం కూడా తీయలేని బాధ ఇక అందరినీ వెంటాడుతూనే ఉంటుంది.

ఏమో.. నా జీవితంలో ఎన్నడూ చూడలేకపోయిన దాసరి సుబ్రహణ్యం గారి రుణాన్ని ఈవిధంగా తీర్చుకుంటున్నానేమో.!

నోట్
(చివరగా, దాసరి గారు చెన్నయ్‌లో నివసించిన ఇంటిని పట్టేశానంటూ నాలుగు నెలల క్రితమే చందమామ అభిమాని శ్రీ కప్పగంతు శివరాం ప్రసాద్ గారికి చెప్పినప్పుడు ఆయన వెనువెంటనే ప్రాధేయపడ్డారు. అది పాత భవంతి అంటున్నారు కనుక రాత్రికి రాత్రే దాన్ని కూల్చేసి కొత్త భవంతి నిర్మాణాలకు ప్లాన్ జరిగిపోవచ్చని, చలం గారు నివసించిన స్వంత ఇంటి ఫోటో విషయంలో కూడా ఇలా నిర్లక్ష్యం చేసినందువల్లే ఒక రోజు ఉన్నట్లుండి దాన్ని కూల్చేసి చరిత్రకే లేకుండా చేశారని శివరాం గారు బాధపడ్డారు.

అందుకే అప్పటినుంచి ఆయన పదే పదే మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా దాసరి గారి అద్దె ఇంటిని వీలైనంత త్వరగా ఫోటో తీయమని గుర్తు చేస్తూ వచ్చారు. మన జీవితాల్లో రియల్ ఎస్టేట్ ఒక పెద్ద భూతమని అది ఎప్పుడు ఏ కొంపను లేకుండా కూల్చి వేస్తుందోనని ఆయన భయం. శివరాంగారు హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ నా వద్ద ఉన్న డిజిటల్ కెమెరా లెన్స్ పాడవటంతో రిపేర్ చేయించడం కుదర్లేదు. కెమెరా రెడీ అయితే తర్వాత చూద్దామని తాత్సారం చేస్తూ వచ్చాను.

ఈలోగా దాసరి గారి మూడు పుస్తకాలను ప్రచురించే బాధ్యత తీసుకున్న రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారి చెవిన ఈ విషయం పడి, ఈ అంశంపై వ్యాసంతో పాటు ఫోటోలను కూడా పంపితే చాలా మంచిదని, మళ్లీ మళ్లీ వేయలేమని అరుదైన రికార్డుగా ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఇక తప్పనిసరై చందమామలో సిస్టమ్ అడ్మిన్ శశి వద్ద మొబైల్ తీసుకుని ఈ వారంలో పని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది.

దాసరి గారు నివసించిన ఇంటి వివరాలు ఈ రూపంలో అయినా వెలుగులోకి వచ్చినందుకు కారణమైన శివరాం, శాయి గార్లకు మనఃపూర్వక కృతజ్ఞతలు. ఆ ఇంటి వివరాలు కావాలని చెప్పగానే దగ్గరుండి మరీ చూపించి, చుట్టుపక్కల కుటుంబాలను పరిచయం చేసిన చందమామ ప్యాకింగ్ విభాగం రవికి, మొబైల్ సాయం అందించిన శశికుమార్‌కి ఈ అన్ని ఫోటోలు తీయడంలో సహకరించిన చందమామ లే అవుట్ డిజైనర్ నరేంద్రకు, చివర్లో దాసరి గారి ఎక్సెలెన్స్ అవార్డు గురించి అరుదైన విశేషాలు తెలిపి దాని అరుదైన పోటో అందించిన మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.)

కె. రాజశేఖర రాజు.
చందమామ
...........

