Pages

Sunday, February 28, 2016

న్యాయం లభించని నేలపై నిరసన కూడా నేరమేనా?

(జేఎన్‌‍యూలో దేశద్రోహ చర్యలు జరిగిపోతున్నాయంటూ ఆరోపణలు, చర్యలు మొదలైన తొలి రోజుల్లోనే ఫిబ్రవరి 14న ఆ ఘటనలపై స్పందిస్తూ ప్రముఖ కాలమిస్టు ఆకార్ పటేల్ రాసిన కథనం ఇక్కడ పోస్ట్ చేయడమైంది. ఈ సమస్యను మరింత ఓపికతో అర్థం చేసుకుని ఉంటే బాగుండేదనేది వ్యాసకర్త ప్రధాన అభిప్రాయం.)

మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ 1931 అక్టోబర్‌లో అంబేడ్కర్ గురించి మాట్లాడుతూ, ‘‘కటువుగా, దూకుడుగా ఉండటానికి ఆయనకు పూర్తి హక్కు ఉంది. కానీ మన తలలు బద్దలు చేయకుండా ఆయన తన్ను తాను నియంత్రించుకున్నారు’’ అన్నారు. తనపై, తన కమ్యూనిటీపై జరుగుతున్న  దౌర్జన్యాలపై అంబేద్కర్ తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో గాంధీ అలా అన్నారు. తాను ఉపయోగిస్తున్న పదాల విషయంలో అంబేద్కర్ చాలా కఠినంగా ఉంటారని ప్రతీతి.

ఇప్పుడు మరొక కళాశాలలో జరిగిన నిరసన కార్యక్రమం పాలక పార్టీ ఆగ్రహాన్ని చవిచూడటం గురించి నేను ఆలోచిస్తున్నాను. అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిరసన తెలిపిన విద్యార్థులపై ఢిల్లీలో పోలీసులు దేశద్రోహ ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ‘తమ ప్రభుత్వంపై ప్రజలు అవిధేయత ప్రకటించేలా మాట్లాడటం, రాయడం లేదా వారిని ప్రోత్సహించేలా ఏవైనా చర్యలు చేపట్టడం ద్వారా చేసే నేరమే’ దేశద్రోహం అంటున్నారు.

విద్యార్థులను రాజ్యాంగ వ్యతిరేకులుగా, జాతి వ్యతిరేకులుగా పేర్కొంటూ తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ మనీష్ గిర్రీ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ‘అలాంటి అవమానకరమైన, దేశ వ్యతిరేక చర్యలు పునరావృతం కాకుండా ఈ నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్య తీసుకోవాల’ని కోరుతూ గిర్రీ.. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీలకు ఉత్తరం రాశారు.

యాకుబ్ మెమొన్‌ను ఉరితీయడంపై హైదరాబాద్‌లో నిరసన తెలిపిన విద్యార్థులపై బీజేపీ కఠినంగా వ్యవహరించిన ఘటన ఢిల్లీలో పునరావృతమైంది. నిరసన తెలిపిన విద్యార్థులలో ఒకరు తనకు తాను ఉరివేసుకున్న విషాదంతో హైదరాబాద్ ఉదంతం ముగిసింది. అలాంటి నిరసన చర్యను తాను అనుమతించలేదని చెప్పిన జేఎన్‌యూ ఒక విచారణ కమిటీని ఏర్పర్చింది కానీ, కమిటీలో ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్య ఇక్కడా ఎదురైంది. వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఏ సభ్యుడూ ఈ కమిటీలో లేరని విద్యార్థి సంఘం పేర్కొంది.

బీజేపీకి ఇక్కడ మరొక అవకాశం ఉంది. విద్యార్థులపై నేరారోపణ చేయడానికి బదులుగా, సమస్యను అర్థం చేసుకోవడానికి అది ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ సమస్య కులంతో నేరుగా సంబంధం కలిగి ఉంది. మెమొన్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో దళితులు ఎందుకు నిరసన తెలిపారు? జేఎన్‌యూలో ముస్లింలపై ఎందుకు దృష్టి కేంద్రీకరించారు? ఒక కమిటీ తమపై ఒక తీర్పు చెబుతున్నప్పుడు దాంట్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని విద్యార్థులు ఎందుకు పట్టుబడుతున్నారు? ఎందుకంటే భారతదేశం చాలావరకు దళితులు, ముస్లింల కోసమే ఉరిశిక్షను పరిమితం చేసి ఉంచిందన్నది వాస్తవం.

