Pages

Friday, February 27, 2015

పనిమనిషి రచయిత్రిగా మారిన క్షణాలు…



ఇతరుల ఇళ్ళలో కసువు తోసి, నేల కడిగి, వంట చేసి బతికే ఒక సాధారణ పనిమనిషి… తన చిన్ని జీవితంలో జరిగిన ఓ గొప్ప పరిణామంతో అత్యంత జనాదరణ పొందిన రచయిత్రిగా భారతీయ సాహిత్య వినీలాకాశంలో మెరుస్తోంది. చెత్త తోయడం, ఇల్లు కడగడం, వంట చేయడం ఒక పనేనా… రోజూ కోట్లాదిమంది “ఆడజనం” చేస్తున్నది అదే పనేగా… దాంట్లో విశేషం ఏముంటుంది. ఇక ఆ పనుల్లో సృజనాత్మకత కూడానా… అని ఎవరయినా ఈసడించవచ్చు.

కానీ, చెత్త తోసిన ఆ చేతులు… నేల కడిగిన ఆ చేతులు… వంట చేసిన ఆ చేతులు… తన జీవితం గురించి తాను రాసే అవకాశం దక్కినప్పుడు, తన బాధామయగాథను ప్రపంచానికి చెప్పాలని ఓ చిరు ప్రయత్నం చేసినప్పుడు ప్రపంచమంతటా కోట్లాదిమందిని కదిలించిన ఓ సజీవగాథకు ప్రాణం పోసినట్లయింది. ఆ చిట్టి చేతులు తన గురించి, తన బాల్య, కౌమార్య జీవితం గురించి తనకు తెలిసిన భాషలో రాసుకున్న కథను ఇవ్వాళ (2004 నుంచి) ప్రపంచమంతా తన కథగా గానం చేస్తోంది.

ఉయ్యాలలూపిన చేతులు ఊళ్ళేలగలవా… -రాజ్యాలు- అనే ప్రశ్నకు ఇది సందర్భం కాదు. ఎందుకంటే అవి ఇంటి చెత్త తోసిన చేతులు, యజమాని ఇంట్లో నేల కడిగి శుభ్రపర్చిన చేతులు. ఆ చేతులు రాసుకున్న తనదైన కథా సౌరభం ఇవ్వాళ విశ్వసాహితీ వీధుల్లో గుబాళిస్తోంది. ఓ పనిమనిషి కలల ప్రపంచాన్ని, జీవన దుర్భరత్వాన్ని తోటి ప్రపంచం ముందు పరచిన ఆ కథ పేరు “ఎ లైఫ్‌ లెస్ ఆర్డినరీ”. ఆ మట్టి చేతుల మనిషి హల్దార్… బేబీ హల్దార్ (ఆమె తండ్రి హవల్దార్ పనిచేశారు కాబట్టి ఈమె పేరు బేబీ హవల్దార్‌గా  -హల్దార్- రూపాంతరం చెందిందట).

భారతీయ పనిమనిషి, రచయిత్రి అయిన బేబీహల్దార్ రాసిన జీవిత చరిత్ర “ఆలో అంధారి” లేక “ఎ లైఫ్‌లెస్ ఆర్డినరీ” రచయితగా మారిన ఈ పనిమనిషి దుర్భర జీవితం గురించే వర్ణిస్తుంది. 1973 లేదా 74లో పుట్టిన ఈమె నాలుగేళ్ళ వయస్సులో కన్నతల్లి వదిలివేస్తే నిర్లక్ష్యపు తండ్రి పోషణలో పెరిగింది. నమ్మశక్యం కానంత తక్కువ వయస్సులో… పన్నెండేళ్ళ పసిప్రాయంలో పెళ్ళి పాలబడిన హల్దార్ 13 ఏళ్లకే తల్లయింది. నిత్యం భర్త వేధింపులు భరించే శక్తి లేక ముగ్గురు సంతానాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఓ ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. ఈ క్రమంలో ఇంటి యజమానుల పీడనను అనేకసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వ్యక్తిగతంగా, సామూహికంగా అంతులేని ఈ బాధల దుర్భరత్వంలోంచే ఆమె ఇంటిపని ముగిశాక దొరికాక కాసింత విరామ సమయంలో తన గురించి రాసుకోవడం మొదలెట్టింది. బెంగాలీ భాషలో అతిసాధారణ, వాస్తవిక శైలిలో రాస్తూ పోయింది. తన చిన్ని దుర్భర జీవితంలో పెనుమార్పుకు దారితీసిన ఈ పరిణామానికి ఓ “కరుణామయుడి” చల్లని చలువే కారణం. ఆయనే ఆమె చివరి యజమాని, రచయిత, మానవ నిర్మాణ శాస్త్రంలో (ఆంథ్రోపాలజీ) రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రబోధ్ కుమార్. తన జీవితం గురించి తానే రాసుకోవాలని ఆమెను ప్రోత్సహించడమేగాక, ఆమె పుస్తకాన్ని ఎడిట్ చేయడంలో కూడా సహకరించారు.

ఈయన జగమెరిగిన హిందీ సాహిత్యవేత్త మున్షీ ప్రేమ్‌చంద్ మనవడు కావడం మరో విశేషం. హల్దార్ రచనను ఈయన హిందీలోకి అనువదించి పెట్టారు. హిందీ భాషలో ఈ పుస్తకం మొదట 2002లో ప్రచురితమవగా, బెంగాలీ మూల భాషా ప్రచురణ 2004లో ప్రచురింపబడింది. బెంగాలీ మూలాన్ని సుప్రసిద్ధ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్వయంగా ప్రచురించడం విశేషం…ఎడిషన్ 2005లో మళయాళం వెర్షన్ రాగా, ఇంగ్లీష్ అనువాదం 2006లో ప్రచురింపబడింది. భారత్‌లో ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా ప్రజాదరణ పొందింది. కాగా, ఫ్రెంచ్, జపనీస్ భాషల్లో దీన్ని అనువదించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని గుర్గాన్‌లో ఇప్పటికీ ప్రొఫెసర్ గారి ఇంట్లో ఉన్న హల్దార్ తన తొలి పుస్తకానికి తరువాయి భాగాన్ని 2006లో రాయడం మొదలెట్టింది. (ఇది 2008లో నా మరొక బ్లాగులో రాసిన కథనం అని మర్చిపోవద్దు)

రచయిత్రిగా మారిన నేపథ్యం

ప్రొఫెసర్ ప్రబోధ్ కుమార్ తన ఇంటి పనిమనిషికి సరైన దిశలో అందించిన కాసింత తోడ్పాటు భయానకమైన హల్దార్ చీకటి జీవిత స్మృతులను తొలగించింది. ఆమె మానసిక ప్రపంచం తేజోమయం కావడానికి దారితీసిన ఆ మహత్తర క్షణాల గురించి కాస్త….

