Pages

Monday, December 6, 2010

పత్రికలలో పదప్రయోగాలు

passive smoking = మారు పొగ -పొగ తాగేవారు వదిలే పొగను పీల్చడం.
concluding session = ముగింపోత్సవం (ఆసియాడ్, చైనా)

పాసివ్ స్మోకింగ్‌ పదానికి నవంబర్ 27నాటి ఈనాడు పత్రికలో చక్కటి తెలుగు పదం వాడారు. మారు పొగ. తమిళంలో డీలక్స్ బండికి ‘సొగసు వండి’ అని ఎంత చక్కటి పదం వాడుతున్నారంటే వింటూనే మనసుకు హాయి అనిపిస్తుంది. మనమేమో ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సెమీ లగ్జరీ, డీలక్స్, ఆర్డినరీ బస్సు పదాలను అలాగే వాడేస్తున్నాం కదా.. ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌ పదాన్ని దాదాపు తెలుగులో అన్ని పత్రికలూ ఇంగ్లీషు ఉచ్చారణలోనే రాస్తున్నాయి. కాని పాటక జనం అని పిలవబడే మామూలు మనుషులు దీన్ని ‘పై వంతెన’ అని పిల్చుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఇంగ్లీష్ ఉచ్చారణ రాదు కదా. కాబట్టి తమదైన భాషలోకి సులువుగా దీన్ని మార్చేసుకున్నారు. విశాఖలో డ్రెడ్జర్ పదానికి 70 లేదా 80 ఏళ్లకు ముందే కూలీలు తవ్వోడ అని పేరు పెట్టుకున్న విషయం తెలుసు కదా..

పదాలను కృత్రిమంగా చొప్పించడానికి బదులుగా, సంస్కృత పదాలను రుద్దడానికి బదులుగా మామూలు మనుషులు వాడే పదాలను వెతికిపట్టుకుని అలవాటు చేస్తే ఎంత బాగుంటుందో! కాని ప్రజలనుంచి నేర్చుకోవడం అనే విలువను మనం పాటిస్తే మన అభిజాత్యాల మాటేమిటి? అవెక్కడికి పోవాలి? కాబట్టి మనకు పదాల విషయంలో కూడా రుద్దుడు తప్పదు.

హైకమాండ్ = అధినాయకత్వం (స్థల పరిమితి లేదా స్థల పొదుపు కారణంగా హైకమాండ్ అనే ఆంగ్లపదాన్నే కొనసాగిస్తున్నారు ప్రత్యేకించి శీర్షికలలో)

ఛీఫ్‌విప్ -ఇంగ్లీషులో ఇవి రెండు పదాలు కాని ఈనాడులో దీన్ని ఒకే పదంగా వాడుతున్నారు.- ఇలాంటివి బోలెడు. ఇతర పత్రికలలో విడిగానే వాడుతుండవచ్చు. ఇలా పదాలను ప్రత్యేకించి రెండు నామవాచకాలను లేదా విశేషణాన్ని నామవాచకాన్ని కలిపి వాడడం, విడదీయడం చాలా సందర్భాలలో జరుగుతోంది. దీనికి ప్రామాణికమైన వాడుక అంటూ లేనట్లే కనిపిస్తోంది.

ప్రింట్ మీడియా – ముద్రణా మాధ్యమం
ఎలెక్ట్రానిక్ మీడియా – దృశ్యమాధ్యమం -ఈనాడు ప్రయోగం-
ఎలెక్ట్రానిక్ మీడియా – దృశ్యమాధ్యమ- విలేకరులు
నేనయితే ముద్రణా మాధ్యమం, దృశ్యమాధ్యమం అనేది ఈ దేశంలో నూటికి 70 మంది పలకలేరని హామీ ఇవ్వగలను. -1980లలో జరిగిన ఓ సర్వేలో ఆకాశవాణిలో వాడుతున్న పదాల్లో 70శాతం గ్రామీణ ప్రజలకు అర్థం కాలేదని తేలింది. జన మాధ్యమంగా పేరు పడిన రేడియోనే ఇంతగా ప్రజలకు దూరంగా ఉంటున్నప్పుడు పత్రికలు, పాఠ్యపుస్తకాల కథ చెప్పవలసిన పనిలేదు - వీటికి బదులుగా ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియా అనే ఇంగ్లీషు పదమే సులువుగా ఉన్నట్లు తోస్తుంది.

