Pages

Saturday, March 18, 2017

ప్రజాసాహితి – 400వ సంచిక, 400 సంచికల సి.డి. ల ఆవిష్కరణ


‘భారతి’ తర్వాత తెలుగు సాహిత్య చరిత్రలో 400కు పైగా సంచికలను పూర్తి చేసుకున్న మాసపత్రిక ‘ప్రజాసాహితి’. నాల్గవ వంతుకు పైగా అంటే 100కు పైగా సంచికలను ప్రత్యేక, విశిష్ట సంచికలుగా వెలువరించటం ద్వారా తన సాంస్కృతికోద్యమ కర్తవ్య దీక్షను ప్రజాసాహితి ప్రదర్శించింది. సరాసరిన ప్రతి నూరు సంచికలలో 11 దాకా ప్రత్యేక సంచికలున్నాయి.

ప్రజాసాహితి ప్రత్యేక సంచికలు అంటే ఎక్కువ పేజీలతో, సాధారణ సంచిక కంటే ఎక్కువ పరిమాణంతో, వెలువరించే పద్ధతి కాదు. ఒక ప్రత్యేక అంశం పైన – ప్రధానంగా సాహిత్యకారులపై, సామాజిక సందర్భౌచిత్యం గల అంశాలపై ప్రత్యేక దృష్టితో సంచికలు తెచ్చారు. ఉదాహరణకు 1980 ఆగస్టులో ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు చనిపోయిన వెంటనే 1980 అక్టోబరులో (37వ సంచిక) ఆయనపై ప్రత్యేకంగా ఒక సంచికను తెచ్చారు. 1995 సెప్టెంబరు 28న గుర్రం జాషువా గారి శత జయంతి సందర్భంగా కూడా ప్రజాసాహితి ఆయనపై ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది.

మతతత్త్వం భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు 1991 నాటి జనవరి సంచికనూ, 1992 నాటి డిసెంబరు సంచికనూ – (బాబ్రీ మసీదు కూల్చివేసిన వెంటనే) ప్రచురించింది. అలాగే 2005లో ‘గ్రామీణ జీవన సంక్షోభం - రైతాంగ ఉద్యమం’ అనే అంశం పైనా, మహాకవి గురజాడ 150వ జయంతి సందర్భంగా, 2012లో ఆయనపై రెండవసారి ప్రత్యేక సంచికను తెచ్చింది. అలా గడిచిన 40 సంవత్సరాలలో 45కు పైగా ప్రత్యేక సంచికలను విడుదల చేసిన ఘన చరిత్ర ప్రజాసాహితిది.

ప్రజాసాహితి 100-200-రజితోత్సవ సంచిక–300వ సంచిక - అన్నీ ప్రత్యేక సంచికలే. ఆ క్రమంలో యిప్పుడు 400వ సంచికను “25 ఏళ్ల ప్రపంచీకరణ:సాoస్కృతిక విధ్వంసం:సాహిత్యోద్యమం” అనే అంశంపై ప్రత్యేక సంచికగా విడుదల చేసారు.

మోహన్ గీసిన ముఖ చిత్రం – ప్రపంచీకరణ సృష్టించిన సాంస్కృతిక విధ్వంసాన్ని “ఉక్కు డేగ పై ధిక్కార స్వరంతో శాంతి పావురపు సృజనగా” సాగుతున్న లాంగ్ మార్చ్ అంటూ ఈ 400వ సంచిక ప్రత్యేకతను కనుల ముందు దృశ్యమానం చేస్తుంది. 156 పేజీల సంచికలో 6 కథలూ, 17వ్యాసాలూ, 7గురు ప్రముఖుల సందేశాలూ, 17కవితలూ, 2 పాటలూ, 4 సమీక్షా వ్యాసాలూ..తో పాటు సాధారణ సంచికల ధారావాహికలను కొనసాగిస్తూ ఈ సంచిక వెలువడింది. నేతాజీ చరిత్రని ఆవాహన చేసుకుంటూ పాపినేని శివశంకర్ రాసిన కవిత ఒక విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. 25 ఏళ్ల సామ్రాజ్యవాద ప్రపంచీకరణాన్ని భారత ప్రజలపై సాగుతున్న విధ్వంసక సాంస్కృతిక దాడిగా, కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక భూస్వామ్య-సామ్రాజ్యవాద సంస్కృతుల విస్ఫోటనంగా ప్రజాసాహితి పరిగణిస్తూ వస్తోంది. అందుకే దాని ఆర్ధిక-రాజకీయ స్వభావాలను పాఠకులకు అర్ధం చేయిస్తూ ఏ ఏ విధంగా సాంస్కృతిక రూపాలలో అది వ్యక్తమవుతూ వస్తోందో విశ్లేషించే వ్యాసాలూ యిందులో చెప్పుకో దగినన్ని ఉన్నాయి.