ముగ్గురు పిల్లల తల్లి. 29 ఏళ్ళ వయసులో ప్రొఫెసర్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. నిశ్శబ్దంగా కసువు ఊడుస్తూ… ఇల్లు తుడిచేది, వంట చేసేది… కఠినతరమైన జీవితం… కానీ ఒక పనిలో మాత్రం ఆమె పనితనం నెమ్మదించేది. షెల్ఫ్‌లోని పుస్తకాలను ప్రత్యేకించి బెంగాలీ పుస్తకాల దుమ్ము దులపరిస్తున్నప్పుడు మాత్రం ఆమె పని మందగించేది. పేజీ పేజీని తిరగేస్తూ పాతబట్టతో మెల్లగా పుస్తకాన్ని పట్టి పట్టి మరీ తుడుస్తుండేది. పనిమనిషి స్వభావానికి భిన్నమైన పనితనం ఇక్కడ కనబడడంతో షెల్ఫ్ వద్ద ఆమె ఏదో చేస్తోందని ప్రొఫెసర్ పసిగట్టారు.

ఒకరోజు ఆమెను నేరుగా అడిగేశారు. “నువ్వు చదువుతావా…?” అని.

అంతే, తాను బిస్కెట్ డబ్బాలో చేయి పెడుతుంటే యజమాని పట్టుకున్నంతగా ఆమె గిల్టీగా ఫీలయింది. స్కూల్ చదువుతో -7వ తరగతి- సరిపెట్టుకున్న హల్దార్ మన ప్రొఫెసర్‌ గారింట్లో బెంగాలీ పుస్తకాలు కనబడినపుడు పేజీలు తిరగేస్తూ చదివే ఆసక్తిని చంపుకోలేక పోయింది. పుస్తకాలపై ఆమె అనురక్తి ఇలా బట్టబయలు కాగానే ఆయన తన పుస్తకాల షెల్ఫ్‌ను వాడుకోమని స్వేచ్ఛ ఇచ్చారు.

ఆడబానిస తొలి స్వతంత్ర పయనం అలా మొదలైంది. ఆమాట చెవుల పడిందో లేదో, ఆబగా ఆమె అందుకున్న తొలి పుస్తకం ఏమిటో తెలుసా… తస్లీమా నస్రీన్ రాసిన నా బాల్యం (మై ఛైల్డ్‌హుడ్).

ఆ పుస్తకం చదువుతున్నంతసేపూ తన కథనే చదువుతున్నంత ఉద్వేగం. ఒక్కొక్కటిగా షెల్ప్‌లోని పుస్తకాలన్నీ ఆమె పఠనా ప్రపంచంలో చేరిపోయాయి. ఆశాపూర్ణాదేవి, మహాశ్వేతాదేవి, బుద్ధదేవ్ గుహ… ఇలా ఎందరో బెంగాలీ రచయితలు… కోట్లాదిమందికి సాహిత్య పఠనావకాశం నేటికీ లభ్యంకాని భారతదేశంలో, ఒక పనిమనిషి చిన్ని ప్రపంచాన్ని ఉద్దీప్తం చేసిన మానవీయ క్షణాలవి… పనిమనిషిని మనిషిలా గుర్తించకుండా గాడిద చాకిరి చేయించుకుంటూ, అనుమానపడుతూ వారి మనసుల్లో నరకం సృష్టించే వాతావరణానికి భిన్నంగా ఆ “కరుణామయుడు” అమృతహస్తాలతో ఆమెకు పఠనానుభవాన్ని ప్రసాదించారు.


ఒకరోజు… ప్రొఫెసర్‌గారు ఆమె చేతికి ఓ కాపీ పుస్తకాన్ని, కలాన్ని అందించి, “రాయి” అంటూ ఆజ్ఞాపించారు. అది ఒకే ఒకమాట… కేవలం రెండక్షరాలు… ఒక్కసారిగా ఆమె ఏడ్చేసింది. నిరాశతో… నిస్పృహతో… ఏం రాయాలి? రాయడానికేముంది? మూడు దశాబ్దాల అజ్ఞానం, చిమ్మ చీకటి రోజులు, కర్కశమైన జీవితానుభవాలు ఆమెను వెంటాడాయి. నిజంగా తనదో మతిలేని జీవితం, మాజీ సైనికుడు, డ్రైవర్ అయిన తండ్రి ఉద్యోగరీత్యా ఎక్కడికెళితే తామూ అక్కడికి వెళ్ళడం… ఇలా కాశ్మీర్ నుండి ముర్షీదాబాద్ వరకు అటునుంచి దుర్లాపూర్ వరకూ జీవితం ఎక్కడికి తంతే అక్కడికి ప్రయాణం….

తల్లిలేని పిల్ల, తండ్రి, సవతితల్లి దూషణలను పంటిబిగువున భరించడం, చివరకు పెళ్ళయ్యాక భర్తతోనూ వేధింపులు… తీవ్రమైన నిరాశా నిస్పృహల మధ్య ముగ్గురు పిల్లల తోడుతో అంతవరకూ ఎరిగివుండని ఢిల్లీకి రైలెక్కేయడం. దేశ రాజధాని నగరంలో జీవితం తీరుతెన్నులు అతి త్వరలోనే ఆమెకు అర్థమయ్యాయి. తాగుబోతు భర్తల దాష్టీకం భరించలేక దారిద్ర్యంతో వేగలేక, ఇల్లువిడిచి పారిపోయిన వేలాది స్త్రీలు ఢిల్లీలో ఎంచుకున్న బాటే ఆమెకూ శరణ్యమైంది. జీతాలు సరిగ్గా చెల్లించని ఇంటిపనిని ఎన్నుకుంది. కొన్నిసార్లయితే గడ్డకట్టించే శీతల రాత్రుల్లో పిల్లలతో పాటు వీధుల్లో గడిపింది.