ఇంగ్లీష్ వద్దంటే దానర్థం సంస్కృతంతో బాదించుకోవడం అని అర్థం కాదు కదా. వినడానికి ఎంత గంభీరంగా ఉన్నా ఈ సంస్కృత పదాలు ఎంత కృత్రిమంగా కనిపిస్తాయో.. మా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో శాస్త్రాలకు తెలుగుపదాలను చివర్లో ఇచ్చేవారు. వాటిని చూడగానే భయం వేసేది. కారణం అవి మాకు అర్థం అయ్యే పదాలు కావు. ఉదా. నకశేరుకాలు, అకశేరుకాలు.. ఈ నాటికీ ఈ పదాలకు నిఘంటువు చూస్తే కానీ నాకు అర్థం తెలీదు. ప్రభుత్వం, దాని నిపుణులూ ఇలాంటి పదాలతో కొడితే మనం ఇక తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? ఇంగ్లీషో లేదా సంస్కృతమో నేర్చుకుంటే పోయేది కదా. గ్రామీణ విద్యార్థులకు సైన్స్, లెక్కలు అంటే ఎందుకంత భయం అంటే దాంట్లో పదాలు చూసేననిపిస్తుంది. స్వయానా వాటిబారిన బడ్డాం కదా. నిజం చెప్పాలంటే పల్లెటూరి బళ్లలో తెలుగు మాత్రమే బాగా వినేవాళ్లం. బట్టీ కొడితే కూడా సైన్స్, లెక్కలు వచ్చేవి కాదు. పదాలు చూస్తేనే భీతి.


డుమువులు చేర్చితే తెలుగయిపోతుందా?

ఇది వందేళ్లుగా కొనసాగుతున్న భాషావివాదం కావచ్చు. ఇలా విదేశీ పదాలకు డు,ము,వు లు చేర్చి తెలుగు చేసేయడం మనకు ఎంత అలవాటయిపోయిందంటే ఆంగ్లంలోకి తెలుగులోకి వస్తున్న పదాలలో 60 శాతం పైగా ఇలా డుమువీకరణకు గురై భాషలో కలిసి పోతున్నాయి. ప్రపంచంలో ఏ భాష అయినా ఇంత భారీస్థాయిలో అన్యభాషాపదాలను పదాల చివర్లో అచ్చులు తగిలించి తనలో కలిపేసుకోవడం జరిగిందేమో మనకు తెలీదు. కానీ దీంట్లో కూడా ఒకేరకమైన ప్రయోగాలు లేవు. ఒకే పదానికి డుమువు చేర్చడం, చేర్చకుండా హలంతంతోనే తీసుకోవడం –ఉదా. ఆపాయింట్‌మెంటు – ఆపాయింట్‌మెంట్- ఒక్కో పత్రిక ఒక్కోలా ఈ పదాన్ని ప్రయోగించడం ద్వారా గందరగోళం. దీంతో ఎలా రాస్తే సరైంది, సరైంది కాదు అనేది బోధపడదు.

నోటీసు – నోటీస్
ప్లాంటు – ప్లాంట్

ఇలా వీటికి ఏక సూత్రత ఉండటం లేదు. ఒకే పత్రిక బిన్న సందర్భాల్లో ఈ రెండు పదాలనూ ప్రయోగిస్తూంటుంది.

అయితే
చానెల్, ఎపిసోడ్, సీరియల్, సీరీస్, భోగస్, హౌసింగ్, గ్రేడింగ్, టెక్నిక్, ఇండోర్, అవుట్‌డోర్, స్పెషల్, స్పెక్ట్రం, డిమాండ్, మార్కెట్, స్కామ్, ఫండ్, బిజినెస్, టర్మ్, డిపాజిట్, ఇన్వెస్టర్, సావనీర్, ఛైర్మన్, బ్రాయిలర్, ఇన్వెస్టర్ వంటి పదాలను దాదాపు హలంతాలతోనే -పదం చివరలో హల్లు చేర్చడం- ముగిస్తున్నారు.