తెలుగు సినిమా రంగంలో, భూస్వామ్య వారసత్వ సంస్కృతిని బలోపేతం చేస్తున్న పెట్టుబడిని బహిర్గతం చేస్తున్న ఆదిత్యనాధ్ వ్యాసం చాలా మంది ఎరుగున్న వాస్తవాల వెనుక ఎరగని మన సామాజిక వ్యవస్థ లక్షణాన్ని  పట్టి చూపిస్తుంది. 25 ఏళ్ల క్రితమే సామ్రాజ్యవాద ప్రపంచీకరణపై కూచిపూడి యక్షగాన ప్రక్రియలో ఎక్కుపెట్టిన ‘అప్పులభారతం’ గురించి వారాల కృష్ణ మూర్తి వ్యాసం ద్వారా పాఠకులు తెలుసుకుంటారు. విద్యా సాగర్ కావ్యం “దిష్టిబొమ్మను” (1995) ఇటీవలి ప్రజాసాహితి పునర్ముద్రించింది. దాన్ని మేడిపల్లి ఈ సంచికలో విశ్లేషించారు. భాషపై, బాల్యంపై, విద్యార్ధి-యువజనులపై, మహిళలపై, మత మౌఢ్యం రూపంలో ప్రపంచీకరణo ఎలా విధ్వంసక పాత్ర నిర్వహిస్తుందో తెలిపే వ్యాసాలిందులో ఉన్నాయి.

“రాజ్యం-రచయితలూ” అన్న సి.హెచ్. మధు వ్యాసం నేటి రచయితలందర్నీ తట్టి లేపుతున్నట్లుగా, ఆలోచించమన్నట్లుగా, మీరెటు వైపూ అని నిలదీస్తున్నట్లుగా వుంటూ – ప్రజల పక్షాన నిలవమని ఆదేశిస్తున్నట్లు సాగుతుంది. సాధారణ సినీ ప్రేక్షకుల దృష్టికి రాని అనేక విశిష్ట డాక్యుమెంటరీలను కోల్‌కతా బాలాజీ తెలుగు పాఠకులకు పరిచయం చేసారు.

గడిచిన 25 ఏళ్లలో ప్రజాసాహితిలో వెలువడిన కొన్ని కథలలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వ్యక్తీకరణల గురించి డా.శాంతి కుమార్ రాస్తే, మహిళల జీవితాలను ప్రభావితం గావించిన కొన్ని కథలను వి. ప్రతిమ విశ్లేషించారు. “ప్రపంచీకరణ-సాహిత్య సాంస్కృతికోద్యమాలు” పై ఎ.కె. ప్రభాకర్ వ్యాసం, “రాజకీయ వ్యవస్థ – దాని సాంస్కృతిక పరిణామాలు” పై సూర్యసాగర్ వ్యాసం, “25 ఏళ్ల ఆర్ధిక పరిణామాలు”పై శశికుమార్ వ్యాసం, గ్రామీణ దళిత, బడుగు వర్గాల జీవితాలను గెంటివేతలకు (విస్థాపన అంటున్నారు) గురి చేస్తున్న విధానాల పై డా. తోట జ్యోతి రాణి వ్యాసాన్ని ఈ సంచికలో చూడగలుగుతాం.

పాపినేని శివశంకర్ రూపొందించిన కొత్త భావనల్ని విశ్లేషించిన కొత్తపల్లి రవిబాబు, ఒక దళితుని ఆత్మ కథను వివరంగా పరిచయం చేసిన జి.వి.భద్రం, నూరేళ్ళనాటి సోవియట్ విప్లవ ప్రభావంతో వెలువడిన భారతీయ కవిత్వం పై రాచపాళెం, దంగల్ సినిమా పై వెన్నెల చేసిన సమీక్ష మొదలైన వ్యాసాలన్నీ కూడా ఈ సంచికలో చూడవచ్చు. గతంలో 2 ప్రత్యేక సంచికలను పునర్ముద్రించిన ఘనత ‘జనసాహితి’ సంస్థకుంది. 1981 నాటి తెలంగాణా పోరాట సాహిత్య సంచిక (41)నూ, ప్రజాకళారూపాల ప్రత్యేక సంచిక (1985 జూన్)ను తిరిగి ముద్రించారు. నిజానికి అలాంటి ప్రత్యేక సంచికలు ఇంకా – ఉదా|| గరికపాటి రాజారావ్ సంచిక, ‘గోర్కి నవల అమ్మ’ పై సంచిక – పునర్ముద్రణ కావాల్సి వున్నాయి. ఇప్పుడు 400 సంచికలనూ సి.డి.ల రూపంలో కూడా విడుదల చేస్తున్నట్లు జనసాహితి ప్రకటించింది. సాహిత్యాభిమానులకూ, సాహిత్య-సామాజిక చరిత్ర పరిశోధకులకూ ఓపిక వున్నంత మేర ఆరగించగలిగే విందును అందుకోవటమే తరువాయి.

