Pages

Wednesday, November 30, 2016

డబ్బులిచ్చే ఏటీఎం మారాజు ఎక్కడ?


భారత దేశంలో ఇప్పుడు పొకెమాన్ వీడియో గేమ్ అడి పోకెమాన్‌లను వెదికి పట్టుకునే ఆట చరిత్రలో కలిసిపోయినట్లుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారికి మరో గేమ్‌ను అవసరం కొద్దీ ఆడాల్సి వస్తోంది. అదేమిటంటే, నగరాల్లో, పట్టణాల్లో ఏ ఏటీఎమ్‌లో ఏ సమయంలో డబ్బు దొరుకుతోంది అనే సమాచారాన్ని జీపీఎస్ సహాయంతో తెలుపుతున్న వాల్‌నట్ వంటి యాప్ ‌లను గాలించడం వేలం వెర్రిగా మారింది. పగలు పూట భారతీయ నగరాల్లో దాదాపుగా ఏ ఏటీఎం కూడా పనిచేయడం లేదు. కానీ రాత్రిపూట మాత్రం బ్యాంకులు అరుదుగా నైనా ఏదో ఒక చోట పరిమిత మొత్తంలో ఏటీఎంలో డబ్బు పెట్టడం.. స్మార్ట్ ఫోన్ లో నిత్యం గాలిస్తున్న జనాలు ఫలానా స్థలంలో ఫలానా బ్యాంకుల ఎటీఎంలో డబ్బు పెట్టారని వాల్ నట్ యాప్ అలర్ట్ చేసిన వెంటనే ఆ ఏటీఎంకు వెళ్లడం.. రెండుగంటల్లోనే ఆ ఏటీఎం ఖాళీ కావడం రివాజుగా మారింది.

వాల్ నట్ యాప్ లో షార్ట్ క్యూ అని మెసేజ్ వచ్చిన వెంటనే పరుగెత్తి ఆ ఏటీఎం చేరుకున్నవారు అదృష్టవంతులు. లాంగ్ క్యూ అని మెసేజ్ చూపిన తర్వాత అక్కడికి వెళ్ళినవారికి డబ్బు అందవచ్చు. అందకపోవచ్చు కూడా. డబ్బు ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో కనబడే ఏటీఎం సింబల్ డబ్బు అయిపోగానే నీలం రంగులోకి మారటం వాల్ నట్ యాప్‌లో చూడగానే హతాశులై జనం వెనక్కు తిరగడం ఇప్పుడు మన నగర జీవిత విధానంలో భాగమైపోయింది. కొందరు లక్కీగా ఒక ఏటీఎంలోనే అలా డబ్బు దక్కించుకోవడం జరుగుతుండగా కొందరు అలాంటి నాలుగైదు ఎంటీఎంల వద్దకు వెళ్లి కూడా డబ్బు దక్కించుకోలేక వెనుదిరగడం.. ప్రపంచంలో ఏ దేశ  ప్రజలు కూడా రాత్రిపూట ఇలాంటి ఆటను ఇంతవరకు ఆడలేదనే చెప్పాలి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఏ స్థానిక వీధిలోని ఏటీఎంలో అలా డబ్బు పెట్టిన విషయం అక్కడి స్థానికులకు అసలు తెలియకపోవడం. వారంతా గాఢ నిద్రలో ఉంటున్న సమయంలో ఇలా కొన్ని దొంగ ఎటీఎంలు తెరుచుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ లో చూసిన బయటి జనాలు అక్కడికి పరుగెత్తి ఉన్న కాస్తా డబ్బు లాగేస్తున్నారు. ఇలా అర్ధరాత్రి, అపరాత్రి కొన్ని ఏటీఎంలను ఎందుకు తెరుస్తున్నారో.. బ్యాంకుల ఉద్దేశం ఏమిటో కూడా స్పష్టం కాదు. ఇంతకూ ఈ దేశానికి ఏమవుతోందో మరి.

