Pages

Friday, January 19, 2018

కొత్త రాష్ట్రంలో తెలంగాణా విస్మృత అధ్యాయమేనా?

తెలంగాణలో కవులు, రచయితలు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అవార్డులకోసం, రివార్డుల కోసం, శాలువాల కోసం కవులు, రచయితలు ప్రభుత్వం ముందు సాగిలపడిన ఇంత సాంస్కృతిక దిగజారుడుతనాన్ని ఏనాడూ చూడలేదని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారాతెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్ తిరుమలరావు గారు ఇది నిజమే అని ఢంకా భజాయించి చెబుతున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే...

ప్రభుత్వంశాలువాలు కప్పుకున్న గాయకులుకవుల్ని చూసి ‘‘నాభిల సల్ల పడ్డరు ఇక నవాబుకి జవాబేమిస్తరు’’ కలాలు నిస్సిగ్గుగా తల వంచాయి. వీరు నిజానికి నియ్యత్ లేని నిప్పులే’  కాని చెద పట్టిన నిప్పులు అయ్యారని భావిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే ఏమి కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యం అయ్యాయి. రోశాల పాటగాడికి వేశాలు మెండు’ అనే సామెత నిజం అయ్యిందని బాధ పడుతున్నారు. ఆనాడు పాటలు పాడినవారుఆటలు ఆడిన వాళ్ళని చూసి ఎకెసక్కాలాడుతుండ్రు. ప్రజల సాంస్కృతిక చరిత్రలో ఇంత దిగజారుడుతనాన్ని ఏనాడు చూడలేదని ఒకటే బాధ. వీళ్ళ లాంటి వారిని చూసి నమ్మదినికడపటనెనరు లేదన్నరట’ అలాంటి వారు ఈ కవులు అని చెవులు కొరుక్కుంటున్నరు. ఈ కవులను చూశాక పిట్టల దొరలు అంతరించి పోయారు. కాని కొత్త దొరలు ఈ కొత్త పిట్టలదొరలను సృష్టించుకున్నారని అంటున్నారు. నక్క సుట్టు నాలుగు గుడ్డి దీపాలు’. ఆ నక్కప్రజలకు చెబుతున్నదేంటే లోకమంతా వెలుగులే’ నమ్మండి అని. సుక్క నూనె లేదు. వెయ్యి దీపాలు వెలిగిస్తా’ నని హెచ్చులు పోయేవారిని ఎగతాళి పట్టిస్తున్నారు. ఈ భాష పాలకులకి వినరావడం లేదు. ఇది తరతరాల ప్రతిఘటన భాష.

జయధీర్ తిరుమల రావుగారి రచన సంక్షిప్తపాఠం సాక్షి నేటి సంచిక -19-01-2018-లో అలసిన తెలంగాణ ఆకాంక్షలు పేరట ప్రచురితమైనది. సాహిత్య అకాడెమీలకు, బీసీ కమీషన్లకు, కాసిన్ని కాసులకు, దుశ్శాలువలకు తెలంగాణ రచయితలు ఇంతగా అమ్ముడుపోతారా, అమ్ముడు పోవాలా అంటూ జనం ఘోష సాక్షిగా జయధీర్ తిరుమల రావు గారు రాసిన రచనకున్న చారిత్రక ప్రాధాన్యత రీత్యా దాని పూర్తి పాఠాన్ని అధ్యయనం, అవగాహన కోసం ఈ బ్లాగులో ప్రచురిస్తున్నాను. తెలంగాణ జనజీవితంలోంచి ఊరి వచ్చిన సామెతల నిసర్గ సౌందర్యాన్ని జయధీర్ గారు రాసిన కింది వ్యాసంలో విస్తృతంగా చూడవచ్చు.

