Pages

Saturday, November 5, 2016

పథకం ప్రకారమే దాడి



మల్కన్‌గిరి జిల్లా రామగూడ గ్రామం సమీపంలో ఆంధ్రా-ఒడిస్సా పోలీసులు చేసిన దాడి పూర్తిగా  పథకం ప్రకారమే జరిగిందని  ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగబంధు పేర్కొన్నారు. ఈ ఘటనపై జగబంధు చేసిన ప్రకటనను మీడియాకు పంపించిన ఆడియోలో గుర్తు తెలియని మావోయిస్టు మహిళ చదివి వినిపించారు. ఆ ప్రకటన పూర్తి పాఠం..

"అక్టోబర్ 24న మల్కన్‌గిరి జిల్లా, రామగూడ గ్రామం సమీపంలో మా మకాంపై ఆంధ్ర-ఒడిశా పోలీసులు సంయుక్తంగా దాడిచేసి 31 మంది కామ్రేడ్స్‌ని హత్యచేసిన ఘటనపై ఇప్పటివరకు పోలీసు అధికారులు చేసిన ప్రకటనలు వాస్తవంగా జరిగిన సంఘటనకు పూర్తి భిన్నంగా, అవాస్తవాలతో కూడినవిగా ఉండి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి. పోలీసుల దిగ్బంధంలో చిక్కుకున్న మేము వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో కొంత ఆలస్యం జరిగింది. 

అసలేం జరిగిందంటే అక్టోబర్ 23వ తారీఖున మా దళం రామగూడ గ్రామానికి చేరుకుని అక్కడే మకాం వేసింది. రాత్రి అదే స్థలంలో పడుకున్నాం. 24 ఉదయం పోలీసులు మా మకాం వైపు రావడాన్ని గమనించిన ప్రజలు మాకు సమాచారం ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని వారిని నిర్బంధించారు. ఉదయం 6 గంటలకు రోల్‌కాల్ జరుగుతున్న సమయంలో రెండువైపుల నుంచి మా మకాంకి అతి సమీపంలోకి పోలీసులు చేరుకున్నారు. అప్రమత్తమైన మా పిఎల్‌జిఎ (ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం) వెంటనే కాల్పులు ప్రారంభించింది. ఆ సమయంలో మాతోపాటు ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరాయుధులైన యువతీయువకులు పక్కనే ఉన్న గ్రామంవైపు పరుగెత్తారు. పరుగెత్తిన వారిపైనా, పక్కనే ఉన్న నదిలో చేపలు పడుతున్నవారిపైనా పోలీసులు విచ్చలవిడిగా ఆటో ఆయుధాలతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు. వారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నారు. 

మా దళం పోలీసులను ప్రతిఘటిస్తూనే మకాం నుంచి క్షేమంగా రిట్రీట్ అయ్యాం. ఆ సమయంలో మాకు ఎలాంటి భౌతిక నష్టం జరగలేదు. అయితే అప్పటికే మా దళం రెండు వలయాలుగా పోలీసులచే చుట్టివేయబడిఉంది. ఒక వలయాన్ని ఛేదించడానికి నలభై నిమిషాల పాటు కాల్పులు జరిపి సురక్షితంగా రిట్రీట్ అయ్యాం. దాని తర్వాత పోలీసులు పన్నిన మరో వలయంచే చుట్టివేయబడ్డాం. వారంతా కొండలను ఆక్రమించుకుని మా రిట్రీట్ దిశగా అనుసరిస్తూ అన్ని వైపుల నుంచి కాల్పులు ప్రారంభించారు. 