గమనిక
శాయిగారూ,
చెన్నయ్‌లో దాసరి గారి వ్యక్తిగత జీవితం, ఆయన నివసించిన ఇల్లు, సందర్శించిన హోటల్స్, వైద్యం కోసం ఉపయోగించిన మెడికల్ షాపు, చందమామ ఎక్స్‌లెన్స్ అవార్డు గురించి లభ్యమైన సమాచారం చాలా పెద్దదయినట్లుంది. రచన పేజీల కొలతకు సరిపోయేలా మీరు దీన్ని వీలైనంత మేరకు ఎడిట్ చేయగలరు.

మీ
రాజు....

తాజా సమాచారం.

మురుగన్ మెడికల్స్ శ్రీనివాస్ గారి వద్ద ఉన్న, దాసరి సుబ్రహ్మణ్యం గారికి వచ్చిన ఎక్స్‌లెన్స్ అవార్డు చందమామ స్వయంగా ఫ్రేమ్ కట్టించి ఇచ్చిందే. దాసరి గారి కోరికమేరకు దీన్ని శ్రీకాకుళంలో కథానిలయానికి అందించవలసి ఉందని తెలుస్తోంది.. ఆయన అభిప్రాయానికి ఎనలేని విలువ కల్పిస్తూ డిసెంబర్ చివర్లో శ్రీనివాస్ వద్ద ఉన్న ఒరిజనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఫోటోను ఆయన అనుమతితో చందమామ ఆఫీసుకు తీసుకెళ్లి స్కాన్ తీయించి భద్రపర్చాము. దాని కాపీనే రచన సంపాదకులు శాయిగారికి, దాసరి వెంకటరమణ గారికి పంపాము. కనీసం కాస్తంత క్వాలిటీతో స్కాన్ అయిన ఈ కాపీ అయినా మనవద్ద ఉందని సంతృప్తి పడాలి.

24-01-2011
చెన్నయ్

Tuesday, December 14, 2010

ఆబాల గోపాల కథల పత్రిక “చందమామ”

ఆరు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను ఆకట్టుకుంటూ వారిని అద్భుతమైన ఊహాలోకపు మంత్రజగత్తులో విహరింప జేస్తున్న కథల పత్రిక “చందమామ”.

పిల్లల్లారా, చిన్నారీ, అమ్మాయీ, అని సంబోధిస్తూ, పాలు తాగే పసిపిల్లలకు ఊకోట్టే కథలను చెబుతూ 'చనుబాల' కథల పత్రికగా 1947 జూలై నెలలో తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ అతి త్వరలోనే ఆబాల గోపాల కథల పత్రికగా భారతీయ సాహిత్య ఆకాశంలో తటిల్లున మెరిసింది.

జాతి జీవనంలో సాంస్కృతిక రాయబారిగా నిలిచిపోయిన అరుదైన పత్రిక చందమామ. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చందమామ కథల పత్రికను చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. దైవ ప్రయత్నం కంటే మానవ ప్రయత్నానికి, తద్వారా మనుషులు సాధించే అంతిమ విజయాలకు ప్రాధాన్యమిచ్చే చందమామ కథలు తరాలు మారినా, సాంకేతిక జ్ఞాన ఫలాలతో జీవితం మూలమలుపులు తిరుగుతున్నా భారతీయ పాఠకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. సున్నిత హాస్యం, విజ్ఞానం, వినోదాల మేళవింపుగా రూపొందుతూ వచ్చిన చందమామ కథలు వాటికి తోడయిన అద్బుత చిత్రాలు -చిత్రా, శంకర్, ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య, రాజీ తదితరుల చిత్ర సృజన- భారతీయ పిల్లల మానసిక ప్రపంచాన్ని దశాబ్దాలుగా వెలిగిస్తూ వస్తున్నాయి.

ఆ పిల్లలు ఆ కథలతో పాటు పెరిగినా, జీవితంలో అన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. తెలుగునేల మీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు. 1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినివిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు.