దేశంలో 75 శాతం మరణ దండనలు, ఉగ్రవాద చర్యలకు గాను విధించిన మరణ శిక్షల్లో 93.5 శాతం వరకు దళితులు, ముస్లింలే ఉన్నారని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ ఏడు ప్రచురించనున్న అధ్యయనం సూచిస్తోంది. ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్న సమస్య ఏమిటంటే పక్షపాత ధోరణే.

మాలెగావ్ బాంబు దాడుల కేసు చెబుతున్నట్లుగా అగ్రవర్ణ హిందువులు పాల్గొన్న ఉగ్రవాద చర్యలపై ప్రభుత్వం కఠినచర్య తీసుకున్న దాఖలాలు లేవు. రాజీవ్‌గాంధీ హంతకులు తమపై విధించిన ఉరిశిక్ష అమలుకు దశాబ్దాలుగా ఎదురు చూస్తుండగా, పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హంతకుడిని ఉరితీయడంలోనూ మన పాలక వ్యవస్థ ఎలాంటి ఆతృతనూ ప్రదర్శించి ఉండలేదు. కానీ ఉగ్రవాద ఆరోపణలతోనే వీరికీ ఉరిశిక్ష విధించారు. ఒకే విధమైన చట్టాలతో దేశంలో నేరస్థులపై నిర్ణయాలు చేయడం లేదన్నదే వాస్తవం. 95మంది గుజరాతీలను నిలువునా ఊచకోత కోసిన మాయాబెన్ కొద్నాని వంటివారిని కనీసం జైల్లో కూడా ఉంచలేదన్న విషయాన్ని పక్కన బెడదాం.

ఇక్కడ రెండో విషయం ఏమిటంటే ఆర్థికం. దళితులు, ముస్లింలు పేదరికానికి పర్యాయపదాలు. ట్రయల్ కోర్టు దశలో అఫ్జల్ గురుకు దాదాపుగా న్యాయ సహాయం లభించలేదు. ఈ వాస్తవాల ప్రాతిపదికన దళితులు, ముస్లింలు వారి మద్దతుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. తమ నిరసనను వ్యక్తీకరించడానికి వారికి పూర్తి హక్కు ఉంది. వారు అదుపు తప్పిన వారిగా, స్థిమితం కోల్పోయిన వారిగానూ కనిపించవచ్చు కానీ, వారు వాస్తవం ప్రాతిపదికపైనే వాదిస్తున్నారు. భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరించిన వారికి వ్యతిరేకంగా కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్మృతి ఇరానీకి ఉత్తరాలు సంధించింది బీజేపీ ఎంపీలే.

మనది సంపూర్ణమైన, లోపరహితమైన సమాజమనీ, దానికి ప్రతి ఒక్కరూ విధేయులై ఉండాలనే కాల్పనిక భ్రమలను భారతీయులందరూ అందిపుచ్చుకోవాలని అగ్రకులాల్లోని మనం బలవంతం చేస్తున్నాం. హిందుత్వ సమాజమే ప్రధానంగా మధ్యతరగతి, అగ్రవర్ణాలతో కూడుకున్నది. తమకున్న సౌకర్యాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయని గ్రహిస్తున్నందున, వీరు రిజర్వేషన్లు అనే భావననే అసహ్యించుకుంటున్నారు. గర్హిస్తున్నారు.

అందుకే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సైతం రిజర్వేషన్లను సమర్థించడం లేదు. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చేసిన ప్రకటనలు ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ పుట్టి ముంచిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని స్పందన ఎలా ఉంది? ప్రతిపక్షం కట్టుకథలల్లుతోందని, అబద్దాలాడుతోందని ఆరోపించడానికే మోదీ పరిమితమయ్యారు.