అప్పటికే కాల్పులు ప్రారంభమై గంట గడిచిపోయింది. పోలీసులు వందలాది తూటాలను కాల్చగా మేము వందలాది తూటాలను కాల్చాము. చివరి వలయాన్ని గండికొట్టే సమయంలో మేము ఒక కొండ నుంచి మరొక కొండకు వెళుతున్నప్పుడు చిన్న మైదానాన్ని దాటి కొండ ఎక్కాల్సి వచ్చింది. అప్పుడు పోలీసు బలగాలు అతి సమీపానికి చొచ్చుకు వచ్చాయి. వందలాది పోలీసులు కొండలపై అనుకూల రక్షణలో ఉండి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దాన్ని రెండువైపులా గండి కొట్టే సమయంలో కొద్ది మంది కామ్రేడ్స్ అమరులై, అనేకమంది గాయపడి మిగిలిన కామ్రేడ్స్‌ను రక్షించారు. గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న మా కామ్రేడ్స్‌ని పోలీసులు చుట్టుముట్టి హతమార్చాయి. కొందరు గాయాలతో తప్పుకున్నారు. 27వ తారీఖును మరిన్ని అదనపు బలగాలను రప్పించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి, గాయపడిన మా కామ్రేడ్స్‌ని తప్పించుకోనీయకుండా వెతికారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాకకు స్వాగతంగా అప్పటికే వారి చేతుల్లో ఉన్న నలుగురు సాధారణ యువతీ యువకులైన కుదిరిగుడ కొమలి, శ్యామల పిల్లిపొదిరి, కావేరి ముదిలి-లచ్చ ముదిలి, డక్క పొదిరిలను కాల్చి చంపి మరో ఎన్‌కౌంటర్ కథనాన్ని అల్లారు.

గాయపడి శత్రు వలయంలో చిక్కిన మరో మహిళా కామ్రేడ్‌ను 26న రామగూడ ప్రజలందరూ చూస్తుండగానే కాల్చి చంపారు. అలాగే గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న మరో ఇద్దరు కామ్రేడ్లు గౌతమ్, నరేశ్‌లను 27 ఉదయం 7 గంటలకు గ్రామ ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపి ఎన్‌కౌంటర్ కథను అల్లారు. మా కామ్రేడ్స్ ఈ ఎన్‌కౌంటర్ ఎదుర్కోవడంతో అత్యంత ధైర్యాన్ని, సాహసాన్ని, త్యాగనిరతిని ప్రదర్శించారు. వారు అమరులవుతూ కూడా వారి చేతుల్లోని ఆయుధాలను శత్రువుల చేతికి చిక్కకుండా మా సహచర కామ్రేడ్లకు అందిస్తూ అమరులయ్యారు. ఈ హత్యా ఘటనలో 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మొత్తం 31 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. అందులో 9 మంది నిరాయుధులైన సాధారణ యువతీ యువకులే. అందులో 9మందిని కూడా పట్టుకుని 24న నలుగురిని, 25వ తేదీన నలుగురిని, బలగాలు వాపస్ అయ్యే రోజున మరొకర్ని హత్య చేశారు.
అమరులైన వారి వివరాలు:
కామ్రేడ్ ప్రసాద్ @ బాకూరు వెంకటరమణ (AOB SZCM), బాకూరు గ్రామం విశాఖ జిల్లా
కామ్రేడ్ దయా @ కిష్టయ్య (AOB SZCM), నల్గొండ జిల్లా
కామ్రేడ్ గంగాధర్ @ ప్రభాకర్ (DVCM), యాప్రాలు, రంగారెడ్డి జిల్లా
కామ్రేడ్ కిరణ్ @ సువర్ణ రాజు (డి.వి.సి.యం), పశ్చిమగోదావరి జిల్లా
కామ్రేడ్ మున్నా @ పృధ్వీ (ప్లటూన్ డిప్యూటీ), ఆలకూరపాడు
కామ్రేడ్ బిర్సు @కేశవరావు (సెక్షన్ కమాండర్), తాడిపాలెం, విశాఖ జిల్లా
కామ్రేడ్ రాజేష్ @ సోమ్లు (సెక్షన్ డిప్యూటీ), ఊరు-కొట్టం, బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ ఎర్రాలు @ నంగాలు (సిపిసిఎమ్), ఊరు- ఎర్రం ,బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ బుద్ధి @ బుద్రిసోరి (ఎసియం), ఊరు-గురునామ్, బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ మంజుల @ ఉంజీ (ఎసియం), ఊరు-నాంగెల్ గూడెం, సుక్మా జిల్లా
కామ్రేడ్ గౌతమ్, టెక్నికల్ దళ కమాండర్, కాంకేర్,
కామ్రేడ్ మురళి @ సింహాచలం (ఎసియం), విజయనగరం జిల్లా
కామ్రేడ్ మధు @ దాసు (ఎసియం), పశ్చిమగోదావరి జిల్లా
కామ్రేడ్ లత @ భారతి (ఎసియం), హైదరాబాద్
కామ్రేడ్ మమత @బొట్టు కుందన (పియమ్), శ్రీకాకుళం జిల్లా
కామ్రేడ్ దాసు @ సాధురామ్ (పియమ్), వాకపల్లి గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ నరేశ్ @ సురేశ్ (పియమ్), గ్రామం-సామాన, కోరాపుట్ జిల్లా
కామ్రేడ్ తిలక (పియమ్), పశ్చిమ బస్తర్, బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ గంగ @ గంగ మాధవి (పియమ్) శీలకోట గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ రజిత @ కామి (పియమ్), నానాదరి గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ జ్యోతి (పియమ్), సుమనోవ గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ కమల @ లక్కీ (పియమ్) ఆలుమ్ గ్రామం, బీజాపూర్ జిల్లా