అలాంటిది… ఆమె చీకటి జీవితం మొట్టమొదటిసారిగా ఇపుడు బంధనాలు తెంచుకుని, తన గురించి, తన బతుకు గురించి రాసేందుకో శైలిని ఆమెకు అందించింది. వెంటనే…కలాన్ని అందుకుంది. తన దినవారీ పనిలో తప్పని మరో భారంగా కలం పట్టాక తొలి పేజీలను అతి కష్టం మీదే అయినా కృత నిశ్చయంతో, గుడ్డి విశ్వాసంతో రాయటం మొదలెట్టింది.  20 ఏళ్లుగా తాను కాపీ పుస్తకంలో  రాసింది లేదు..అక్షర క్రమం మర్చిపోయింది కూడా, ముఖ్యంగా కాపీ పుస్తకంలో తాము రాయవలసింది పోయి తమ తల్లి ఎందుకు రాస్తుందో తెలుసుకోవాలని పిల్లలు భావించినప్పుడు ఆమె చాలా ఇబ్బందిపడింది.

అయితే ఆమె రాసిన తొలిపదాలే తమవైన మాయను ప్రదర్శించాయి. అవి గతంనుండి ఆమెను బంధవిముక్తి చేశాయి. కన్నతల్లి తమను వదిలి పెట్టి కనపడకుండా వెళ్లిపోయిన బాధాకరమైన స్మృతులను, తనను పెళ్లాడిన వ్యక్తి తన పరుపు మీదికి ఎక్కి తనపై తొలి రోజే అత్యాచారం జరిపిన ఆ రాత్రిని, తన భర్తచేత చంపబడిన సోదరిని, 13 ఏళ్ళ పసిప్రాయంలో తొలి బిడ్డను ప్రసవించిన సందర్భంగా తాను అనుభవించిన బాధను, భీభత్సాన్ని.. ఇన్నాళ్లుగా తాను ఎవరికీ చెప్పుకోని, తానైనా గుర్తించలేని విషాద స్మృతులను నోట్ పుస్తకంలోకి ఎక్కించడం మొదలు పెట్టింది.

ఆమెను ఇప్పుడిక ఎవరూ అడ్డుకోలేరు. వంటగదిలోనూ, కూరగాయలు, వంట పాత్రల మధ్య నోట్ పుస్తకాన్ని అటూ ఇటూ జరుపుతూ, ఇల్లు చిమ్మడానికి, తుడవడానికి మధ్య విరామంలోనూ, పిల్లలను పడుకోబెట్టిన తర్వాత నడిరేయిలోనూ ఆమె రాస్తూ పోయింది. ఏదైనా రాయడానికి కూర్చునే ముందు కుర్చీ, అధ్యయన, రాత సామగ్రిని సిద్ధం చేసుకోవాల్సి వచ్చేది కాని రాత మొదలెట్టాక కూరగాయలు తరుగుతున్నంత సులువుగా రాసేదాన్ని అని ఆమె చెప్పుకుంది.

ఫలితాలు అనూహ్య రీతిలో సాగాయి. రాయవలసిందిగా హల్దార్‌కు చెప్పినప్పుడు ఆమె మనస్సును సమస్యలపై కేంద్రీకరింపజెయ్యాలన్నదే తన ఆలోచన అని ప్రొఫెసర్ గుర్తు తెచ్చుకున్నారు. అయితే నోట్ పుస్తకంలో రాసిన విషయాలు ఎంతో అద్భుతంగా వచ్చాయని చెప్పారాయన. ఆమె రాసింది చదువుతూ, తప్పులు దిద్దుతూ, ఫోటో కాపీలు తీస్తూ ఎంతో ప్రోత్సాహం ఇచ్చారాయన. ఇలా నెలల తరబడి రాస్తూ పోయింది.

ఆమె రచనల పట్ల ఆయన ఎంత ఉద్వేగం పొందారంటే అవి బాగున్నాయని భావించిన తన నిర్ణయాన్ని సైతం తాను విశ్వసించలేకపోయారు.సాహిత్యానికి సంబంధించి పరస్పరం అభిప్రాయాలు పంచుకునే తన స్నేహితులు అశోక శేక్సారియా, రమేష్ గోస్వామిలను సంప్రదించారు. బేబీ రాత ప్రతిని చదివిన ఆ ఇద్దరూ ఇది మరో అన్నే ఫ్రాంక్ డైరీ అవుతుందని ప్రశంసించారు. (రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీల జాతి హనన కాండకు బలైన యూదు బాలిక అన్నే ప్రాంక్ నాజీల చేత చిక్కి బలయ్యేంతవరకూ రాసుకున్న తన అజ్ఞాత జీవితపు అనుభవాల సమాహారమే ‘అన్నే ఫ్రాంక్ డైరీ’)

ఇలా బెంగాలీలో హల్దార్ రాసిన మూలాన్ని ప్రబోధ్ మొదట హిందీలోకి అనువదించారు. అలా వెలుగులోకి వచ్చింది ఆలో అంధారి -చీకటి వెలుగు- అయితే అతి సాధారణ వర్ణనతో కూడిన ఈ రచనకు ప్రచురణకర్తను పట్టుకోవడం తలకు మించిన పని. ఎందుకంటే సాధారణ పాఠకుల అభిరుచులకు ఇది కొరుకుడుపడనిది. అయితే చిన్నస్థాయి ప్రచురణా సంస్థ అయిన రోషని పబ్లిషర్‌ను నడుపుతున్న సంజయ్ భారతి తనకు నష్టం కలిగించినా సరే ఈ పుస్తకాన్ని ప్రచురించే బాధ్యతను తలపై పెట్టుకున్నాడు.

ఇలా పుస్తకం ప్రచురించబడడమే గొప్ప కాగా, దాని అమ్మకాలు ఈ నలుగురు సాహితీమిత్రులను ఆశ్చర్య పరిచాయి. హిందీ అనువాదమైన ఆలో అంధారి ప్రచురించబడిన తొలిరోజునుంచి అమ్మకాలు మొదలయ్యాయి. స్వీపర్ నుంచి రిటైరైన హెడ్‌మిస్ట్రెస్ వరకూ ఈ పుస్తకం కాపీని కొనడానికి ఆసక్తి చూపారు. ఇది ఎంతగా అమ్ముడుపోయిందంటే దాని రెండో ఎడిషన్ సైతం రెండు నెలల్లోపే అమ్ముడు పోయింది. ఈ పుస్తకం సినిమా హక్కుల గురించి ప్రకాష్ ఝా మాట్లాడడం జరిగింది. కొందరైతే దీన్ని నాటకంగా రూపొందించాలనుకున్నారు. ఇతరులు ఈ రచనను ఇంగ్లీష్, ఒరియా, తమిళ్, తెలుగు భాషల్లోకి సైతం అనువదించడానికి నడుం కట్టారు. కలకత్తాలోని కొత్త సాహిత్య పత్రిక భాషా బంధన్ బెంగాలీలో ఈ పుస్తకాన్ని సీరియల్‌గా వేసింది.