(ఆదివారం (19-03-2017) విజయవాడ, హైదరాబాద్, ఒంగోలు, అనకాపల్లి, శ్రీకాకుళంలో ప్రజాసాహితి 400వ సంచిక, 400 సంచికల సి.డి. ల ఆవిష్కరణ సభల సందర్భంగా)  

మరిన్ని వివరాలకు

మంజరి lakshmi
23-22-123, శివాలయం స్ట్రీట్,
సత్యన్నారాయణ పురం, విజయవాడ:520 011
ఫోన్ నెం.:086 2535884
lakshmi manjari <manjari.lakshmi57@gmail.com>


గమనిక: 
ఇప్పటికే ప్రగతిశీల సాహిత్యానికి పెనుగొమ్మగా నిలిచిన సృజన పాతికేళ్ల సంచికలను, అరుణతార 35 ఏళ్ల సంచికలను డీవీడీరూపంలో అందించిన సృజన సాహితీ మిత్రులు, అరుణతార నిర్వాహకులు నాలుగు దశాబ్దాల తెలుగు ఉద్యమ సాహిత్య, సాంస్కృతిక మేధోకృషికి సంబంధించిన చరిత్రను తెలుగు పాఠకులకు శాశ్వత ప్రాతిపదికన అందించి ఎనలేని సహాయం అందించారు. ఇప్పుడు ప్రజాసాహితి మాసపత్రిక 40 సంవత్సరాల సంచికలను రెండు డీవీడీల రూపంలో అందిస్తున్న ప్రజాసాహితి నిర్వాహకులు జ్ఞానాన్ని పాఠకుడికి ముంగిట్లోకి తీసుకువస్తున్న నిరుపమాన ప్రక్రియ క్రమానికి అద్భుతమైన తోడ్పాటునిస్తున్నారు. హైదరాబాద్‌ సాహిత్య మిత్రులు వీలయితే రేపు సాయంత్రం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగనున్న ప్రజాసాహితి 40 ఏళ్ల సంచికల డీవీడీల ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాగలరు.

Thursday, March 2, 2017

అలాంటి వ్యక్తి ఇక లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు: సునయన హృదయవేదన


ప్రేమను పంచే పోరాటంలో ప్రాణాలర్పించి గెలిచావు శ్రీనివాస్: సునయన అత్మవేదన

బరువెక్కిన హృదయంతో నేనీ నాలుగు ముక్కలు రాస్తున్నాను. గత బుధవారం, ఫిబ్రవరి 22, 2017 నాకో కాళరాత్రి. ఆ రోజు నేను నా భర్తను, ఆత్మబంధువును, మిత్రుడిని, అత్యంత నమ్మకస్తుడిని కోల్పోయాను. అతనో స్ఫూర్తి ప్రదాత. సహాయకారి. ఒక్క నాకే కాదు... తనని ఎరిగిన వారందరికీ. ఎవరు ఎదురైనా... ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. తనకంటే పెద్దవారి పట్ల ఇంకా గౌరవభావంతో మెసిలేవాడు. 2006 ఆగష్టులో కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత ‘ఆర్కుట్‌’  ద్వారా పలకరించుకునే వాళ్లం.

తొలి పరిచయంతోనే ఇద్దరమూ ఒకరినొకరం ఇష్టపడ్డాం. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో నేనే చిన్నదాన్ని. చాలా గారాభంగా, స్వేచ్ఛగా పెరిగాను. అమెరికాకు వెళ్లి చదువుకోవాలనే నా కలను నిజం చేసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని నాకు శ్రీనివాసే ఇచ్చాడు. నేనీ రోజు ఇలా స్వత్రంత్య భావాలు కలిగిన వ్యక్తిగా, సొంత కాళ్లపై నిలబడగల, ధైర్యమున్న మహిళగా ఎదగడానికి అమెరికాలో చదువు దోహదపడింది. గత ఏడాది మే నెల నుంచే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం రావడంలో శ్రీనివాస్‌ది ముఖ్యపాత్ర. ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడు. నిరాశపడ్డప్పుడల్లా వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాడు. ఎందుకంటే నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ఉద్యోగ జీవితం మొదలుపెట్టాను.