సాధారణ యువతీయువకులు:
లచ్చ మొదిలి, గ్రామం- డక్ల పొదురు, మల్కన్ గిరి జిల్లా
కావేరి మొదిలి, గ్రామం- డక్ల పోదురు
బుమిలి, గ్రామం- బచ్చర పొదురు
మల్కన్ పాంగి, గ్రామం-బచ్చర పొదురు
అమల, గ్రామం- బచ్చర పొదురు
షిండే, గ్రామం- ముక్కుడు పల్లి
శ్యామల, గ్రామం-సుంగి పొదురు
జయా, గ్రామం- కొదురుగూడ
కొమలో, గ్రామం- కోదురుగూడ
           
            మా అమరుల శవాల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఆదరాబాదరాగా పోస్టుమార్టం నిర్వహించి, వాళ్ళ శవాలను బంధుమిత్రులు గుర్తుపట్టే విధంగా ఫోటోలను ప్రదర్శించకుండా సాధారణ అట్టపెట్టేల్లో పెట్టారు. వారి కుటుంబసభ్యులు శవాలను తీసుకుపోయి చివరిసారి చూపుకు కూడా నోచుకోకుండా చేశారు. ఈ అమరవీరులందరికీ మా పార్టీ తలవంచి వినమ్రంగా జోహార్లర్పిస్తున్నది. వారి కుటుంబసభ్యుల, బంధుమిత్రుల బాధలు, దుఃఖంలో పాలుపంచుకుంటున్నది. వారిని హత్య చేసిన రాజ్యాంపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనుతున్నది. వారి ఆశయాలను తుదకంతా కొనసాగిస్తామని శపథం చేస్తున్నది. అమరులైన కామ్రేడ్లందరూ పీడిత వర్గాల నుండి ఉద్యమంలోకి వచ్చిన వారే. వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించారు. అయితే ఆ సమస్య పరిష్కారానికి సాయుధమవ్వడం తప్ప మరో మార్గం లేదని స్వీయ అనుభవం ద్వారా తెలుసుకొని ఆయుధాలు పట్టారు. ఇది ప్రభుత్వం చెబుతున్నట్లుగా శాంతి భద్రతల సమస్య కాదు. నూటికి తొంభై శాతంగా ఉన్న ప్రజల సమస్య. ప్రజల సామాజిక ఆర్థిక సమస్య. ఈ సమస్య మా కామ్రేడ్స్ ను హత్య చేయడం ద్వారా పరిష్కరించలేరు. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకు ప్రజలు పోరాడుతూనే ఉంటారు. పోరాడే ప్రజల నుండే మళ్ళీ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అమరులు లేని లోటును మళ్ళీ భర్తీ చేస్తాం. మా పార్టీకి త్యాగాలు కొత్తవి కాదు. త్యాగాల చాలు వేస్తూనే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ సంఘటనలో మేము శత్రువును అంచనా కట్టడంలో చేసిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాం. అందుకు తీవ్రంగా విచారిస్తున్నామని ప్రజలకు తెలియజేస్తున్నాం. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోడానికి శత్రువుతో మరింత వర్గ కసితో పోరాడాలని పిలుపునిస్తున్నాం. ఈ సంఘటనలో నిరాయుధులైన తొమ్మిది మంది యువతీ యువకులను సజీవంగా పట్టుకుని హత్య చేసిన సంఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్యాకాండను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