అయితే హల్దార్‌కు మాత్రం రచయితగా తన రెండో జన్మలో తనకు జరిగిన మంచి అంటూ ఉంటే నూతన స్నేహితులు దొరకడమే అంటుంది. జీవితంలో మొదటిసారిగా తన రచన తన మాటల్లోనే రూపొందినప్పటికీ దానికీ ఒక విలువ అనేది ఉందన్న విశ్వాసం ఏర్పడింది అంటుందామె. తన జీవితం, తను రాసిన పుస్తకం పత్రికలలో, టివీల్లో చర్చనీయాంశం అవుతుందని తాను ఏ మాత్రం ఊహించలేదని వినమ్రంగా చెప్పింది. తాను రచయితను కాదని, తానొక వంటమనిషిని మాత్రమేనని నిర్వికారంగా చెప్పుకునే హల్దార్ తన జీవిత కథ ఇంత సంచలనం ఎందుకు రేపిందో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని అంటుంది. అయితే జీవితంలో ఒక విషయంలో మాత్రం మార్పు వచ్చింది. అదేమంటే గతంలో తన పిల్లలు ఆమెను ఫలానా అని పరిచయం చేయడానికి సిగ్గుపడేవారట. ఇప్పుడు వాళ్లు మా అమ్మ రచయిత్రి అని గర్వంగా నలుగురికీ చెప్పుకుంటున్నారట.

తన రెండో పుస్తకం అయిన ‘ఈస్సాత్ రూపాంతర్’ -చిన్న చిన్న మార్పులు-ను కూడా ఇటీవలే ఆమె పూర్తి చేసింది. ఆలో అంధారీ -ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ- ప్రచురించిన తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను ఈ రెండో పుస్తకంలో పొందుపర్చింది. గత జీవితంలో సాదా సీదా పనిమనిషిగా కాలం గడిపిన తనకేసి ఎవరూ తలెత్తి చూసేవారు కాదని ఆమె గతాన్ని తల్చుకుంటూ చెబుతుంది. అయితే ఉన్నట్లుండి ప్రతి ఒక్కరూ తనతో మాట్లాడడానికి ఆత్రుత ప్రదర్శిస్తున్నారట. పనిమనిషి నుంచి రచయిత్రిగా మారిన హల్దార్‌కి ఇవ్వాళ ప్రతిరోజూ వందలాది ఉత్తరాలు వస్తుంటాయట.

—————————————

జీవితం మలుపు తిరిగిన ఆ క్షణం…


బేబీ హల్దార్ రాసిన ‘ఎ లైఫ్ లెస్  ఆర్డినరీ’ అత్యంత దుర్భర జీవితంపై ఎదురు తిరిగిన అద్భుత మానవ శక్తికి తిరుగులేని నిదర్శనం. నిజంగానే అది ఒక ‘అసాధారణ జీవితం’ గురించి ఓ మామూలు పనిమనిషి వెలువరించిన అంతర్మధనం. దైనందిన జీవితంలో తమవైన అభిప్రాయాలు, ఆకాంక్షలు, వ్యక్తీకరణలకు చోటులేకుండా మగ్గిపోతున్న ఒక సామాజిక విభాగం తమ శక్తినంతా కూడదీసుకుని పెట్టిన పొలికేకే ‘ఎ లైఫ్ లెస్  ఆర్డినరీ’.

అందుకే, అది వెలువడిన మరుక్షణంనుంచి అసమాన విజయాన్ని సరైన సందర్భంలో, సకాలంలో పొందటంలో ఆశ్చర్యపడాల్సింది లేదు. పాచిపని, ఇంటిపని, వంటపని ఇలా సాధారణ సమాజం ఏ మాత్రం విలువ ఇవ్వని పనులకు జీవితాన్ని అంకితం చేసుకున్న సామాన్య మహిళ హల్దార్ ఇవ్వాళ వ్యక్తిగా, రచయితగా విజయం పొందడానికి కారణం ఆమె తన చుట్టూ ఉన్న అంథకారాన్ని కళ్లకు కట్టేంత శక్తివంతంగా తన సొంత భాషలో రాసుకుంటూ పోవడమే తప్ప మరే విశిష్టత లేదు.

నాలుగేళ్ల క్రితం (2004లో)  విడుదలయింది మొదలు ఇప్పటిదాకా ఏడుసార్లు పునర్ముద్రణలు పొందినా అన్ని పుస్తకాలూ అమ్ముడుపోవడం అన్న సత్యమే ఈ పుస్తకం గొప్పతనాన్ని చెబుతోంది… ఆమె వాణిని, జీవన కాఠిన్యాన్ని, అంధకారంలోంచి వెలుగులోకి ఆమె సాగించిన చిరు ప్రయాణాన్ని సమాజం వింటోంది. స్పందిస్తోంది. పన్నెండేళ్ల ప్రాయంలో వివాహం జరిగాక పుట్టింటికి దూరం కావడం, 14 ఏళ్ల లోపే తల్లి కావడం, వివాహ జీవితంలో భయానక అనుభవాలనుంచి పారిపోయి ఢిల్లీలో పాచిపని చేసుకుని బతకాల్సిరావడం..

….చివరకు ఓ కరుణామయుడి ఆపన్న హస్తం అందించిన నైతిక మద్దతుతో ఆమె తన కడగండ్ల జీవితాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం దాకా ఆమె తన తొలి పుస్తకంలో సాధారణ మానవ జీవితానికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టలేదు. అలాగని తనపై జాలిపడేలా ఉద్వేగ శైలితో రచన సాగించలేదు. సాహిత్యానికి సంబంధించిన ఏ మెరుగులు, ఉపమలు, అలంకారాలు, శైలీ పటుత్వం అన్నేదే లేకుండా.. తాను మాట్లాడే భాషలో, తనకు తెలిసిన భాషలో, తనకు చేతనైన శైలిలో మనుషుల బాధల పాటల పల్లవిని ఆమె ఈ పుస్తకంలో ఆలపించింది.