విమానయాన రంగంలో నిరంతరం కొత్త ఆవిష్కరణల కోసం తపించేవాడు. రాక్‌వెల్‌ కోలిన్స్‌ కంపెనీలో చేరడం ద్వారా శ్రీనివాస్‌ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌పై పనిచేసేవాడు. ప్రాథమిక ఫ్లైట్‌ కంట్రోల్‌ కంప్యూటర్‌ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. రాత్రి భోజనం కోసం ఇంటికి వచ్చి, అది కాగానే ఆఫీసుకు వెళ్లిపోయిన రోజులు చాలానే ఉన్నాయి. అలా వెళ్లి మళ్లీ ఏ రెండింటికో, మూడింటికో తిరిగివచ్చేవాడు. రాక్‌వెల్‌లో ఉద్యోగంతో చాలా సంతోషంగా ఉండేవాడు. అయోవాలోని చిన్న పట్టణం సెడార్‌ రాపిడ్స్‌లో ఉండటానికి కూడా ఇష్టపడ్డాడు. అయితే నేను ఉద్యోగం సంపాదించడానికి, నా కలలను సాకారం చేసుకోవడానికి పెద్ద పట్టణానికి మారాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. మరో ఆలోచన లేకుండా వెంటనే కాన్సస్‌ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. ఎన్నో కలలతో కాన్సస్‌లో అడుగుపెట్టాం. సొంతింటి కలను నేరవేర్చుకున్నాం. ఈ ఇంటికి శ్రీనివాస్‌ స్వయంగా రంగులేశాడు... గ్యారేజీకి తలుపు బిగించాడు. ఇంటికి సంబంధించిన ఏ పనినైనా అతనెంతో ఇష్టపడి చేసేవాడు. అందులో ఎంతో సంతోషం పొందేవాడు. మా కోసం, మాకు పుట్టబోయే బిడ్డల కోసం అతను కట్టిన ఇల్లు ఇది. మాకంటూ చిన్ని కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి వేసిన తొలి అడుగు.

దురదృష్టమేమింటే... ఇప్పుడీ కల చెదిరిపోయింది. మా ఆశలు, ఆకాంక్షలు, కలలు అన్నీ చెదిరిపోయాయి... ఒకే ఒక వ్యక్తి మూలంగా. తన చర్యవల్ల బాధిత కుటుంబంపై పడే ప్రభావం ఏమిటనేది అతను ఆలోచించని మూలంగా. ఆ రోజు రాత్రి పోలీసులు మా ఇంటి తలుపులు తట్టి... ఎవరో ఆగంతకుడు తుపాకీతో నా భర్త ప్రాణాలు తీశాడని చెబుతుంటే నేను నమ్మలేకపోయా. ‘మీరు చెబుతున్నది వాస్తవమేనా మీరు శ్రీనివాస్‌ను చూశారా తనను గుర్తుపట్టడానికి నాకేదైనా ఫోటోను చూపించగలరా మీరు మాట్లాడుతున్నది ఆరు అడుగుల రెండు అంగుళాలు ఉండే వ్యక్తి గురించేనా అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నా. అన్నింటికీ పోలీసులు తలూపుతూ... ‘అవును’ అనే సమాధానం ఇచ్చారు. వెంటనే డల్లాస్‌లో ఉంటున్న శ్రీనివాస్‌ తమ్ముడికి ఫోన్‌ చేశా. నమ్మలేదు... నేనేదో జోక్‌ చేస్తున్నానని అనుకున్నాడతను. తమ ఆప్త మిత్రుడిని, అత్యంత సన్నిహితుడికి కడసారి వీడ్కోలు పలకడానికి అయోవా, మిన్నెసోటా, సెయింట్‌ లూయిస్, డెన్వర్, కాలిఫోర్నియా, న్యూజెర్సీల నుంచి మిత్రులు వచ్చారు. న్యూయార్క్, న్యూజెర్సీలో ఉండే అతని ఆంటీలు వచ్చారు. ఈ మార్చి తొమ్మిదికి తను 33వ ఏట అడుగుపెట్టేవాడు. తన కజిన్‌ ఎంగేజ్‌మెంట్‌ కోసం న్యూజెర్సీకి విమానంలో వెళ్లొద్దామని మేము ప్లాన్‌ చేసుకున్నాం. ఈ ట్రిప్‌ కొరకు వీకెండ్‌లో షాపింగ్‌ చేయాలని కూడా అనుకున్నాం. కానీ జరిగింది మరొకటి. నేను భారత్‌కు ప్రయాణమయ్యాను. శవపేటికలో తనని తీసుకొని.

