Pages

Thursday, April 30, 2020

విద్వేష రహిత భారత్‌‌ నా స్వప్నం - ఎమిరేట్స్ యువరాణి సందేశం



గల్ఫ్ న్యూస్‌ పత్రికలో "I pray for an India without hate and Islamophobia" అనే పేరిట  ప్రచురితమైన ఎమిరేట్స్ యువరాణి షెకా హింద్ ఖసేమీ వ్యాసానికి ఇది పూర్తి అనువాదం. సాక్షి పత్రికలో స్పేస్ పరిమితుల రీత్యా కాస్త తగ్గించి ఈ గురువారం సంచికలో ప్రచురించడమైంది. భారతదేశం గురించి హృదయం నిండా ప్రేమను పెంచుకున్న ఒక గల్ఫ్ యువరాణి తాజా సందేశాన్ని పాఠకులకు అందించడం కోసం ఇంతకన్నా మించిన తరుణం ఉండదనే ఉద్దేశమే ఈ వ్యాసం అనువాదానికి, ప్రచురణకు మూలం.

మహావిష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన ఒక కమలంపై బ్రహ్మ కూర్చుని ఉంటాడు. బ్రహ్మ ఆ పుష్పాన్ని స్వర్గం, భూమి, ఆకాశం అనే మూడు భాగాలుగా వేరుచేశాడు. ఒంటరితనం తాళలేని బ్రహ్మ తనను తాను రెండుగా వేరుపర్చుకుని ఒక పురుషుడిని, ఒక స్త్రీని సృష్టించాడు. వీరినుంచే ప్రాణులన్నీ సృష్టించబడ్డాయి.

ఒక భారీ కమలం ఆకారంలోని రంగస్థలం మధ్యలో నేను ఇజ్రేలీ సెనేటర్‌కు ఎదురుగా కూర్చుని ఉన్నాను. ఆమె 'టియర్స్ ఆఫ్ ఏ జ్యూయిష్ విమన్' (యూదు మహిళ కన్నీళ్లు) పుస్తక రచయిత్రి. అంతకుముందు ఎన్నడూ నేను యూదు వ్యక్తిని కలిసి ఉండలేదు. అందులోనూ ఆమె యూదు మత సమర్థకురాలు, ఇజ్రేలీ పార్లమెంట్ సభ్యురాలు కూడా. తాను ఎదురుపడినప్పుడు కాస్త భయపడ్డాను. కానీ ప్రశాంతంగా కూర్చున్నాను. మేమిరువురం క్లుప్లంగానే మాట్లాడుకున్నాం. ఎందుకంటే బెంగళూరు ఆశ్రమంలో యోగాను కొత్తగా ప్రాక్టీసు చేసేవాళ్లం. ఆమె తనను మళ్లీ కలవమని చెప్పారు. నేను కూడా తనను మరోసారి కలవాలని ఆశించాను.

బెంగళూరు ఆశ్రమంలో యోగాభ్యసనం ద్వారా ఆనందం పొందడం కోసం ప్రపంచమంతటినుంచి వచ్చి నిరాడంబరంగా కూర్చుని ఉన్న అనేకమంది వ్యక్తులను కలిసి నేను ఆనందించాను, కొత్త జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఆశ్రమంలో ఉన్నంతకాలం మేం శాకాహారులుగానే ఉన్నాం. నాకు మాంసాహారం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు కాబట్టి అక్కడి అలవాటు నాకు ఏమంత ఇబ్బంది కలిగించలేదు. హార్వార్డ్ పట్టభద్రుడైన నా డాక్టర్ మిత్రుడు అక్కడ నన్ను కలుసుకున్నాడు. ఆ గ్రామంలోని చీరలషాపులో చీరలు, నుదుటి బొట్టు, చెవిదిద్దుల కోసం వెతుకుతూ కొంత సమయం గడిపాం.