ఆరు దశాబ్దాల క్రితం పిల్లల పత్రికగా మొదలైన చందమామను ప్రస్తుతం 70, 80 ఏళ్ల పైబడిన వారు ఇప్పటికీ కొని చదువుతూ తమ మనవళ్లు, మనవరాళ్లకు వాటిని చదివి వినిపిస్తున్నారంటే ఒకనాటి చనుబాల కథల పత్రిక క్రమంగా ఆబాల గోపాల కథల పత్రికగా మారిన వైనం బోధపడుతుంది.

మారుతున్న కాలం, మారుతున్న తరాలు, పిల్లల అభిరుచులకు అనుగుణంగా దశ, దిశలు రెండింటినీ మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న చందమామను వెనక్కి పట్టి లాగి మూలం నుంచి పక్కకు పోవద్దని హెచ్చరిస్తూ, ధ్వజమెత్తుతూ, దూషిస్తూ కూడా చందమామ సారాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్న పాఠకుల వంటి వారు మరే భారతీయ పత్రికకూ కూడా లేరు. యాజమాన్యం చేతులు మారినా చందమామ మూల రూపం మారితే సహించబోమంటూ నిరసన తెలుపుతూ, ఉత్తరాలు, ఫోన్లు, ఈమెయిళ్లు, ఎస్ఎమ్ఎస్ ల ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తున్న అరుదైన పాఠకులు చందమామకు తప్ప ప్రపంచంలో మరే పత్రికకు కూడా లేరని చెప్పవచ్చు.

చందమామ ఎందుకింత చరిత్ర సంపాదించుకుంది! లక్షలాది మంది పిల్లలు పెద్దల మనో ప్రవంచంపై ఇంత మహత్ ప్రభావాన్ని చందమామ దశాబ్దాలుగా ఎలా కలిగిస్తూ వస్తోంది? భారతీయ సాహిత్యాకాశంలో కథా కాంతులు మెరిపించిన ఈ గొప్ప చరిత్రకు, ఈ గొప్ప సంస్కృతికి ముగ్గురు మహనీయులు కారణం. వారి వల్లే, వారి దార్శనికత వల్లే చందమామ ఇంతటి ఘనతర చరిత్రను సాధించగలిగింది. వారు నాగిరెడ్డి, చక్రపాణి, కుటుంబరావు గార్లు. తొలి ఇద్దరూ చందమామకు రూపురేఖలు నిర్దేశిస్తే, తనకే సాధ్యమైన అతి సరళమైన రచనా శైలితో ఆబాల గోపాలం చందమామను తమ హృదయాలకు హత్తుకునేలా మార్చిన వారు కొడవటిగంటి కుటుంబరావు గారు. తను ఏ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకూ సరిపోయేట్టు మలిచి రాసేవారు.

అనన్య సామాన్యమైన ఈ త్రిమూర్తుల దార్శనిక కృషి ఫలితంగా, ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ “చందమామ”లో కథలుగా వచ్చాయి. భారతం, రామాయణం, భాగవతం, ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బేతాళకథలూ, పంచతంత్రం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, అరేబియన్‌ నైట్స్‌ ఇలా విశిష్టమైనవన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు, ఇంకా ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, షేక్‌స్పియర్‌ అనువాదాలు ఎన్నిటినో పాఠకులు చదవగలిగారు.

ఇవి కాక గ్రీక్‌ పురాణాలైన ఇలియడ్‌,ఒడిస్సే, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ “చందమామ”లో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలే గాక ఇతర సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి. “చందమామ” ఆఫీసులో అన్ని ప్రపంచదేశాల జానపద కథలూ ఉండేవి.

భారతీయ పిల్లలను జానపద ప్రపంచపు ఊహాలోకాల్లో విహరింపజేస్తూ వచ్చిన చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేటట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం లాంటి మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూ వచ్చాయి. మంచి అలవాట్లు, నీతి, నిజాయితీ, స్నేహం, విశ్వాసం నేర్పుతూనే పిల్లలకు పుస్తకాలు చదవటం నేర్పుతోంది చందమామ.