ఈలోపున మన అభినవ పిచ్చి తుగ్లక్ రాజ్యంలో అవినీతి ఇంటిదొంగల్లోనే పేరుకుపోయిందని తాజాగా బయటపడింది. బ్యాంకు ఖాతాదారులకు కూడా గంటల కొద్దీ క్యూలలో నిల్చున్నా పరిమితమైన డబ్బు కూడా దొరకక అల్లాడిపోతున్నారు. కానీ మరోవైపున సాక్షాత్తూ బ్యాంకు మేనేజర్లు, పోస్టాపీసుల అధిపతులు, ఉద్యోగులు కూడబలుక్కుని మరీ కోట్లాది పాత నేట్లకు బదులు కొత్త నోట్లు బ్యాంకుల్లోనే మార్పిడి చేసి అందుకు 20 నుంచి 25 శాతం కమిషన్ తీసుకున్నారన్న వార్తలు సగటు మనిషిని రగిల్చి వేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. మన రూపాయి మీద నమ్మకం పోయింది. ఇప్పుడు బ్యాంకులమీద కూడా నమ్మకం పోగొట్టుకోవలసిన సమయం ఆసన్నమైనట్లుంది.

నవంబర్ 10-15 మధ్య బ్యాంకుకు ఒకరోజు నగదు మార్పిడికి వచ్చిన వారే వరుసగా మూడు రోజుల పాటు వచ్చి నగదు మార్చుకున్నట్లు ఆ బ్యాంక్‌ల నుంచి తెప్పించిన డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమైంది. ఉదాహరణకు మొదటి రోజున రెండు వేల మంది నగదు మార్పిడి చేసుకుంటే వారిలో 1,000 మందికి సంబంధించిన ఐడీలను జిరాక్స్ తీసి, మళ్లీ వాటినే సమర్పించి బ్యాంక్ మేనేజర్లు నగదును విత్‌డ్రా చేశారు. నల్లకుబేరులు తెచ్చిన పాత నోట్లు తీసుకుని విత్‌డ్రా చేసిన ఈ కొత్త నగదును సమర్పించారు. ఇందుకుగాను నల్లకుబేరుల నుంచి సంబంధిత బ్యాంక్ సిబ్బందికి 20 నుంచి గరిష్టంగా 35 శాతం వరకు కమీషన్ లభించింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని వెయ్యికి పైగా వివిధ బ్యాంక్ శాఖల్లో నగదు మార్పిడి కుంభకోణం చోటు చేసుకుందని తాజా సమాచారం. ఖాతాదారులు నగదు మార్పిడి కోసం సమర్పించిన ఐడీ ప్రూఫ్ ‌లను మళ్లీ మళ్లీ వాడి బ్యాకు అధికారులు, సిబ్బంది ఇష్టం వచ్చినట్లుగా పాత నోట్లకు బదులు కొత్త నోట్లను బ్యాంకుల్లోనే మార్పిడి చేసి కమిషన్ పుచ్చుకున్నట్లు వస్తున్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగించడం కాదు... అవినీతిపై యుద్ధం ఇలాగే ఉంటుందన్న నగ్నసత్యాన్ని కొత్త రీతిలో చెబుతున్నాయి. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాకు అధికారుల హస్తం కూడా దీంట్లో ఉందని బయటపడటం మరీ ఘోరం.

నగదు మార్పిడికి వెళ్తే అందుకు సమర్పించే గుర్తింపు కార్డు పత్రం ఏదైనా దాని జిరాక్స్‌పై  సంతకం ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అదే సంతకంతో కూడిన జిరాక్స్ పత్రం ఇస్తే బ్యాంక్‌లు తిరస్కరించాలి. వారికి నగదు మార్పిడి చేయకూడదు. కానీ దేశవ్యాప్తంగా జరిగినట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అక్రమ తతంగం చోటు చేసుకుంది. మొదటి మూడు రోజులు వచ్చిన గుర్తింపు కార్డులనే జిరాక్స్ తీసి కొందరు బ్రాంచ్ మేనేజర్లు కొత్త రూ.2 వేల నోట్లు, రూ.100 నోట్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్న అంశం ఆర్బీఐ దృష్టికి, సీబీఐ దృష్టికి వెళ్లింది. ఈ భారీ స్కామ్ వివరాలు అన్నీ బయటపడాలంటే కనీసం 3 నెలలు పడుతుందని అంచనా. వీళ్లకెవరికీ ఏ శిక్షలూ పడవన్నది మరొక విషయం అనుకోండి.