కాని క్షేత్రస్థాయిలో వాస్తవాలు అత్యంత స్పష్టంగా ఉన్నాయి. ఇవాళ దళితులు నోరు విప్పుతున్నారు, వారి హక్కుల కోసం నిలబడుతున్నారు. దీంట్లో ఎలాంటి తప్పూ లేదు. దుందుడుకు భాషను వాడుతున్నంత మాత్రాన వారిని నేరస్తులుగా భావించకూడదు. నేడు వారు సంధిస్తున్న నినాదాలకు వ్యతిరేకంగా స్పందించడానికి, ఆగ్రహించడానికి బదులుగా ప్రభుత్వం వారితో చర్చలు జరపటం, వారి వాదనను కనీసం వినడానికైనా ప్రయత్నించడం ముఖ్యం.

మొదట హైదరాబాద్‌లో, ఇప్పుడు ఢిల్లీలో విద్యార్థులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో హిందుత్వ నేతలు ప్రదర్శిస్తున్న అసంబద్ధ ప్రతీకార చర్యలను... ఈ కథనం మొదట్లో పేర్కొన్నట్లుగా, అంబేడ్కర్ ఉపయోగించిన పదాల కాఠిన్యంపై గాంధీజీ ప్రదర్శించిన విజ్ఞతతో సరిపోల్చి చూడండి.

ఈ సమస్యలపై మనం కాస్త పరిపక్వతతో కూడిన అవగాహనను ప్రదర్శించాలి. ప్రభుత్వం ఈ దిశగా అడుగులేయడానికి ప్రయత్నించనంత కాలం... అత్యంత క్రూరంగా, పాశవికంగా మనం అణచివేస్తున్న వారు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో అవిధేయతను ప్రోత్సహించేలా మాట్లాడుతూ, రాస్తూ ఉండటమే కాకుండా అలాంటి చర్యలకు భవిష్యత్తులో కూడా పాల్పడుతూనే ఉంటే మనం ఏమాత్రం ఆశ్చర్యపోవలసిన పనిలేదు.

ఈ వ్యాసాన్ని కింది లింకులో కూడా చూడవచ్చు.

న్యాయం లభించని నేలపై నిరసన కూడా నేరమేనా



10 comments:

నీహారిక said...
This comment has been removed by the author.
నీహారిక said...

తమకున్న సౌకర్యాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయని గ్రహిస్తున్నందున, వీరు రిజర్వేషన్లు అనే భావననే అసహ్యించుకుంటున్నారు. గర్హిస్తున్నారు.

మీ అభిప్రాయం తప్పు.రిజర్వేషన్ అంటే అడుక్కోవడమే.ఒక మనిషి వికలాంగుడైతే తప్ప రోజుకి కనీసం 200 రూ సంపాదించుకునే వీలున్నది. ఒక 100 రూ ఖర్చుపెట్టుకున్నా 100 రూ దాచుకోవచ్చు.అందరికీ సమానంగా తెలివితేటలున్నపుడు ఉచితంగా ఎవరో ఏదో చేయాలని ఎందుకు కోరుతున్నారు ?
రోహిత్ మృతికి అతని తల్లి 50 లక్షలు డిమాండ్ చేస్తుంది.డేశం మొత్తానికి సంబంధించిన సభా సమయాన్ని ఒక్క రోహిత్ ఆత్మహత్య గురించి వినియోగించడం అవసరమంటారా ? ఆత్మహత్య చేసుకున్నందుకు ఆమె తల్లి కూడా ఒక కారణం అయి ఉండవచ్చు కదా ? రోహిత్ తన పుట్టుక పైనే అసంతృప్తి వెల్లడించాడు. సభా సమయాన్ని వృధా పరుస్తున్నందుకు,తన కుమారుడి మృతికి పరోక్షంగా కారణమయినందుకు అతని తల్లిని జైలుకి పంపించాలి లేదా అమెకి యావజ్జీవిత ఖైదు శిక్ష వేయాలి.

Anonymous said...

మేడం గారిది అసహనమనండి, లేదా ఆక్రోశమనండి.
సహేతుకమే.
అప్ కోర్స్ జవాబు అంత తిన్నగా రాదనుకోండీ.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
kanthisena said...