నా గురించి నేను ఎప్పుడు పరిచయం చేసుకున్నా జనం నన్ను చిరునవ్వుతూ పలకరించేవారు. హింద్ అనే పేరు కలిగిన ఒక అరబ్ యువరాణిని కలుసుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి ప్రదర్శించేవారు. వారు నా రాణిత్వం గురించి అడిగేవారు. నేను చిరునవ్వుతోనే జవాబిచ్చేదాన్ని. తెల్లవారుజామునే నిద్రలేచి, ఉదయం యోగా సెషన్స్ కోసం ఆశ్రమంలోని హాలుకు వెళ్లేవాళ్లం. అది నిజంగా ఒక తీర్థయాత్ర లాంటిది. మీరు ఎంత నిరాడంబరంగా జీవించవచ్చో తెలిపే ప్రయాణం అది. సాధారణమైన చెప్పులు, పలుచటి నూలుదుస్తులు ధరించేవారం. కానీ నేను మాత్రం కాటుక, బొట్టు, అరబ్ సెంటును కూడా వాడేదాన్ని. ఆ గ్రామంలో ప్రపంచమంతటి నుంచి వందలాది మంది వ్యక్తులు వచ్చి ఉండేవాళ్లు. యోగా సభ్యులు ఇచ్చే విరాళాలతో అక్కడ ఒక అనాథాశ్రమం నడిపేవారు. అక్కడే ఐటీ కోసం భవంతులు, సర్వీసులు కూడా నిర్వహించేవారు. అక్కడే ఒక స్పాతో కూడిన రిసార్టు కూడా ఉండేది.

ఆధునిక ఊహాస్వర్గం
ఆ ఆశ్రమంలో నా అమెరికన్ స్నేహితుడు, నేను కలిసి ప్రజలు.. వారి గాథలు.. ఆవిష్కరణల సంపదల గురించి తెలుసుకునేవారం. అక్కడ వివక్ష కలికానికి కూడా కనిపించేది కాదు. అది నిజంగానే ఆధునిక కాలపు ఊహాస్వర్గాన్ని గుర్తు తెచ్చేది. అనేకమంది రాయబారులు, వారి భార్యలతో కలిసి నేను ఆశ్రమ గురువును కలిసి ఆనందించేదాన్ని. మతం ఒక అనవసరమైన అంశమని వారంతా పదే పదే చెప్పేవారు. అది సామరస్యంగా జీవించే కళను తిరిగి ఆవిష్కరించిన ఒక సాధారణ ప్రపంచం.

మీ జాతి, మతం, ప్రాంతంకి పూర్తి భిన్నమైన వ్యక్తుల సమూహంతో జీవించగలగడం నిజంగా ఒక పర్వదినం లాంటిదే. నా కొత్త గ్లాస్ స్లిప్పర్స్ ధరించి అక్కడున్న బ్యాలేకి వెళ్లేదాన్ని. ఒక విముక్తిని పొందిన భావనతో.. ఎలాంటి వివక్ష, విద్వేషం లేకుండా నిరాడంబరంగా జీవించే అనుభవం కోసం కనీసం ఒక్కరోజయినా  ప్రతి ఒక్కరూ ఆ అశ్రమంలో గడపాలని నేను సిఫార్సు చేస్తున్నాను. మీకు వినయం అనే గ్రంథి ఇచ్చే ప్రతి దాన్నీ విద్వేషం ఓడిస్తుంది. నేను అక్కడి వాతావరణానికి దాసోహమైపోయానని అంగీకరిస్తున్నా. ప్రేమించడం అనే మత్తులో గడిపాను.

మీ హృదయం తెరుచుకున్నప్పుడు అక్కడ విద్వేషానికి మరి చోటు ఉండదు. అనేక కారణాల వల్ల మనకు ఆగ్రహం కలగవచ్చు కానీ దాన్ని మీ పడకగది వరకూ తీసుకు పోవద్దు. విషయాలను తేలిగ్గా చూసే కళే నిజంగా జీవించడానికి అనువైన కళ. అయితే పోరాడేందుకు అవసరమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి కానీ, స్వభావసిద్ధం గానే ఒక పారిశ్రామిక, ఉత్పాదక వ్యక్తినైన నేను పరిష్కారాల కోసమే చూస్తాను తప్ప సమస్యలను సాగదీస్తూ కాలాన్ని వ్యర్థం చేయడాన్ని ద్వేషిస్తాను. నేను సమాధానాలు కనుగొనడాన్ని ఇష్టపడతాను. ఆగ్రహం, పాతుకుపోయిన దురభిప్రాయాలు అనేవి మునిగిపోతున్న నావ చుక్కాని లాంటివి.