ఆరేళ్ల స్నేహం తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. అదంత తేలికగా ఏమీ జరగలేదు. వాళ్ల తల్లిదండ్రులతో పాటు మా అమ్మానాన్నలను కూడా అతనే ఒప్పించాల్సి వచ్చింది. మీ ప్రియమైన కూతురిని బాగా చూసుకోగలనని, తగినవాడినని చెప్పి పెళ్లికి ఒప్పించడానికి పలుమారు మా కుటుంబీకులను కలిశాడు. అడిగిన ప్రశ్నలన్నింటికీ ముఖంపై చిరునవ్వుతో సమాధానాలిచ్చాడు. ఆయన సమ్మోహన శక్తి ఎలాంటిదంటే... అనతికాలంలోనే మా కుటుంబంలో అందరికీ అత్యంత ఆప్తుడైపోయాడు. అలాంటి వ్యక్తి ఇక లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. చిన్న చిన్న వాటిల్లోనే సంతోషం పొందేవాడు. టీవీ చూడటం ఆయనకు అత్యంత ఇష్టమైన కాలక్షేపం. కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వ్యక్తి. ఇంట్లో వండినవి తినడమే ఆయనకిష్టం. ప్రతిరోజు రాత్రి... మరుసటి రోజు లంచ్‌కు మాకిద్దరికీ బాక్స్‌లను సిద్ధం చేసేదాన్ని. బాక్స్‌ సర్దుకోవడం అస్సలు ఇష్టముండేది కాదతనికి. ఎందుకలా... అని అడిగితే సరదాగా ఉండే వివరణలు ఇచ్చేవాడు. నా లంచ్‌ బాక్స్‌ నేనే సర్దుకుంటే... ఏ తినబోతున్నానో ముందే తెలుస్తుంది. అదే నువ్వు ప్యాక్‌ చేశావనుకో... ఈరోజు లంచ్‌లో ఏముందో అనే ఆసక్తి నాకుంటుంది అనేవాడు. ఆప్యాయంగా భోజనం పెట్టిన వారినీ ‘అన్నదాతా సుఖీభవ’ అని మనసారా దీవించేవాడు. చాలామంది మిత్రులకు శ్రీనివాస్‌ నుంచే ఈ అలవాటు వచ్చింది. లంచ్‌లో ఆర్నబ్‌ గోస్వామిని ఎంజాయ్‌ చేసేవాడు. మళ్లీ ఎప్పుడు టీవీ తెరపై కనిపిస్తాడా అని ఎదురుచూస్తుండే వాడు.

పిల్లలంటే తనకెంతో ఇష్టం. పిల్లలను కనాలనే ఆలోచనతో ఉన్నాం. కొన్ని వారాల కిందటే డాక్టర్‌ను కలిశాం కూడా. ‘నానీ (తను నన్నలా పిలేచేవాడు)... కృత్రిమ గర్భధారణకు వెళ్లాల్సి వస్తే... దానికోసం డబ్బు దాచాలిరా’  అని అన్నాడు. తను నాతో పంచుకొన్న కొన్ని చివరి ఆలోచనల్లో ఇదొకటి. మా ఈ కల చెదిరిపోయిందనేది ఇప్పుడిప్పుడే నాకు జీర్ణమవుతోంది... అందుకే రాస్తున్నాను. మాకో బిడ్డ ఉంటే... తనలోనైనా శ్రీనివాస్‌ను చూసుకునే దాన్ని. శ్రీనులా పెంచేదాన్ని. చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై ఆసక్తి ఉండేది. రోజూ టీవీలో వార్తలు చూడటం, పత్రికలు చదవడం చేసేవాడు. భారత్‌ గురించి, నరేంద్ర మోదీ గారి గురించి గర్వంగా ఫీలయ్యేవాడు. దేశానికి సమర్థ నాయకత్వం లభించిందనే భావనతో ఉండేవాడు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ విదేశాల్లో ఉన్న భారతీయులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించే తీరు తనకు నచ్చేది. అలా సహాయం పొందే వాళ్లలో తాను ఒకడినవుతానని ఊహించి ఉండడు. కష్టకాలంలో మాకు సహాయపడ్డందుకు మరోసారి ధన్యవాదాలు మేడమ్‌. మిమ్మల్ని, మోదీ గారిని కలిసి మా ఇరువురి తరఫున కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను.