కొత్త రాష్ట్రంలో తెలంగాణా విస్మృత అధ్యాయమేనా?
మూడున్నరేళ్ళ కాలంలో తెలంగాణఎంత వెలిగిందో తేటతెల్లంగా మాట్లాడుకోలేకపోయాం. ఎవరు, ఏది మాట్లాడినా తెలంగాణా వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. ప్రతిపక్షం అని నిందించడం మామూలైంది. లేదా ఎవరో ఒకరితో ఖండింపచేయడం ఆనవాయితిగా మారింది. నిజానికి ఆనాడు తెలంగాణ సాధన అవసరం ఏమిటి? రాష్ట్రం వచ్చాక ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీరాయా లేదా మరింతగా వాటి ప్రాసంగికత సంతరించుకుందా అని ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.

ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నా అక్కడ ప్రజలువ్యతిరేకించలేదు. కొద్దిమంది పెట్టుబడిదారులు తప్ప. తెలంగాణా ప్రజలు మూకుమ్మడిగా మలిదశలో రెండు దశాబ్దాలుగా నిరవధికంగా ఉద్యమాలు చేశారు. నాటినుండి రాష్ట్రం సిద్ధించే వరకు ఒకే ఆశ. ఒకే ఆశయం. ఒకే క్రమశిక్షణ. పాలకులు ప్రజల ఓపిక తాడు తెంపినప్పుడు మాత్రమే ధర్మాగ్రహం పెచ్చుపెరిగింది. సాగరహారం, రాష్ట్రవ్యాప్త బందులు, ఊరూరా ధర్నాలు, ఊరేగింపులు ఉధృతంగా జరిగాయి.

ఈ ఉద్యమానికి నిరుద్యోగులు, యువకులు, వర్శిటీ విద్యార్థులు, రైతాంగం, అధికార వ్యవస్థలని ఎదిరించిన కవులు, రచయితలు, మేధావులు ఒక్కొక్కరే రంగప్రవేశం చేశారు. ఆ తరువాతే రాజకీయ నాయకులు కళ్ళు తెరిచారు. తెరాస పార్టీ ఆవిర్భవించింది.

ఉద్యోగాలు, అన్ని రంగాలలో వాటా, మూసివేసిన మిల్లులు, ఫాక్టరీలు తెరవడం, సాంస్కృతిక సంపద పరిరక్షణ, కరుడుగట్టిన దళారి పాత్ర వ్యతిరేకత, తెలంగాణా ఆత్మగౌరవ భావన, విద్య, భాష, సాహిత్య, సాంస్కృతిక, పరిశోధన రంగాలలో జరిగిన అవమానం, అన్యాయం ఉద్యమానికి ముఖ్య కారణాలు. ఐతే రాష్ట్రం వచ్చాక ప్రజల ఆకాంక్షల్ని పక్కన పెట్టి తెరాస అధినాయకుల అభీష్టాలకోసం, ప్రయోజనాల కోసమే పాలన ఆరంభమైంది. ఇప్పటివరకు అదే రీతిలో ఆగకుండా కొనసాగుతున్నది.

ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే ఇప్పుడిక తెరాస ఉద్యమ పార్టీ కాదు అని ప్రకటించారు. గద్దెనెక్కింది మాత్రం ఉద్యమ పార్టీగానే. అన్ని బూర్జువా పార్టీలలాగే ఎన్నికల పార్టీ అనే సంకేతం ఇచ్చారు. అన్ని పార్టీలు లోగడ తెలంగాణ ప్రజలను వంచించిన విధంగానే, ఆ పార్టీలు ప్రవర్తించిన రీతిలోనే తెరాస ఉంటుందని వారి భావనేమో.

ఈ ప్రకటన వెలువడినప్పుడే ప్రజల నుంచి, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన రావలసింది. అందుకు వ్యతిరేకంగా పోరాటం జరగవలసి ఉండింది. మావోయిస్టు ఎజండా మా ఎజండా అని ప్రకటించిన అధినాయకుల ప్రకటన ఆంతర్యాన్ని బట్టబయలు చేయవలసి ఉండింది. కాని ఎందుచేతనో దాని గురించి సీరియస్‌గా ఆలోచించలేదు. అదిగో! అప్పటి నుండే తెలంగాణ ప్రజల వాంఛలకు, బతుకులకు వ్యతిరేక దిశలో పాలన మొదలైంది. ఎన్నికల ప్రణాళికలో ఉంచిన ప్రధానమైన అంశాలు పక్కన పడినాయి. అవి కేవలం సైనుబోర్డులకి, ఫ్లెక్సీలకి, పత్రికలలో పేజీల నిండా ప్రకటనలకి, రంగు రంగుల కరపత్రాల ప్రచారానికే ఎక్కువ పరిమితం అయ్యింది.