చందమామ కథలు ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులని చందమామ అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు. “విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, కొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు.. నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..

చందమామతో పాటు మరిన్ని పిలల్ల పత్రికలూ ఉన్నా, భాషలో, కథల ఎంపికలో, మరీ ముఖ్యంగా బొమ్మలలో చందమామకి ఉన్న ప్రత్యేకత చందమామదే. చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇలా బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. పైగా ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..” –మేధ, బెంగళూరు

చందమామ రాగానే పోటీ పడి ఎవరు ముందు చదవగలుగుతామా అని ఆత్ర పడడమూ, చందమామ అభిమానులందరికీ పరిపాటిగా ఉండేది. కొత్త చందమామ కోసం బేరాలు. బొమ్మలు చూసి ఇస్తాను అనో, ఒక్క పేజీ కథ ఒకటి చదివి ఇచ్చేస్తాననో, లేకపోతే చదివే వారి పక్కనే కూర్చుని వారితో పాటే చదవడమో, రక రకాలుగా ప్రయత్నాలు సాగుతుండేవి. మొదటి రుచి అందుకోవాలని. అలా హడావిడిగా మొత్తం పత్రిక తిరగేసినా, అందరి వంతులూ అయిపోయాక తీరిక సమయాలలో ఎవరికి వాళ్లు తొందర లేకుండా మళ్ళీ మళ్ళీ చదువుకునే వాళ్ళు. ఇక ఆ తర్వాత బొమ్మలు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూసుకునే వాళ్లు. అలా చూసుకుంటూనే, పిల్లలు, పెద్దలు ఆ కథల గురించీ, బొమ్మల గురించీ చర్చించుకునే వాళ్లు.

ఈ మధ్యే చందమామ సీనియర్ చిత్రకారుడు శంకర్ గారిని చందమామ పనిలో భాగంగా పోన్ చేసి మాట్లాడితే చందమామను మొదటినుంచి పిల్లలూ, పెద్దలూ ఎందుకు అంత ఆసక్తిగా, ఆరాటంగా చదివారో అద్బుతంగా వివరించారు. పేదవాళ్లకు, పనిపాటలు చేసుకుంటూ బతికేవారికి కాస్త తీరిక సమయంలో చదువుకునేందుకు కథలు తప్ప జీకేలు, కార్టూన్‌లు ఉపయోగపడవని, కష్టజీవులకు కాస్త సరదా తెప్పించేందుకు, శ్రమను మరిపించేందుకోసమే చందమామ కథలు ముందునుంచి ప్రయత్నించాయని శంకర్ గారు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా చందమామ వస్తోందంటే కారణం కథలేనని, కథల కోసమే చందమామను చదువుతున్నారని ఆయన అమూల్యమైన అభిప్రాయం చెప్పారు. గ్రామఫోనూ, రేడియో తప్ప మరే ఇతర వినోద విజ్ఞాన సాధనమూ లేని కాలంలో చదువగలిగిన ప్రతి వారికి చందమామ చక్కటి వినోద సాధనంగా పనిచేసిందని అభిప్రాయపడ్డారు.

చింతచెట్టుమీద దయ్యం గురించి చదివితే, ఆ దయ్యం కూడా… మనిషి కష్టాలు దయ్యం పెట్టే బాధల కంటే ఎక్కువ అనే సత్యాన్ని గ్రహించి అప్పటినుంచి అది మనుషులను పీడించడం మానుకున్న వైనం చదివితే కష్టాలు పడుతున్న వారి మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని, వారి శ్రమను, కష్టాన్ని కూడా మరిపించడంలో భాగంగా చందమామ కథలు పుట్టాయని శంకర్ గారు తమ అమూల్యమైన అభిప్రాయం చెప్పారు.