దేశభక్తులు, వారి తైనాతీలు, మోదీ భక్తులకు అర్థం కాని విషయం ఇదే. మాఫియా ఎక్కడో లేదు రిజర్వ్ బ్యాంకులోనే, దేశంలోని ప్రధాన బ్యాంకులలోనే, దాగి ఉందనేది ఇప్పటికే స్పష్టమైనా వీరు కళ్లు తెరవరు. నిద్రలేచింది మొదలు పడుకునే దాకా మోదీ జపమే. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ, దాని లుచ్ఛా యాజమాన్యం చేస్తున్న నిర్వాకం ఎప్పుడూ ఇలాగే ఉందన్న సత్యాన్ని వీరు గమనించరు. బ్యాంకర్లకు, రాజకీయ నేతలకు ఉన్న అవినీతి బంధం ఎన్ని అక్రమాలనైనా పెంచి పోషిస్తున్నదన్నది జగమెరిగిన సత్యం. వందకోట్లమందికి తమ కష్టార్జితం చేతిలోకి రాకుండా పోయిన దుర్భర పరిస్థితి రాజ్యమేలుతున్నచోటే లక్షలకు లక్షల రూపాయలు ఇలా అక్రమార్గంలో వక్రమార్గంలో పోతున్న ఘటనలు నిత్యవార్తలవుతున్నాయి. పెట్టుబడి విశ్వరూపానికి ఇవన్నీ నిదర్శనాలే.

బ్యాకుల్లో డబ్బులు ఖాతాదారులకు అందుబాటులో లేకపోవడానికి, దొడ్డి మార్గంలో బ్యాంకుల నుంచే డబ్బు అపమార్గం పడుతుండడానికి అవినాభావ సంబంధం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కింది లింకును చూడండి.

బ్యాంకు మేనేజర్లపై సీబీ'ఐ'

సోవియట్ యూనియన్ మరి కొద్ది నెలల్లో రద్దవడానికి ముందు 1991లో ఆ దేశాధ్యక్షుడు గొర్బాచెవ్ ఇలాగే పెద్ద రూబుల్స్ ని రద్దు చేస్తే మూడు రోజుల్లో జనం తమ వద్ద ఉన్న పాత రూబుల్స్‌ని బ్యాంకులలో డిపాజిట్ చేశారు. సరిగ్గా మూడు  రోజుల్లోనే అక్కడి బ్యాంకులు కొత్త రూబుల్ నోట్లను బ్యాంకులలో చలామణికి అందుబాటులోకి తెచ్చాయి. ఎవరికీ ఏ ఇబ్బంది కలుగలేదు. 25 ఏళ్ల క్రిత జరిగిన ఈ అవినీతిపై యుద్ధ చర్యలు కూడా సత్ఫలితాలను ఇవ్వలేదని, పాత నోట్లు, లేదా నల్లధనం రద్దు ద్వారా అవినీతి సమసిపోదని  చరిత్ర నిరూపించింది.
అలాగే 1987లో బర్మా సైనిక జుంటా పార్టీ చైర్మన్ నల్లధనంపై యుద్ధం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేస్తే, బర్మా నగరాల్లో రేగిన ఆహార అలజడిని అణిచే క్రమంలో సైన్యం దాదాపు 10 వేలమందిని కాల్చిచంపింది. నగదు చెల్లింపులకు దూరమైన బర్మా రైతులు వస్తుమారకపు పద్ధతిలో తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాలను తమకు అవసరమైన వస్తువుల కోసం మారకం చేసి ఉన్న ధాన్యాలను మొత్తంగా మార్పిడి చేసుకోవడంతో నగరాలకు ఆహార ధాన్యాల సరఫరా మొత్తంగా నిలిచిపోయి ఆకలి దాడులు చెలరేగిన నేపథ్యంలో అంతమందిని సైన్యం కాల్చి చంపినా తమ అధ్యక్షుడి పదవిని కాపాడలేకపోయాయి. బర్మా పెద్దనోట్ల రద్దు అవమానకరమైన రీతిలో ఘోర పరాజయం మిగల్చడంతో సంస్కర్తగా పేరుగాంచిన సైనిక జుంటా పార్టీ చైర్మన్ తన పదవికి  రాజీనామా చేసి తప్పుకోవలసి వచ్చిందని తెలుస్తోంది.. పైగా సంస్కర్త హృదయం కలిగిన ఇతడు రెండు సార్లు నోట్ల రద్దు చేస్తే రెండుసార్లూ పరాభవమే మిగిలిందట.

బర్మాలో పెద్ద నోట్లను రద్దు చేస్తే ఏమైంది?

1 comments:

Anonymous said...

బాంక్ మానెజర్ లు ఎక్కడికి పోరు. అందరిని బొక్కలో తోసి మక్కెలిరగొట్టే రోజు తొందరలో ఉంది. వాళ్లు మనలను ఎవరు పట్టుకొంటారులే అనుకొంట్టున్నారు. పిచ్చి వెధవలు. ఇప్పటికే చాలా మంది ని సస్పెండ్ చేశారు.

Post a Comment