ఇవీ ఈనాడు ప్రయోగాలే

ఈనాడులో డుమువులు
రిస్కు, నోటీసు, కోర్సు, రేటు, లేయరు, సిమెంటు, రిజర్వు బ్యాంకు,
పదం చివరలో అచ్చు చేర్చడానికి ఇవి ఉదాహరణలు


రిస్క్-రిస్కు, నోటీస్-నోటీసు, రేట్, రేటు, లేయర్-లేయరు, బ్యాంక్, బ్యాంకు వీటిలో ఏది వాడినా అర్థభేదం లేదు. కాని ఈనాడులో వీటికి డుమువులు తగిలించారు.

కాని ఇదే ఈనాడులో ‘మరోపుస్తకం రాస్తా: వై.వి.రెడ్డి’ అనే శీర్షికన నవంబర్ 28న బిజినెస్ విభాగంలో రాసిన వార్తలో గవర్నర్, గవర్నరు అంటూ హలంతం, ఉకారాంతాన్ని చేర్చి మరీ వాడారు. పదాల వాడకంలో ప్రామాణికతకు మారుపేరుగా గుర్తింపు పొందిన ఈనాడులోనే ఈ తేడాలు ఒకే వ్యాసంలో కిందా పైనా పంక్తులలో వచ్చి చేరుతున్నప్పుడు ప్రామాణికతకు అర్థం లేదనిపిస్తుంది.


ఇతర పేపర్లలో కూడా ఇలాంటి భిన్నప్రయోగాలతో కూడిన పదాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇలాంటి భాషా పద ప్రయోగాలు చూస్తున్నప్పడు ప్రామాణికతకు అర్థమే లేదని జనం రాసిందే భాష, జనం మెచ్చిందే భాష అనుకోక తప్పదు.

అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే నగరాల పేర్లలో కూడా పత్రికలు ప్రామాణికతను పాటించకపోవడం. ఉదా. తమిళనాడు నుంచి వచ్చే తెలుగు టాబ్లాయిడ్‌లలో తమిళనాడు రాజధాని పేరే రెండు రకాలుగా వాడబడుతోంది. ఈనాడు, సాక్షి పత్రికల్లో చెన్నై అని రాస్తే, ఆంధ్రజ్యోతి మొదటినుంచి చెన్నయ్ అని ప్రయోగిస్తోంది. మిగతా అన్ని నగరాల పేర్లను ఒకేలా రాసే తెలుగు పత్రికలు చెన్నయ్ లేదా చెన్నై విషయంలో వేర్పాటువాదానికి గురైపోయాయి.

ఇక మదురై అనే పదం విషయంలో కొనసాగుతున్న గందరగోళం అంతా ఇంతా కాదు. తమిళంలో మహా ప్రాణాలు –ఒత్తక్షరాలు- లేవు కాబట్టి ‘మదురై’ నగరానికి ఒత్తు లేకుండా పలకడం వారికి అలవాటు. కాని ద్రావిడభాషలన్నింటిలో లాగే అచ్చతెలుగులో కూడా మహాప్రాణాలు లేనప్పటికీ సంస్కృతప్రభావంతో ప్రతి అక్షరానికీ ఒత్తులు రాసే అలవాటు రాతలో స్థిరపడిపోవడంతో తమిళనాడునుంచి ముద్రిస్తున్న తెలుగు టాబ్లాయిడ్‌లలో చాలాసార్లు మదురై అనే రాస్తున్నప్పటికీ, కంట్రిబ్యూటర్ల స్థాయిలో పంపే వార్తలను ఎడిటింగ్‌ సమయంలో సరిదిద్దనప్పుడు మదురై, ఒత్తు కలుపుకుని మధురై అని ముద్రణ అవుతోంది. మనకు మధుర అనే పదానికి వత్తు తగిలించడం అలవాటే కాని తమిళులు చూశారంటే వాళ్ల ప్రాణం అలాగే పోతుంది. మనకేమో మధుర మీనాక్షి, వారకేమో మదురై మీనాక్షి. ఈ రెండు పదాల్లో అర్థ భేదం లేదు కాని, ఒక రాష్ట్ర భాషా సంప్రదాయాలను గౌరవించవలసిన పెద్ద సమస్య దీంట్లో దాగి ఉంది.