ఇమ్మిగ్రేషన్‌ విధానం, చట్టాల గురించి ఆందోళన చెందేవాడు. ఇంటర్నెట్‌లో ఈ అంశాలను చాలా ఆసక్తితో చదివేవాడు. అమెరికా శాశ్వత నివాస కార్డు కోసం దరఖాస్తు చేసి ఏళ్లు గడిచిపోతోంది... ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో అని అప్పుడప్పుడు అనేవాడు. హెచ్‌–1బీ వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుకల్పించే హెచ్‌4 ఈఏడీ రూల్‌ చట్టసభల ఆమోదం పొందినపుడు ఎంత సంతోషించాడో. ‘నానీ... నువ్వు ఇక ఉద్యోగం చేయవచ్చురా. మనకు డబ్బు అవసరం ఉందని కాదు. నువ్వు నీ కలలను సాకారం చేసుకునేందుకు... నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయడానికి’ అని అన్నాడు. తక్కువ ఆదాయంతో ముగ్గురు మగపిల్లలను పెంచడానికి వాళ్ల తండ్రి బాగా కష్టపడ్డాడని రోజుకు ఒకసారైనా గుర్తుకు చేసుకునేవాడు. తల్లిదండ్రులకు ఎంతో చేయాల్సి ఉందనేవాడు.

‘నేనొకటి కచ్చితంగా చెప్పగలను శ్రీను... నువ్వు మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదిగావు. కానీ నువ్విలా మమ్నల్ని విడిచి వెళ్లకుండా ఉండాల్సింది’. ముగ్గురు పిల్లల్లో శ్రీను రెండోవాడు. తనకు తమ్ముడంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ముగ్గురూ బాగా అల్లరి చేసేవారంట. ఇదివరకు ప్రెస్‌మీట్లో చెప్పినట్లుగా... ఎవరైనా హత్యకు గురయ్యారనే వార్త విన్నపుడల్లా ఇక్కడి నుంచి వెళ్లిపోదామా అని అడిగేదాన్ని. ‘మన ఆలోచనలు మంచిగా ఉంటే, మనం సత్ప్రవర్తనతో నడుచుకుంటే... మనకు మంచే జరుగుతుందని, మనకేం కాదు అని ప్రతిసారీ ధైర్యం చెప్పేవాడు. నన్ను గట్టిగా హత్తుకొని పడుకొనేవాడు... శ్రీను ఆ ఆత్మీయ ఆలింగనం, నేనున్నాననే భరోసా... నాకిప్పుడు లేవు. నాకిక మునుపటిలా నిద్ర రాదేమో! ఎలాంటి ఆందోళన, భయం లేకుండా నేను హాయిగా నిద్రపోయేది ఒక్క నీ ఎదపైనే.

కాన్సస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎంతోమంది నన్ను గుర్తుపట్టారు. ఆలింగనం చేసుకొని ఓదార్చారు. నా జీవిత పరమార్థాన్నే మార్చేశావని ఓ డెర్మటాలజిస్టు అంది. ప్రేమను పంచే పోరాటంలో అది తొలి విజయమేమో. నీ గురించి... చుట్టుపక్కల ఉన్న వారికి నువ్వు పంచిన ప్రేమ గురించి ఓ పుస్తకం రాసినా సరిపోదేమో. ఒకే సాయంత్రంతో అంతా మారిపోయింది. భార్య నుంచి వితంతువును అయిపోయాను. ఈ నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. శ్రీను... నా ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... ఎప్పటికీ నీ ఆశలను, ఆశయాలను ఓడిపోనివ్వను.

ఐ లవ్‌ యూ, నువ్వు ఎప్పటికీ నా వాడివే.

టీ తాగడానికి ఇంటికి రమ్మని పిలిచినపుడు నీవు వచ్చుంటే బాగుండని అనుకుంటున్నాను. నాలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి. వాటికి నువ్వు జవాబివ్వాలని కోరుకుంటున్నాను. అవతలి ప్రపంచంలో నీవున్న చోటికి నేను వచ్చినప్పుడే నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు.

గార్మిన్‌ సీఈఓవోకు, శ్రీను సహచరులకు, ఓలేత్‌ నగర మేయర్‌కు, కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను పనిచేస్తున్న ఇన్‌టచ్‌ సొల్యూషన్స్‌ సీఈవో ఫ్రాంక్‌కు ధన్యవాదాలు. ఎంతకాలమైనా సెలవు తీసుకోమని, ఎప్పుడొచ్చినా... నా ఉద్యోగం నాకు ఉంటుందని చెప్పారాయన. నేను అమెరికాలో కెరీర్‌ను నిర్మించుకోవాలనేది నా శ్రీను కల. దానిని నెరవేర్చడానికి నేను అమెరికా తిరిగి రావాలి. నా భర్తను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి కాల్పుల్లో గాయపడ్డ ఇయాన్‌ గ్రిలాట్‌ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నాను. ఓలేత్‌కు తిరిగివచ్చాక మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్నాను. గ్రిలాట్‌ సాటి మనిషిని కాపాడటానికి మీరు చేసిన ప్రయత్నం, మీరు ప్రదర్శించిన మానవత్వం... ప్రేమపై, ప్రేమను పంచడంపై నాలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచాయి. ట్వీట్ల ద్వారా మద్దతు పలికిన సత్య నాదెళ్ల, కమలా హారిస్‌లకు కృతజ్ఞతలు. మార్క్‌ జుకెర్‌బర్గ్, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ లాంటి వారందరికీ నా విన్నపం ఒకటే... మానవ హక్కులకు మీ మద్దతును వీలైనంతగా జనంలోకి తీసుకెళ్లండి. ద్వేషాన్ని ఆపాలి... ప్రేమను వ్యాపింపజేయాలి. ఈ రోజు గార్మిన్‌ ఉద్యోగికి జరిగింది... రేపు మీ ఉద్యోగుల్లో ఒకరు కావొచ్చు. మా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను.