"రిజర్వేషన్ అంటే అడుక్కోవడమే"

నీహారిక గారూ, మీ ఈ వ్యాఖ్య రాజ్యాంగబద్ధమైనదా లేక రాజ్యాంగ విరుద్ధమైనదా అనేది ఒక్కసారి స్పష్టం చేయండి ముందు. అలనాటి అంబేద్కర్ గురించి నేటి శ్రీమాన్ మోదీ వరకు రిజర్వేషన్ లపై ఇంత గొప్ప వ్యాఖ్యలు చేయలేదు. మీ సాహసానికి జోహార్లు చెప్పాలి.

"అందరికీ సమానంగా తెలివితేటలున్నపుడు ఉచితంగా ఎవరో ఏదో చేయాలని ఎందుకు కోరుతున్నారు?"
అందరికీ సమానంగా తెలివి తేటలు ఉంటే ఈ దేశం తరతరాలుగా ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు ఏడుస్తుంటుంది? నూటికి 90 శాతం మందికి పైగా జనాభాకు ఇటీవలి దాకా ఏ అవకాశాలూ లేకుండా చేసిన దొడ్డ దేశం కదా మనది. మేలుకున్న కులాలు వర్గాలు ఇన్నాళ్లకైనా వారి హక్కులకోసం డిమాండ్ చేస్తుంటే, పొందుతుంటే కటంగింపు అవుతోంది చాలామందికి. ఇలాంటివారి జాబితాలో మీరు చేరడమేమిటండీ? ఒకటి మాత్రం నిజం. దేశాన్ని కొల్గగొట్టే తెలివితేటలు, దేశ ప్రజల మూల్గులు పీల్చే తెలివితేటలు అందరికీ లేవు లెండి. ఇవి మాత్రం మొదటినుంచీ కొందరికే ఉన్నట్లున్నాయి. అందుకే ఇలా ఏడుస్తున్నాం అందరం...

Anonymous said...

>>>అందరికీ సమానంగా తెలివి తేటలు ఉంటే ఈ దేశం తరతరాలుగా ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు ఏడుస్తుంటుంది? నూటికి 90 శాతం మందికి పైగా జనాభాకు ఇటీవలి దాకా ఏ అవకాశాలూ లేకుండా చేసిన దొడ్డ దేశం కదా మనది. >>>
ఎంత గొప్పగా చెప్పేరు. ఒకపక్క తెలివితేటలు లేవంటున్నారు మరో పక్క అవకాశాలు ఇవ్వలేదంటున్నారు, తమకే చెల్లింది.

Anonymous said...

చుండూరు దళితుల ఊచకోత కోసిన అగ్రవర్ణాల వాళ్లకి ఏ శిక్ష విధించింది ఈ వ్యవస్థ, చక్కగా వదిలేసి ఊరుకుంది, ఎవరికీ శిక్ష పడకపోతే ఎవరు చంపారు దళితులని పట్టపగలు? , కారంచేడు, నీరుకొండ లలో ఎంత మందికి శిక్ష పడ్డాయి, దళితులని ఊచకోత కోసిన ఎన్టీఆర్ వియ్యంకుడికి నక్సలైట్లు మాత్రమే శిక్ష విధించారు, కొన్నాళ్ళు పొతే ఈ ప్రభుత్వం ఆ ఊచకోత కోసిన అగ్రవర్ణాల వాళ్ళకి పద్మ భూషణం ఇస్తుంది మరి . దళితులకి ,ముస్లిములకి మాత్రమే శిక్షలు , ఉరి తీతలు రిజర్వ్ కాబడ్డవి . అదేమని అడిగితే దేశద్రోహం మరి, థూ ఈ వ్యవస్థ

Anonymous said...

చుండూరు దళితుల ఊచకోత కోసిన అగ్రవర్ణాల వాళ్లకి ఏ శిక్ష విధించింది ఈ వ్యవస్థ,

దళితులని ఈ వ్యవస్థ వాళ్లకి ఏ శిక్ష విధించలేదని అనుకోవద్దు. కోర్ట్ కెళ్ళిన మెజారిటి కేసులలో ఎవరికైనా సకాలాం లో శిక్ష విధించగా చూశావా? కోర్ట్ లు సక్కంగా పనిచేసి ఉంటే ఈదేశం ఎప్పుడో బాగుపడేది. మా ఊరులో ఒక మహిళ జడ్జ్ ప్రియుడితో పట్టపగలు, కోర్ట్ లోనే పనిలో ఉండగా చిక్కిందట, ఆమెకి విధించిన శిక్ష ట్రాన్స్ఫర్. ఇలా ఉంది ఈదేశంలో న్యాయవ్యవస్థ.