            కటాఫ్ ఏరియా మావోయిస్టులు సేఫ్ జోన్ గా వాడుకుంటున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారం వట్టి బూటకం. ఈ ప్రాంత ప్రజలు మా పార్టీ నాయకత్వంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా, బలిమెల రిజర్వాయర్ ముంపు నిర్వాసిత సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలిటెంట్ ఆందోళన చేస్తున్నారు. దున్నేవారికే భూమి సమస్యపై వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకొని భూమిలేని పేదలకు పంపిణీ చేస్తూ వ్యవసాయక విప్లవ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. అలాగే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. దీంతో రాజ్యం ప్రత్యేకంగా కేంద్రీకరించి ఆంధ్రా ఒడిశా పోలీసులు సంయుక్తంగా అనేక సంవత్సరాల నుండి కూంబింగ్ ల పేరుతో దాడులు చేసి ప్రజలను, పి.ఎల్.జి.ఏ సభ్యులను హత్యలు చేశారు. గత రెండు సంవత్సరాల నుండి నాయకత్వ నిర్మూలన కోసం ప్రత్యేకంగా కేంద్రీకరించారు. అందులో భాగంగా జరిగిందే అక్టోబర్ 24 ఘటన. అయితే పోలీసులు ప్రకటిస్తున్నట్లుగా ఆ సమయంలో మా పార్టీ పైకమిటీ సమావేశాలు గానీ, ప్లీనాలు గాని ఏమీ లేవు. ఆ ప్రాంత ఆర్గనైజేషన్ లో భాగంగానే మా దళం అక్కడికి వెళ్లింది. పక్కా సమాచారంతోనే 23 రాత్రి అత్యంత రహస్యంగా మా మకాం పరిసరాలకు బలగాలను చేర్చి చుట్టుముట్టి ఉన్నారు. మరికొన్ని బలగాలను 24 ఉదయం 6 గంటలకు రప్పించుకొని చుట్టుముట్టి దాడి చేశారు. దీనికి లొంగిపోయిన మాజీల సహకారం కూడా తీసుకున్నారు. ఈ ఘటన జరటానికి దారితీసిన మా లోపాలను సమీక్షించుకుంటూనే, దీనిలో ఇన్ ఫార్మార్లుగా వ్యవహరించిన వారిని, అలాగే విప్లవద్రోహులైన మాజీలను ప్రజల సహకారంతో శిక్షిస్తామని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి వందలాది బలగాలతో గాలింపులు కొనసాగిస్తున్నారు. దాంతో ప్రజలు చేతోకొచ్చిన పంటను రక్షించుకోలేకపోతున్నారు. పశువులను కాపలా కాయలేకపోతున్నారు. ఈ బలగాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే రెండు రాష్ట్రాల అధికార టిడిపి, బిజెడి నాయకులు మూల్యం చెల్లించవలసి ఉంటుంది.

విప్లవాభివందనాలతో
జగబంధు
ఎఒబి ఎస్.జెడ్.సి అధికార ప్రతినిధి



ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగబంధు ప్రకటన పూర్తి ఆడియో పాఠాన్ని కింది సాక్షి లింకులో వినవచ్చు.

9 మంది సామాన్య పౌరులను చంపారు!
http://www.sakshi.com/news/district/9-people-common-citizens-killed-418752


విరసం వెబ్‌సైట్‌లో వచ్చిన జగబంధు అసంపూర్తి ప్రకటనను కింది లింకులో వినవచ్చు.