శ్రీనివాస్‌ పార్థివదేహం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరేలా చూసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అమితాబచ్చన్‌ సర్, షారూక్‌ ఖాన్‌ సర్‌... మేము మీకు వీరాభిమానులం. ప్రేమను పంచాలనే గట్టి సందేశాన్ని అందరికీ చేరవేయడానికి నాకు మీ మద్దతు కావాలి. నేను అదే ప్రశ్న మళ్లీ అడుగుతాను. చర్మం రంగును బట్టి ఒక మనిషి మంచివాడో, చెడ్డవాడో ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు కొంతకాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుంది. కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారు. ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి నిరంతర పోరాటం జరగాలి. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రతి వలసదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్న... మేమీ ప్రాంతానికి చెందిన వాళ్లమేనా? చివరగా దీనికి సమాధానం కావాలి. ఇది మేము కలలు గన్న దేశమేనా? పిల్లలు, కుటుంబంతో కలిసి నివసించడానికి ఇది సురక్షితమేనా

– సునయన దుమాలా
అమెరికాలోని కాన్సస్‌ రాష్ట్రంలో ఫిబ్రవరి 22న జరిగిన ద్వేషపూరిత దాడిలో ప్రాణాలు కోల్పోయిన కూచిబొట్ల శ్రీనివాస్‌ అర్ధాంగి.
(28–02–2017లో తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో చేసిన పోస్ట్‌)
https://www.facebook.com/sunayana.dumala/posts/1254788961284812


సునయన రాసిన ఇంగ్లీషు పాఠానికి తెలుగులో అన్ని పత్రికలూ ఇప్పటికే తమ స్పేస్ పరిధుల్లో పూర్తిగానూ, సంక్షిప్తంగానూ అనువాదం చేసి ప్రచురించాయి. ఇక్కడ పొందుపర్చిన అనువాదం వీలైనంత సంపూర్ణంగా ఉంది. (పూర్తిగా అని కాదు).

పూర్తి పాఠం చూడాలంటే పైన పొందుపర్చిన ఆమె ఫేస్ బుక్ తొలి పోస్టు లింకును చూడండి. సాంత్వనగా కాస్త సానుభూతి కూడా తెలిపితే మరీ మంచిది

https://www.facebook.com/sunayana.dumala/posts/1254788961284812


ప్రజల మనసుల్లో ద్వేషాన్ని రూపుమాపేందుకు ఎంత పోరాటం చేయాలి: సునయన ప్రశ్న

హైదరాబాద్, గురువారం, 2 మార్చి 2017 (03:45 IST)
చర్మం రంగును బట్టి ఒక మనిషి మంచివాడో, చెడ్డవాడో ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు కొంతకాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుంది. కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారు. ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి నిరంతర పోరాటం జరగాలి. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రతి వలసదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్న... మేమీ ప్రాంతానికి చెందిన వాళ్లమేనా? చివరగా దీనికి సమాధానం కావాలి. ఇది మేము కలలు గన్న దేశమేనా? పిల్లలు, కుటుంబంతో కలిసి నివసించడానికి ఇది సురక్షితమేనా
ఓ కాళరాత్రి అమెరికాలో జాతి వివక్షా ఉన్మాద చేష్ట్య కారణంగా తన జీవన సహచరుడిని పోగొట్టుకున్న సునయన యావత్ ప్రపంచానికి వినిపిస్తున్న ఇది. తన భర్తను బలిగొన్న ఘటనల వంటివి జరిగినప్పుడు కొంత కాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుందనీ, కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారనీ.. కానీ ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి ఎంత పోరాటం జరగాలి అని ప్రశ్నిస్తున్నారామె. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వాలు ఏం చేయబోతాయి అని నిలదీస్తున్నారామె.