ఎమిరేట్స్ ప్రజలకు, భారతీయులకు మధ్య విచ్ఛిన్నం చేయడానికి వీలుకాని బంధం ఒకటి ఏర్పడి ఉంది. ఇది ఇతరులకు అర్థం కాకపోవచ్చు. మా చుట్టూ, మా ఇళ్లలో అరబ్బుల కంటే భారతీయ పిల్లలే ఎక్కువగా ఉంటూవచ్చిన వాతావరణంలో మేం పెరుగుతూ వచ్చాం. కాబట్టి మా డీఎన్ఏలో తిరస్కరించడానికి వీలులేని అనుబంధం, ఆపేక్ష ఉంటూ వస్తోంది. మా రోజువారీ భాష కూడా మా సొంత ఆచారాలనుంచి పుట్టుకొచ్చిన పదాల నుంచే అరువు తెచ్చుకునేది.

నేను అభివృద్ది చెందుతున్న దేశాల్లో స్వావలంబన అనే అంశంపై పీహెచ్‌డి చేస్తున్నాను. దేశాలు తమ శక్తి ఎక్కడుందో గ్రహించి, దానికోసమే ప్రయత్నించి, తమ బలహీనతలను సర్దుబాటు చేసుకోవడం, తమముందున్న అవకాశాలను గుర్తించడం, తమకు ఎదురవుతున్న ప్రమాదాలను తటస్థం చేయడం గురించిన పరిశోధన అది. భారత్ కూడా ఇలాంటి దేశాల్లో ఒకటి. ఒక పేద వ్యవసాయ దేశం నుంచి నేడు సూపర్ పవర్‌గా ఎదిగిన దేశమది. సింగపూర్, దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్ కూడా ఈ కోవలోకే వస్తాయి. నేను ప్రేమించే నా స్వదేశం యూఏఈ కూడా ముత్యాలు ఏరుకునే కొన్న గ్రామాల సమూహంగా ఉండి, కొత్తగా కనుగొన్న చమురు నిక్షేపాలతో సంపన్న దేశంగా మారి ఒక సంతోషకమైన, సంవద్వంతమైన జాతిగా ఆవిర్భవించింది. మా దేశంలో 33 లక్షలమంది భారతీయులు ఆతిథ్యం పొందుతూ స్వదేశంలోని తమ కుటుంబాలకు ఏటా 17 బిలియన్ డాలర్లను పంపుతున్నారు.

మతసహనపు తారాస్థాయి
నేను పైన పేర్కొన్న దేశాలు ఏవీ మార్గదర్శకత్వం లేకుండా ఎదిగినవి కావు. వీటిలో ప్రతి దేశం కూడా అభివృద్ధి విత్తనాలను నాటిన ఒక విజ్ఞత కలిగిన నాయకుడిని కలిగి ఉండేది. వారి విజ్ఞత వల్లే రెండు తరాల తర్వాత మా శ్రమ ఫలితాన్ని ఈరోజు మేం అందుకుంటున్నాం. మతపరమైన సామరస్యపు ఔన్నత్యమే ఈ దేశాల్లో అపారమైన అభివృద్ధికి తావిచ్చిందని కొంతమంది చెబుతుంటారు కూడా. విద్య, ఆరోగ్యం, సామాజిక పెట్టుబడి, భద్రత, అవకాశం, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యతత్వం అనేవి ఈరోజు ఏ దేశానికైనా విజయాన్ని సాధించే వ్యూహంలో అంతర్భాగాలుగా ఉంటాయి.