పథకం ప్రకారమే దాడి: ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగబంధు
http://virasam.org/article.php?page=303

                                                    **********

ఆంధ్రజ్యోతి పత్రికలో ఆర్కె ఎందుకు ఏఓబీకి వచ్చాడనే అంశంపై ఒక విశేష కథనం వచ్చింది.

ఆర్కే క్షేమం: వరవరరావు 
04-11-2016 00:58:43
http://www.andhrajyothy.com/artical?SID=329559

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే ఉనికిపై ఉత్కంఠ వీడింది. ఆయన క్షేమంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. గతనెల 24న ఒడిసాలోని మల్కన్‌గిరి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన అనంతరం మరో రెండు చోట్ల ఎన్‌కౌంటర్‌లు చోటుచేసుకున్నాయి. పోలీసు కాల్పుల్లో మావోయిస్టు నేత ఆర్కే గన్‌మెన్‌ కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఆర్కేకు కూడా గాయాలయ్యాయని, ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారని ప్రజాసంఘాలు తొలి రోజు నుంచి ఆరోపిస్తున్నాయి. అయితే... ఆయన తమ అదుపులో లేరని పోలీసులు హైకోర్టుకు కూడా నివేదించారు. చివరికి... ఆయన క్షేమంగా ఉన్నారంటూ హక్కుల నేతలకు సమాచారం వచ్చింది. విరసం నేత వరవరరావు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఆర్కే క్షేమంగా ఉన్నారు: పద్మక్క
అది సాధారణ సమావేశం కాదు! పార్టీ పునర్‌వ్యవస్ధీకరణ, కీలక బాధ్యతల్లో మార్పులు, చేర్పులు భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ విధివిధానాలపై చర్చించేందుకు ఏఓబీ పరిధిలోకి వచ్చే కీలక నేతలంతా హాజరైన/హాజరు కావాల్సిన సమావేశం! ఏవోబీ కమిటీ రూపురేఖలు, భవిష్యత్ కార్యాచరణ, కీలక వ్యూహాలు రచించేందుకు ఉద్దేశించిన సమావేశం! కానీ... ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. అంతేకాదు... కొత్త బాధ్యతల్లోకి రావాల్సిన నేతలు, దండకారణ్యంతోపాటు, ఇతర డివిజన్లకు వెళ్లాల్సిన ముఖ్యులు సైతం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. గతనెల 24న జరిగిన ఏవోబీ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా మావోయిస్టు పార్టీ అంతర్గత డాక్యుమెంట్లు కూడా వెలుగుచూశాయి. ఆంధ్రా-ఒడిసా ఉద్యమాన్ని మరింత దూకుడుగా తీసుకెళ్లేందుకు, ప్రత్యేకించి బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఆ పార్టీ కార్యాచరణ చేపట్టింది. ఓ వైపు నిర్భంధాన్ని ఎదుర్కొంటూనే, మరోవైపు పట్టున్న ప్రాంతాల నుంచి కొత్తగా ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళికలు వేశారు. ఇందుకోసం ప్రజాసమస్యలే ఆయుధంగా ఉద్యమాలు నిర్మించాలని, గ్రామాలు, పట్టణాల్లో ఉన్న పార్టీ శ్రేణులు, సానుభూతిపరుల సహకారం పెద్ద ఎత్తున తీసుకోవాలని డాక్యుమెంట్‌లో రాశారు. ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీలోనే పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ప్రతిపాదించారు. వీటిని ఆర్కేనే ఏవోబీ కమిటీలో చర్చించి అమలు చేయాల్సి ఉంది. ఇక్కడ కేంద్ర కమిటీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఏవోబీ కార్యదర్శిగా ఆర్కేను రిలీవ్‌ చేసింది. ఆయన స్థానంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మక్కను ఎంపిక చేశారు. ఆమె ప్రస్తుతం దండకారణ్యం ప్రత్యేక జోనల్‌ కమిటీలో, డీకే కమిటీలో సభ్యురాలు. 