భయపట్టే దయ్యాలు, రాక్షసులూ కాకుండా మంచి వారికి సాయపడే దయ్యాలు, రాక్షసులు ఇతివృత్తంగా కథలు మార్చి ప్రచురించిన కారణంగా చందమామ కథను లక్షలాది మంది భారతీయులు తమ స్వంత జీవిత అనుభవాలతో పోల్చుకుని పరవశించారు. దశాబ్దాలుగా ఇదే తీరు.

చందమామలోని మరో ప్రత్యేకత ఏమిటంటే తేనెలూరే తియ్యటి తెలుగు. తెలుగు భాష నిసర్గ సౌందర్యాన్ని, భాషలోని తియ్యదన్నాన్ని చూడాలంటే కూడా చందమామనే చూడాలి. నాలుగైదు తరాల ప్రజలు, పాఠకుల జ్ఞాపకాల్లో చందమామ భాష నిల్చిపోయింది. భాష విషయంలో చందమామలో తప్పు దొర్లిన ఘటన దాదాపు ఉండేది కాదంటే చందమామ సంపాదకులు భాషకు, శైలికి ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది.

ఇన్ని సుగుణాల రాశి కాబట్టే చందమామ కొన్ని తరాల పిల్లలకు, పెద్దలకు కొండంత వెలుగు. అందులోనూ పాత చందమామలు అంటే తెలుగు ప్రాంతంలో ఎంత పోటీ ఏర్పడింది అంటే రాష్ట్రంలో ఎక్కడా పాత పుస్తకాల కొట్లలో, రోడ్జు పక్క అంగళ్లలో చందమామ సంచికలు దొరకని పరిస్థితి. పూర్వకాలంలో లంకెబిందెలకోసం వెతుకులాట ప్రారంభించినట్లుగారాష్ట్రంలో చందమామలు, పాత చందమామల కోసం వెతుకులాట మొదలయింది.

‘చంపి’ -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రియులు- లుగా ముద్రపడిన చందమామ వీరాభిమానులు పోటీలు పడి చందమామలు సేకరించడం, ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ రూపంలో చందమామ పాత సంచికల ఫైళ్లను వెతికి పట్టుకుని సేకరించి తమ వద్ద ఇన్ని సంవత్సరాల చందమామలు ఉన్నాయి అని బ్లాగ్ లోకానికి టముకు వెయ్యడం గత కొంత కాలంగా నిత్య కృత్యంగా మారింది.

అలనాటి, ఈనాటి పాఠకులలో చందమామ కథలపట్ల ఉన్న ఈ వీరారాధనను గుర్తించి చందమామ యాజమాన్యం కూడా 1947 నుంచి 2000 వరకు చందమామ సంచికలను ఆన్‌లైన్‌లో ఉచితంగా చందమామ వెబ్‌సైట్‌లలో ఆర్కైవ్స్ విభాగంలో పొందుపర్చింది. ప్రపంచ వ్యాప్తంగా చందమామ పాఠకులు మొత్తం పది భాషల్లో ఇప్పుడు ఇంటర్నెట్‌లో 53 ఏళ్ల సంచికలను ఉచితంగా చూసి చదువుకోవచ్చు. ఆవిధంగా ప్రపంచంలో ఏ కథల పత్రికా సాధించని అరుదైన ఘనతను చందమామ సాధించింది.

“చందమామ నా ప్రాణనేస్తం. అమ్మ తన చిన్నప్పుడు చందమామ, తోకచుక్క, పాతాళదుర్గం, చదువుతూ పెరిగింది. నేను అక్క, అన్న, చందమామ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాళ్లం.” అంటూ నాలుగైదు తరాలుగా పిల్లలు చందమామతో తమ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ తరాలు మారినా పాఠకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి.