ఆ వెంటనే రాష్ట్రంలో ప్రజావ్యతిరేక భూసామ్య పెత్తందారీ విధానం అమలులోకి వచ్చింది. బ్రాహ్మణ, పాలకవర్గాలకి ఇచ్చిన ప్రాధాన్యతలో పది శాతం కూడా కింది వర్గాలకి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చుట్టూరా ఆ శక్తులే ఎక్కువగా మోహరించాయి. చండీయాగం తరువాత ఈ సంస్కృతికి రాష్ట్రమంతా ద్వారాలు తెరుచుకున్నాయి. ఇరవై శాతం పాలక వర్గాల ప్రయోజనాల ముందు ఎనభైశాతం ప్రజల మత సాంస్కృతిక సాహిత్య చరిత్రలు దిగదుడుపు అయ్యాయి. దీనిని కప్పి పుచ్చడానికి కొత్తగా, కులాలవారిగా, మతాలవారిగా పథకాలకు రూపకల్పన చేశారు. దీనిని గమనించిన ప్రజలు ఇలా అనుకున్నారు.

గురిజెత్తు బంగారం చూపి మణుగెత్తు మరకతం ఇస్తాఅన్నాడనే సామెత గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందంటూనే ప్రపంచ బ్యాంకు నుండి లక్షల కోట్ల అప్పు తీసుకోవడం, ప్రజలపై ప్రత్యక్షంగా భారం వేయడమే. వచ్చేవి తొంభైఆరు ఇచ్చేవి లెక్క తీయంగ ఆరేఅనే సూక్తి ఇందుకోసమే పుట్టింది. వరిగడ్డి మంట పెట్టి ఏడాది పొడుగు దీపాల వెలుగుఅనే సామెత ఇలాంటి ప్రభువులను చూసే ఆనాడు పుట్టి ఉంటుంది. ఈనాడు దానిని సందర్భోచితంగా గుర్తు చేసుకుంటున్నారు.

ఎక్కడా, ఏ రూపంలోనూ ఆలనలో, పాలనలో తెలంగాణ మాట లేదు. ముచ్చట లేదు. అధినాయకుల కీర్తనే. జై తెలంగాణఅని ఎవరూ నినదించడం లేదు. తెలంగాణా ఆత్మాభిమానం తాకట్టు పెట్టి వందకోట్లతో తెలుగుకు తారాజువ్వల వెలుగులు అద్దారు. ఆనాటి ఉద్యమ భావనలకు ఇలాంటి కార్యక్రమాలు విరుద్ధం. విచారం పెద్ద, విత్తులు తాలుఅనే నానుడిని ప్రజలు ఈ సందర్భంగా వాడుకుంటున్నారు.

కేవలం పదిమందికే ప్రయోజనం దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. అధినాయకుని గడీలోని వారికే సంతసం. మిగతా వారంతా డమ్మీలే. ఎన్నో ఏళ్ళుగా ఉద్యమం చేసిన అమాత్యులకి, ఎమ్మెల్లేలకి, నాయకులకి సరైన గౌరవం ఏ రూపంలోనూ ఇవ్వడం లేదని ప్రజలకి అర్థమైంది. రాష్ట్ర ఆదాయంలో ప్రజలకి ప్రత్యక్షంగా దక్కేదెంత అనే ఆలోచన బంగారం నడుం బంటి ఉంది. సింగారం మాత్రం చెప్పులెత్తు లేదుఅనీ, ‘రాజులు పెరిగిండ్రు. జనాలు తరిగిండ్రుఅని తలసరి ఆదాయం పెరగవలసిన పేద ప్రజలు ఆర్థిక భారంతో బతకలేక కుంగిపోతున్నారు.