ఒకే ఒక వ్యక్తి మూలంగా. తన చర్యవల్ల బాధిత కుటుంబంపై పడే ప్రభావం ఏమిటనేది అతను ఆలోచించని మూలంగా ఒకే సాయంత్రంతో అంతా మారిపోయింది. మా ఆశలు, ఆకాంక్షలు, కలలు అన్నీ చెదిరిపోయాయి...  భార్య నుంచి వితంతువును అయిపోయాను. ఈ నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. శ్రీను... నీ ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియటం లేదని విలపిస్తున్న సునయన వ్యక్తిగత జీవితంలో తన ప్రమేయం లేకున్నప్పటికీ ఓడిపోయిన నిస్సహాయ క్షణాల్లో కూడా ప్రపంచాన్ని శపించలేదు. తన కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని కోరుకుంటోందామె.

బండగుండెల ట్రంప్ జాతి వివక్షకు ఇస్తున్న కొత్త నిర్వచనం సాక్షిగా అమరికాలో పెరిగిపోతున్న ఉన్మాదాన్ని సవాలు చేస్తూనే తన భర్త ప్రాణాలు కాపాడటానికి ప్రాణం అడ్డువేసిన సాటి అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిలాట్ ప్రేమను పంచడంపై తనలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతున్నాడని కృతజ్ఞతలు చెబుతున్నారు సునయన. నా భర్తను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి కాల్పుల్లో గాయపడ్డ ఇయాన్‌ గ్రిలాట్‌ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నాను. ఓలేత్‌కు తిరిగివచ్చాక మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్నాను. గ్రిలాట్‌.. సాటి మనిషిని కాపాడటానికి మీరు చేసిన ప్రయత్నం, మీరు ప్రదర్శించిన మానవత్వం... ప్రేమపై, ప్రేమను పంచడంపై నాలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచాయి.
ట్వీట్ల ద్వారా మద్దతు పలికిన సత్య నాదెళ్ల, కమలా హారిస్‌లకు కృతజ్ఞతలు చెబుతూనే ప్రపంచ సాంకేతిక దిగ్గజ సంస్థల సీఈఓలను ద్వేషాన్ని ఆపి ప్రేమను వ్యాపింపజేసే మృదు సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లవలసిందిగా ఆమె అభ్యర్థిస్తున్నారు.

"మార్క్‌ జుకెర్‌బర్గ్, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ లాంటి వారందరికీ నా విన్నపం ఒకటే... మానవ హక్కులకు మీ మద్దతును వీలైనంతగా జనంలోకి తీసుకెళ్లండి. ద్వేషాన్ని ఆపాలి... ప్రేమను వ్యాపింపజేయాలి. ఈ రోజు గార్మిన్‌ ఉద్యోగికి జరిగింది... రేపు మీ ఉద్యోగుల్లో ఒకరు కావొచ్చు. మా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను."

జీవనలత ఒక్కసారిగా కళ్లముందే వాడిపోయిన భయవిహ్వల క్షణంలోనూ గుండె దిటవు  చేసుకుని తన జీవన సహచరుడు శ్రీనివాస్ ఆకాంక్ష మేరకు అమెరికాలోనే కెరీర్ నిర్మించుకోవడానికి తప్పకుండా ఆ దేశానిని మళ్లీ వెళతానని సునయన చేబుతున్నారు. శ్రీను... నీ ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... ఎప్పటికీ నీ ఆశలను, ఆశయాలను ఓడిపోనివ్వను అంటూ శపథం చేస్తున్నారు.
అమెరికాలోనే కాదు... భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెరిగిపోతున్న విద్వేష భావనలను, వాటిని ఎగవేస్తున్న సంకుచిత రాజకీయాలను సునయన ఆత్మ ఘోష మారుస్తుందా.. మానవత్వానికి ఆమె ఇస్తున్న నిలువెత్తు నిర్వచనాన్ని ఈ ప్రపంచం ఏనాటికైనా తనదిగా చేసుకుంటుందా?

బరువెక్కిన హృదయంతో నేనిలా రాస్తున్నా  (లేదా)
అశ్రు‘నయన’ ప్రశ్న
http://www.sakshi.com/news/hyderabad/kuchibhotla-srinivas-wife-sunayana-facebook-post-454360?pfrom=home-top-story 

కొండంత అండను కోల్పోయాను... కన్నీళ్లు పెట్టిస్తున్న సునయన ఫేస్‌బుక్ పోస్ట్
http://www.andhrajyothy.com/artical?SID=376360

ప్రేమను పంచే పోరాటంలో ప్రాణాలర్పించి గెలిచావు శ్రీనివాస్: సునయన అత్మవేదన
http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/kuchibhotla-srinivas-wife-sunayana-facebook-post-117030200002_1.html

Kansas shooting: Hyderabad techie's wife Sunayana prefers to return to ground zero
http://timesofindia.indiatimes.com/city/hyderabad/kansas-shooting-sunayana-prefers-to-return-to-ground-zero/articleshow/57421953.cms