మొత్తం మీద చూస్తే తెలుగు భాషను బాల్యం నుంచి మనం నేర్చుకుంటున్నప్పుడు సాధారణ తెలుగు మనకు దరిదాపులలోకి రాదనే అనిపిస్తూంటుంది. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల ద్వారా ప్రభుత్వ తెలుగు నేర్చుకున్నాము. తర్వాత పత్రికలు, డిటెక్టివ్ నవలలు, ఇతర సాహత్యం ద్వారా ఒకరకం తెలుగును నేర్చుకున్నాము. ఆ తర్వాత యూనివర్శిటీ స్థాయిలో ఒకరకం తెలుగు ఉద్యోగాల్లో చేరుతూ వచ్చాక ముఖ్యంగా లోకలైజేషన్ పేరిట బహుళజాతి సంస్థల ఉత్పత్తులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే –స్థానికీకరణ- పనుల్లో చేరినప్పుడు నిజంగా మనకు ఉన్న మతి పోతుంది. నేను వెబ్‌దునియాలో పనిచేస్తున్నప్పుడు మైక్రోసాఫ్ట్, గూగూల్, రిలయన్స్, నోకియా, మోటారోలా తదితర ఉత్పత్తుల సాఫ్ట్‌వేర్‌లు మరియు యూజర్ మాన్యువల్స్‌ని అనువదించే బృహత్తర పనిలో నాలుగేళ్లు కొనసాగాను.

ఈ కంపెనీలు ఐటీ పదాలనే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా సూత్రీకరించి గ్లాజరీని తయారు చేసి అనువాదకులకు కాదు... కాదు.. లోకలైజర్‌లకు –స్థానికీకరణ కర్తలు- పంపేవి. డీఫాల్ట్ అనే పదాన్ని నాలుగు కంపెనీలు నాలుగు రకాలుగా నిర్వచించి గ్లాజరీలలో కూరిస్తే మేం వాటినే చచ్చినట్లు ఆయా క్లయింట్‌లకు చేసి పంపాల్సి వచ్చేది. సెంట్రల్ యూనివర్శిటీ స్థాయి వాలిడేటర్లను ఈ కంపెనీలు నియమించి వారి మాటనే ఫైనల్‌గా చేసేవి. వారు సూచించే పదాలు సందర్భానికి తగినట్లుగా కాకుండా రొడ్డకొట్టుడు పద్ధతిలో సాగటంతో వాటిని ఏ మాత్రమూ మార్చకుండా అలాగే చేసి పంపాల్సి వచ్చేది. భాష, భావం, సందర్భం రీత్యా కూడా ఈ పదం సరైంది కాదు అని మేం సూచించినా టీమ్ మొత్తంగా ఏకాభిప్రాయంతో మా అసమ్మతిని ప్రకటించినా వారి మాటే ఫైనల్. చివరకి గ్లాజరీలో అచ్చుతప్పులు ఉన్న విషయం కనిపెట్టి వాటిని రిమైండ్ చేసినా మార్చవద్దు అలాగే చేయండి అనే వారు.

ఆ నాలుగేళ్ల పనిలో మేం రకరకాల తెలుగు నేర్చుకున్నాం. ఆరు నెలలు మైక్రోసాఫ్ట్ తెలుగు, నాలుగు నెలలు గూగుల్ తెలుగు, 5 నెలలు నోకియా తెలుగు, మరి కొన్ని నెలలు రిలయన్స్, మోటారోలా తెలుగు నేర్చుకుంటున్నాములే అని చెప్పుకుని సమాధానపడేవాళ్లం. తెలుగు వాళ్ల అదృష్టం కొద్దీ ఈ గొప్ప గొప్ప సంస్థల ఉత్పత్తుల స్థానికీకరణలు వారి వద్దే ఉండిపోయి అటకెక్కిపోయాయి కాని అవి మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చి ఉంటే జనాలుకు తిక్క పట్టేది.