ఎందుకోగాని సంకల తెలంగాణా పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకులాడుతున్నామని అనుకుంటే తప్పనిపించడం లేదు. దేశానికే తలమానికమైన రామప్ప, గణపురం, వరంగల్ కోట, హనుమకొండ వంటి అనేక శిథిల శిల్ప కళా ఖండాల పరిరక్షణ ఊసలేదు. వాటి పరిస్థితి రోజు రోజుకు దిగజారి పోతున్నది. సున్నకు సున్నా. హళ్ళికి హళ్ళి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. ఇప్పుడు గొర్రెలకు, మనుషలకు తేడా లేదు. తెలంగాణాలో పేరు పెరుమాళ్ళది. ఆరగింపు మాత్రం అయ్యగార్లదే’  లాగా, ‘పులగం పెడుతానన్న దొర సొట్ట గిన్నె కూడ లాక్కు పోయిండన్నచందంగా మారిపోయింది. లెక్కలు చెప్పుతున్నరు. చుక్కలు చూపిస్తున్నరుఅంతా టక్కరితనమే. పాత దొరలందరు నేతలైండ్రు. ఆనాడు జెండ పాతిన చెలకలన్ని దొరలకు చేరుతున్నాయి. అంటరానోళ్ళకు మూడెకరాల భూమి ఆశ చూపి, అడియాస చేసిండ్రు.

పత్తి గింజల్ని ముత్యాలు చేసిండ్రు, ముడుపులు చెల్లించి మళ్ళీ వాటిని కొనుక్కొంటున్నరుఅన్న చందాన భూ పందేరం ఉంది. పండుగైనంక ఇల్లు పడావు పడినట్లున్నదిఇప్పుడు తెలంగాణ! ఐతే ఈ విషయం పాలకులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ధగ ధగల సైనుబోర్డుల వెలుగులే సత్యమని నిత్యమని నమ్ముతున్నారు. మేడిపండు చూడ.... వేమన పద్యం తప్పు అని పద్యాల మాస్టరు నిరూపిస్తున్నారు. ఆనాడు ఈనాడు ఎక్కువ మాటలు చెప్పినోడు ఊరికి పెద్ద’. పాత వ్యవస్థకు కొత్త ప్రాణం. ఇప్పుడు కూడా తక్కువ తిన్నోడు గడిల వెట్టి వంతులోడుఅయ్యిండు. బావిల పడ్డోన్ని తీయడానికి బంగారు తంతెలు పరుస్తారటపాలకులు. ఇదీ ఇవ్వాళ బంగారు తెలంగాణ బతుకు. తిన్నమ్మకు తిన్నంత’. బోడితలకు మొట్టికాయలేమిగులుతాయి. కాని ఆ బోడి తలలే ఆనాడు నైజాం కిరీటాన్ని, దేశముఖుల హోదాలని, దొరల గడీలను కూల్చివేశారు.

ఇప్పుడు తెలంగాణ ప్రజల మనసులు బాగోలేవు. అందుకే పాత నానుడులు, జాతీయాలు, సామెతల వాడుక మెల్లి మెల్లిగా మొదలైంది. ఒక కొత్త విచారధార వారి పదాల్లో తొంగి చూస్తోంది.

మాకు మా అసలు తెలంగాణ, కోరిన తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణా ఆత్మరహిత తెలంగాణ. నిర్జీవ తెలంగాణ. తెలంగాణ జీవ ధాతువులకి గుర్తింపు లేని తెలంగాణ. ప్రజల అస్తిత్వం, కాంతి లేని రోల్డు గోల్డు తెలంగాణ వచ్చింది. వచ్చింది పాలకవర్గాల తెలంగాణే. ఇది ప్రజలు ఊహించని పరిణామం. పైగా తెలంగాణా తల్లికి గౌరవం లభించడం లేదనే ఆలోచన అంతటా పెరిగింది. మళ్ళీ ఒక పోరాటం చేయాలెఅని నిర్ధారించుకున్న శబ్దం వినవస్తోంది. తెలంగాణ ఉద్యమం కొనసాగాలనే ఆలోచన విస్తరిస్తుంది.