తెలుగులో ప్రత్యామ్నాయ వెబ్‌సైట్‌లలో ఒకటిగా పేరు పొందిన ప్రజాకళ.ఆర్గ్ నుంచి బాలసాహిత్యం శీర్షిక కోసం నెలనెలా చందమామ కథలను పరిచయం చేయాలని ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్నొక గౌరవంగా భావించాను. ఎందుకంటే నేను కూడా బాల్యంలో పల్లెటూర్లో చందమామకోసం పోటీ పడి చదువుతూ పెరిగిన వాడినే. చందమామ పత్రికపై ఉన్న ఈ మమకారం చివరకు 35 ఏళ్ల తర్వాత నాకు కూడా చందమామలో ఓ స్థానం కల్పించింది. కథా సాహిత్యంలో వైభవోజ్వల ఘనతను సాధించుకున్న చందమామ పత్రికను మొదట పరిచయం చేసిన తర్వాత ప్రతినెలా ఒక విశిష్టమైన చందమామ కథను పరిచయం చేద్దామని నా ప్రయత్నం.. ప్రజాకళ పాఠకులు మే నుంచి ప్రతి నెలా చందమామ కథల నేపథ్యాన్ని, వాటి పరిచయాన్ని ఆస్వాదిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కలిగించిన ప్రజాకళ.ఆర్గ్ వారికి కృతజ్ఞతలు
- కె.రాజశేఖర రాజు

7 అభిప్రాయాలు
# Rohiniprasad 05 ఏప్రిల్ 2010 , 9:32 am
ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తికి తాను నిర్వహిస్తున్న బాధ్యతల గురించి అభిరుచి ఉండడం తప్పనిసరి కాదు. ఈ విషయంలో రాజశేఖరరాజుగారి ధోరణే వేరు. చందమామ గురించీ, దాని చరిత్రను గురించీ ఆయనకు ఎంతో ఆసక్తీ, అభిమానమూ ఉండడం చాలా మంచి విషయం.
చందమామ నిర్వహణ వ్యవస్థలో ఇటీవల జరిగిన కొన్ని ఘోరమైన తప్పిదాల కారణంగా దాని చరిత్రను వివరించే కొన్ని అమూల్యమైన, అపూర్వమైన ఆధారాలు కనుమరుగైపోయాయి. అప్పటితరంలో ముఖ్యపాత్ర చేపట్టినవారందరూ కాలం చెయ్యడంతో ఆ చరిత్రను తవ్వి తీయడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా ఈ బాధ్యతను చేపట్టిన రాజు ఎంతైనా అభినందనీయుడు.

# bhandaru srinivasrao 08 ఏప్రిల్ 2010 , 3:10 am
రాజు గారికి
చాలరొజులుగా మీ వ్యాసాలు చదివే వీలు దొరకలెదు. prajakala కు ధన్యవాదాలు.
భండారు శ్రీనివాస రావు

# దామోదరం మారెం 09 ఏప్రిల్ 2010 , 12:21 am
తొలుత చందమామ చరిత్ర గురించి ఇంతగా ప్రత్యేక శద్ధ తీసుకుని, భావి తరాలు మరిచిపోకుండా వివరించిన రాజశేఖర రాజు గారికి ధన్యవాదాలు. ఎన్ని సంచికలు వచ్చినా…చందమామ పత్రిక మాత్రం “లివింగ్ లెజెండ్” వంటిదని నిస్సందేహంగా చెప్పొచ్చు. మీ నుంచి మరెన్నో అద్బుతమైన కథనాలు రాగలవని ఆశిస్తున్నాను.

# murali mohan mallareddy 25 ఏప్రిల్ 2010 , 11:42 am
రాజు గారికి అభినందనలు. ఇటీవలే చందమామ కు కొన్ని కథలు పంపించాను. రాజు గారు వాటిని చక్కగా ఆదరించి ఎంతో ప్రొత్సాహాన్ని అందిస్తున్నారు. చందమామ తో ఇదివరకు పాఠకుడిగా ఉన్న అనుబంధం ఇప్పుడు రచయితగా మొదలవుతోంది. మహామహుల రచనలు వచ్చిన చందమామ లో నా కథలు కూడా రాబోతున్నాయన్న తలంపే ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోంది. రాజు గారి కృషి అభినందనీయం…. మల్లారెడ్డి మురళీ మోహన, అంబాలా, హర్యానా.