మనకు వచ్చే తెలుగే అంతంతమాత్రం అనుకునేటప్పుడు ఈ రకరకాల తెలుగు భాషల వాడకాలు మీద పడి ఏది సరైనదో, ఏది సరైంది కాదో కూడా తేల్చుకోవడం చాలా కష్టమైపోతుంది. ఈ ఐటీ పదాలు, పరిభాషలూ, పొట్టి పదాల విభజనలూ వచ్చి పడ్డాక తెలుగులో ఏ పదాలను కలిపి వాడాలో, వేటిని విడదీసి వాడాలో మొత్తంగా మర్చిపోతున్నాము. ఎందుకు కలపాలి, ఎందుకు విడదీయాలో తెలియనంత గుంజాటన.

ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటిగా తెలుగుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. మన భాషలో ఒకే పదం ఒక సుదీర్ఘ వ్యాక్యాన్ని స్పురిస్తుంటుంది
ఉదా: చేయాలనుకుంటున్నాను ( I want to do)
తెలుసుకోవాలనుంది (I want to know)
ఇలాంటివి కొన్ని వందల ప్రయోగాలు సమాజం వాడుతూ వచ్చింది. కానీ ఐటీ ఉత్పత్తులు, పత్రికల వాడుక పుణ్యమా అని మన భాష తన లక్షణాన్నే పోగొట్టుకుని పొట్టిపదాల సమాహారంగా మారిపోతోంది. చివరకు విభక్తి ప్రత్యయాలను కూడా పదం నుండి విడబెరికి మరీ రాస్తున్నారు.

జీవితమంతా ఎక్కడ ఉద్యోగంలో చేరితే అక్కడ అమలయ్యే భాషను, దాని ఫార్మాట్‌ను నేర్చుకోక తప్పదేమో అనిపిస్తూంటుంది. చివరకు పత్రికలు కూడా తమ తమ ఫార్మాట్‌తో కూడిన తెలుగును ఉపయోగిస్తున్నాయి. అందుకే చాలాసార్లు జోకులేసుకునేవాళ్లం. మనం ఈనాడు తెలుగు నేర్చుకోవాలా? ఆంధ్రజ్యోతి తెలుగు నేర్చుకోవాలా? లేదా ఇతర పత్రికల తెలుగు నేర్చుకోవాలా? ఇలా చర్చించి చర్చించి ‘మనకు అస్సలు తెలుగు రాదులే’ అని తేల్చేసుకుని ఎవరిదారిన వాళ్లం పోయేవాళ్లం.

చివరగా ఒకే ఒక ఉదాహరణ. మా చిన్నప్పటినుంచీ పీజీ చదువేంత వరకూ ‘ఉన్నది’ పదంతో పాటు ‘వున్నది,’ ‘వున్నాడు’ అనే ప్రయోగాలను కూడా విరివిగా వాడుతూ వచ్చాము. చిన్నప్పుడు కాని, పెద్దయ్యాక కాని ఎవ్వరూ మాకు ఈ రెండింటిలో ఒకటి తప్పు అని చెప్పలేదు. నేర్పలేదు. పైగా కథా రచయితలు, నవలా రచయితలు తమ రచనల్లో వున్నది, వున్నాడు, వుంది, వుండేది అనే ప్రయోగాలను కొన్ని వందలసార్లు వాడుతూ వచ్చారు. ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు.

కానీ ఆన్‌లైన్, ప్రింట్ మీడియాలోకి అడుగుపెట్టాక ‘వు’కార ప్రయోగం నిషేధమైపోయిందని చాలా లేటుగా బోధపడింది. 30 ఏళ్లు నేర్చుకుని, రాస్తూ వస్తున్న పదం ఇప్పుడు ప్రింట్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు నిషిద్ధం అయిపోయింది. దీనికి ఈనాడు పదప్రయోగాల కర్తలే, దాని జర్నలిజం స్కూళ్ల ప్రిన్సిపాళ్లే ప్రధాన కారకులు తెలియవచ్చింది.