ఇప్పుడు ప్రతి మాటకు, ప్రతి ప్రజల ఆటకు, సభలో జై తెలంగాణనినాదం మారుమోగాలని ఆలోచిస్తున్నారు. సద్ది తిన్న రేవుని తలవనివారికి బుద్ధి చెప్పాలని యోచన చేస్తున్నారు. తియ్యటి మాటలకు తీర్థం పోతే వాడు (గడీలనో), గుడిలోనో నేను మాత్రం చలిలోఅనే సామెత నిజం చేసినందుకు పాలకుల స్వభావాన్ని అభినందించాలి. చెప్పింది దండి  చేసింది మొండిఅని ప్రభుత్వానికి తెలిసినా దానిని వాళ్ళు ఒప్పుకోరు. ప్రజలు మాత్రం దొప్పెడు అంబలి కోసం, దోసి అంబలి పారబోసుకున్నారు’. మరోసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణా పేర ఏర్పడిన పార్టీ, ప్రభుత్వం చేతిలో ఓడిపోయినట్లుగానే లెక్కిస్తున్నారు. ఇంతటి దుర్గతిలో కూడా ప్రస్తుత పాలకవర్గాలకి, పార్టీలకి ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నారు. మళ్ళీ ఎవరు తెలంగాణ అంటారో వారికి మద్దతు ఇస్తాం. మోసపోకుండా జాగ్రత్త తీసుకోవడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

వచ్చిన భౌగోళిక సరిహద్దుల్లోనే తమ నూతన విజయం దాగుంది. దానిని ఇప్పుడు ఎనభై శాతం ప్రజలకి ఎలా వర్తింపచేయగలం అని ఆలోచిస్తున్నారు. కాని ప్రభుత్వం, శాలువాలు కప్పుకున్న గాయకులు, కవుల్ని చూసి ‘‘నాభిల సల్ల పడ్డరు ఇక నవాబుకి జవాబేమిస్తరు’’ కలాలు నిస్సిగ్గుగా తల వంచాయి. వీరు నిజానికి నియ్యత్ లేని నిప్పులే’  కాని చెద పట్టిన నిప్పులు అయ్యారని భావిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే ఏమి కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యం అయ్యాయి. రోశాల పాటగాడికి వేశాలు మెండుఅనే సామెత నిజం అయ్యిందని బాధ పడుతున్నారు. ఆనాడు పాటలు పాడినవారు, ఆటలు ఆడిన వాళ్ళని చూసి ఎకెసక్కాలాడుతుండ్రు. ప్రజల సాంస్కృతిక చరిత్రలో ఇంత దిగజారుడుతనాన్ని ఏనాడు చూడలేదని ఒకటే బాధ. వీళ్ళ లాంటి వారిని చూసి నమ్మదిని, కడపట, నెనరు లేదన్నరటఅలాంటి వారు ఈ కవులు అని చెవులు కొరుక్కుంటున్నరు. ఈ కవులను చూశాక పిట్టల దొరలు అంతరించి పోయారు. కాని కొత్త దొరలు ఈ కొత్త పిట్టలదొరలను సృష్టించుకున్నారని అంటున్నారు. నక్క సుట్టు నాలుగు గుడ్డి దీపాలు’. ఆ నక్క, ప్రజలకు చెబుతున్నదేంటే లోకమంతా వెలుగులేనమ్మండి అని. సుక్క నూనె లేదు. వెయ్యి దీపాలు వెలిగిస్తానని హెచ్చులు పోయేవారిని ఎగతాళి పట్టిస్తున్నారు. ఈ భాష పాలకులకి వినరావడం లేదు. ఇది తరతరాల ప్రతిఘటన భాష.