ఆమె అవలంబించిన సాధారణ రచనా శైలి కారణంగా ఇప్పుడూ, భవిష్యత్తులోనూ పులిట్జర్ తదితర అవార్డులను ఆమె పొందలేకపోవచ్చు. కాని మనిషికి సంబంధించిన ఏదో అంశాన్ని ఆమె తట్టిలేపింది. అందుకే ప్రపంచమంతా ఆమె భాషను ఇవ్వాళ వింటోంది. ఆమె బాధలను ప్రపంచం తనదిగా చేసుకుని స్పందిస్తోంది.

(ఈ కథనం 2008 ఫిబ్రవరిలో నా మరొక బ్లాగులో ప్రచురించినది. మరోసారి గుర్తు తెచ్చేందుకు ఇక్కడ పోస్ట్ చేయడమైనది. ఈ పుస్తకం అప్పట్లోనే తెలుగులో కూడా వచ్చినట్లుంది. తెలుగు పాఠకులకు మాత్రం 2008 సంవత్సరంలోనే ఆంధ్రజ్యోతిలో మొదటిసారిగా మా స్నేహితురాలు నీలిమ ఈమె గురించి పరిచయం చేశారు.)

కె.రాజశేఖర రాజు.
8341571371

Posted on February 29th, 2008 by mohana


Thursday, February 12, 2015

కేవలం గాయకుడే కాదు...



ఘంటసాల కన్ను మూసిన సందర్భంగా ఆయన మృతికి అందరూ నివాళి అర్పిస్తున్నారు. ఆయన మధుర స్వరాన్ని కొనియాడుతున్నారు. అయితే ఘంటసాల గురించి నిజాన్ని గ్రహించడంలో ఈ ప్రశంసలు విఫలమౌతు న్నాయి. ఎందుకంటే ఆయన గాయకుడు మాత్రమే కాదు. నిజమైన కవి. ప్రేమ, విచారం, సంతోషం, భాధ, దయ, ఆనందం, విషాదాలకు సంబంధించిన ప్రగాఢమైన అనుభూతులను మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా ఆయన వ్యక్తీకరించాడు. మానవులకు సంబంధించిన ఈ ప్రాధమిక ఉద్వేగాలను ఆయన స్వయంగా అనుభూతి చెంది ఉండకపోతే, ఆ జీవిత నేపథ్యంలో ఆయన నివసించి ఉండకపోతే వాటిని అంత వాస్తవికంగా, అంత సుసంపన్నంగా, అంత ఇష్టంగా ఆ మానవానుభూతులను ఘంటసాల తన స్వరంలో పలికించి ఉండేవారు కాదు.

మానవ ఉద్వేగాలను ఇంత మహనీయ మహత్వంతో పలికించిన మహాకవులెవరూ చరిత్రలో ఇంతవరకు లేరు. సహజంగానే ఇది ఆయన హృదయ స్వచ్ఛతను, మానసిక నిర్మలత్వాన్నే సూచిస్తుంది. ఆయన పాటలను వింటూ పరవశించే శ్రోతలు ఆయన అందించిన పరిపూర్ణమైన, మహోన్నతమైన జీవన తాత్వికతను అనుభూతి చెందకుండా తమ మనోభావాలను అణుచుకోలేరు. మానవ జీవితానికి సంబంధించిన తాత్వికతను ఆయన తన పాటల్లో అత్యంత స్పష్టంగా  ప్రతిబింబించారు.

ఇంతవరకు చరిత్రలో పదాలు, పదబంధాలు ఎన్నడూ వ్యక్తీకరించలేనంత గాఢంగా, జీవితాన్ని వ్యక్తపరిచేందుకు ఆయన తన పాటల ద్వారా ప్రయత్నించారు. సినిమా కథలో భాగంగానే ఆయన చాలా పాటలు పాడి ఉండొచ్చు. కాని ఒక క్రమంలో అవి స్వతంత్ర స్థాయిని పొంది, తమ స్వంత అర్థం సంతరించుకుని, సినిమా కథ సందర్భం నుంచి తమను తాము విముక్తి చేసుకునేవి. ఈ వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు కాబట్టే థియేటర్లలో చూడటం కంటే థియేటర్ల బయట ఆ పాటలను వినడానికే పదే పదే ప్రయత్నించేవారు.

చదువుకున్న, చదువుకోని తెలుగు ప్రజలపై ఆయన పాటల ప్రభావం ఎంతగా ఉండేదంటే తెలుగు ప్రజల రోజువారీ ఆంతరంగిక జీవితాలను అవి గుణాత్మకంగా మార్చాయి. ఇవ్వాళనుంచి (1974) ఆంధ్రప్రదేశ్‌లో జనజీవితం ఉద్వేగరహితంగా, బోసిపోతుందని మనం వెరపు లేకుండా చెప్పవచ్చు. నిస్సందేహంగా, ఘంటసాల రాక తోటే తెలుగు ప్రజల భావోద్వేగాల చరిత్రలో ఓ కొత్త శకం మొదలైంది. ప్రజల హృదయాలలో నిక్షిప్తమై ఉన్న రహస్య నిధులను ఆయన వెలికి తీశారు. ఆయనే లేకుంటే అవి నేటికీ నిద్రాణ స్థితిలోనే పడి ఉండేవి. అంతవరకు హిందీ సినిమా సంగీతం కోసం ఎదురు చూసే తెలుగు ప్రజలకు ఒక వినూత్నమైన ఊహాత్మక అనుభవం అందుబాటు లోకి వచ్చేసింది. ఆ విశిష్ట అనుభవమే ఘంటసాల పాట.

ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన తనలోని కళను విస్తృతంగా వాణిజ్య ప్రయోజనం కోసమే ఉపయోగించినప్పటికీ నాణ్యత విషయంలో కాని, నిజమైన ప్రేరణను కలిగించడంలో కాని ఆ కళ తన నాణ్యతను ఎన్నడూ కోల్పోలేదు. అనేకానేక చెడు ప్రభావాలకు గురికాకుండా ఆయన చిత్రపరిశ్రమలో వెలుగొందుతూ వచ్చారు. అసంఖ్యాకంగా ఆయన పాటలు పాడినప్పటికీ జీవితం చివరివరకు ఆయన అలిసిపోలేదు, పాటపై అనురక్తి తగ్గిపోయిన దాఖలాను ప్రదర్శించలేదు.