పత్రికాఫీసుల్లో, ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు పొరపాటున వున్నది, వుంది అని రాస్తే హత్య చేసినంత సీరియస్‌గా చూసేవాళ్లు. ఈ తరహా పదప్రయోగాలు పత్రికలకు ఎందుకు నిషిధ్దమైపోయాయి, వందలాది రచయితలకు, నాలాంటి పాతకాలం చదువులు చదువుకున్న వారికి ఇవి ఎందుకు నిషిద్ధం కాకుండా పోయాయి అనే విషయం ఎంత చించుకున్నా బోధపడేది కాదు. ఈనాటికీ ఇంతే. భాషను ఇలాగే రాయాలి, ఈ నుడికట్టుగళ్లలోనే పొందుపర్చాలి అనే నిరంకుశత్వం పత్రికలు ఎందుకు గుత్త తీసుకున్నాయి. పత్రికలే ఆధునిక గ్రాంధిక వాద సమర్థకులుగా తయారవుతున్నాయా అనిపిస్తుంది.

చివరకు కొన్న తరాల పిల్లలకు మంచి భాషను నేర్పినట్లు పేరుపడిన చందమామ పాత సంచికలలో కూడా ఈ వున్నది, వున్నాడు, వుంది ప్రయోగాలు చాలా సార్లు కనిపిస్తున్నాయి. పట్టి పట్టి చూస్తే కూడా వీటిని చందమామ కథల పత్రిక నిషేధించినట్లు, వదిలేసినట్లు నాకు కనిపించలేదు.

కొన్ని దశాబ్దాలుగా తెలుగు సమాజం, ప్రజలూ, రచయితలూ, నవలాకారులూ, కథకులూ వాడుతూ వచ్చిన ప్రద ప్రయోగాలు ఈనాడు తదితర పత్రికల నిరంకుశత్వం కారణంగా, ఆధునిక చిన్నయ సూరిల రుద్దుడు కారణంగా ఇప్పుడు పత్రికలలో ఉనికిలో లేకుండా పోయాయి. మొత్తం సమాజ వాడుకను తోసిపుచ్చిన ఈ దారుణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పత్రికలు వాడలేదు కాబట్టి, నిషేధించాయి కాబట్టి ఇలాంటి పదాలు తెలుగు పదాలే కాకుండా పోతాయా?

“ఆర్య వ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబు” ఇది మనం చిన్నయసూరి బాలవ్యాకరణంలో నేర్చుకున్న మాట. అంటే పూర్వకవులు తమ కావ్యరచనలలో తప్పులు రాసినా వాటిని ఒప్పులుగానే స్వీకరించాలి అని అర్థం. కావ్యరచనలలో శతాబ్దాల క్రమంలో జరుగుతూ వచ్చిన తప్పులను కూడా మనం స్వీకరించాలని చిన్నయసూరి చెబితే నెత్తిన పెట్టుకుని మోస్తున్నాం. కాని జనం వాడుకలో వందల, వేలసార్లు వ్యవహరించబడుతున్న పదాలను, వాడుకపదాలను నేటి పత్రికా నిరంకుశులు నిషేధిస్తే ఇదేమి న్యాయం అని అడగడానికి కూడా వీల్లేకపోతోంది.

శతక్కొట్టిన, వీరబాదిన వంటి డజన్లకొద్దీ అపభ్రంశ పదాలను వాడుకలోకి తీసుకురావడంలో పత్రికలదే ప్రధాన భాధ్యత. కానీ వీళ్లే ఇది వాడవద్దు, ఇలా రాయకూడదు అని నిరంకుశ రేఖలు గీస్తున్నారు.

ఇది న్యాయమేనా?

పత్రికల నిరంకుశత్వం నశించాలి.

ముఖ్యంగా భాష విషయంలో......

0 comments:

Post a Comment