ఇప్పుడు, తెలంగాణా ఆత్మ, నాలుగు కోట్ల ప్రజల గుండెలను తట్టి లేపుతున్నది. నక్కను తొక్కి వచ్చినవాడికి శత్రువు ఆ నక్కే. నక్క జిత్తులు ఎన్ని వేసినా నక్కలకి తెలిసిపోతుంది. ఇవి విశ్వాసపాత్రమైన కుక్కల్ని చూసి పారిపోక తప్పదు. సీమాంధ్ర నాయకులను ఎంత రాపాడారో ఈ కవులు మరిచి పోయారు. ఇప్పుడు ఆంధ్రపాలకుల కన్నా అన్నింటిలోనూ ఒక ఆకు ఎక్కువే చదివిన వాళ్ళని చూసి దండం దొరా! అని పక్కకి తప్పుకుంటున్నారు. కాని వారిని వదలకుండా పాత బాకీతే! అంటున్నారు.

ఉమ్మడి పాలనలో మిస్అయిన సన్మానం, ప్రతి శాలువ తనకే కావాలని సర్కారీ కవులు కంకణబద్దులయ్యారు.  ఈ మూడున్నరేళ్ళలో కవుల మతలబు ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నాలిక మీద ప్రేమ. నాభి కాడ కోపంకలిగిన పాలకుల అసలు స్వభావం అర్థం చేసుకున్నారు. గాచారం దప్పి గడీలకు పోతే ఆచారం దప్పక అణగబెట్టిండ్రటఇలాంటి వ్యవస్థని నిరాకరించిన తెలంగాణా ప్రజలు నాటిని గుర్తు తెచ్చుకుంటూ నేటి ప్రతిఫలనాలను లోతుగా అర్థం చేసుకుంటున్నారు. తొండకు దొరతనమిస్తే ప్రహరి గోడ మీద సవారి చేసిందనే నానుడిని, ‘ఊసరవెల్లి అసలు రంగు మోసమేఅని తెల్లంగా గ్రహించారు.

దూరపోని (సీమాంధ్రుల) మీద దుంకులాడి తనవాడి (తెలంగాణ ప్రజల) మీద నిప్పులు పోస్తున్నవైనం చూస్తున్నరు. తెగిన బొక్కెన ఎక్కడి వరకే అంటే, నూతిల దాకనేకదా అని చెప్పిన సత్యాన్ని అర్థం చేసుకున్నారు. అంతే సులువుగా తమ ఆగ్రహావేశాలను నుడికారాలలోంచి వెళ్ళగక్కుతున్నారు. ఇప్పుడు పాటలు, కళారూపాలు కాదు. ధూం ధాంలు అసలే కాదు. మాటలను, శబ్దాలను ఉద్యమం తెలంగాణలో జరగవలసినవి తక్కువ జరిగాయి. జరగకూడనివి అతి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిమధ్య సమతౌల్యత లేని కారణంగా తెలంగాణాలో అనిశ్చిత వాతావరణం నెలకొంది. అశాంతి గాలులు వీస్తున్నాయి. ఇవి ఈ ఏడాది చలి గాడ్పులకన్నా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఈ వాతావరణంలో మరోసారి తెలంగాణా ఉద్యమ ఉష్ణోగ్రతలో ప్రజలు సేద దీరాలనుకుంటున్నారు!