# Hymavathy 02 ఆగస్టు 2010 , 12:47 am
చందమామ రాజు గారికి!

వెబ్ లో ఎన్నో సైట్స్లొ లో చందమామ గురించిన విషయాలు, చరిత్ర ప్రచురించడం ముదావహమం.[ఇక్కడవ్రాయడం కష్టం గానే ఉంది. లేఖిని లో వ్రాయడం అలవాటు] ఐతే ఏపత్రికైనా దాని బాగోగులగురించిన ఫీడ్ బ్యాక్ తెల్సుకుంటుంటేనే మంచి చరిత్రను రూపొందించుకుంటుంటుంది.అది చందమామ మాత్రమేచేయగలగడం మరో గొప్పవిషయం. చందమామ పాత పాఠకులనందరినీ ,[ అంటే ఓల్డ్ పాఠకుల సదస్సు రాష్ట్రములవారీగా ఏర్పాటుచేస్తే ఎంతో బావుంటుంది.ఎందుకంటే దాసరి సుబ్రహ్మణ్యం గారిలా జీవంతో ఉన్నపుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోక , ఆతరువాత ఎన్ని వ్యాసాలు, బాధలు, గాధలు చెప్పుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదేమో!
70 ఏళ్ళ ”చంపి” గారిలాంటి వారెందరో ఇంకా ఉండవచ్చు. కనుక యోచించగలరు.ఇలా చందమామ గురించిన కధల ప్రచురణవలన ప్ర జాకళ కూ పాఠకులు పెరిగిపోతారనడం యదార్ధం

# నారాయణ 16 ఆగస్టు 2010 , 10:39 am
చందమామకున్న చారిత్రక నేపధ్యాన్ని రాజుగారు చాలా చక్కగా చిత్రీకరిస్తున్నారు. నాగిరెడ్డి-చక్రపాణిగార్లు తెలుగు సాహిత్యానికి, పిల్లల పఠనాసక్తిని పెంచటానికి చందమామను స్థాపించి, దాన్ని పెంచి పెద్దచేసి ఇంతటి దాన్ని చేశారు. అయితే ఈ మధ్యకాలంలో చందమామలోని కథల్లోగాని, వాటి ప్రెజెంటేషన్లోగాని నిజంగా పెను మార్పులే చోటు చేసుకున్నాయి. (”..చందమామ కథలు గతంలో ఉన్నంత బాలేవు” అనేది నా వ్యక్తిగత అభిప్రాయం; అయితే దానికిక్కడ తావులేదు). ఈ క్రమంలో రాజుగారు చందమామ ప్రస్తుత యాజమాన్యం గురించి, వారికి చందమామ చరిత్రతో ఉన్న అనుబంధం గురించి, వృత్తి ప్రవృత్తుల రీత్యా వారికి తెలుగు భాష/ పిల్లలతో ఉన్న సంబంధాల గురించీ కూడా వివరిస్తే బాగుంటుంది.

గమనిక:
మనకున్న కొన్ని ప్రత్యామ్నాయ వెబ్‌సైట్లలో ఒకటైన ప్రజాకళ.ఆర్గ్ చందమామ కథల గురించి కథనాలు పంపమని అడిగినప్పుడు పంపిన మొదటి కథనం ఇది. చందమామ కథల ఒరవడి గురించి సూచన ప్రాయంగా తెలుపుతున్న ఈ కథనం అప్పట్లో మంచి స్పందనలను కూడా పొందింది. ఈ కథనం ప్రచురించి ప్రోత్సహించిన ప్రజాకళ.ఆర్గ్ వారికి కృతజ్ఞతాభివందనలు.

ప్రజాకళ.ఆర్గ్‌లో ఈ కథనం మూల లింకును కింద చూడవచ్చు.
http://prajakala.org/mag/2010/04/చందమామ