గాంధీ మ్యూజియాన్ని సందర్శించి ఆనాడు యుద్ధాన్ని నిలిపివేయాలని హిట్లర్‌ను కోరుతూ గాంధీ రాసిన ఉత్తరాన్ని చదివి నేను ఆయన జీవిత చరిత్ర గ్రంథాన్ని కొనుక్కున్నాను. భారత్‌కు కావలసింది విద్య, టాయెలెట్లు (ఇవి మహిళ ఆరోగ్యానికి, భద్రతకు తొలిమెట్టు) అని ఆయన నొక్కి చెప్పారు. పైగా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నవి కాకుండా భారతీయ నూలు వస్తాలను మాత్రమే వాడాలని చెప్పారు. స్వదేశీ ఉత్పత్తులు వాణిజ్యంలో పోటీకి అవకాశమిచ్చి ఆర్థిక వ్యవస్థను పెంచిపోషించేవి. ఆయన దూరదృష్టికి నిజంగా జోహార్లు చెప్పాలి.

పాలనకు సంబంధించిన నాణ్యత అనేది కొనసాగింపు తత్వానికి హామీనిచ్చే పజిల్‌లో చివరి ముక్కలాంటింది. రోమ్ నిర్మాణం ఒక్కరోజులో జరగలేదు. గాంధీ కార్యాచరణను ఒకటి రెండు తరాల తర్వాతే చూడగలిగేవాళ్లం. శాంతి సాధన విషయంలో గాంధీ ప్రాపంచిక దృక్పథాన్నే నెల్సన్ మండేలా అనుసరించారన్న విషయం మర్చిపోవద్దు. గాంధీ భారత విముక్తి ప్రదాత అనే విషయాన్ని ఇప్పుడు ఎవరూ వ్యతిరేకించలేరు. భారతదేశం గురించి ఇంత అనురక్తితో మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. అది పాలు, తేనెతో కూడిన దేశం. నా సంస్కృతిలో ఒక సామెత ఉంది. మీరు భారత్ పాలు తాగినట్లయితే ఆ దేశమే మీ మాతృమూర్తి అవుతుందని మా వాడుకలో ఉంది.

నాజీయిజం మారణకాండకు కారణమైన విద్వేష ప్రచారం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదని కొత్తగా పుట్టుకొచ్చిన ఈ శక్తిమంతులైన కోటీశ్వరులు గ్రహించడం లేదా? విద్వేష ప్రచారాన్ని విషంలాగా పెంచి పోషించారు. ఇప్పుడు భారత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో 18 కోట్లమంది ముస్లింలు జీవిస్తున్నారు. "ముస్లింలు, క్రిస్టియన్లు 2021 డిసెంబర్ 31 నాటికి భారత్ నుంచి తుడిచిపెట్టేస్తాం' అంటూ బీజేపీ, ఆరెస్సెస్ నేత రాజేశ్వర్ సింగ్ చెబుతున్న మాటలు విద్వేష ప్రచారానికి అసలు సిసలు నమూనాలు.

ప్రపంచానికి మరో హిట్లర్ అవసరం లేదు..
నేటి ప్రపంచానికి కొత్తగా మరొక హిట్లర్ అవసరం లేదు. కానీ దానికి మార్టిన్ లూథర్, నెల్సన్ మండేలా, గాంధీ వంటి ధోరోదాత్త నాయకులు కావాలి. మీ సోదరుడిని చంపడం మిమ్మల్ని హీరోని చేయదు. విద్వేషం స్వాగతించాల్సిన అంశం కాదు కాబట్టి దానికి పుల్ స్టాప్ పడాలి. యూఏఈలో విద్వేష ప్రచారం చట్టవ్యతిరేకం. ఇలాంటి చట్టాలు ఉన్నాయంటే ప్రజలు జోక్‌గా భావించవచ్చు కానీ ఇలాంటి చట్టాలే మా దేశంలో శాంతిని నెలకొల్పుతున్నాయి. మీరు నిర్మించిన దేశాన్ని మీరే ఎందుకు తగులబెట్టుకుంటారు? మా దేశంలో అమలవుతున్న ఈ చట్టం అభివృద్ధిని కాంక్షించే ప్రతి దేశ నాయకుడు పాటించాల్సిన తారకమంత్రం లాంటిది.