తన మరణంతో మనం మరో నేపధ్య గాయకుడిని మాత్రమే కోల్పోలేదు. ఒక కవీశ్వరుడిని కోల్పోయాం. ఒక జాతి ప్రజల భావోద్వేగాలను మేల్కొలిపి తారాస్థాయికి తీసుకెళ్లిన కవీంద్రుడిని కోల్పోయాం. వాస్తవంగానే, ఘంటసాల పాట లేని తెలుగు ప్రజలను ఊహించడం అసాధ్యం. ఆయన వదిలివెళ్లిన ఖాళీని పూరించగల గాయకుడు లేడు. సాధారణ లలిత సంగీతకారుడి లేదా సాంప్రదాయేతర సంగీతకారుడి స్థాయిని ఘంటసాల నిస్సందేహంగానే శిఖరస్థాయిలో నిలబెట్టారు.

సత్యం పట్ల, సౌందర్యం పట్ల తృష్ణతోపాటు, తన ప్రభావ ప్రపంచంలోకి ఇతరులను కూడా తీసికొచ్చి ప్రాథమికమైన స్వీయ ఎరుకను తీసుకొచ్చిన ఘనుడు ఘంటసాల. ఆయన దుర్బల దేహాన్ని గమనించిన ఎవరయినా, ఆయనలో సంగీత స్ఫూర్తి ఇంత స్థాయిలో ఉందని ఊహించలేరు. కాని తన జీవిత క్రమం సంగీతాన్ని ఆయనకు పేటెంట్‌గా మార్చేసింది. దాన్నే ఇవ్వాళ అందరూ చూస్తున్నారు.. వింటున్నారు..

ఆయన మరణం తర్వాత ఆయన సంగీతం అన్ని కాలాల్లోనూ నిలిచి ఉంటుందని, ఉనికిలో ఉంటుందని పలువురు భావిస్తుండవచ్చు. ఈ మృత కవీంద్రుడి సజీవ స్వరం మనల్ని సమ్మోహన పర్చడానికి, దాసానుదాసులుగా మార్చుకోవడానికి అలా అలా కొనసాగుతూనే ఉంటుందని పలువురు భావిస్తూండవచ్చు. అయితే ఈ విశిష్ట,  నిరుపమాన గాయకుడితో వస్తున్న చిక్కల్లా ఏమిటంటే మనం ఇంకా ఈయన సాధించినదానితో సంతృప్తి చెందడం లేదు.

ఆయన స్వరం నుంచి వెలువడిన మేధోపరమైన, శాశ్వతమైన, వినిర్మలమైన, నాజూకైన, సృజనాత్మకమైన సంగీతం పట్ల మన అనురక్తి, తృష్ణ ఇంకా ముగియలేదు. ఆయన నుంచి చాలినంత సంగీతామృతాన్ని పొందామని కొంతమంది భావిస్తుండవచ్చు కాని, ఆయన సంగీతంతో మనలో చాలామంది ఇంకా సంతృప్తి చెందడం లేదు. విన్న కొద్దీ మళ్లీ మళ్లీ వినాలని పించే అమృత గుళికలను మనముందుంచి వెళ్లారు. ఆ పాటలతో సంతృప్తి చెంది ఇక చాలు అనుకోవడం అసాధ్యం.  ఘంటసాల అనే ఈ గాన గంధర్వుడితో వస్తున్న చిక్కు ఇదే..

ఘంటసాల మృతిపై నాటి 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నివాళి

(ఈ రచన ఘంటసాల గారు కన్నుమూసిన రెండు రోజుల తర్వాత నాటి 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో 14-02-1974వ తేదీన ప్రచురితమైంది. దీన్ని రచించిన వారు కె. కుమార శేఖర్, ఎలుగు. అంతకుమించి తన విశేషాలు ప్రస్తుతం ఎవరికీ తెలీవు. ఘంటసాల గానమాధుర్య శకాన్ని అనన్యసాధ్యమైన రీతిలో ఆవిష్కరించిన ఆ రచయిత ఎవరో ఇవ్వాళ ఎవరికీ తెలియదు. ఈ వ్యాసం ఆంగ్లపాఠాన్ని ప్రచురించిన ఘంటసాల. ఇన్పో వెబ్‌సైట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది.

"No Mere Singer" అనే పేరుతో వచ్చిన నాటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనానికి ఇది స్వేచ్ఛానువాదం.

దీని ఆంగ్ల లింకు
http://www.ghantasala.info/theman/no_mere_singer.html
http://www.ghantasala.info సౌజన్యంతో)

గమనిక: ఘంటసాల గారి వర్థంతి సందర్భంగా 2014 ఫిబ్రవరి 12న నేను స్వేచ్ఛానువాదం చేసి నాటి andhraprabha.com తెలుగు వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఈ అరుదైన వ్యాసాన్ని ఇక పోగొట్టుకున్నట్లే అని భావిస్తున్న తరుణంలో చిరంజీవిబ్లాగ్.కామ్ అనే కింది బ్లాగులో యధాతథంగా అచ్చేసి ఉండటం ఇప్పుడే చూశాను. బంగారో లేదా తిరుపతి లడ్డూనో ఏదైతేనేం కోల్పోయాననుకున్న రచన తిరిగి కంటపడింది. అందుకు ఆ బ్లాగర్‌కు కృతజ్ఞతలు.

మరొకరి మంచి రచనను ఇలా ఇతర బ్లాగర్లు తమ బ్లాగుల్లో ప్రచురించుకోవడం కూడా ఒక్కోసారి మనమంచికే దారి తీస్తుందన్నమాట. చాలా సంతోషం. నా చందమామ చరిత్ర http://blaagu.com/chandamamalu/ బ్లాగు మళ్లీ మాయమైంది కాబట్టి దాంట్లో ఉన్న ఘంటసాల గారిపై రెండు వ్యాసాలను నా ఈ కాంతిసేన బ్లాగులో మళ్లీ భద్రపరుస్తున్నాను.
కె.రాజశేఖరరాజు
8341571371

నా వ్యాసం పునర్ముద్రణకు అవకాశం కల్పించిన కింది బ్లాగర్‌కు ధన్యవాదాలు.
http://www.chiranjeeviblog.com/forums/index.php?topic=6732.0 