వారిని జాగ్రత్తగా చూసుకోండి
జైళ్లలో ఉన్న నేతల కుటుంబీకులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కిందిస్థాయి నాయకత్వాన్ని ఆదేశించింది. లొంగిపోయేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజా సంఘాలకు కూడా వారికి సంబంధించిన సమాచారం ముందుగానే ఇవ్వాలని ఆదేశించింది. అయితే, పార్టీలోనే ఉంటున్న పెద్దలు (వెటరన్స్‌) కొందరు క్షేత్రస్థాయిలో తిరగలేకపోతున్నారని, వారి సంరక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డివిజన్‌, ఏరియా కమిటీలను ఆదేశించింది.
                               **************************

ఒకవైపు మావోయిస్టు నేత ఆర్కే క్షేమం అనే వార్తతోపాటు, ఏవోబీ ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందనే అంశంపై మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన ఈ అధికారిక ప్రకటన చాలా విషయాలను స్పష్టం చేసినట్లే... ఆయుధాలతో పరస్పరం తలపడుతున్న పక్షాలకు ఏమరుపాటు ప్రాణాంతకం. క్షణకాలంలో మొదలయ్యే అనూహ్య దాడిని (సర్‌ప్రైజ్ అటాక్) తట్టుకుని నిలబడటం ఎదిరిపక్షానికి చాలా కష్టం.  గత నాలుగేళ్లలో ిఇది పదే పదే అటూ ఇటూ రుజువవుతూనే ఉంది. 

అన్నిటికంటే మించి.. 30 మంది పైగా మరణించిన ఒక మేజర్ ఎన్‌కౌంట‌ర్‌లోనూ ఆర్‌కేతో సహా అగ్రశ్రేణి నాయకత్వం ప్రాణాలతో తప్పించుకుందంటే ఆ దాడి నిష్ఫలమే అని చెప్పాలి. ఇంతమందిని చంపాం అని లెక్క వేసుకోవడానికి తప్పితే దాడికి దిగిన పక్షం సాధించింది ఏమీ లేదనేది స్పష్టం. అదే సమయంలో 1998లో ఇదే పరిస్థితుల మధ్య ఏఓబీలో జరిగిన కోపర్‌డెంగ్ ఎన్‌కౌంటర్‌ను గుర్తు చేసుకుంటే కేడర్ పరంగా మావోయిస్టు పార్టీకి ఇప్పుడు జరిగిన నష్టం కూడా తక్కువేం కాదు. 

అంతిమంగా అర్థం అవుతోందేమిటంటే అడవిలో ఆదివాసులు ఉన్నంతవరకు.. వారి భూములను, వారివైన వనరులను కొల్లగొట్టే విధానాలు ఉనికిలో ఉన్నంతవరకు ఇలాంటి ఘటనలు ఆగిపోవడం అనేది జరగనిపని. అది రావణ కాష్టమా లేక మరే పదంతో పిిలిచినా సరే. సమస్య రగలడం శాశ్వతం. ఆదివాసుల ఉనికి సమస్యను పోలీిసులు, తుపాకులు, బుల్లెట్లు, మాయం చేయలేవు. 

ఆదివాసులకు మద్దతిస్తున్న, ఆదివాసుల మద్దతు పొందుతున్న మావోయిస్టులను, నక్సలైట్లను జల్లెడ పట్టడం అంత సులభం కాదు. అది మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ అప్పట్లో తలమీద దువ్వెనతో దువ్వుకుని కూంబింగ్ అంటే ఇదీ అని చూపించినంత సులభం అంతకంటే కాదు.

3 comments:

Mangu Siva Ram Prasad said...

మావోయిస్టులు అమాయకులను, గిరాజనులను చంపినా అది విప్లవం. ఆ ప్రాణాలకు విలువ లేదా? కానీ మావోయిస్టుల పోలీసుల చేతిలో హతమైతే అది అన్యాయం. ఇదేమి న్యాయం?

శ్యామలీయం said...

> ఇదేమి న్యాయం?
మావోయిష్టుల దృష్టిలో ఇదే న్యాయం. వారి న్యాయమే వలవలరావుల దృష్టిలో పౌరహక్కుల పరిరక్షణావిధానం.

Anonymous said...

వారి న్యాయం అంతేలెండి.

Post a Comment