కానీ భారతదేశం గురించి ఎంతగానో సాన్నిహిత్యం ఉంటున్న మాలాంటివారికి నేటి భారత్‌లో ద్వేషం, ఇస్లామోఫోబియా, రోజువారీ రక్తపాతం జరుగుతుండటం షాక్ కలిగిస్తోంది. పైగా దేశాన్ని 'ఖురానో-వైరస్' అనే సాంక్రమిక వ్యాధి చుట్టుముడుతున్నట్లుంది. ఒకనాడు నేను గడిపిన ఆ గొప్ప కమలాకారంలోని భవంతి నుంచి నేను పొందిన శాంతి సారాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నాను.

వసుధైక కుటుంబం.. అంటే 'ప్రపంచమంతా ఒకే కుటుంబం' అనే భావన భారతీయ సమాజంలోని అత్యున్నతమైన నైతిక విలువలలో ఒకటి. ఈ ఉపనిషత్ శ్లోకాన్ని భారత పార్లమెంటు హాల్‌లో చెక్కారు కూడా. గాంధీ దాన్ని అనుసరించారు. ప్రధాని నరేంద్రమోదీ దాన్ని మళ్లీ నొక్కి చెప్పారు. భారత్‌లో శాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి కరోనా మహమ్మారి మృత్యుచ్ఛాయలను విస్తరించకుండా, ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని చిన్నాభిన్నం చేయకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ స్వీయనిర్బంధాన్ని గడిపేలా ప్రజలను చైతన్యవంతం చేయవలసిన ఈ తరుణంలో భారత్‌లో శాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను.

షేఖా హింద్ అల్ ఖసేమి, ఎమిరేట్స్ యువరాణి, రచయిత్రి, ఎడిటర్, 'వెల్వెట్' మేగజైన్

వివరణ
గల్ఫ్ న్యూస్‌ పత్రికలో "I pray for an India without hate and Islamophobia" అనే పేరిట  ప్రచురితమైన షేఖా హింద్ ఖసేమీ వ్యాసానికి ఇది పూర్తి అనువాదం. సాక్షి పత్రికలో స్పేస్ పరిమితుల రీత్యా కాస్త తగ్గించి ఈ గురువారం సంచికలో ప్రచురించడమైంది. భారతదేశం గురించి హృదయం నిండా ప్రేమను పెంచుకున్న ఒక గల్ఫ్ యువరాణి సందేశాన్ని పాఠకులకు అందించడం కోసం ఇంతకన్నా మించిన తరుణం ఉండదనే ఉద్దేశమే ఈ వ్యాసం అనువాదానికి, ప్రచురణకు మూలం.

విద్వేష రహిత భారత్‌ నా స్వప్నం
https://www.sakshi.com/news/guest-columns/sheikha-hend-faisal-al-qassemi-article-my-dream-india-1281794?

మూల రచనకు కింది లింకులో చూడగలరు
I pray for an India without hate and Islamophobia

https://gulfnews.com/opinion/op-eds/i-pray-for-an-india-without-hate-and-islamophobia-1.71169436
fbclid=IwAR2vYJs_AIJX6wXTh0ttwQIqMH0kE_YB1f3ANGYMafW73bHd7PISky8ptS4

ఎమిరేట్స్ యువరాణి పర్సనల్ జీవితం లాంటి సామాజిక జీవిత వివరాల కోసం కింది ఇంటర్వ్యూను కింది లింకులో తప్పక చదవండి
Very hard for a princess to turn to social media for support, says Qatari royal

https://www.dnaindia.com/world/interview-very-hard-for-a-princess-to-turn-to-social-media-for-support-says-qatari-royal-2790034