తెలుగు జాతి అమరగానం ఘంటసాల


సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం ఈ భూమ్మీద నుండి ఒక మనిషి వెళ్లిపోయాడు. ఒక అమర స్వరం ఇక పాడలేనని సెలవు తీసుకుంది. దివిజ కవివరుల్ గుండియల్ దిగ్గురనంగ చందాన ఆ మనిషి, ఆ స్వరం ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్లిపోయాయి. మనిషి లేడు... ఆయన స్వరం లేదు. నాలుగు దశాబ్దాలు గడిచాయి. కాని ఆ మనిషి, ఆ స్వరం ఈ గడ్డ జ్ఞాపకాల్లోంచి అంతరించి పోలేదు. కొన్ని లక్షల కుటుంబాలు ఆయన పాటలు వింటూనే తరిస్తున్నాయి. జీవితంలో తమకెదురవుతున్న సమస్త బాధలను, సంతోషాలను, ప్రేమాభిమానాలను, పిడుగుపాటులా తగిలే ఎదురుదెబ్బలను, విచారాన్ని, వేదనను, భక్తిభావనను, శృంగారాన్ని, కరుణ రస హృదయ స్పందనలను ఆయన పాటల ద్వారా వింటూ స్వాంతన పొందుతూ ఈ నేల మీది మనుషులు సేద తీరుతున్నారు. ఆయన పాడింది మూడు దశాబ్దాలు.. ఆయన గతించిన తర్వాత గడిచిన కాలం నాలుగు దశాబ్దాలు. గత ఏడు దశాబ్దాలుగా ఈ నేల ఆయన పాటలతో పునీతమవుతూనే ఉంది.

ఊర్లలో హరికథలు పాడుతూ బాల భరతుడిలా జనాన్ని మెప్పించిన వాడు, తెలుగుసీమలో ఒక మారుమూల నాలుగిళ్లలో అన్నం అడుక్కుని, కొందరమ్మలు పెట్టిన బిక్ష సాక్షిగా సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ఓ పిల్లాడు.. తెలుగు నేల నలుచెరగులా, ప్రపంచంలో తెలుగువాళ్లు కాలు మోపిన ప్రతి చోటా తన ఉనికిని పాట రూపంలో, పద్యం రూపంలో చాటుకుంటూ చిరంజీవిగా మనందరిమధ్యే ఉంటున్నాడు. కంచుకంఠానికి శాశ్వత నిదర్శనంలా నిలిచి, మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతనాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల... మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీత, నేపధ్య గాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హదయాల్లో నిలిచిపోయాడు.

ఆయన గాత్రం, అసలున్నాడో లేడో తెలియని 'దేవుడు' కరుణించి, తెలుగు ప్రజలకి ప్రసాదించిన అపురూప వరమని కొనియాడుతున్నారు. అటు ఆస్తికులను, ఇటు నాస్తికులను కూడా, స్వరపేటికలోంచి పెల్లుబికి వచ్చే మహా వేదనలో ముంచెత్తి ఏడ్పించి, కన్నీరుపెట్టించిన అమరగానం ఆయనది. పాటలోని భావానికి పడిపోకున్నా, లోబడిపోకున్నా, మాంత్రిక మహనీయ కంఠస్వరంతో వాదాలను, సిద్ధాంత భేదాలను పక్కనబెట్టించి మనుషులను కరిగింపజేసిన అపర తుంబుర నాదానికి ఆయన గొంతు ఒక అచ్చమైన ప్రతిబింబం. శాస్త్రీయ సంగీత ఛాయలనుంచి, లలిత సంగీతంలోకి తెలుగు సినిమాపాట పరిణామం చెందుతున్న క్రమంలో వేలకొద్దీ పాటలు, పద్యాలూ పాడి, తెలుగు సినీ గాన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించిన గొప్పకళాకారుడు ఆయన.

ఎలా సాధ్యం? ఒక మనిషికి అతడి గొంతుకు ఇది ఎలా సాధ్యమైంది? ఒక గొంతు ప్రేమను పలికించవచ్చు, ఒక గొంతు విచారాన్ని తారాస్థాయికి తీసుకుపోవచ్చు.. ఒకరు చిలిపితనానికి తేనెసొగసులద్ది పరవశింపజేయవచ్చు. ఓ గొంతు విషాదానికి శిఖర స్థాయి నిచ్చి ఉద్వేగంలో ముంచెత్తవచ్చు. ఓ గొంతు శృంగారానికి అపర శ్రీనాధ కవి సార్వభౌముడిలా నిలిచి కంచుడక్కను పగులగొట్టవచ్చు... ఒక గొంతు నవ్వించవచ్చు, ఒక గొంతు కన్నీరు తెప్పించవచ్చు. ఓ గొంతు ఆథ్యాత్మిక ప్రపంచపు సరిహద్దుల్లోకి మనిషిని తీసుకుపోయి అక్కడే విడిచి రావచ్చు.

కాని ఇదేమిటి? అటు భక్తిని, ఇటు రక్తిని, అటు ప్రేమను, ఇటు ఎడబాటును, అటు వేదనను ఇటు అనుకంపనను, విరక్తిని, అల్లరిని, సంతోషాన్ని ఒక్క మనిషి సమస్తజీవుల తానైన చందాన నవరసాలను ఒక్క గొంతులో పలికించడమేమిటి? మన కళ్లముందు ఈ ప్రపంచంలో ఎన్ని భాషల్లో, ఎంతమంది ప్రసిద్ధ గాయనీ గాయకులు పాడటాన్ని, పాటలతో జీవితాన్ని పండించుకోవడాన్ని మనం చూడలేదు? కనలేదు..! వినలేదు..? ప్రేమను పలికించినవారు, విషాదాన్ని గుండెనిండా నింపినవారు.. భక్తిని రంగరించి పాడినవారు ఎంతమందిని మనం చూడలేదు. కాని ఇన్ని మానవ అనుభూతులను ఒక గొంతు.. ఒకే ఒక్క గొంతు పలకడమేమిటి? ఒక జాతి గొంతును తన గానంతో తరింపజేయడమేమిటి?