ఇప్పుడు ఏ పార్టీ, ఏ పంథా అయినా మరోసారి తెలంగాణకు సైఅంటుందో వారికే ఇక్కడ భవిష్యత్తు ఉంది. మార్క్సిస్టు పార్టీ తన గత పాత్రకి అపాలజీ చెప్పి తెలంగాణాకి అంకితం కావాలి. అప్పుడు పోషించని పాత్రని ఇప్పుడు త్యాగాలతో పూర్తి చేయాలి. ఎన్నికలు ముఖ్యంకాదు. తెలంగాణా ప్రజల పూర్తి కాని ఆకాంక్షలే ప్రధానం. కాంగ్రెస్ పార్టీ పోరాడకుండానే కేవలం పార్లమెంటరీ పోరాటం ద్వారా తెలంగాణాకి మార్గం వేశారు. కాని ఇప్పుడు అధికారం కోసం రాజకీయాలు ఆపి పరిపూర్ణ తెలంగాణా కోసం పోరాడాలి. జైళ్ళకైనా వారు వెళ్ళగలగాలి. తమ నిజాయితిని చూపగలగాలి. రెండు కళ్ళ దృష్టిని ఒకే చూపుగా మార్చుకుని టీడీపి పార్టీ పాప ప్రక్షాళన చేసుకోవాలి. పసుపురంగుని తెలంగాణా ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంగా మలచుకోవాలి. వరంగల్‌లో ఇరవై ఏళ్ళ కింద డిక్లేరేషన్ కాదు. ఇవ్వాళ తెలంగాణ మూడున్నరేళ్ళలో బలపడాల్సిన వాళ్ళు బలహీనం కావడానికి తెలంగాణా గౌరవాన్ని విస్మరించి, పాలక వర్గాల పాచికలో పడిపోలేదని ఎలుగెత్తాలి. బడుగు జనాల పోరాటానికి, ఓ మెట్టు కిందకు దిగి ప్రజలతో కలసి మమేకం కావాలి. జేఏసీలు వేసిన పప్పులో కాళ్ళని బయట పడేసుకుని ఆత్మ విమర్శ చేసుకుని సరిదిద్దుకోవాలి. ఎందుకు తాము బలహీన పడినామని తమలోకి చూసుకోవాలి. ఎవరినీ కలుపుకుని పోని విధానాన్ని తప్పుగా ఒప్పుకోవాలి.

అందరూ అంతో ఇంతో ఎంతో చేశారు. కాని అది సరిపోలేదు. ఈనగాచి పందులకు పెట్టినట్లుఆనే సామెతలా కాకుండా శ్రమ జీవులకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి కొత్తగా ఆలోచించాలి.

నూతిలో తుపాకి గుండేసి తూటు చూపియ్యి అన్నాడటవెనకటికో దొరగారు. ఆనాటికది సామెత! నేడు ప్రజలు తమ గుండెలు విప్పి చూపి అన్నీ తూటులే అని అంటున్నారు. మా ఊరి దొరగారి బర్రె కొమ్ములకు మా మంచి బంగారి నిగనిగలుఅని ఇప్పుడు ప్రజలు చంకలు గుద్దుకోవడం లేదు. తెలంగాణాలో బంగారం అంతా ఎక్కడ ఎక్కువగా కుప్ప కూడుతున్నదో కళ్ళు విప్పి చూస్తున్నారు. లెక్కలు కడుతున్నారు. మొలిచే కొమ్ములను వంచడానికి మార్గం వెదుకుతున్నారు. చల్లబడిన సిద్ధాంతాలను పెనం మీద కాదు, అగ్గి కొలిమిని రాజేసి పరీక్షిస్తున్నారు. వేశాలు దొరలవి రోశాలు కావుఅవి దోపిడి మార్గాలు అని నిరూపించ దలిచారు. నియ్యత్ లేని దొర పాలనలో బర్కత్ లేని ప్రజ’  ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ తెలంగాణ పోరాటం అన్ని శక్తులను కలుపుకొని కొత్త పల్లవి అందుకుంటుంది.

తెలంగాణ ఉద్యమం గతం కాదు. అది రేపులో కదలాడుతున్నది.

గురిజెత్తు ఆశయం, గురి చూసి కొట్టే అమ్ముల పొదిలా ఉంది పరిస్థితి. తెలంగాణా ఎన్నడూ పాలకులకు సింహస్వప్నమే. అసలు సిసలు తెలంగాణా సాధన కోసం ఉద్యమం కొనసాగింపు దిశగా కదులుతుందా?

జయధీర్ తిరుమలరావు
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు
మొబైల్ : 99519 42242

సాక్షి పత్రికలో వచ్చిన సంక్షిప్త పాఠం కింది లింకులో చూడవచ్చు.

అలసిన తెలంగాణ ఆకాంక్షలు
https://www.sakshi.com/news/guest-columns/desires-weary-telangana-972139

2 comments:

sam said...

dear sir very good blog and very good content
Latest Telugu News

kanthisena said...

కృతజ్ఞతలు శామ్ గారూ

Post a Comment