నీహారిక said...

>>>>ఈ వ్యాఖ్య రాజ్యాంగబద్ధమైనదా లేక రాజ్యాంగ విరుద్ధమైనదా అనేది ఒక్కసారి స్పష్టం చేయండి ముందు. అలనాటి అంబేద్కర్ గురించి నేటి శ్రీమాన్ మోదీ వరకు రిజర్వేషన్ లపై ఇంత గొప్ప వ్యాఖ్యలు చేయలేదు. మీ సాహసానికి జోహార్లు చెప్పాలి.<<<<<<

రాజ్యాంగంలో వ్రాసిఉంటే అంబేద్కర్ ని గౌరవించి ఉండేదాన్ని.అంబేద్కర్ రిజర్వేషన్లు ఉపయోగించుకుని చదువుకున్నారో లేదో తెలియదుగానీ మోడీ మాత్రం టీ దుకాణం నుండి మాడిసన్ స్క్వేర్ లో ప్రసంగం దాకా వెళ్ళి కూడా రిజర్వేషన్లు అవసరం లేదని ఎందుకు చెప్పలేకపోతున్నారా అన్నదే నా అసహనానికి కారణం.స్త్రీలకు రిజర్వేషన్లు కూడా నాకు నచ్చదు.ఉద్యోగాల్లోనూ,రాజకీయాల్లోనూ చేరేది సమానత్వం కోసమేగా ? రిజర్వేషన్లు కోరితే సమానత్వమెలా వస్తుంది ?

మీరన్నట్లు హక్కులకోసం పోరాడాల్సిందే కానీ బాధ్యత మర్చిపోకూడదు కదా ? ఉరిశిక్ష అయినా ఊచకోత అయినా బాధ్యతా రాహిత్యమే ! వీటిని సమర్ధించి ఓటువేసి గెలిపిస్తున్నారంటే ప్రజలు కూడా బాధ్యతా రహితంగా ఉంటున్నారన్న మాటే !

ఇపుడు కాలం మారుతోంది కాబట్టి మనమూ మారాలి.శత్రువుని చంపడం అనేది చాందసవాదం. శత్రువులో మార్పు తీసుకురావడం అనేది ఆధునికత.అంత ఓపికెవరికండీ అని ఒక్క ముక్కలో తీసిపడేస్తారు కానీ వేల సంవత్సరాలు పోరాటం చేసేకన్నా శత్రువు దారిలో వెళ్ళడం సులువైన పద్ధతి ! సమానత్వం కావాలంటే రిజర్వేషన్లు కోరకూడదు.దళితులెవరైనా రిజర్వేషన్లు అవసరం లేదు అని పోరాడితే చూడాలన్నది నా చిరకాల స్వప్నం !

Anonymous said...

దళితులు రిసెర్వేషన్స్ వద్దని కోరరు. వాళ్లకు రిసెర్వేషన్స్ అస్తిత్వం,అభివృద్ది చెందిన వారు కూడా దానిని కావాలి అంటుమ్న్నారంటే అర్థంచేసుకోండి. మమ్మల్ని తొక్కేశారు అని సానుభూతి పొందటానికి రాజకీయాలలో దళిత కార్డ్ గా ఉపయోగించుకోవటానికి రిసెర్వేషన్స్ చక్కగా ఉపయోగపడతాయి.

కత్తి మహెష్ అనే ఒకతను మాకొచ్చే లాభాన్ని వదులుకోవటానికి మేమైనా పిచ్చోళ్లమా? అన్నాడు. దళిత మేధావులు సామాన్యులా? వాళ్లలో పేదోడిని,పేదరికాన్ని చూపించేది అభివృద్దిచెందిన దళితులు వాటి వలన లాభపడేడి. ఇప్పుడు క్రైస్తవం లోకి మరిన దళితులకి రిసెర్వేషన్స్ కావాలని ఈ నెల చలో డిల్లికి పోతున్నారు.

Post a Comment