అనితర సాధ్యమైన ఈ గంధర్వ గాన కళ ఈయనకే ఎలా సాధ్యమైంది? ఆయన కంఠంలో పలికిన భక్తి, విచారం, వేదన, విరక్తి, ప్రేమ, చిలిపితనం, శృంగారం, అల్లరి, గడుసుదనం మరొకరికి అనుకరణ సాధ్యంకాదని తెలుగు జాతి ముక్త కంఠంతో శ్లాఘిస్తోంది. ప్రపంచ గాన చరిత్రలో ఒక గాయకుడు ఇన్ని మానవ మనోభావాలను, సంవేదనలను మూడు దశాబ్దాలపాటు ఒకే స్థాయిలో పాడటం జరిగిందా, మన దేశంలో కాని, ఇతర దేశాలలో కాని నవరసాలను జీవిత పర్యంతమూ పలికించిన గొంతు ఎక్కడైనా ఉందా అనేది రేపటి పరిశోధకులకే వదిలేద్దాం...

కాని.. అనేకులు చెబుతున్నట్లు ఆయన కారణ జన్ముడు కాడు. గంధర్వగాయకుడు కాడు.. దేవుడు ప్రసాదించిన వరప్రసాదం అంతకంటే కాదు. పేదరికాన్ని జీవితపు తొలినాళ్లలో ఘోరంగా అనుభవించిన ఆ చిన్ని జీవితం, ఆకలి విశ్వరూపాన్ని తాను చేపట్టిన మధూకర వృత్తి సాక్షిగా చవిచూసిన ఆ పిల్లాడి జీవితం తన గొంతును రాగరంజితం చేసింది. మానవ జీవితపు సమస్త వేదనలను, ఆశలను, ఆరాటాలను, అభిమానాలను, అనురక్తులను ఆయన కంఠం తనవిగా చేసుకుంది. పేదరికం, ఆకలి ఆ గొంతుకు అమృతాన్ని అందించి కమ్మటి స్వరాన్ని ఈ ప్రపంచానికి చిరస్థాయిగా అందించాయి.

జీవితంలో బాధ పడనివాడు, బాధ అంటే ఏమిటో తెలియని వాడు, ఆకలి రుచెరుగనివాడు, సమస్త బాధల వెనుక ఒక జీవితం అంటూ ఉంటుందన్న ఆశను, వాస్తవాన్ని ఆకలి సాక్షిగానే గుర్తెరగని వాడు మనిషిని కరిగించే పాట పాడలేడు. అతడు త్యాగరాజు కావచ్చు, అన్నమయ్య కావచ్చు.. రామదాసు కావచ్చు.. చివరకు గద్దరే కావచ్చు... వీరి పాటల వెనుక ఉన్న మహిమాన్విత శక్తికి వారి జీవిత నేపథ్యమే కారణం. వీరిలో ఏ ఒక్కరు సంపన్నులై ఉన్నా వారికి కళా జగత్ చరిత్రలో స్థానం ఉండేది కాదన్నది వాస్తవం. తదనంతర జీవితంలో వారు ఎంత ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చు. కాని పేదరికమే వారిని నడిపించింది. జీవితంలో లేమితనం వారిని రగిలించింది. కష్టభూయిష్ట బాల్యమే వారిని రాటుదేల్చింది.

మన కన్నీళ్లు, మన వేదన, మన దుఃఖం ఇవి పాటకు, గానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తాయనే సత్యాన్ని అన్నమయ్య గీతాలాపనకు ప్రాణంపోసిన శోభారాజు ఒక సందర్బంలో అన్నట్లు గుర్తు. తిండికి ముఖం వాచిపోయిన తన పేదరికమే, తన ఆకలే తన పాటకు మూలమైందని, అన్నమయ్య పాట రూపంలో తన అకలిబాధ వెలికి వచ్చిందని ఆమె పాతికేళ్ల క్రితమే ఒక సందర్భంలో అన్నారు. చరిత్రకెక్కిన, చరిత్రను చరితార్థం చేసిన ప్రతి గొప్ప వ్యక్తి జీవితం వ్యక్తిగత బాధనుంచే మొదలైంది. ఘంటసాల దానికి అతీతుడు కాదు. ఆయన గొంతు పలికించిన అద్భుత రాగాలకు, కమనీయ వ్యక్తీకరణలకు ఆయన అనుభవించిన బాధ కారణం. ఆకలి కారణం, కటిక పేదరికం కారణం.

ఆయనను ఇలాగే స్మరించుకుందాం. గుర్తించుకుందాం... ఆయన గొంతులో తారాడిన పాట పలికించిన సహస్ర వ్యక్తీకరణలను మనం ఇలాగే భద్రపర్చుకుందాం. మరో వెయ్యేళ్లు గడిచినా జాతి మర్చిపోని ఈ గాన గంధర్వుడికి ఇలాగే నివాళి పలుకుదాం.

(ఫిబ్రవరి 11 ఘంటసాల వర్థంతి)

గమనిక: ఘంటసాల గారి వర్థంతి సందర్భంగా 2013-14లో నేను andhraprabha.com లో పనిచేసేటప్పుడు 'జాతి అమర గాయకుడు ఘంటసాల', 'కేవలం గాయకుడే కాదు' అనే పేర్లతో రెండు సంస్మరణ వ్యాసాలు 2014 ఫిబ్రవరి 11, 12 తేదీల్లో రాశాను. మొదటిది ఆయనపై నా అనుభూతి. రెండోది దాదాపు 40 ఏళ్ల క్రితం ఘంటసాల కన్నుమూసిన సందర్భంగా నాటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో కె. కుమార శేఖర్ అనే వ్యక్తి రాసిన అద్భుతమైన ఆంగ్లవ్యాసానికి స్వేచ్ఛానువాదం. andhraprabha.com ఇప్పుడు లేదు. దాంట్లో ఆరునెలలపాటు శ్రమించి నేను రాసిన వందలాది వ్యాసాలూ లేవు. బ్లాగు రూపంలో అయినా దొరికిన కొన్ని రచనలనయినా భద్రపర్చుకోవాలనే పేరాశతో ఈ ప్రయత్నం.
(పేరాశ అని ఎందుకంటున్నానంటే వారం క్రితం వరకు పనిచేసిన నా చందమామ చరిత్ర బ్లాగ్ మళ్లీ ఆన్‌లైన్ నుంచి కనుమరుగైంది. మళ్లీ వస్తుందో లేదో తెలీదు. blaagu.com వారి డొమైన్‌లో blaagu.com/chandamamalu అనే పేరుతో నేను రూపొందించుకున్న 'చందమామ చరిత్ర' బ్లాగు అది. జల్లెడ.కామ్ వారు మరోసారి ఈ విషయమై నాకు సహాయం చేస్తే బాగుండు.)

రాజశేఖర రాజు
8341571371
హైదరాాబాద్